26, ఆగస్టు 2012, ఆదివారం

పద్య రచన - 93


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(మా గురుదేవులు కీ.శే. శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు రచించిన "అవతారధార" తప్పక చూడవలసిందిగా మనవి)

15 కామెంట్‌లు:

  1. చూచింతర్వాతే ఇక్కడకు వచ్చాను గురువుగారు,
    మా గురుదేవుల రచన కూడా ఈ రోజు తప్పక చదవాలని ఆశకలుగుతున్నది.

    రిప్లయితొలగించండి
  2. ధర్మ సంస్థాప నార్థమ్ము దాల్చెను హరి
    మత్స్య కచ్ఛప వారాహ మానవ మృగ
    వామనము రామ శ్రీకృష్ణ పరశురామ
    బుద్ధ కల్క్యావ తారముల్ బ్రోవ మనల.

    రిప్లయితొలగించండి
  3. దుష్ట శిక్షణ గావించు నిష్ఠ గలిగి
    విష్ణు డ వతారము ల్ యె త్తె వివిధములుగ
    మత్స్య కూర్మా ది గా గల మాన నీ య
    వేష ధారణ గావించె వెన్ను డవని

    రిప్లయితొలగించండి
  4. నాలుగు వేదముల్ వెదకి నాల్గుమొగమ్ముల నిల్పువానికిన్
    పాలసముద్రమున్ గిరిని భారము గొప్పగ దాల్చు వానికిన్
    బేల ధరిత్రినిన్ కనగ పెద్ద వరాహము నైన వానికిన్
    బాలుని వాక్కు నిల్పినెడ బాయక దర్శనమిచ్చువానికిన్

    మేలగు బాపనుండగుచు మిన్నును మన్నును గొల్చువానికిన్
    తాలిమి పాపులన్ నఱికి ధాత్రికి భారము దీర్చువానికిన్
    నేలనె యేలు మోహమును నేర్పుగ ద్రోసిన శౌర్యరూపుకున్
    కేలను పర్వతమ్మునిడు కేళిని లీలగ జూపు బాలుకున్

    శీలత పృథ్వినిన్ నిలుపు చేవను గల్గిన బుద్ధదేవుకున్
    కూలిన ధర్మమిద్ధరను కూర్చగ రాగల ఖడ్గధారుకున్
    లీలలు జూపు దేవునికి లేనగవొప్పెడు దేవదేవుకున్
    మాలను వైచి మ్రొక్కుదును మాయలు తీయుచు కావవేడుదున్


    రిప్లయితొలగించండి
  5. మీనము, కూర్మము, కమఠము
    పై నరహరి, వామనునిగ, భార్గవుగా, శ్రీ
    జానకి రామునిగ మరియు
    జ్ఞానీ బుధ్ధునిగ యైన కల్కీ, హరి జే !

    రిప్లయితొలగించండి
  6. శరణు యన్న మా కొరకు దశావతారములను, సం
    చరుడవయ్యు, రాక్షసులను సంహరించి, చెలగి, పా
    మరులను ధర గాచినావు, మారుతాత్మజా ! ఘనా !
    చరలనుండి గావుమింక, శతృనాశ రాఘవా !

    రిప్లయితొలగించండి
  7. పరిణతి చెందినయాత్మయె
    పరమాత్మస్వరూప మంచు పదిరూపములన్
    ధరియించి విష్ణువె దెలుపఁ
    నరుడీసత్యముఁదెలిసిన నారాయణుడౌ!

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పద్యము....

    సీ.
    వేదమ్ములనుఁ గాచి; మేదినీధర మోసి;
    కాశ్యపిన్ ధరియించి; కశిపుఁ జీల్చి;
    బలిని ముప్పాదానఁ బాతాళమున కంపి;
    రాజన్యులనుఁ జంపి; రావణుఁ దన
    యాశుగమ్మునఁ గూల్చి; యమునను వణికించి;
    కారుణ్యమును నేర్పి; మ్లేచ్ఛుఁ ద్రుంచి;
    దుష్టులఁ దునుమాడి; శిష్టులఁ జేకొని;
    పాపులఁ బరిమార్చి; వసుధ నోమి;
    గీ.
    జన్మ నిచ్చియుఁ, బ్రతికించి, సమయఁ జేయు
    మత్స్య, కూర్మ, కిటి, నరసింహ, వటు, పరశు
    రామ, రఘురామ,బలరామ, శ్రాంత బుద్ధ,
    కల్కి రూపుండునౌ హరిన్, ఘనునిఁ గొలుతు!

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    మీ గురువుగారు ఎవరు?
    *
    మిస్సన్న గారూ,
    క్రమం తప్పకుండా దశావతారాలను పద్యబద్ధం చేసిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి భావంతో పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    మొదటి పాదంలో ‘దుష్ట - నిష్ఠ’లకు ప్రాసయతి చెల్లదు. అక్కడ ‘దుష్టశిక్షణ గావింప నిష్టపడుచు’ అందాం. ‘అవతారముల్ + ఎత్తి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అవతారముల నెత్తి’ అంటే సరి!
    *
    లక్ష్మీదేవి గారూ,
    అద్భుతం! ఎంత బాగారాసారు పద్యాన్ని! నాలుగు చొప్పున పాదాలను విడగొట్టవలసిన అవసరం ఏమిటి? అది ఉత్పలమాలిక కదా! చాలా సంతోషం. అభినందనలు.
    ‘పాలసముద్రమందు గిరి భారము’ అంటే బాగుంటుందేమో!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అవతారాలన్నిటినీ క్రమంతప్పకుండా కందంలో అందంలో ఇమిడ్చారు. అభినందనలు.
    ‘జానకీరాముడు’ అనాలి కదా. ‘జానకి మగడగు రాముడు / జ్ఞానియు’ అందాం. జ్ఞానీ అంటే సంబోధన స్ఫురిస్తున్నది.
    *
    వామన కుమార్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘శరణు + అన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘శరణ మన్న’ అందాం. అన్నట్టు మధ్యలో మారుతాత్మజు డెందుకు వచ్చాడు?
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పరమాత్మస్వరూప’మన్నప్పుడు గణదోషం. ‘పరమాత్ముని రూప’మందాం.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా ! కడుంగడు ధన్యవాదములు.
    మీరు చేసిన సవరణ తో..

    మీనము, కూర్మము, కమఠము
    పై నరహరి, వామనునిగ, భార్గవుగా, శ్రీ
    జానకి మగడగు రాముడు
    జ్ఞానియు బుధ్ధునిగ యైన కల్కీ, హరి జే !

    రిప్లయితొలగించండి
  11. గురువు గారు,
    ధన్యవాదాలండి.
    పొరపాటుగా అలా ప్రచురించేశానండి. సరే అని ఉంచేశాను.
    పాలసముద్రమందు గిరి బాగున్నదండి.

    అలవోకగా అందమైన పద్యములను వ్రాసే "కంది శంకరయ్య గారు" అనే గురువుగారి గురించే నండి నేను చెప్పినది.

    రిప్లయితొలగించండి


  12. తేటతెల్లముగ బదియె తెలియు జనుల
    కిరువదొక్కటి కలవుగా యెంచి చూడ
    నద్భుతావతారములు నీ వంబుజాక్ష !
    తెలియకుండంగ మరియెన్ని కలవొ దేవ.

    దుష్ట శిక్షణకు,మరియు శిష్ట రక్ష
    ణార్థ మఖిల విశ్వమ్ముల యందు సత్య ,
    ధర్మ సంస్థాపనార్థమ్ము ,జనుల బ్రోవ,
    నుదయమౌ యవతారముల్ యుగయుగాల.
    1.
    శంకరార్యా,ఈ రోజుల్లో పద్యపాద ఆరంభంలో అచ్చు ఉండవచ్చునంటారు.
    2.ఈ మహా విశ్వంలో ఇంకా ఎన్ని లోకాల్లో ఎందరు ప్రజలున్నారో తెలియదుకదా.అక్కడ కూడా భగవంతుని ప్రభావం ఉంటుందన్న ఊహతో వ్రాసాను.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ ముద్దు రమణారావు గారూ ! పద్యములోని దోషమును తెలిపినందులకు ధన్యవాదములు.
    సవరణతో నా పూరణ...


    మీనము,కూర్మవరాహం
    బా నరహరి, వామనునిగ, భార్గవుగా, శ్రీ
    జానకి మగడుగ, కృష్ణుడు
    జ్ఞానియు బుద్ధుండు పైన కల్క్యగు హరి ! జే !

    రిప్లయితొలగించండి