ఆదివారం 29 ఎప్రిల్ 2012

సమస్యాపూరణం - 689 (పాండు తనయుల మించిన)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పాండు తనయుల మించిన పాపు లెవరు?

ఈ సమస్యను పంపిన

వసంత కిశోర్ గారికి

ధన్యవాదాలు.

28 వ్యాఖ్యలు:

Pandita Nemani చెప్పారు...

శ్రీ సరస్వత్యై నమః:
డా. ఆచార్య ఫణీంద్ర గారూ! శుభాశీస్సులు.
మీరు తెర మీదకు వస్తున్నారు కాని మీ బాణీని వినిపించుట లేదు కదా. మీ పద్యాలు కూడా మేము నిత్యము చూడ గలిగితే అదీ ఒక ఆనందమే కదా!. అవనిజాత అని కూడ ప్రయోగించవచ్చును -- ఉదా: తిక్కన గారి ప్రయోగము - "నదిసుత". కాళిదాసు కూడా ఈ కోవలోకే వస్తుందేమో. పద్యములలో అక్కడక్కడ హ్రస్వమునకు బదులుగా దీర్ఘము, అలాగే దీర్ఘమునకు బదులుగా హ్రస్వములు పూర్వ కవి ప్రయోగములలో నున్నవి. పరిమళమునకు బదులుగా పరీమళము వాడుట నాకు చిన్న జ్ఞాపకము ఉన్నది. దీనికి సరైన వ్యాకరణ సూత్రమో లేక మరి ఎటువంటి వెసులుబాటో నాకు గుర్తు లేదు. మీరు తగిన వివరణలు మాకు సూచిస్తే చాలా సంతోషము.

మిస్సన్న చెప్పారు...

పాండు సుతులను ద్రోహులు పాపులనుచు
పలుక భావ్యమె చేయుచు పాప కర్మ ?
తగదు కౌరవ ! మీరలు ధర్మ నిరతి
పాండు తనయుల మించిన, పాపు లెవరు?

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

పాండుతనయుల మించిన పాపు లెవరు
కనుడటందురు ప్రజలంద రనుజులార!
రండు శాంతంబె వలయు కౌరవుల పట్ల
తగ్గు డంచును వారించె ధర్మజుండు.

లక్ష్మీదేవి చెప్పారు...

పునస్సభాప్రవేశ సందర్భముగా పెద్దలందరికీ నమస్కారములు.

ధర్మమార్గము వదలని ధన్యులెవరు,
పాండుతనయుల మించిన? పాపు లెవరు
పతితులెవ్వరు, కౌరవ ప్రథము గన్న?
మంచి చెడులను చూపించు మాయ తొలగ.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

పండిత నేమాని గారికి వందనాలు.
నేను నా ఆఫీస్ వ్యవహారాలు చక్కదిద్దుకొన్నాక, సాయంత్రాల్లో వివిధ సాహిత్య సంస్థలలో నిర్వహిస్తున్న ’ఉపాధ్యక్ష’, ’ప్రధాన కార్యదర్శి’ వంటి పదవుల కారణంగా సభలు నిర్వహించడంలో; ఇతర సంస్థల ఆహ్వానం మేరకు సభలలో పాల్గొనడంలో; వివిధ సాహిత్య పత్రికలకు, ప్రత్యేక సంచికలకు రచనలు పంపడంలో; శిష్య మిత్రుల గ్రంథ పరిష్కరణలతోబాటు పీఠికలు రచించడం, సమయం చిక్కినప్పుడు నా మూడు సాహిత్య బ్లాగులను నిర్వహించడంలో బిజీగా ఉంటాను. ఇవి గాక నా గ్రంథ రచనలు, ముద్రణలు ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం నా పి.హెచ్.డి. గ్రంథ ముద్రణలో బిజీగా ఉన్నాను. అయితే నేను నా "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" బ్లాగులో ప్రారంభించి కొనసాగించలేక పోయిన సాహిత్య కృషిని, తమ "శంకరాభరణం" బ్లాగు ద్వారా విజయవంతంగా సలుపుతున్న శంకరయ్య గారంటే నాకు అపారమైన గౌరవం. ఈ బ్లాగును రోజుకొక్క సారి తప్పకుండా చూస్తాను. నాకూ అన్ని పూరణలూ, పద్య రచనలూ చేయాలనే ఉంటుంది. కాని సమయం చిక్కదు. అయినా అప్పుడప్పుడూ నా పద్యాలనూ ప్రచురిస్తుంటానే? మీరు గమనించ లేదేమో! అయితే మీ అంత విస్తృతంగా కాదు. ఆ అసంతృప్తి నాకూ ఉంది.
ఇక 'అవనిజాత' అని తిక్కన గారి ప్రయోగం ఉంటే మీ వాదన సరైనదే! నా దృష్టిలో కూడా వ్యాకరణ మేమి శిలా శాసనం కాదు.
తిక్క్కన గారి ఆ ప్రయోగం ఏ పద్యంలో ఉందో దయచేసి చూపరూ! నేను వెదుక్కొనే బాధ తప్పుతుంది.
నా బాణీ చూడాలన్న మీ ఆసక్తికి సంతోషం. నా ఈ బ్లాగులను చూడండి.
dracharyaphaneendra.wordpress.com
dracharyaphaneendra.blogspot.com
drphaneendra.blogspot.com
మీకు నా ధన్యవాదాలు!

శ్యామలీయం చెప్పారు...

నాకు తిక్కన గారి ప్రయోగం దొరకలేదు (లేదని కాదు). కళ్యాణ రాఘవములో ప్రయోగం దొరకినది. ( http://kandishankaraiah.blogspot.in/2012/04/12.html )

ధర్మమయమూర్తి లోకైకధన్వి పరమ
కారుణికుఁడును సత్యసంకల్పుఁ డాతఁ
డట్టి రామున కనురూప యవనిజాత
లక్ష్మణున కట్లె మీ యూర్మిళాకుమారి. (163)

Pandita Nemani చెప్పారు...

మిత్రులు డా. ఆచార్య ఫణీంద్ర గారికి శుభాశీస్సులు. మీరు నిత్యము సాహిత్య సేవలో తల మునకలైన వారైనందుకు మా అభినందనలు. మీ కృషి చిరస్థాయిగా ఉండాలి అని మా ఆకాంక్ష. మీ చదువు కృషులతో పోల్చగల స్థితిలో నేను లేను. కేవలము పి.యు.సి. వరకే నా తెలుగు చదువు. "నదిసుత" అని తిక్కన వాడేడు. అలాగే అవనిజాత కూడా సరిపోతుందేమో అని నేను అనుకొన్నాను. అందుకే మిమ్ము కోరేను ఇటువంటి సందర్భములలో సరైన వ్యాకరణ సూత్రములను గురించి వివరించమని. ఇదే నా మనవి. శుభం భూయాత్. స్వస్తి.

Pandita Nemani చెప్పారు...

వంచించి రాజ్యముంగొని
ముంచిరి జ్ఞాతులను నీట ముష్కరులారా!
ఎంచెదరె పాండుతనయుల?
మించిన పాపులెవరు భువి మీరే కాదా?

(దుర్యోధనాదులతో శ్రీకృష్ణుడు అనినట్లు భావించుకొనవచ్చును)

subbarao చెప్పారు...

పాండు తనయుల మించిన పాపు లెవరు ?
ననుట ధర్మమ? పండితు లార! మీ కు ?
పరమ ప్రామాణ గ్రంధంబు భార తంబు
తెలియు మీ కది నైనను దెలుపు చుంటి

శ్యామలీయం చెప్పారు...

కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహంలో అథర్వణాచార్యుని భారతాంధ్రీకరణం నుండి ఉదాహరణ:
పది దినము లయిదుప్రొద్దులు
పదపడి రెణ్ణాళ్ళు నొక్కపగలున్ రేయున్
గదనంబుజేసి మడిసిరి
నదిసుత గురు కర్ణ శల్య నాగ పురీశుల్
Ref: http://te.wikipedia.org/wiki/అథర్వణాచార్యుడు

సహదేవుడు చెప్పారు...

గురుభ్యోనమః
నిన్నటి నా పద్యంలో తమరి సవరణ బాగుంది.

నేటి పూరణ:
పాండవులు పడిన కష్టాల మూలంగా వారిపై జనసామాన్యుల అభిప్రాయం.

అన్నదమ్ముల తండ్రులా? అన్య సురులు!
ఐదుగురు పతులుండియు అతివ వగచె!
అడవులజ్ఞాతవాసాల గడచె బ్రతుకు!
పాండు తనయుల మించిన పాపు లెవరు?

గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

ద్రౌపది, శ్రీకృష్ణునితో ;

కాన నంబుల బన్నెండు, గాన రాక
మరియు నొక్కటి యేళ్ళును మఱుగు పడుచు
గడిపి కురురాజు వేడగ సడియు రాదె
' పాండుతనయుల మించిన పాపు లెవరు?'

Pandita Nemani చెప్పారు...

పాండుతనయుల మించిన పాపులెవరు?
క్షితి ననుచు ధార్తరాష్ట్రులు గేలిసేయ
పేలగింజయు గంపట్టు బెద్దదట్లు
దయ్యముల దృష్టిలోకదా ధర్మమూర్తి!

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా!
శ్రీ శ్యామలరవు గారు ఉదహరించిన "పది దినములైదు ప్రొద్దులు........" పద్యమే నాకూ మదిలో మెదలుచున్నది. ఇది తిక్కనగారి ప్రయోగము అని నాకు ఎలాగో ఇంతవరకు మనసులో ఉండిపోయినది. శ్రీ శ్యామలరావు గారి వివరణతో ఏకీభవిస్తున్నాను. స్వస్తి.

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

శ్రీకృష్ణుడు దుర్యోధనునితో :


01)
___________________________________


పాండు తనయుల మించిన, - పాపు లెవరు ?
యనుచు వారల దూషించు - ఘనుడ వినుము !
త్రుంచగా భీము నీటిని - ముంచె నెవరు ?
మంచి యిల్లాలి చీరల - చించె నెవరు ?
వంచనను వారి యడవుల - పంచె నెవరు ?
మీకు సాటిల వంచనన్ - మీరె గాక!

___________________________________

సహదేవుడు చెప్పారు...

అందరి పూరణలు అలరించు చున్నవి.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

ధర్మ మేనాడు వీడక ధరణి లోన
పదియు మూడేండ్లు సైచిరి పరమ కష్ట
ములను పాపమ్ము దలచిరి మూర్ఖులపయి
పాండు తనయుల మించిన పాపులెవరు?

కిశోర్ కుమార్ చెప్పారు...

కవులకూ పండితులకూ నమస్కారాలు .అవనిజాత వరకు ఎందుకు ? అవనిజ అనే పదమే వుంది కదా , ( అవనీజ అని కాకుండా ). అక్కడే సమాధానం లభిస్తుంది కదా , అందుకని నా యుద్దేశంలో అవనిజాత అని వాడడానికి అభ్యంతరాలేమీ లేవనుకుంటాను మన్నించాలి .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తొల్లి జన్మల యందున్న దోష మేమొ
మాయ జూదము నందోడి జాయ తోడ
కాన లందుండి యిడుముల కాలనేమి
పాండు తనయుల మించిన పాపు లెవరు ?

గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

' కేవలము పి.యు.సి. వరకే నా తెలుగు చదువు. '
ఇలాంటి వ్యాఖ్య నా వంటి వారలకు సరిపోతుంది. పండితులకు, విద్వాంసులకు కళాశాలల ప్రమాణాలు చిత్తు కాగితాలే కాదా ?

మిస్సన్న చెప్పారు...

అవును మూర్తి మిత్రమా ఆవ్యాఖ్య నా వంటి వారలకు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది.

కంది శంకరయ్య చెప్పారు...

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీ దేవి గారూ,
చక్కని విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
నా పట్ల మీకున్న సదభిప్రాయానికి ధన్యవాదాలు.
*
శ్యామల రావు గారూ,
మా గురువు గారి కావ్యాన్ని పరిశీలనగా పఠించినందుకు ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
కందంలో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
మీ రెండవ పూరణ కూడా బాగుంది.
*
సుబ్బారావు గారూ,
ఎందుకో ఈ నాటి మీ పూరణ కొంత గందరగోళాన్ని కలిగిస్తున్నది.
రెండవ పాదంలో యతి తప్పింది. ప్రామాణిక గ్రంథము అనాలనుకుంటా. ‘అది + ఐనను = అది యైనను’ అవుతుంది. మీ పద్యానికి నా సవరణ....
పాండు తనయుల మించిన పాపు లెవర
టంచు మాటలాడుట ధర్మమౌనె మీకు?
పరమ పూజ్యమౌ గ్రంధంబు భారతంబు
తెలియు మీ కది యైనను దెలుపు చుంటి.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మీ పూరణను ఇలా సవరిస్తే ఎలా ఉంటుంది?
పదియు రెండు వత్సరములు వనములందు
మరియు నొక యేడు నునికిని మరుగుపరచి
గడిపి కురురాజు వేడగ సడియు రాదె
' పాండుతనయుల మించిన పాపు లెవరు?'
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఎవరు + అనుచు = ఎవరనుచు’ అవుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘ఎవర / టంచు’ అంటే సరి!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
కిశోర్ కుమార్ గారూ,
ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ అన్ని విధాల బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు వారూ,
మిస్సన్న గారూ,
నిజమే! డిగ్రీలు కొలబద్దలు కావు.

వసంత కిశోర్ చెప్పారు...

ఆ మాటకొస్తే నాకు సరిగ్గా సరిపోతుంది !
నాది S.S.L.C మాత్రమే !
P.U.C ఒక నెల మాత్రమే చదివి
polytechnic లో సీటొస్తే చేరిపోయాను P.U.C. వదిలేసి !

గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

గురువు గారూ ధన్యవాదములు !

కిశోర్ జీ ! అదీ అసలు చిక్కు. పియుసి లో సంక్రాంతి సెలవుల తర్వాత యడాగమ, నుగాగమ పాఠాలు చెబుతారు.

మరి నా సంగతి , వైద్యకళాశాలలో ప్రవేశించే ఆతృతతో భౌతిక, రసాయినక, జీవ శాస్త్రాలపై పెట్టిన శ్రధ్ధ తెలుగుపై పెట్టక పోవడమే !

వసంత కిశోర్ చెప్పారు...

ఔనా మూర్తీజీ ! పాఠాలు అక్కడే తప్పానన్న మాట !

ఇక్కడ తప్పడంలో తప్పులేదైతే !

గురువుగారు దాన్నొక చిదంబర రహస్యం చేసేసేరు !
తప్పులు దిద్దడమే తప్ప పాఠాలు చెప్పరు !

కంది శంకరయ్య చెప్పారు...

వసంత కిశోర్ గారూ,
గతంలో కొన్ని పాఠాలు చెప్పాను. ఈ మధ్య ఈతిబాధల వల్ల సమయం, మనశ్శాంతి లేక పాఠాలు పెట్టడంలో వెనుక బడ్డాను. ఇకనుండి అవసరమైనప్పుడల్లా పాఠాలు ప్రకటిస్తూ ఉంటాను.
నా బాధ్యతను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

వసంత కిశోర్ చెప్పారు...

శంకరార్యా !ధన్యవాదములు !

మారెళ్ళ వామన కుమార్ చెప్పారు...

గురువు గారి నిర్ణయంతో నేను కూడా లబ్ధి పొందబోతున్నాను. మీ అందరూ ఎంతో కొంత తెలుగు పాఠాలు చదివిన వారైతే, నేను మాత్రం పదవ తరగతి వరకూ తెలుగు చదువుకున్నాను. ఆ తేడా అప్పడప్పుడూ వచ్చే పద్యాలలో కనపడుతూ ఉన్నా, ఎంతో ఓర్పుగా తప్పులు దిద్దే మా మాస్టారు శంకరయ్య గారికి జేజేలు. మీరు రాసే పాఠాలన్నీ కాపీ చేసుకుని ఒక ఫైల్ తయారు చేసుకుంటున్నాను. (మొన్న మధ్యక్కర గురించి చెప్పారు కద!)
నమస్సులు.