మంగళవారం 21 ఫిబ్రవరి 2012

పద్య రచన - 1

మిత్రులందిరికీ "మాతృభాషా దినోత్సవ" శుభాకాంక్షలు!

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

సందర్భంగా

మాతృభాషాభిమానాన్ని తెలియజేస్తూ

ఐచ్ఛికచ్ఛందంలో పద్యం వ్రాయండి.

34 వ్యాఖ్యలు:

Pandita Nemani చెప్పారు...

పలికెదను తెలుగు మాటలు
కొలిచెద నా తల్లి నెదను కుదురగు బత్తిన్
వెలిగింతు తెలుగు దివ్వెను
నలరెద నా వెలుగు లోన నరుసమ్మెసగన్

Nayonika చెప్పారు...

జనింపనేల పరలోకములన్ దేవతలుగ
భుజింపనేల అమృతము దినదినము విసుగు లేక
జీవించనేల చావు సౌఖ్యము లేక జీవన్మృతులై
మనిషిగ పుట్టి మృష్టాన్నము భుజించి చచ్చుట మేలే!

మందాకిని చెప్పారు...

సుంతయు మర్యాద మరిచి
స్వంతమయిన భాష విడిచి జనులీ వేళన్
వింతగ చరియింప, మహా
పంతము తో నే నిలిచెద భాషను విడకన్.

డా. విష్ణు నందన్ చెప్పారు...

తెలుగుం జాతి జనించుటే కద మహాదృష్టమ్ము , భావింపగా
దెలుగుం కైతలు వ్రాయగల్గుట శుభాధిక్యమ్ము , తీయందనాల్
జిలుకన్ చిక్కని తేనెలూరు కవితా శ్రీగంధమున్ జిమ్మగా
దెలుగుం గబ్బము గూర్చగల్గుట మహాంధ్రీ వాణి మాహాత్మ్యమే !!!

త్రైలింగమ్మిది , నిత్య పావనము ; సద్యః పుణ్య సంధాయక
మ్మై లాలిత్య గుణాత్మకమ్మయి తిరమ్మై వెల్గు నీ తెల్గు సీ
మా లావణ్య విభూతి నెన్న దరమే ? మా జన్మ ధన్యంబె , యీ
నేలన్ బుట్టువు నొందు కారణము చింతింపన్ పురా భాగ్యమే !!!

పాట పాడునట్లు , కోటి వీణలు మ్రోగు
నట్లు , పనస జెప్పునట్లు దోచు -
తెలుగు భాష మాట తీరు తెన్నులు , సదా
తేజరిల్లవలయు తెలుగు భాష!!!

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ చెప్పారు...

వాసము విడి వారాసిని
క్రోసులు క్రోసులుగ మీరి కొలువులుగొన్నన్
వేసము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పలికెదనన్నా

Sanath Sripathi చెప్పారు...

విష్ణు నందన్ గారూ మీ పద్యాలు చలా బాగున్నాయి

శ్యామలీయం చెప్పారు...

దండకము.
ఓ తల్లి మా తెల్గు తల్లీ సదానందవల్లీ విశుధ్ధాంధ్రలోకైక సంస్తుత్య నీ భూమిలో వెల్గు నీ పల్కులం జిల్కు గేహంబులం బుట్టి నీ కింపుగా సొంపుగా నాడు నీ భాష మాట్లాడి నీ పాటలే పాడి నీ యాటలే యాడి నీ యందు ప్రేమాతిరేకంబునం జేసి నీ దివ్య సంగీత సాహిత్యముల్ జన్మసాఫల్యతా సిధ్ధిదంబుల్ విచారించుచున్ దేవి నీ దివ్యచారిత్ర లీలావిశేషంబులత్యంత శ్రధ్ధన్ విమర్శించుచున్ నీదు సత్కీర్తిసౌధాగ్రభాగంబునంచంద్రబింబంబు దీపంబుగానొప్పుటం గాంచి సర్వాత్మనా బొంగుచున్ నేడు హూణఫ్రభావంబుకున్నోడి తద్విద్యలం జీవనోపాధికై నేర్చిచుం బోవ తద్వేషముల్ భేషజంబొప్పగా వేయుచుం బోవ తద్భాషలం లోకవృత్తానుమోదంబుగా బల్కుచుం బోవ నీపట్ల ద్రోహంబుగా నాయె మాతీరు కోట్లాదిగా నున్న నీ బిడ్డలం జూచి కన్నీరు నింపంగ నాయెంగదా నీకు ప్రేమం బ్రశంసించి పోషంచు సంతానమే యన్య బాషావిమోహాత్ములై మాతృద్రోహంబు గావించ నిస్సిగ్గుగా నిట్లెగ్గులం జేసినం గాని మాయందు నీ వుందు వో తల్లి దివ్యానురాగంబునం పూర్ణవాత్సల్యభావంబునం మాకు సద్బుధ్ధులం గోరుచున్ మాకు నభ్యున్నతుల్ గోరుచున్ మాకు నాశీః ప్రసాదంబులం జేయుచుం ప్రేమ మాతప్పులం గాయుచుం వేగ మమ్మక్కునంజేర్చి లాలించుచున్ మమ్ము పాలించుచున్ మొఱ్ఱలాలించుచున్ అమ్మరో మాకు మాతప్పు దైవకృపంజేసి యిన్నాళ్ళకైనం బహుస్పష్టమై దోచె మే మింక నీ సేవలో నుందుమో కన్నతల్లీ సదా నీదు సత్కీర్తికిన్ మచ్చ రాకుండ వర్తింతు మేవేళ నీ మాటలే మాకు నోటం ప్రకాశించుగా కింక నేవేళ నీ దివ్యసంగీతసాహిత్యలీలావిలాసంబు లీయుర్వి మార్మోగ జేయంగ నుంకింతు మిందేమియుం శంకయుం గొంకునుం బొకుంనుం లేవు నీ వైభవం బెంచి జీవింతుమో మాతృదేవీ నమస్తే నమస్తే నమస్తే నమః

శ్యామలీయం చెప్పారు...

దండకంలో సవరణ:
గావించ నిస్సిగ్గుగా నిట్లెగ్గులం జేసినం గాని --బదులు--
గావించ నిస్సిగ్గుగా నెగ్గులం జేసినం గాని

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా! డా. విష్ణునందన్ గారి పద్యములు ప్రశంసనీయములు. అభినందనలు.

శ్రీ ఆదిభట్లవారూ: మీ పద్యము బాగున్నది. వారాశి అని సవరిద్దాము. వారాసి కాదు.

శ్రీ శ్యామలరావు గారూ! మీ దండకము మంచి ధారాశుద్ధితో అలరారుచున్నది. చిన్న సవరణలను సూచించు చున్నాను:

(1) నిస్సిగ్గు కాదు - నిర్లజ్జ అందాము.
(2) దైవకృపంజేసి: వ గురువు కాదు - గణభంగము కాకుండా సవరించండి.

Pandita Nemani చెప్పారు...

అమ్మా మందాకినీ గారూ! మహా పంతము అనేది దుష్టసమాసము. అందుచేత మార్చండి. సమాసములో మొదటి పదము తెలుగు ఉండవచ్చు కాని తొలి పదము సంస్కృతము తరువాతి పదము తెలుగు ఉండరాదు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

తమిళ కన్నడ దేశ ధరణీ తళమ్ముల
తెలుగును వెలయించి దీప్తి కెక్కె
దేశ భాషల యందు తెలుగు లెస్సని పల్కి
భాషాభి మాన ప్రాభవము జూపె
అష్ట దిగ్గజముల నౌదల నెక్కించి
తెలుగు కవితకు పందిరులు బెట్టె
మణిపూస నాముక్త మాల్యద రచియించి
దీటైన కవిరాజ తేజ మొదవె

కలడె శ్రీకృష్ణ దేవ రాయలను బోలు
తెలుగు భాషాభి మాని యీ తెలుగు నేల ?
తెలుగు నేలంగ మరల రా దిగుము భువికి
మంగళారతు లిడుదు తెలుంగు రాయ !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ళ టైపాటు , ల గా చదువగలరు

Pandita Nemani చెప్పారు...

మా తెల్గుతల్లికి మల్లె పూదండను
వేసిన దెన్నడో మాసిపోయె
మా కన్నతల్లికి మంగళ హారతి
నిచ్చుట లానాటి ముచ్చటయ్యె
ఆంగ్ల భాషను నేర్చుటావశ్యకంబౌట
మాతృభాషాసక్తి మరుగుపడెను
పరదేశములవారి పంచ జేరుటజేసి
మనసంస్కృతియు నెండమావి యయ్యె
ఎంత కాల ముపేక్షింతు మివ్విధముల
కాంచుడీ నేటి దుస్థితి కన్న తల్లి
మన తెలుగు భాష వెలుగొంద మనసు నిలిపి
చేయి చేయి కలిపి సేవజేయ రండు

శ్యామలీయం చెప్పారు...

శ్రీనేమానివారికి,
దండకం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీరు సెలవిచ్చినట్లుగా 'నిస్సిగ్గు' కాక 'నిర్లజ్జ' అందాం అలాగే 'దైవకృపంజేసి' యన్నప్పుడు గణభంగం కాబట్టి కొద్దిగా మార్చి 'దైవానుకంపావిశేషంబునంజేసి' యందాం. ఇక్కడ కొంచెం పొడుగైనట్లుంది కానివ్వండి దండకమే కదా, ఫరవాలే దనుకుంటాను. ధన్యవాదాలు.

డా. విష్ణు నందన్ చెప్పారు...

సనత్ శ్రీపతిగారికి , శ్రీ నేమాని గారికి బహుధా కృతజ్ఞతలు . తక్కినవారికి అభినందనలు .

మందాకిని గారికి , నావీ రెండుమాటలు - చెప్పిందే అయినా చర్విత చర్వణము , స్వ శబ్దానికి వికృత రూపం సొంత . వ్రాస్తే ' స్వ ' అనైనా వ్రాయాలి , లేదంటే ' సొంత ' అనైనా వ్రాయాలి . ' స్వ ' సంస్కృతము , ' సొంత ' అచ్చ తెలుగు మాట , అంతే తేడా !

' విడకన్ ' కూడా ఇబ్బంది పెట్టేదే , ' కన్ ' వల్ల . భాషను విడువన్ అంటే బాగుంటుంది కదా !

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

డా.విష్ణు నందన్ గారి పద్యములు. కోటి వీణలు మ్రోగినట్లు , పనస జెప్పినట్లు దోచినది.

శ్యామలీయం గారి దండకము మా తెల్గుతల్లికి మల్లె పూదండను వేసినట్లున్నది.
శ్రీ నేమాని వారి, రాజారావు గారి, మందాకిని గారి, శర్మ గారి పద్యములు తెలుగు వెలుగులు చిమ్ముచున్నవి.

భోజరాజు జూడ భూజనంబుల కెల్ల
కవిత సంస్కృతమున కదలి వచ్చు
ఆంధ్ర భోజు మరల అవనిలో బుట్టంగ
కోరు కొందు హరిని కోర్కె దీర.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

చిన్న సవరణ తో..

భోజరాజు జూడ భూజనంబుల కెల్ల
కవిత సంస్కృతమున కదలి వచ్చు
ఆంధ్ర భోజు మరల అవనిలో బుట్టించ
కోరు కొందు హరిని కోర్కె దీర.

శ్యామలీయం చెప్పారు...

మిత్రులారా!

సీ. మమ్మీలు డాడీలె అమ్మనాన్నలు లేరు
.............. కొంపలన్నింటను సొంపులిట్లె
మంచినీళ్ళన్నట్టి మాట మరుగుబడె
.............. వాటరూ మినరల్లు వాటరాయె
అన్నంబు నన్నం బనంగ మోటాయనే
.............. ప్రతివాడు రైసనే పలుకు చుండె
పాట నెవ్వరు గాని పాట యనరు నేడు
............... సాంగ సాం గందురు సర్వజనులు

తే.గీ. అంద రాంటీలు నంకుళ్ళు నందరకును
హాయి హాయిని పలకరిం పన్ని చోట్ల
తెలుగు తెలుగని మొత్తుకో దలచినట్టి
ఛాందసుల కిదె మాతృభాషాదినంబు

మిస్సన్న చెప్పారు...

అయ్యా విష్ణునందన్ గారూ తియ్యని తెలుగును రుచి చూపించారు.
అయ్యా శ్యామలీయం గారూ మధురమైన స్తోత్రరాజాన్ని తెలుగు భాషామ తల్లి గళసీమలో హారంగా అలంకరించారు.
రాజారావుగారూ మనోహరమైన పద్యాల నిచ్చారు.
మిత్రులందరూ అద్భుతంగా తమ భాషాభిమానాన్ని చాటుకొన్నారు.
అందరికీ అభినందనలు.

మిస్సన్న చెప్పారు...

ఆది శంకరార్యు లన్నట్లు ధరణిలో
చెడ్డ తల్లు లసలు తారసిలరు
మాయ కాల మేమొ మన తల్లిభాషాయె
చెడ్డ తల్లిభాష చెడుగులకును.

పట్టణమ్ము లాటపట్టాయె నెన్నడో
పొరుగు దేశభాష కరిది యేమి
పల్లెవాసులకును వ్యాపించె నీ వ్యాధి
తేట తెలుగు మాట తెల్లబోవ.

పొరుగు దేశములకు నరిగిన మనవారి
కృషిని తెలుగు కచట కీర్తి గలుగ
ఆంధ్ర దేశమందు నన్యాయ మౌచుండె
నేలికలకు లేక నింగితమ్ము.

పొరుగు రాష్ట్రములను పోల్చుకొన్నను చాలు
మాతృ భాష పట్ల మమత తెలియు
జాతి పరిఢవిల్ల సంస్కృతి వలయును
దాని నందజేయు తనదు భాష.

తెలుగు తల్లికి జేజేలు పలుక వలయు
తెలుగు భాషకు జేజేలు పలుక వలయు
తెలుగు గడ్డకు జేజేలు పలుక వలయు
తెలుగు వారికి జేజేలు పలుక వలయు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

గోవు పొదుగు గుడిచి గుమ్మపాలను ద్రావి
తనువు మరచి దూడ తనిసి నట్లు
తెలుగు తల్లి యొడిని కొలువు దీరెను నేడు
విష్ణు నందనుండు వేడ్క మీర

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ చెప్పారు...

తిక్కన్న ఎవ్వడో తిక్కసన్నాసంచు
నన్నయ్య అవ్వానికన్నయంచు
వెర్రి రాతలవాడు ఎర్రన్నయేనంచు
పూతన మామయే పోతనంచు
చంపక మాలన్న జయమాల్ని చెల్లెలో
చూడ కాంచనమాల చుట్టమంచు
తేటగీతననేమొ తెలియునా మీకంచు
గాజువాకా పిల్ల కాదొ యంచు

తెరను వెలిగేటి తారనే దేవుడంచు
దొరల మాటాడువాడినే దొడ్డయంచు
పరగు చున్నట్టి తెలుగింటి పాపలార
తెలుగు విలువేమిటో మీరు తెలిసికొండు

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

జేజేలు తెలుగు తల్లికి
జేజే లిదె తెలుగు నుడికి జేజే లిడెదన్
రాజిత ప్రాచీన కవుల
కోజను కవిమిత్రులకును హృదయ మలరగన్

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

సవరణ

జేజేలు తెలుగు తల్లికి
జేజే లిదె తెలుగు నుడికి జేజే లిడెదన్
రాజిత ప్రాచీన కవుల
కోజను కవిమిత్రులకును నుత్సాహముతో

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

భాష ఎయ్యది దేవభాషతో పెనగూడి
జంట నాగుల నాట్య జతులు పలికె-
భాష దేనిని యతిప్రాసలే ఒనగూడి
కవచ కుండల దివ్య కాంతులొలికె-
భాష ఎద్దానికిన్ ద్వ్యర్థి మరియు త్ర్యర్థి
సత్కావ్య నిర్మాణ సత్త్వ మమరె-
కరము నే భాషరా కర్ణాట సంగీత
వాగ్గేయ కళకయ్యె పట్టుగొమ్మ-

భాష దేనిలో అవధాన భాసుర కళ
విశ్వ భాషీయులకు నెల్ల విస్తు గొలిపె-
అద్ది నాదు తెలుగు భాష! అమృత ధార!
తెలుగు గాక ఇంకెందునీ వెలుగు గలదు?

కంది శంకరయ్య చెప్పారు...

ఆహా! ఏమీ "శంకరాభరణం' బ్లాగు అదృష్టం? "పద్యరచన" శీర్షికను ప్రారంభించిన రోజే ఎంతటి స్పందన! మనోహరమైన మీ పద్యాలు చదివి పులకించి పోయాను. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
అచ్చమైన తెలుగు మాటలు పలికి ముచ్చట గొలిపే పద్యంతో క్రొత్త శీర్షిక "పద్యరచన"కు హృద్యమైన శుభారంభం చేసారు. ధన్యవాదాలు.
"తెలుగు భాషకు సేవ చేయ రం"డని ఆహ్వానం పలికిన మీ సీసపద్యం ప్రశస్తంగా ఉంది.
*
నయోనిక గారూ,
ధన్యవాదాలు.
*
మందాకిని గారూ,
చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
డా. విష్ణు నందన్ గారి వ్యాఖ్యను గమనించండి.
*
డా. విష్ణు నందన్ గారూ,
అద్భుతమైన పద్యాలు. ఏదో ప్రాస్తావిక పద్యాలు వ్రాసినట్లుగా కాక ఒక మనోహరమైన ఖండకావ్యాన్ని చదివిన అనుభూతిని కల్గించారు. ధన్యవాదాలు.
*
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మాతృభాషాభిమానాన్ని విడనన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
వ్యాజనిందాగర్భమైన మీ సీసపద్యం చాలా బాగుంది.
*
సనత్ శ్రీపతి గారూ,
ధన్యవాదాలు.
*
శ్యామలీయం గారూ,
మీ తెలుగు తల్లి దండకం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
"ఛాందసుల కిదె మాతృభాషాదినంబు"అన్న మీ సీసపద్యంలో మీరు వెలిబుచ్చిన ఆవేదన సార్థకం.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
"తెలుగు కవితకు పందిరులు" పెట్టిన మీ పద్యం మనోహరంగ ఉంది. అభినందనలు.
విష్ణునందనులపై మీ ప్రశంసా పద్యానికి ధన్యవాదాలు.
తెలుగు తల్లికి జేజేలు పలికన మీ పద్యం చక్కగా ఉంది.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
"తెలుగు భాషకు జేజేలు పలుకవలయు"నన్న మీ పద్యాలు ఒక ఖండకృతిలాగ భాసిస్తూ అలరించాయి. ధన్యవాదాలు.
*
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
తెలుగు భాషాసాహిత్యాల ప్రత్యేకతలను మనోహరంగా వివరించిన మీ పద్యరత్నానికి ధన్యవాదాలు.

మిస్సన్న చెప్పారు...

రాజారావు గారూ విష్ణు నందనుల మీద
యెంత చక్కని పద్యం చెప్పారండీ!

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

మిస్సన్న గారూ,ధన్యవాదములు

మంద పీతాంబర్ చెప్పారు...

చెల్లి తమ్ముడు మాట్లాడు తల్లి భాష
కమ్మ దనమంత నిండిన అమ్మభాష
జగము మెచ్చిన గుడుల నజంత భాష
పలుకు పలుకున తేనియ లొలుకు భాష

వెలుగు దివ్వెల పరిభాష తెలుగు భాష
శ్రావ్య మైనట్టి భవ్యమౌ కావ్య భాష
రాగ భావాల తాళ స్వరాల భాష
మధుర మంజుల మంజూష మాతృ భాష !

మందాకిని చెప్పారు...

లోపాలు చూపినందుకు కృతజ్ఞతలు.
నెట్ డిస్కనెక్ట్ అయినందువలన వెంటనే ప్రతిస్పందించలేకపోయాను.
మన్నించండి.

గురువు గారు,
పై పూరణకు బదులుగా మరొకపూరణ

మంచియు మర్యాద విడిచి
యించుక నింగితము వీడిరిక నేమగునో,
కంచెయె చేనును మేసిన
వంచన రీతి తమ పల్కు వలదను పల్కుల్.

శ్యామలీయం గారు,
తెలుగుతల్లి మీద దండకం ఎప్పుడూ చదవలేదు.
చాలా బాగా వ్రాశారు. అభినందనాలు మీకు.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

విష్ణునందన్ గారు!
’త్రైలింగమ్మది’ కాదు - ’త్రైలింగ్యమ్మది’ అనాలేమో చూడండి.
పద్యాలు బాగున్నాయి. అభినందన!

కంది శంకరయ్య చెప్పారు...

మంద పీతాంబర్ గారూ,
మధురమైన పద్యాలు చెప్పి అలరించారు. ధన్యవాదాలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

తెలుగుభాష మాధుర్యమును పంచిన కవి మిత్రులకు అభినందనలు. మాతృభాష దినోత్సవ సూభాకాంక్షలు.

తల్లి సంస్కృతమ్ము తనయలు పెక్కుండ్రు
భాష భాష లోన భావముండు
వారి వారి భాష వారికి మధురము
మాతృభాష నెపుడు మరువ తగదు

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.