19, అక్టోబర్ 2015, సోమవారం

సరస్వతీ స్తుతి



తల్లీ !నా మదిలో నినుందలతు, నే తాత్సారముంజేయ, నీ

కల్లోలంబగు మోహసింధువులఁ జిక్కంబట్టి నాపాపముల్
యల్లాడించుచునున్నవో జనని! మా యమ్మా! సుతంత్రంబుతో
నీళ్ళన్ పాలను వేరుజేయు గుణముల్ నీవే ప్రసాదింపవే!



హంసపై కొలువైన మానిని! యక్కరన్ కనిపెట్టుమా!
ధ్వంసమవ్వగ నాదు భ్రాంతులు, దక్షురాలనుఁ జేసి, వి
ద్వాంసురాలుగఁ జూడుమమ్మ! సదా మదిన్ నిను దల్తు,నే
యంసమైనను విద్యనిచ్చిన నజ్ఞగానిక నుందునే?



సరస్వతీ, దయామయీ! విశాల నేత్రి! చూడుమా!
పరమ్మునందిహమ్మునందు పాలనమ్ము సేయుమా!
వరమ్ము నన్ను కోరమందువా, విరించిరాణి, శ్రీ
కరమ్ము నీదు దీవనమ్ము , కాంచనమ్ము చాలునే?


రచన - లక్ష్మీదేవి

2 కామెంట్‌లు:

  1. గురువుగారు,
    కృతజ్ఞురాలను. మోహసంద్రముల అనే పదము సరికాదని మిత్రులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తిగారు సూచించారు. దీన్ని మోహసింధువుల అని మారిస్తే సరిపోతుందంటే మార్చగలరు.

    రిప్లయితొలగించండి