15, ఏప్రిల్ 2013, సోమవారం

పద్య రచన - 312 (ఎండమావులు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“ఎండమావులు”

10 కామెంట్‌లు:

  1. జలమ్ముభంగి భ్రాంతిఁ గొల్పు, సత్యమౌనె? యెన్నడున్,
    ఫలమ్ము లేదు, రాదు; చెమ్మ వచ్చునే యెడారిలో?
    బలమ్ము లేని మేఘమాల, వానజల్లు లిచ్చునే?
    ఫల ప్రతీక్షణమ్ముఁ జేయ వచ్చునే మహాశయా!

    రిప్లయితొలగించండి
  2. వచ్చు ననుకొను భాగము వ్రయ్య లయ్యి
    ఎండమావిగ మారెను నింత లోన
    ప్రాప్తి లేదని భావించి పరమ శివుని
    వేడు కొనగను బోవుదు విభుని దరికి .

    రిప్లయితొలగించండి





  3. ఆశ తీరక జీవితమంత శాంతి
    లేక శ్రమియించి సంపద లెన్ని యైన
    గడనజేసి జరారుజ గడకు సుఖము
    వెదకినను నెండమావులు వింత!బ్రతుకు.

    రిప్లయితొలగించండి
  4. ఎండమావిజూచి యిందులో నీరంబు
    త్రాగగలనటంచు దలచు జనుడు
    కువలయంబులోన కుందేటికొమ్ముకై
    వెతుకువాని పగిది వెర్రివాడు.

    రిప్లయితొలగించండి
  5. ఎండమావు లందు నుండవు జలములు
    భంగ మున్న భంగి భ్రాంతి గొలుపు
    చేర వచ్చి చూడ దూరము పోవును
    తృష్ణ మాత్ర మెంత తీర దెపుడు

    రిప్లయితొలగించండి
  6. ఇవిగివిగో నీరములు త
    నివి తీరగ త్రాగ రమ్మని, జలా శయమే?
    చవులూరించెనని నడువ
    నవివేకంబని మరీచికదియే దెలుపున్!

    రిప్లయితొలగించండి
  7. దాహము తీరగ వచ్చితి
    సాహసముగ నింతదవ్వు సంతస పడినే !
    మోహమున మరీచిక గని
    ఐహికమున కంద నట్టి నైమిత్తి కముల్ !

    రిప్లయితొలగించండి
  8. ఎండమావులు(మరీచిక,మృగతృష్ణ): మిట్ట మధ్యాహ్నపువేళ బయళ్ళయందు నీటివలెకన్పించెడి సూర్యకిరణములు.
    ఎండమావులు ఎలాగైతే దాహం తీర్చలేవో అలాగే ఈ లోకం, దాని కోరికలు, నిన్ను ఎన్నటికి తృప్తిపరచలేవు.
    మృగతృష్ణ అంటే ఎండమావి.ఎడారులలో సుదూరం నుండి కనిపించే మాయాసరస్సులు. ఇసుక తిన్నెల మీద పడే సూర్యకిణాలు ప్రతిఫలించడం వలన దూరమునుండి చూసేవారికి నీటి మడుగులు ఉన్నట్లు భ్రమ కలిగించే సరస్సు.
    తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
    వెతకి కుందేటి కొమ్ము సాదించ వచ్చు
    తిరిగి మృగతృష్ణ లో నీరు త్రాగవచ్చు
    జేరి మూర్కుల మనస్సు రంజింపలేము

    రిప్లయితొలగించండి
  9. రామ పత్నిని గోరె రావణ దైత్యుండు
    .............నెండ మావిగ వాని యిచ్ఛ మిగిలె!
    దుష్ట పన్నాగమున్ దుర్యోధనుడు పన్నె
    ............నెండ మావిగ వాని యిచ్ఛ మిగిలె!
    దామోదరుని జంప దపియించె కంసుండు
    ............నెండ మావిగ వాని యిచ్ఛ మిగిలె!
    నిష్పాండవము జేయ నెంచె నశ్వద్ధామ
    ............నెండ మావిగ వాని యిచ్ఛ మిగిలె!

    నీతి నియమాలు లేనట్టి నీచ వాంఛ
    లెండ మావులె దలపంగ నేరికైన
    ధర్మ బద్ధుడై సంఘాన తనరెనేని
    కర తలామలకమ్ములే కనగ నెల్ల.

    రిప్లయితొలగించండి
  10. ఎండమావులపై ప్రశంసనీయమైన పద్యాలను రచించిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మిస్సన్న గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి