26, ఆగస్టు 2024, సోమవారం

సమస్య - 4864

27-8-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు”

(లేదా...)

“గురువులమంచు శిష్యజనకోటిని  మోస మొనర్తు రెందరో”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

15 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

కదలక మెదలక నిలుచు కర్మసాక్షి
తిరుగు సప్తాశ్వములు గల తేరుపైన
ననుచు బోధించుచును వారలనుదినమ్ము
శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు.


హరిహయు డగ్నిగోళమని యాతడు నిశ్చలు డంచెఱంగియున్
తురగములేమొ యేడనుచు తూర్పుజనించుచు పశ్చిమంబునన్
బరమపదించు వాడనుచు భానుని గూర్చి వచించుచున్ సదా
గురువులమంచు శిష్యజన కోటిని మోసమొనర్తు రెందరో.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
బొమ్మ గురునిగ ద్రోణుఁడు పూజలంది
ఏకలవ్యుని విలుకాని నెడ వివక్ష
నంగుటమ్మందె గురుదక్షిణనఁగ! నిటుల
శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు!


చంపకమాల
దరికిని జేరి భక్తి గురుదక్షిణనిత్తన నేకలవ్యుఁడున్
బరుడనుచున్ వివక్షఁగని పార్థునినెంచుచు నంగుటమ్మునే
దురితపు భావనన్ మఱచి ద్రోణుడు బొమ్మగురుండు! నిట్టులన్
గురువులమంచు శిష్యజనకోటిని మోస మొనర్తు రెందరో!

Sitharamayya Solasa చెప్పారు...

నేటి సాధన ములతోడ నిరవధికము
తమనుమించి యెవరులేరు ధరణిలోన
ననుచు చాటుచు చక్కటగ ననువు జుపి
శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే. శ్రద్ధ తరిగి ధ్యాస మరలు సమయమందు
విరుగుడుఁ గని విద్యార్థుల విషయ మరసి
కల్లలాడి సక్రమ దారి గరుప నెంచి
శిష్యులను మోసగింత్రు విశిష్టగురువులు

(విశిష్ట గురువులు శిష్యుల మంచి కోరెదరని)

చం॥ అరయఁగ నేఁడు విజ్ఞతకు నాసర లేకయె పోయె నయ్యయో!
విరియఁగ లంచగొండులటు విత్తము నిచ్చిన వారినే కదా
గురువులుగాను గూర్చెదరు గుట్టును విప్పఁగ జ్ఞాన హీనతన్
గురువులమంచు శిష్యజన కోటిని మోసమొనర్తు రెందరో

(వీరు రెండో రకమండి unworthy teachers)

M.B.G.TILAK చెప్పారు...


సర్వ మెరిగిన వారమీ యుర్విపైన
పుణ్య మొసగు దివ్యాంశ సంభూతులమని
తాము దీవించ భాగ్యమ్ము తనరుననుచు
శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు

పరమము తామటంచు నిటపల్కుచు నుందురు యోగులెందరో
తరతమ భావమే తొలగి ధర్మము త్రెక్కొనజేయు యత్నమే
తరచుగ చేతుమంచు తమ దర్పము చూపుచు శ్రేష్టమైన స
ద్గురువులమంచు శిష్యజనకోటిని మోస మొనర్తు రెందరో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తే.గీ.॥
మతము పేరిట మోసముల్ సతము జరుపు
ముచ్చు స్వాములు వెలసిరి విచ్చలుగను
భోగములయెడ నాశతో పుడమియందు
శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు

చంపకమాల:
నిరతము దైవచింతనము నిక్కపు భక్తినిగల్గి నిష్ఠతో
గురువులు భక్తితత్త్వమును గూర్తురు బోధల భక్తకోటికిన్
వెరవుగ నేడు పీఠముల విచ్చలుగా నెలకొల్పి భుక్తికిన్
గురువులమంచు శిష్యజనకోటిని మోస మొనర్తు రెందరో

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పై చదువులఁ జో టందిన పాత వారిఁ
బదుల లోఁ జూపి చేరిన వచ్చు మంచి
కాల మంచు నాసలు సూపి వేల లోన
శిష్యులను మోసగింత్రు విశిష్ట గురులు


తరుణుల మాటలం దనిపి తద్దయు రక్తినిఁ గామ సారమున్
విరివిగఁ దెల్ప యత్నములు వేమరుఁ జేయఁగ గీత సార మం
దరసిన యట్టి ముక్తి వడయంగ నుపాయము లెల్లఁ దెల్పు స
ద్గురువుల మంచు శిష్యజన కోటిని మోస మొనర్తు రెందఱో

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ: శిష్య! అద్వైత మొక్కటే శ్రేష్ఠ మయ్య!
తర్కమున విశిష్టాద్వైత తత్త్వ మెల్ల
యోటమిని బొందు దానినే యొసగి మూర్ఖ
శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు”
(అద్వైతి ఐన ఒక గురువు విశిష్టాద్వైతాన్ని నమ్మ వద్దని శిష్యుని తో అన్నట్లు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం:గురులఘుసూత్రముల్ దెలిసి,కూర్చ గణమ్ముల నేర్చి సుంత వ్యా
కరణము లేని పద్యముల గల్పన జేయుచు క్రొత్త యైన సం
బరమున గొత్త వారలకు బద్యము నేర్పగ జాలు నట్టి స
ద్గురువులమంచు శిష్యజనకోటిని మోస మొనర్తు రెందరో”
(ఈ సమస్య పూరించాలంటే ఎవరో కొందరు గురువుల్ని ఆక్షేపించక తప్పదు కదా!పాపం! ఎప్పుడూ ఆథ్యాత్మిక గురువుల్నే ఆక్షేపించే బదులు ఒక సారి పద్యగురువుల్ని ఆక్షేపిద్దా మని.)

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కపట బాబాలు వెలసిన కలి యుగాన
మహిమలను జూపు దుమనుచు మాయ జేసి
శిష్యులను మోస గింత్రు విశిష్ట గురులు
జా గ రూకత వలయును జాతి కిపుడు

subbarao చెప్పారు...

శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు
ద్రోణు పటమును గురువుగఁదోచి మదిని
యేకలవ్యుఁడు నేర్వగ నిషువు విద్య
దక్షిణగనిమ్మనె వ్రేలు దయను వీడి

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తగినశిక్షణిచ్చెదమనిధనముకోరి
నియమములు తప్పి కొందరు నీతిని విడి
శిష్యులను మోసగింత్రు విశిష్టగురులు”*
నెమ్మితోడబోధింతురు నిష్టతోడ

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

అరయుచునెల్ల గ్రంథములనార్జనచేయుచుతెల్వితేటలన్
గరుపుచునుందురెప్పుడునుకాలము వ్యర్థముచేయకుండగన్,
గురువులుకొందరుండమరికొందరుకుత్సితబుద్ధితోసదా
*“గురువులమంచు శిష్యులను మోస మొనర్తురు పండితోత్తముల్”*


subbarao చెప్పారు...

గురువులుగాఁజలామణయికొందరుధూర్తులు మానవాళినిన్
దరతమభేదమున్గనక తప్పులఁజేయుచు బాధ వెట్టగా
నిరతము శోకసంద్రమున నీల్గుట జూడగఁదోచెయిట్టులన్
గురువులమంచు శిష్యజనకోటిని  మోస మొనర్తు రెందరో”

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

బోధ చేయుటకు తగిన మేధ లేని
యొజ్జలు ధనము కొఱకు తా ముద్యమించి
శిష్యులను మోసగింత్రు; విశిష్ట గురులు
చేయుదురు బోధ విత్తమాశించకుండ.