30, నవంబర్ 2011, బుధవారం

నా పాటలు - శరణం శ్రీ సుబ్రహ్మణ్యం!

శరణం శ్రీ సుబ్రహ్మణ్యం!
(ఈరోజు సుబ్రహ్మణ్యషష్ఠి. ఈ సందర్భంగా నే నెప్పుడో వ్రాసిన పాట)

శరణు శరణు శరణం మురుగా!
        శరణం శ్రీ బాలమురుగా!
వరమిచ్చే దైవం నీవని - మేము
        చేరినాము స్వామీ నీదరి         
|| శరణు ||

పళనిమలై మందిరమందు
        వెలసిన ఓ కుమార స్వామీ!
శరవణభవ! సుబ్రహ్మణ్యం!
        శరణం నీ దివ్యచరణం
నీ నామగానం మధురము - మాకు
        నీ పాదసేవే శుభకరం         
|| శరణు ||

నెమలి నెక్కి తిరిగే స్వామివి
        వల్లీ దేవసేనా పతివి
తారకుని చంపిన దేవా!
        దయ చూపి కావగ రావా
పాలాభిషేకం చేయగా - నీకు
        తెచ్చినాము పాలకావడీ    
|| శరణు ||

ఉమామహేశ్వర సుతుడవు నీవు
        గణపతి అయ్యప్పల కన్నవు
వీరబాహు మిత్రుడి వంట
        ఆరుకొండల కధిపతి వంట
నమ్మినాము నిన్నే షణ్ముఖా! - మురుగా!
        మమ్ము బ్రోవ రావా వేగమే 
|| శరణు ||

చమత్కార పద్యాలు - 135

                                   శ్రీబంధం

కం.
శ్రీమ దజ! కేశవ! వరద!
రామా! రఘువీర! దీనరక్షక! శౌరీ!
సామజవరగమనా! హరి!
దామోదర! శేషశయన! దయ జూపు మయా!

సమస్యా పూరణం - 544 (లచ్చిమగనికి వచ్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
       లచ్చిమగనికి వచ్చెఁ గళంక మిపుడు.

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/1

                  అయ్యప్ప కథాగానం - 2/1

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


అంతలో అక్కడికి తన శిష్యగణముతో
        మునులలో శ్రేష్ఠుం డగస్త్యుడే వచ్చాడు
        రాజు చేతులలోని పసిబాలునే చూసె || రాజు ||
దైవకార్యం తీర్చగా - పుట్టిన
        హరిహరుల తనయుడంటు - గుర్తించె
రాజును దీవించియు - మునిరాజు
        అతనితో పలికినాడు - ఏరీతి


"ఓ రాజ! సంతానమే లేక బాధపడు
        నీకు ఈ పసికందు దైవప్రసాదంబు
        కొడుకుగా భావించి పెంచుకో నీవింక || కొడుకుగా ||
మెడలోన హారమ్ముతో - దొరికాడు
        మణికంఠు డను పేరుతో - పిలుచుకో
సామాన్యు డనుకోకుమా - పన్నెండు
        వత్సరాలకు తెలియును - ఇత డెవరొ || శ్రీకరం ||


ఆనంద ముప్పొంగ ఆ రాజశేఖరుడు
        మణికంఠు నెత్తుకొని నగరికే వచ్చాడు
        తనయు డంటూ చెప్పి తన రాణి కిచ్చాడు || తనయు ||
ముగ్ధమోహన రూపము - వీక్షించి
        పరవశత్వం చెందెను - ఆ రాణి
రాణివాసం నందున - రాజ్యాన
        సంబరాలే చేసిరి - అందరు


మణికంఠు రాకతో పందళ రాజ్యమ్ము
        సకల సంపదలతో తులదూగ సాగింది
        ప్రజ లెల్ల సుఖముగా జీవింపసాగారు || ప్రజ ||
ఇంతలో గర్భవతియై - ఆ రాణి
        పండంటి ఒక కొడుకును - ప్రసవించె
రాజదంపతు లప్పుడు - వానికి
        రాజరాజను పేరును - పెట్టారు || శ్రీకరం ||


రాజు మణికంఠుణ్ణి ‘అయ్య’ అని పిలిచాడు
        రాణి కడు ప్రేమతో ‘అప్ప’ అని పిలిచింది
        అయ్య అప్పలు కలిసి అయ్యప్పగా మారె || అయ్య ||
ఆ పేరె స్థిరపడ్డది - లోకాన
        అందరికి ఆప్తుడయ్యె - అయ్యప్ప
శుక్లపక్షపు చంద్రుడై - దినదినం
        వర్ధిల్లె మణికంఠుడు - అప్పుడు


గురుకులంలో చేరి గురుసేవలే చేసి
        సకల శాస్త్రమ్ములూ యుద్ధవిద్యల నన్ని
        నేర్చినా డయ్యప్ప ఏకసంథాగ్రాహి || నేర్చి || 

చదువు చెప్పిన గురువుతో - తా నేమి
        దక్షిణగ ఇవ్వవలెనో - అడిగాడు
అయ్యప్ప మహిమ తెలిసి - ఆ గురువు
        అతనితో అలికినాడు - ఈ రీతి || శ్రీకరం ||


"నాయనా! మణికంఠ! నా ఒక్క పుత్రుడు
        మూగవాడూ గ్రుడ్డివాడుగా జన్మించె
        లోపాలు సరిదిద్ది జ్ఞానిగా చేయు" మనె || లోపాలు ||
అయ్యప్ప తాకగానే - బాలునకు
        వచ్చె మాటలు చూపును - చిత్రంగ
గురు వెంతొ సంతసించి - దీవించి
        పంపినా డయ్యప్పను - పందళకు


తన తమ్ముడైనట్టి రాజరాజే రాజ్య
        వారసుండని యెంచి పందళరాజుకు
        భృత్యభావంతోడ సేవలే చేసాడు || భృత్య ||
ఈ రీతి మణికంఠుడు - పన్నెండు
        వత్సరమ్ములు గడపెను - ఆచోట
రాజశేఖరు డతనికి - పట్టాభి
        షేకమే చేయాలని - భావించె || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

29, నవంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 543 (తెలుఁగేలా ? యాంగ్ల భాష)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
       తెలుఁగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/5

                   అయ్యప్ప కథాగానం - 1/5

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


తన భక్తురాలైన కన్నికను రక్షింప
        శివుడు పంపించంగ శ్రీధర్మశాస్తా
        తన మిత్రుడు కరుప్పస్వామితో వచ్చె || తన ||
తంత్రవిద్యలతోడను - ఆ రాజు
        నోడించి రక్షించెను - కన్నికను
అతని రూపం చూసిన - పుష్కళ
        వరియించి పెళ్ళాడెను - శాస్తాను


మలయాళ రాజైన పింజకన్ ఒకసారి
        భూత భేతాళాల చేతిలో చిక్కాడు
        తనను కాపాడంగ శాస్తాను ప్రార్థించె || తనను ||
భూతనాథుని చూసిన - భూతాలు
        దాసోహ మని చేరెను - శరణమ్ము
తన కుమార్తెను పూర్ణను - పింజకన్
        ధర్మశాస్తా కిచ్చెను - భార్యగా || శ్రీకరం ||


తన కూతురైన పుష్కలదేవి ఉండగా
        మరల పూర్ణను పెళ్ళిచేసికొన్నాడని
        కోపించినాడు ఆ నేపాళరా జపుడు || కోపించి ||
మనిషిగా భూమిపైన - శాస్తాను
        బ్రహ్మచారిగ ఉండగా - శపియించె
అది దైవలీలగానే - భావించి
        శిరసా వహించేనులే - ఆ శాస్తా


శ్రీ పూర్ణ పుష్కళాంబా సమేతుండైన
        భూతనాథుని పిల్చి శివుడిట్లు చెప్పాడు
        "నాయనా! విను మొక్క దేవరహస్యమ్ము || నాయనా ||
మహిషికి మోక్షమిచ్చి - జనులను
        కాపాడు కర్తవ్యమే - నీ కుంది
పందళరా జింటను - పన్నెండు
        వత్సరమ్ములు గడుపగా - పోవాలి" || శ్రీకరం ||


మలయాళ దేశాన పందళ రాజ్యాన
        రాజశేఖరుడనే రాజొక్క డున్నాడు
        ప్రజల బిడ్డల రీతి పాలించుచున్నాడు || ప్రజల ||
సంతానమే లేకనూ - ఆ రాజు
        సంతాపమే పొందియు - దుఃఖించె
తాను చేసిన పూజలు - వ్రతములు
        వ్యర్థమైపోయె నంటూ - భావించె


ఆ రాజు ఒకరోజు వేటాడగా దలచి
        మంత్రి పరివారమ్ముతో అడవి నున్నట్టి
        పంపానదీతీర ప్రాంతమ్ము చేరాడు || పంపా ||
స్వేచ్ఛగా సంచరిస్తూ - అడవిలో
        ఎన్నెన్నొ జంతువులను - వేటాడె
మధ్యాహ్నకాలానికి - ఆ రాజు
        అలసి సొలసి చేరెను - ఒక నీడ || శ్రీకరం ||


కునుకు తీస్తున్నట్టి ఆ రాజు చెవి సోకె
        మృదుమధుర గానమై పసివాని ఏడుపు
        "ఈ ఘోరవనిలోన రోదనం ఎక్కడిది?" || ఈ ఘోర ||
 అని లేచి రా జప్పుడు - ఏడుపు
        వినబడ్డ దిక్కుకేగె - వేగంగ
అటు పోయి వీక్షించెను - చిత్రంగ
        పసివాణ్ణి పాముపడగ - నీడలో


"ఎవ్వడీ పసివాడు? ఎందు కిట నున్నాడు?
        పాము పడగను పట్టె బహుగొప్ప జాతకుడు
        వదలిపోరాని ముద్దులమూటరా ఇతడు || వదలి ||
కులగోత్రములు తెలియక - నా వెంట
        ఏరీతి కొనిపోదును - ఇతనిని
ఎవరైన కనిపించరా" - అనుకొని
        అన్ని దిక్కులు వెదికెను - ఆ రాజు || శ్రీకరం ||


                                                       మొదటి భాగం సమాప్తం

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715





28, నవంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 542 (దోషకాల మొసంగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
దోషకాల మొసంగు సంతోషగరిమ.
ఈ సమస్యను పంపిన
తాడిగడప శ్యామల రావు గారికి
ధన్యవాదాలు.

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/4

                    అయ్యప్ప కథాగానం - 1/4

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


మెరుపుతీగను బోలు మేని హొయలును చూపి
        రతిని మించిన సుందరాంగియై కనిపించి
        భస్మాసురుని దృష్టి తనవైపు తిప్పింది || భస్మా ||
ఆమె పొందును కోరుతూ - రాక్షసుడు
        ప్రాధేయపడె నంతట - మోహాన
"నాకు దీటుగ నాట్యమే - చేయరా
        సొంతమౌతా" నందిలే - మోహిని


దేవతలు యక్ష గంధర్వ కిన్నరు లంత
        అతివిస్మయంతోడ వీక్షించుచుండగా
        తాధిమ్మి తకధిమ్మి నాట్యమే చేసారు || తాధిమ్మి ||
వివిధభంగిమ లొప్పగా - తనచేయి
        తలపైన పెట్టుకొనెను - మోహిని
ఆమెనే అనుకరిస్తూ - తనచేయి
        తలపైన పెట్టుకొనెనే - రాక్షసుడు || శ్రీకరం ||


వరము మరచి చేయి తలపైన పెట్టుకొని
        భగభగా భగ్గుమని మంటలే లేవగా
        భస్మాసురుడు కాలి భస్మమై పోయాడు || భస్మా ||
విపరీత బుద్ధితోడ - రాక్షసుడు
        తనకు తానై చచ్చెనే - దుష్టుడై
మోహినీవేషమ్ముతో - విష్ణువు
        శంకరుని కాపాడెను - యుక్తితో


మోహినీ రూపలావణ్యాలు తిలకించి
        మోహాలు రేపు కనుసైగతో పులకించి
        మరుని చంపిన హరుడు మరులు గొన్నాడు || మరుని ||
కామదేవుని బాణము - తగులగా
        మోహినిని మోహించెను - శంకరుడు
విష్ణువే ప్రకృతి కాగా - శివుడేమొ
        పురుషుడై పొందినారు - సుఖములను || శ్రీకరం ||


మోహినీరూపుడగు శ్రీమహావిష్ణునకు
        లయకారకుండైన ఆ పరమశివునకు
        అతిసుందరుండైన బాలుడే కలిగాడు || అతి ||
మహిషిని సంహరించే - హరిహరుల
        కొడుకు జన్మించె ననిరి - దేవతలు
దివినుండి పూలవాన - కురిపించి
        సంబరాలే చేసిరి - అందరు


ఉత్తరాయణ పుణ్యకాలాన ఉత్తరా
        నక్షత్ర పంచమీ శనివారమందున
        వృశ్చికలగ్నాన జన్మించె నా శిశువు || వృశ్చిక ||
విష్ణు వొక మణిహారము - బహుమతిగ
        శిశువు మెడలో  వేసెను - ప్రేమతో
ధర్మాన్ని శాసించగా - జన్మించె
        ధర్మశాస్తా అందుము - అనె బ్రహ్మ || శ్రీకరం ||


ఆ ధర్మశాస్తా తనతండ్రి శివునితో
        కైలాసమే పోయి అక్కడే పెరిగాడు
        గణపతి సుబ్రహ్మణ్యుల తమ్ముడై ఎదిగె || గణపతి ||
భూతాలు ప్రేతాలకు - అతనిని
        అధిపతిగ చేసినాడు - శంకరుడు
భూతనాథుం డనుచునూ - దేవతలు
        కీర్తించి సేవించిరి - అప్పుడు


మంతతంత్రాది విద్యావిశారదు డైన
        నేపాళదేశ రాజైన పళింజ్ఞన్ కు
        పుష్కళాదేవి అను కూతురే ఉన్నాది || పుష్కళా ||
మరణమ్ము లేకుండగా - కాళికి
        కన్నెలను బలి ఇచ్చును - ఆ రాజు
శంకరుని భక్తురాలు - కన్నికను
        బలి ఇవ్వబోయినాడు - ఒకసారి || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

27, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 541 (పనిపాటులు లేనివాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
                        పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.
         ఈ సమస్యను సూచించిన 
మా బావగారు మిట్టపెల్లి సాంబయ్య గారికి 
                                                                           ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 540 (పంచమవేదమై పరగు)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
పంచమవేదమై పరగు
భారతమున్ బఠియింప  దోషమౌ.

ఈ సమస్యను సూచించిన ‘కవిమిత్రునకు’ ధన్యవాదాలు.

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/3

                    అయ్యప్ప కథాగానం - 1/3

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


మహిషి బాధలు విన్న శ్రీమహావిష్ణుండు
        శంకరుని బ్రహ్మను దగ్గరకు పిలిచాడు
        వారి అంశలతోడ మహిష మొక్కటి పుట్టె || వారి ||
దత్తాత్రేయుని అంశతో - మహిషమ్ము
        పుట్టి తన కర్తవ్యము - అడిగింది
స్వర్గాన్ని ఏలుతున్న - మహిషిని
        చేర్చు భూలోకానికి - అన్నారు

అతి సుందరంబైన ఆ మహిష మప్పుడు
        పరుగు పరుగున స్వర్గలోకమే చేరింది
        కోరికలు చెలరేగ రంకెలే వేసింది || కోరికలు ||
మహిషాన్ని చూడగానే - మహిషికి
        కామవాంఛలు పుట్టెను - మనసులో
తన పొందుకై వచ్చిన - మహిషిని
        భూలోకమే చేర్చెను - మహిషమ్ము || శ్రీకరం || 


బహుకాల మిద్దరు భూలోకమందున
        స్వేచ్ఛావిహారమ్ము చేసి సుఖపడ్డారు
        మదనసామ్రాజ్యాన్ని పాలించినారు || మదన ||
రాక్షసులు వివరించగా - వాస్తవం
        తెలిసికొని విదిలించెను - మహిషాన్ని
మహిషరూపును వీడెను - దత్తుండు
        ఆ త్రిమూరుల కలిసెను - లీనమై

ఇంద్రలోకం నుండి తనను తప్పించిన
        దేవతల మోసాన్ని తెలిసికొన్నది మహిషి
        ఆగ్రహావేశాలతో ఊగిపోయింది || ఆగ్రహా ||
దేవలోకం చేరెను - ఇంద్రున్ని
        తన్ని తరిమి వేసెను - దివినుండి
మునులను దేవతలను - మానవుల
        ముప్పుతిప్పలు పెట్టెను - దయలేక || శ్రీకరం || 


ఏకాంత స్థలమందు దాగినా డింద్రుండు
        ఒకనాడు నారదుడు అక్కడికి చేరాడు
        ఇంద్రాది దిక్పతుల పూజలే కొన్నాడు || ఇంద్రాది ||
"ఇంకెంత కాలానికీ - మా బాధ
        తీరునో చెప్ప" మనిరి - నారదుని
"కలిసివచ్చే కాలము - ముందుంది
        అందాక ఆగు" మనెను - దేవముని

భస్మాసురుం డనే రాక్షసుడు ఉన్నాడు
        పరమేశ్వరుని గూర్చి తపమెంతొ చేశాడు
        మెచ్చి వచ్చిన శివుడు "కోరు వర" మన్నాడు || మెచ్చి ||
తన చేతి నెవరి తలపై - ఉంచినా
        భస్మమై పోవు వరము - అడిగాడు
శంకరుడు మన్నించియు - వరమిచ్చి
        కైలాసమే వెళ్ళగా - చూచాడు || శ్రీకరం ||


తనకంత సులభంగ వర మిచ్చి నందుకు
        అనుమానమే వచ్చె భస్మాసురున కపుడు
        వరము శక్తిని పరీక్షించగా దలచాడు || వరము ||
శంకరుని తలపిననే - చెయిబెట్ట
       మునుముందుకే వచ్చెను - రాక్షసుడు
ప్రాణరక్షణ కోసమై - భయముతో
        వెనువెనుకగా పోయెను - శంకరుడు

ఆగు మాగు మంటు రాక్షసుడు వెంటాడ
        వద్దు వద్దని శివుడు పారిపోసాగాడు
        తలదాచుకొనునట్టి స్థానమే వెదికాడు || తలదాచు ||
విష్ణు విది చూసినాడు - శంకరుని
        కాపాడ దలచినాడి - ఆ క్షణమె
సౌందర్యరాశి యైన - మోహినిగ
        కనిపించె మురిపించెను - రాక్షసుని || శ్రీకరం || 



క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

26, నవంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 539 (హీనులకు శుభమ్ము)

                          కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
              హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు
ఈ సమస్యను సూచించిన తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలు.

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/2

                     అయ్యప్ప కథాగానం - 1/2

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
మధురం మనోహరం ఆనందభరితం
|| శ్రీకరం ||)

దత్తుడా తర్వాత దేహాన్ని వదిలేసి
        ఆ త్రిమూర్తులలోన ఐక్యమ్ము చెందాడు
        లీలావతి కూడ తనువు చాలించింది || లీలావతి ||
ఆమె మరుజన్మలోన - కరంభునికి
        కూతురై జన్మించెను - మహిషిగా
ఆమె పెదతండ్రి యైన - రంభునికి
        మహిషాసురుడు పుట్టెను - అన్నగా.

స్త్రీ చేతిలో తప్ప మరియెవరి చేతను
        మరణమ్ము లేకుండ బ్రహ్మచే వరమంది
        మహిషాసురుడు లోకకంటకుం డైనాడు || మహిషాసురుడు ||
దేవతలు ప్రార్థించగా - పరాశక్తి
        దుర్గగా అవతరించె - ఆ క్షణమె
లోకాల కాపాడగా - యుద్ధాన
        మహిషాసురుని చంపెను - ఆ తల్లి || శ్రీకరం ||

 
తన అన్న మహిషుని మరణవార్తను విన్న
        మహిహి దుఃఖముతోడ కుమిలిపోయింది
        దేవతలపై ఎంతొ పగ పెంచుకున్నది || దేవతలపై ||
"వరబలం ఉన్నప్పుడే - దేవతల
        నోడింతు" వని చెప్పెను - శుక్రుడు
గురువు చెప్పిన మేరకు - ఆ మహిషి
        తీవ్రతపమే చేసెను - వనమందు

అతిఘోర మైనట్టి ఆ మహిషి తపమునకు
        పదునాల్గు భువనాలు తల్లడిల్లెను నాడు
        ఆ తపోజ్వాలల్లొ అల్లాడిపోయాయి ||
ఆ తపో ||
బ్రహ్మదేవుం డప్పుడు - పొడసూపి
        "వరమేమి కావా" లనీ - అడిగాడు
"మరణమే లేకుండగా - నా కొక్క
        వర మివ్వ" మని కోరెను - ఆ మహిషి || శ్రీకరం ||


"పుట్టిన ప్రతిజీవి గిట్టుట సహజమ్ము
        మరణమ్ము లేకుండ వర మివ్వలే నమ్మ!
        అది తప్ప ఏదైన కోరింది ఇస్తాను" || అది తప్ప ||
అని బ్రహ్మ బదు లివ్వగా - ఆ మహిషి
        ఆలోచనే చేసెను - తీవ్రంగ
తన కోర్కె తీరునట్లు _ యుక్తితో
        వింతైన ఒక వరమునే - కోరింది

"హరి శంకరుల వల్ల జన్మించు పుత్రుండు
        పన్నెండు వర్షాలు ఒక మానవుని ఇంట
        సామాన్యమనిషిగా దాస్యమ్ము చేయాలి || సామాన్య ||
అటువంటి వాడు తప్ప _ ఇంకొకరు
        చంపకుండగ ఇవ్వవే - వరమును"
నాల్గు మోముల వేలుపు - తథాస్తని
        కరుణతో వరమిచ్చెను - మహిషికి || శ్రీకరం ||

 
బ్రహ్మ వరమును పొంది గర్వించి తన రోమ
        మూలాలలో వేల మహిషులను పుట్టించి
        తన సేనతో మహిషి స్వర్గమే చేరింది || తన సేనతో ||
ఆమెను ఎదిరించక - ఇంద్రుడే
        పారిపోయెను వేగమే - భయముతో
దేవలోకా న్నంతయూ - రక్కసులు
        కల్లోలమే చేసిరి - అప్పుడు

ఇంద్రసింహాసనం ఆక్రమించిన మహిషి
        సురపానమత్తయై ముల్లోకములలోని
        దేవతల మానవుల మునుల బాధించింది || దేవతల ||
మహిషి బాధల నోర్వక - దేవతలు
        బ్రహ్మకే మొరపెట్టిరి - కాపాడ
శంకరుడు వెంట రాగా - ఆ బ్రహ్మ
        వైకుంఠమే చేరెను - అందరితో || శ్రీకరం ||

 క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

25, నవంబర్ 2011, శుక్రవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/1

                   అయ్యప్ప కథాగానం - 1/1
           నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ రెండు భాగాల ఆడియో లింకులను ఇంతకు ముందే ఇచ్చాను. ఈ పాట సాహిత్యాన్ని కూడా బ్లాగులో ప్రకటించమని కొందరు మిత్రులు కోరారు. పాట పెద్దది కనుక భాగాలుగా బ్లాగులో ప్రకటిస్తున్నాను. దయచేసి ఇందులో ఛందోవ్యాకరణాల దోషాలను పట్టించుకోవద్దని మనవి.

శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం
|| శ్రీకరం ||

ధర్మశాస్తా భూతనాథుండు హరిహరుల
        పుత్రుడై జన్మించి మణికంఠుడను పేర
        పందళరాజుకు వనమందు దొరికాడు
|| పందళ ||
పన్నెండవ యేటనే - మహిషిని
        మర్దించి కాపాడెను - లోకాల,
శబరికొండను వెలసిన - అయ్యప్ప
        కథ వింటె లభియించును - పుణ్యాలు
|| శ్రీకరం ||

అత్రి అనసూయలు అన్యోన్యదంపతులు
        బ్రహ్మశివకేశవులు కొడుకులై పుట్టగా
        వరము పొందాలని పూజలే చేసారు
|| వరము ||
వారి పూజలు మెచ్చిరి - దేవుళ్ళు
        కనిపించి వరమిచ్చిరి - అత్రికి,
ఆ త్రిమూర్తుల అంశలే - ఒక్కటై
        పొందె దత్తాత్రేయుడు - జన్మను.


ముగ్గురు మూర్తుల అంశలే దత్తుడై
        జన్మించెనని వారి భార్యలకు తెలిసింది
        తమవంతు కర్తవ్యమును చేయదలచారు
|| తమ ||
ముగ్గురమ్మల అంశలే - ఒక్కటై
        వెలిసింది యోగమాయ - లోకాన
లీలావతి పేరుతో - గాలవుని
        కూతురై జన్మించియు - వర్ధిల్లె
|| శ్రీకరం ||

దత్తలీలావతులు తగిన జంటగ ఎంచి
        ఆ అత్ర్రి గాలవులు అతివైభవముతోడ
        కళ్యాణమే చేసి సంతోషపడ్డారు
|| కళ్యాణ ||
అన్యోన్యదాంపత్యమే - వారిది
        ఆదర్శసంసారమై - కొనసాగె,
ఎల్లలే లేకుండగా - ఇద్దరు
        సంసారసుఖ మందిరి - తృప్తిగా


ఒకనాడు దత్తుండు లీలావతిని పిలిచి
        సంసారసుఖమంత అనుభవించితి మింక
        వానప్రస్థం పోవు కోరికే మిగిలింది
|| వాన ||
సంసారులకు తప్పక - కావాలి
        భార్య అంగీకారము - నయముగ,
అనుమతించి పంపవే - అర్ధాంగి
        తపము చేయగ పోదునే - అన్నాడు
|| శ్రీకరం ||

ఆ మాట మన్నించలేని లీలావతి
        నా కామవాంఛలు తీరనేలేదయ్య
        నిను వీడి క్షణమైన నేనుండలేను
|| నిను ||
పట్టమహిషిని విడుచుట - నీకెట్లు
        భావ్యమని తోచెనయ్యా - నా నాథ!
నీ పట్టమహిషి నేనై - నిన్నెట్లు
        విడుతునని అనుకొంటివి - అని పల్కె 


ఎంత చెప్పిన గాని వినని భార్యను చూసి
        "పట్టమహిషిని నీకు మహిషినని అంటావు
        మహిషి రూపముతోడ జన్మించవే నీవు"
|| మహిషి ||
అని శాపమే ఇవ్వగా - కోపించి
        ప్రతిశాపమే ఇచ్చెను - ఆ దేవి
"మహిషరూపము దాల్చియు - నీ వపుడు
        నా కోరెలే తీర్తువు" అని పలికె
|| శ్రీకరం ||

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

సమస్యా పూరణం - 538 (చీమల పదఘట్టన విని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

24, నవంబర్ 2011, గురువారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2

అయ్యప్ప కథాగానం -2
నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ మొదటిభాగం లింకును మొన్న ఇచ్చాను. 
ఇప్పుడు రెండవభాగం లింకు ఇస్తున్నాను. ఇదే చివరిది కూడా.
వీలైతే రేపటినుండి ఈ పాట సాహిత్యాన్ని కొన్ని భాగాలుగా బ్లాగులో ప్రకటిస్తాను.
క్రింది లింకు ద్వారా పాటను విని తమ స్పందనలను తెలియజేయవలసిందిగా మిత్రులకు మనవి.
http://www.esnips.com/displayimage.php?pid=32992715

సమస్యా పూరణం - 537 (మణులపైన యతికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
మణులపైన యతికి మక్కువ గద!
ఈ సమస్యను సూచించిన తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలు.
నిజానికి ‘శ్యామలీయం’ గారిచ్చిన సమస్య
"మణు లనిన యతీశ్వరుండు మక్కువ జూపెన్"
అయితే ‘ణ’ప్రాసతో కందపద్యం ఔత్సాహిక కవులకు కష్టమౌతుందేమో అన్న అనుమానంతో దానిని ఆటవెలదిగా మార్చి ఇచ్చాను. అందుకు ‘శ్యామలీయం’ గారిని మన్నించమని కోరుతున్నాను.
ఉత్సాహం, సామర్థ్యం ఉన్న కవిమిత్రులు పై కందపద్య పాదాన్ని స్వీకరించి పూరణ చేయవచ్చు.

23, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 536 (ఆమెకును నామె కూతునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
           ఆమెకును నామె కూఁతున కతఁడె భర్త.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

22, నవంబర్ 2011, మంగళవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం

                       అయ్యప్ప కథాగానం -1
నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ చాలా పెద్దది.   
"శ్రీకరం శుభకరం అయ్యప్ప చరితం,
మధురం మనోహరం ఆనందభరితం" 

అనే పల్లవితో, 80 చరణాలతో ఉన్న దీనిని బ్లాగులో ఒకే పోస్టుగా పెట్టాలంటే ఇబ్బందే. అందువల్ల కేవలం పాట ఆడియో లింకు ఇస్తున్నాను. ఈరోజు మొదటి భాగం ఇస్తున్నాను. రెండు మూడు రోజుల్లో రెండవ భాగాన్ని ఇస్తాను. మిత్రు లెవరైనా కోరితే ఎనిమిది చరణాల కొక పోస్ట్ చొప్పున వరుసగా పదిరోజులు ఇస్తాను. దీనిని పి. డి. ఎఫ్. ఫార్మేట్ లో ఇబుక్ గా పెట్టాలంటే అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. ఇందుకు మిత్రుల సలహాలను ఆహ్వానిస్తున్నాను.
దీనిని క్రింది లింకు ద్వారా విని మీ స్పందన తెలియజేయండి.

 http://www.esnips.com/displayimage.php?pid=32991161

ప్రాసభేదాలు - 5

                             ప్రాసమైత్రి - 5
17)  సంధిగత ప్రాస -
ప్రాస వ్యంజన ప్రధానం. సంధిలో ఆగమ, ఆదేశములుగా వచ్చిన హల్లు ప్రాసస్థానంలో ఉంటే దానికే ప్రాసమైత్రి కూర్చాలి. ‘నెయ్యము + అలుక = నెయ్యపు టలుక’ అన్నప్పుడు ‘ట’ ప్రాసస్థానంలో ఉన్నప్పుడు మిగిలిన పాదాలలో ప్రాసగా ‘ట’వర్ణాన్నే ప్రయోగించాలి. అలాగే ‘వాఁడు + చచ్చె = వాఁడు సచ్చె’ అన్నప్పుడు ప్రాసస్థానంలో మిగిలిన పాదాల్లో ‘స’వర్ణమే ఉండాలి.
ఉదా.
సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. (భార. విరా. 4-95)
 
18) వర్గ ప్రాస -
అప్పకవి స్వవర్గప్రాసలో ద-ధలకు, ధ-థలకు ప్రాసమైత్రిని చెప్పినాడు. టవర్గాక్షరాలలో కూడా ఇటువంటి ప్రాసమైత్రి కనుబడుతున్నది. కవర్గంలో క-గలకు, ఖ-ఘలకు ఇలాగే మిగిలిన వర్గాలకు చెల్లుతాయని కొందరు లాక్షణికుల మతం.
ఉదా.
అ)
పెటిలి సువర్ణపర్వతము పెక్కుదెఱంగుల వ్రయ్యునట్టు ల
ప్పుడు వివిధప్రకారముల .... (భార. ఆది. 8-259)
ఆ)
ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షౌహిణుల్
రూఢిం గౌరవసైన్య మీ యుభయమున్ .... (భార. ఆది. 1-69)
 
19) శకార ప్రాస - 
ఊష్మాలైనందువల్ల శసలకు అభేదం చెప్పబడుతున్నది. పూర్వకావ్యాలలో వీనికి ప్రాసమైత్రి చెల్లిన ప్రయోగాలు ఉన్నందున శకారప్రాస స్వీకరింపదగినదే అని కొందరి అభిప్రాయం.
ఉదా.
అ) నాసికాస్యాంగ దృక్ *భ్రూశిరోజ (భాగ. 2-158)
ఆ)
మీసలు మెలిబెట్టుచుఁ గడు
రోసమ్ములు గ్రమ్ముకొనఁ బురోభాగములం
దాశ లద్రువ కేక లిడుచు
దూసిన కత్తులను ... (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలసము - 789) 

 *మరి రెండు మూడు ప్రాసభేదాలను లాక్షణికులు చెప్పినా అవి అంత ముఖ్యమైనవి కానందున విడిచివేయడం జరిగింది.
పై ప్రాసభేదాలు కేవలం అవి ఉన్నాయని మీకు పరిచయం చేయడానికే. ఎలాగు ప్రాసభేదాలలో ఉంది కదా అని మీరు అనుసరించవద్దు. క్రింది విషయాలను గమనించండి. 
1) ప్రాసమైత్రి హల్లులకే కాని అచ్చులకు కాదు.
2) ప్రాసాక్షరం సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, అనుస్వార యుక్తాలైతే మిగిలిన పాదాలలోను అలాగే ఉండాలి.
౩) ప్రాస పూర్వాక్షరం గురు లఘువులలో ఏది ఉంటే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండాలి.
4) ర-ఱల భేదం పాటించడం లేదు కనుక ఈ రెంటికి ప్రాసమైత్రి కూర్చవచ్చు.
5) ప్రాసాక్షరం ముందు అరసున్న ఉంటే మిగిలిన పాదాల్లోను అరసున్న ఉండే పదాలను వేసే ప్రయత్నం చేయండి. అలా వేయకున్నా దోషం కాదు.

దీనితో ‘ప్రాసమైత్రి’ పాఠం పూర్తయింది. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

సమస్యా పూరణం - 535 (సంపదలచేత నరుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
        సంపదలచేత నరుఁడు మోక్షమ్ముఁ గనును.
ఈ సమస్యను పంపిన తాడిగడప శ్యామల రావు గారికి ధన్యవాదాలు.

21, నవంబర్ 2011, సోమవారం

నా పాటలు - (అయ్యప్ప పాట)

                      నవవిధ భక్తి మార్గాలు 

ఒకే గమ్యమును చేరుటకై మన
          కున్నవి ఎన్నో దారులు
నా దైవం అయ్యప్పను చేరగ
          నవవిధ భక్తి పథమ్ములు
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

మహిమలు చూపిన మణికంఠుని కథ
          మరి మరి ‘శ్రవణం’ చేద్దాము
దీనుల గాచే స్వామి లీలలను
          మానక ‘కీర్తన’ చేద్దాము
దయ కురిపించే శాస్తా నామం
          తప్పక ‘స్మరణం’ చేద్దాము
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

పావన పంపాతీర నివాసుని
          ‘పాదసేవనం’ చేద్దాము
పదునెట్టాంబడి పైన వెలసిన
          ప్రభువుకు ‘అర్చన’ చేద్దాము
పందళరాజ కుమారుని కెన్నో
          ‘వందనము’లనే చేద్దాము
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

వావరు స్వామిని మన్నన చేసిన
          వానికి ‘దాస్యం’ చేద్దాము
శబరికొండపై వెలసిన వానికి
          సతతం ‘సఖ్యం’ చేద్దాము
అందరి బాధలు హరించు విభునికి
          ‘ఆత్మనివేదన’ చేద్దాము
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

ప్రాసభేదాలు - 4

ప్రాసమైత్రి - 4 
13) స్వవర్గజ ప్రాస - 
ఏకవర్గానికి చెందడం వల్ల, బాహ్యప్రయత్నంలో మహాప్రాణాలుగా ఉండడం చేత థ, ధలు, ఘోషాలు అవడం వల్ల ద,ధలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
ఉదా.
(అ).
సింధురము మహోద్రేక మ
దాంధంబై వచ్చులీల నాచార్యునిపై
గంధవహసుతుఁడు గవియ న
మంథరగతి నెవ్వఁ డాఁగు మనయోధులలోన్. (భార. ద్రోణ. 1-88)
(ఆ).
కా దన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ .... (భార. ఆది. 1-124)
(ఇ).
బాంధవసౌహృదప్రణయ భక్తివిశేషము లొప్ప నీమనో
గ్రంథి యడంగఁ జేయ నెసకంబునఁ బూనినవారు ... (భార. ఆర. 4-160)
 
14) ఋప్రాస -
యణాదేశసంధి వలన ఋకారానికి రేఫత్వము వస్తుంది. ఋకారానికి ఇటువంటి హల్సామ్యం ఉండడం వల్ల ‘పదాద్యంబులు ఋఌ వర్ణంబులు రల తుల్యంబులు’ అని సూత్రం చెప్పబడింది. ఈ కారణాల వల్ల ఋకారం రేఫంతో ప్రాసమైత్రికి చెల్లుతుంది.
ఉదా.
ఆఋషిపుత్త్రుఁడు గట్టిన
చీరలు మృదులములు నవ్యశిష్టములు మనో
హారులు నాతని పృథుకటి
భారంబును నొక్క కనకపట్టము వ్రేలున్. (భార. ఆర. 3-104)
 
15) లఘు యకార ప్రాస -  
లఘు యకారానికి, అలఘు యకారానికి ప్రాస చెల్లుతుంది. ‘యరలవలు లఘువులని యలఘువులని ద్వివిధంబులు. ఆగమ యకారము లఘువు, తక్కిన యకార మలఘువు’ అని వ్యాకరణ సూత్రం. దీనిని బట్టి సంధివలన ఆగమంగా వచ్చిన యకారానికి, సహజ యకారానికి ప్రాస కూర్పవచ్చు. ప్రాస వ్యంజన ప్రధానం కనుక ఈ ప్రాసభేదాన్ని చెప్పవలసిన పనిలేదు.
ఉదా.
శ్రీయుత గురువర్యునకును (సహజ యకారం)
మా యజ్ఞానమును బాపు మహితాత్మునకున్ (ఆదేశ యకారం)
 
16) అభేద ప్రాస -
‘లళయో రభేదః, లడయో రభేదః’ అనే సూత్రాల వలన లళడలు అభేదాలు కనుక వానికి పరస్పరం ప్రాసమైత్రి చెల్లుతుంది.
ఉదా.
(అ). కేళీ ...., ప్రాలేయాచల .... నిద్రవో, వే లావణ్య ..., జోల (రాజశేఖర చరిత్ర. 2-4)
(ఆ). పాలును ... వా, హ్యాళి ...., బాల ... ప్రో, యాలు ... (రామాభ్యుదయము. 1-8)
(ఇ).
ప్రల్లద మేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రితుల్యుఁడై
త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము ... (భార. సభా. 2-69)
(ఈ).
కొడుకులుఁ దానును గుఱ్ఱపు
దళములఁ గరిఘటల భటరథవ్రాతములం ... (భార. ఉద్యో. 1-220)
(ఉ). జలనిధి ..., వెడలి ...., కడు ....తన, రెడు ... (ప్రభావతీప్రద్యుమ్నము. 1-5
7)

మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

సమస్యా పూరణం - 534 (తీయనైన పండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
        తీయనైన పండు తిక్త మయ్యె.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

20, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 533 (బక సేవలు చేయ సకల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బక సేవలు చేయ సకల భద్రము లొదవున్.
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 532 (భారతి భర్త శంభుఁ డని)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
భారతి భర్త శంభుఁ డని
పల్కుట లోకవిరుద్ధ మెట్లగున్?
(జాల పత్రిక "ఈమాట" సౌజన్యంతో)

19, నవంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 531 (బుద్ధి గలుగువారు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బుద్ధి గలుగువారు బుధులు గారు.
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

18, నవంబర్ 2011, శుక్రవారం

నా కథ ‘కథాజగత్’లో

కవి మిత్రులారా,
నేను ఎప్పుడో ముప్పై యేళ్ళ క్రితం వ్రాసిన కథానిక ‘దత్తత’ కోడీహళ్ళి మురళీ మోహన్ గారు నిర్వహించే ‘కథాజగత్’లో ప్రకటింపబడింది. క్రింది లింకు ద్వారా ఆ కథను చదివి మీ అభిప్రాయాలను తెల్పండి.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/dattata---kandi-sankarayya

నా కవిత్వం - 1

ఈ తీరం

ఈ రాతిరి తీరానికి
ఈదలేని ఏకాకిని
వికటంగా నవ్వే నా
విక! నను దరి జేర్చవోయి.

ఈ తీరము నిస్సారము
హితదూరము విషపూరము
ఇది శాంతికి సంహారము
కదనకాంక్ష విస్తారము.

హితము హత మహింస జితము
నుత సహకారమ్ము క్షతము
మమత లేదు సమత రాదు
మానవతకు తావు కాదు.

వెతలతోడ పతితుడనై
చితికి సతము నిహితుడనై
యున్న నన్ను కన్నారగ
కన్నవాడ నవ్వకు మరి.

ఎటు చూచిన చిక్కని చీ
కటి రక్కసి వెక్కిరించు
చున్న వేళరా నావిక!
నన్ను పరిహసింపకు మిక!
(36 సంవత్సరాల క్రితం 4-9-1975 నాడు వ్రాసిన గేయం ఇది. 
పాత కాగితాలు వెదుకుతుంటే దొరికింది. 
చిత్రం! 
ఇది వ్రాసినప్పటి నా మనఃస్థితి ఇప్పుడు పునరావృతమైంది)                                

ప్రాసభేదాలు - 3

                            ప్రాసమైత్రి - 3
9) ఉభయ ప్రాస -
వ్యాకరణసూత్రాలను బట్టి స, న లకు ష, ణలు ఆదేశమౌతాయి.  ఆదేశ షకారానికి సహజ షకార సకారాలు, ఆదేశ ణకారానికి సహజ ణకార నకారాలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
ఉదా.
అ) విషమ (వి+సమ) లోని ఆదేశ షకారానికి సహజ ష, సలతో ప్రాసమైత్రి ...
వసుధా .... సా, రసదళ ...., విసరాంబుజ ....., విషమ (సాంబవిలాసము)
ఆ) ప్రాణ (ప్ర+ఆన) లోని ఆదేశ ణకారానికి సహజ న, ణలతో ప్రాసమైత్రి ...
    i) ప్రాణములఁ బాపె నాహవ*క్షోణియందుఁ
      బ్రాణవల్లభఁ గొని చన్న *దానవేంద్రు (అప్ప. 3-332)
   ii) దుర్ణయమున శకుని*కర్ణదుశ్శాసనుల్ ... (భార. ఆది. 3-120)
  iii) కర్ణుండు రేఁచి పెట్టఁగ
      దుర్నయపరులైన శకుని దుశ్శాసను లీ ... (భార. ఉద్యో. 2-248)
  iv) పెనఁగు ...., ఫణులు ... (కుమార సంభవము. 4-101)
   v) దనుజుల గర్వరేఖయును ..... ని
      ర్గుణతను జేయ నుమ్మలికఁ గోల్తల కోపక పాఱి రార్తులై (భాగ. షష్ఠ. 276)
 
10) అనునాసిక ప్రాస -
సహజమైన నకార, మకార ద్విత్వాక్షరాలకు (న్న, మ్మ లకు) బిందుపూర్వకాలైన న, మలతో క్రమంగా ప్రాసమైత్రి కూర్పవచ్చు.
ఉదా.
అ) మిన్నేఱు .... ధా, తంనాభి ...., సాన్నిధ్యము ...., సన్నుతి ... (అప్ప. 3-341)
ఆ) i) తమ్ముల ... కుసు, మమ్ముల .... భ, క్తింముర ...., సమ్మదమున (అప్ప. 3-342)
   ii) కమ్మని లతాంతముల*కుం మొనసి వచ్చు మధు*పమ్ముల ... (భార. ఆది. 5-138) 
  iii) అమ్మునీశు నివాసశక్తి ...... జే
      సెం మహానది దీర్ఘికా సరసీనదంబులు నిండఁగాన్. (భార. ఆరణ్య. 3-113)
  iv) ఇమ్ముగ సర్వలోకజను లెవ్వని ... వం
      ద్యుం ముని నప్పరాశరుని ....... (భార. ఆది. 1-76)
అయితే ఇటువంటి ప్రయోగాలు అసాధారణం కావున అప్పకవి తప్ప మిగిలిన లాక్షణికు లెవ్వరూ ఈ ప్రాసను అంగీకరించలేదు. 

 11) ప్రాసమైత్రి ప్రాస -
పూర్ణబిందుపూర్వక బకారానికి (ంబ కు), ద్విత్వమకారానికి ప్రాస వేయవచ్చునని కొందరు లాక్షణికులు చెప్పారు.
ఉదా.
i) గుమ్మతావులు వెదచల్లు*నంబుజములు
  శంబరారాతి చేతి వా*లమ్ము లనఁగ. (అప్ప. 3-343)
ii) అమ్మఖవాజి ...., మో, వం బసి .... (జైమిని భార. 7-145)
12) ప్రాసవైరం - రేఫ శకటరేఫాలకు (ర-ఱ లకు) ప్రాస చెల్లదని లాక్షణికులు చాలా మంది చెప్పినారు. అందుకు శకట సాధురేఫ నిర్ణయాలు చేసినారు. కాని రకార, ఱకార సాంకర్యం అనివార్యమై తిక్కన కాలంనుండి కావ్యాలలో అశేషంగా యతిప్రాసల మైత్రి కూర్పబడింది. ఆధునిక కాలంలో వీని వైరుధ్యం లేదనే చెప్పవచ్చు. కావున వీని మైత్రి అంగీకరింపవచ్చు.
ఉదా.
i) ఊఱక మీఱ నాడెదవు యుక్త మయుక్తము నాత్మఁ జూడఁగా
  నేరవు సర్వలోకముల ...... (భార. ఆరణ్య. 4-199)
ii) ఉఱవడిఁ దఱిమిరి మద్రే
   శ్వరుఁడు గదిసి దీప్తశక్తి వైచెం పెలుచన్. (భార. ద్రోణ. 1-175)
iii) మఱి యట్టి జలజభవునకుఁ
    గర మంతఃకరణ గాత్రకములై వరుసన్. (భాగ., తృ.స్కం. 772)

మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

సమస్యా పూరణం - 530 (భావింపగఁ గృష్ణుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
                      భావింపగఁ గృష్ణుఁ డేకపత్నీవ్రతుఁడే!
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

17, నవంబర్ 2011, గురువారం

నా పాటలు - (సాయి పాట)

                           పరబ్రహ్మ సాయి

సాయి మాధవుడు - సాయి శంకరుడు
సాయినాథుడే పరబ్రహ్మ
అణువునుండి బ్రహ్మండం వరకు
నిండిన సర్వాంతర్యామి       
|| సాయి ||

ఏయే పేరున పిలిచిన వారికి
ఆయా పేరున బదులిచ్చి
ఏ రూపును భావించిన వారికి
ఆ రూపంతో కనుపించు       
|| సాయి ||

నామరూపముల కందని దేవుడు
నానాజీవుల జీవాత్మ
అన్ని నామముల కన్ని రూపముల
కాలవాలమీ పరమాత్మ       
|| సాయి ||

అన్ని మతముల సారం ఒకటే
సంప్రదాయముల గమ్యం ఒకటే
భేదభావముల హద్దులు చెరిపిన
సాయినాథుడే మన శరణం       
|| సాయి ||

ప్రాసభేదాలు - 2

                             ప్రాసమైత్రి - 2
5) సంయుతాసంయుత ప్రాస -
రేఫంతో కాని లకారంతో కాని సంయుతమై ఉన్న హల్లుతో, రేఫ లకారాలు లేని అదే హల్లుతో ప్రాస కూర్చుట. (అనగా ప్రాసాక్షరాలుగా క్ర-క, క్లే-క మొదలైనవి ప్రయోగించుట). దీనిని చాలామంది లాక్షణికులు ఒప్పుకొనలేదు.
ఉదా.
పాఁడి ద్రచ్చఁగ నిమ్ము నా*తండ్రి కృష్ణ (పాఁడి-తండ్రి)
వేఁడుకొనియెద నందాఁకఁ* బండ్లు దినుము (వేఁడు-బండ్లు)
దుండగపు చేష్టలును నోటి*గాండ్రతనము (దుండ-గాండ్ర)
మెండుగాఁ జొచ్చె నీకు నై*దేండ్లు కనఁగ. (మెండు-దేండ్లు)  (అప్పకవీయము. 3-315)

6) రేఫయుత ప్రాస -
వట్రసుడి (ఋత్వం) ఉన్న హల్లు(కృ)కు, ఉకార రేఫ ఉన్న హల్లు(క్రు) ప్రాసలో దేనికి దానితోనే మైత్రి చెల్లుతుంది. అనగా కృ-క్రు లకు ప్రాస వేయరాదు. నిజానికి ఇక్కడ నిషేధం చెప్పినందున దీనిని ప్రాసభేదంగా చెప్పవలసిన అవసరం లేదు.
7) లఘు ద్విత్వ ప్రాస -
సాధారణంగా ఏకపదంలోని సంయుక్తాక్షరానికి ముందున్న హ్రస్వం గురు వవుతుంది. కాని కొన్ని (విద్రుచు మొదలైన) పదాలలోని రేఫ సంయుక్తాక్షరం దాని ముందున్న లఘువును గురువు చేయదు. అటువంటి పదాన్ని ప్రయోగించినప్పుడు అన్ని పాదాలలోను అటువంటి పదాలనే ప్రయోగించాలి. ఒకపాదాన్ని ‘విద్రుచు’తో మొదలుపెట్టి మరోపాదాన్ని ముద్ర, కద్రువ, భద్రము, నిద్ర మొదలైన పదాలు వేయరాదని భావం.
ఉదా.
అ) విద్రుచు వినతాత్మజుఁడు దిక్కు*లద్రువ ననఁగ. (విద్రుచు-అద్రువ) (అప్ప. 3-326)
ఆ) ఎద్రిచిన ...
    పద్రిచిన .....
    విద్రుపఁగ ....
    చిద్రుపలు ..... (ఉత్తర హరివంశము)
 
8) వికల్ప ప్రాస -
కకారం మొదలైన పొల్లు హల్లులకు (క, చ, ట, త, ప లకు) అనునాసికాలు పరమైనప్పుడు అవి ఆయా వర్గపంచమాక్షరాలు (ఙ, ఞ, ణ, న, మ) గానో, వర్గ తృతీయాక్షరాలు (గ, జ, డ, ద, బ) గానో మారుతాయి. ఈ ఆదేశం వైకల్పికం. ప్రాక్+నగ=ప్రాఙ్నగ, ప్రాగ్నగ అని రెండు రూపా లేర్పడుతాయి. ఈ కారణం చేత వర్గ పంచమాక్షరాలు అయా వర్గ తృతీయాక్షరాలతో ప్రాసమైత్రి పొందుతాయి.
ఉదా.
ప్రాఙ్నగ సమానధృతి సుధా*రుఙ్నిభాస్య
స్రఙ్నిచయ సక్తకంఠ దా*వాగ్ని పాయి (స్రఙ్ని- వాగ్ని)
వాఙ్మనోహరనుత యస*దృఙ్మహాత్మ
దిఙ్మహితకీర్తి యర్జున*యుగ్మభేది (దిఙ్మ- యుగ్మ) - (అప్ప. 3-328)

మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

సమస్యా పూరణం - 529 (కసి కసితో మ్రింగనెంచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
             కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

16, నవంబర్ 2011, బుధవారం

ప్రాసభేదాలు - 1

                             ప్రాసమైత్రి - 1
పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాస. పద్యపాదం యొక్క మొదటి అచ్చుకు రెండవ అచ్చుకు మధ్య ఉండే హల్లు లేదా హల్లుల సముదాయం ప్రాస. అంటే పద్యపాదంలో రెండవ వర్ణం హల్సామ్యం కలిగి ఉండడం ప్రాసమైత్రి. ప్రాసాక్షరానికి ముందు వర్ణం దీర్ఘమైతే మిగిలిన పాదాలలోను దీర్ఘం, లఘువైతే మిగిలిన పాదాలలోను లఘువే ఉండాలని నియమం. ప్రాసయతి వేసినప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాలి.
ప్రాసభేదాలు.....
1) అర్ధబిందు ప్రాస -
మొదటి పాదంలో ప్రాసాక్షరానికి ముందు అరసున్న ఉంటే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండడం.
ఉదా.
వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్
నేఁ డిట వచ్చె నేకతమ నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్
పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నేనియున్
రాఁడు వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో (భార - ఆది. 3-112)

2) పూర్ణబిందు ప్రాస -
నాలుగు పాదాలలోను పూర్ణబిందు పూర్వకమైన హల్లు ఉండడం.
ఉదా.
ఇందు గలఁ డందు లేఁ డను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే గలఁడు దానవాగ్రణి వింటే. (భాగ. 7-275)

౩) సంయుతాక్షర ప్రాస -
మొదటి పాదంలో ప్రాసాక్షరం సంయుక్తాక్షరమైతే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండడం.
ఉదా.
ఉండ్రా యోరి దురాత్మక!
యిండ్రాప్రాసమ్ము కవుల కియ్యఁదగున? కో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్. (చాటువు)

4) ఖండాఖండ ప్రాస -
ప్రాసాక్షరానికి ముందు అరసున్న ఉన్నా, లేకున్నా మైత్రి పాటించడం ...
ఉదా.
ఆ పన్నగముఖ్యులఁ దన
వీఁపునఁ బెట్టికొని పఱచి విపినములు మహా
ద్వీపములు గిరులు నఖిల ది
శాపాలపురములుఁ జూపెఁ జన వారలకున్. (భార. ఆది. 2-44)

మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

చమత్కార (చాటు) పద్యాలు - 134

                               అనామిక
ఒక రాజు తనసభలోని కవి తనను ప్రశంసిస్తూ చెప్పిన శ్లోకానికి సంతోషించి తన వ్రేలి ఉంగరాన్ని తీసి బహుమానంగా ఇవ్వబోయాడు. అంతలో అతనికో అనుమానం వచ్చించి. "బొటనవ్రేలును అంగుష్ఠ మనీ, చూపుడువ్రేలును తర్జని అనీ, నడిమివ్రేలును మధ్యమ అనీ, చిటికెనవ్రేలును కనిష్ఠిక అనీ అంటున్నాం. కాని ఏ పేరు లేనట్లు ఉంగరపు వ్రేలును అనామిక అంటున్నాం. దీనికి కారణ మేమిటో తెలిపి ఈ వజ్రపుటుంగరాన్ని బహుమతిగా పొందండి కవీశ్వరా!" అన్నాడు.
అప్పుడు ఆ కవీశ్వరుడు ఈ క్రింది శ్లోకాన్ని చెప్పి బహుమతిని అందుకొన్నాడు ....
పురా కవీనాం గణనా ప్రసంగే
కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః
|
అద్యాపి తత్తుల్యకవే రభావాత్
అనామికా సార్థవతీ బభూవ
||
(పూర్వం కొందరు పండితులు కూర్చుని కవులను లెక్కిస్తూ "మొదటి స్థానం కాళిదాసుదే కదా" అని ‘ఒకటి’ అంటూ చిటికెన వ్రేలు మడిచారు. రెండవ స్థానం ఎవరిదీ అని చాలా పేర్లను ప్రస్తావించినా ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి రెండవవ్రేలికి ఎక్కే కవి ఎవరూ దొరకక ఆ వ్రేలు ‘అనామిక’గా మిగిలిపోయింది)
పై శ్లోకానికి నా అనువాదం ........
పూర్వ మెప్పుడో పండితుల్ భూమిమీఁది
కవుల లెక్కింప మొదలిడి కాళిదాసు
పేరు చెప్పుచు చిటికెనవ్రేలు మడిచి
పిదప తత్తుల్యుఁ డగు కవి పేరు లేక
నా పిదపవ్రే లనామిక యని నుడివిరి.

(కోడీహళ్ళి మురళీమోహన్ గారి ‘తురుపుముక్క’ బ్లాగులో ‘అనామిక’ పోస్టు చూచి, వారికి ధన్యవాదాలతో ...)
http://turupumukka.blogspot.com/2011/11/blog-post_7761.html
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి ....
      నవరత్నాంగుళి గలిగి యనామిక యయ్యెన్.

సమస్యా పూరణం - 528 (ఇడుమలను పొంది నరుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
        ఇడుమలను పొంది నరుఁడు సుఖించు నెపుడు.
ఈ సమస్యను సూచించిన నేదునూరి రాజేశ్వరి అక్కయ్యకు ధన్యవాదాలు.

15, నవంబర్ 2011, మంగళవారం

అవీ - ఇవీ (పాండవ పక్షపాతి)

                         పాండవ పక్షపాతి
‘తురుపుముక్క’ బ్లాగులో కోడీహళ్ళి మురళీమోహన్ గారు చిలకమర్తి లక్ష్మీనరసింహ రావు గారి ‘మనోరమ’ పత్రికనుండి తీసికొని ప్రకటించిన ఈ ఐతిహ్యానికి నేను సరదాగా చేసిన పద్యరూపం ....
సీ.
భువనవిజయ సభన్ భూజాని కృష్ణరా
                     
                    యలు కవీంద్రులఁ జూచి యడిగె నిట్లు
"శ్రీరాము తమ్ములు శ్రేష్ఠులా? ధర్మజు
                    తమ్ములు శ్రేష్ఠులా? ధర్మ మరసి
తెలుపుఁ" డనఁగ నష్టదిగ్గజమ్ములు రెండు
                    పక్షమ్ము లైరి సంవాద మెసఁగె
రాయలే తుద కనె "రాముని తమ్ము లా
                    తనికంటే నన్నింటఁ దక్కువె కద!
ధర్మరాజును మించు తమ్ములైనను వార
                    లన్నమాటను మీర రెన్నఁడైన
తే.గీ.
కనుక ధర్మజు తమ్ములే ఘను" లటన్న
రామకృష్ణుఁ డనియె నిట్లు రాయలఁ గని
"యౌర! కృష్ణావతారమ్మునందె గాదు
ప్రభువు నేఁడును పాండవ పక్షపాతి!"


తురుపుముక్క బ్లాగులో చూడండి .....
http://turupumukka.blogspot.com/2011/11/blog-post_09.html

నా పాటలు - (సాయి పాట)

సాయిబాబా ఏకాదశ సూత్రాలు

సాయిబాబ ఏకాదశ సూత్రము
లివియే బాగుగ తెలియండి
శ్రద్ధాభక్తుల సమన్వయంతో
నమ్మిన వారికె రక్షణము                
|| సాయిబాబ ||

షిరిడీపుర ప్రవేశ మొక్కటే
సర్వదుఃఖముల పరిహారం              
|| షిరిడీ ||
ఆర్తులు పేదలు ద్వారకమాయిని
చేరి పొందుదురు సౌఖ్యమును         
|| ఆర్తులు ||
భౌతికదేహము వీడిన పిదప
అప్రమత్తుడై వెలసెను సాయి           
|| భౌతిక ||
సమాధినుండే వెడలుచుండును
సాయిభక్తులకు సర్వరక్షణం            
|| సమాధి ||
సర్వకార్యములు సమాధినుండే
నిర్వహించును సాయినాథుడు        
|| సర్వ ||
సాయీమానుషదేహము మనతో
సమాధినుండే సంభాషించును        
|| సాయీ ||
అర్తుల శరణాగతులను బ్రోచుటె
సద్గురు సాయి కర్తవ్యం                   
|| ఆర్తుల ||
ఎవరు సాయిపై దృష్టి నిలిపిరో
వారిపైననే కటాక్షము                     
|| ఎవరు ||
తనపై నుంచిన భారము లన్నీ
మోసే ప్రభువు శ్రీసాయి                   
|| తనపై ||
కోరిన వెంటనె సహాయ మొసగే
కరుణాసింధువు మన సాయి           
|| కోరిన ||
సాయిని నమ్మిన భక్తుల యింట
లేమి అనునదే లేదు సుమా            
|| సాయిని ||

సాయిబాబ ఏకాదశ సూత్రము
లివియే బాగుగ తెలియండి
శ్రద్ధాభక్తుల సమన్వయంతో
నమ్మిన వారికె రక్షణము               
|| సాయిబాబ ||

(ఇది రికార్డింగ్ కాలేదని గమనించవలసిందిగా మనవి)

సమస్యా పూరణం - 527 (పసిబాలుఁడు సంగరమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
        పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్.
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

14, నవంబర్ 2011, సోమవారం

విశ్వనాథ స్తోత్రము

విశ్వనాథ స్తోత్రము

శ్రీకంఠం శ్రీ మహాదేవం
శ్రీమదద్రీశజా విభుమ్
|
కైలాసవాసినం సోమం
విశ్వనాథమహం భజే
||

మహేశ్వరం మహాకాలం
మహాధ్యాన పరాయణమ్
|
 మహాత్మానం మనోజారిం
విశ్వనాథమహం భజే
||

నందివాహన మీశానం
నాగరాజ విభూషితమ్
|
 నారాయణహితం దేవం
విశ్వనాథమహం భజే
||

పరమేశం ప్రభుం శంభుం
పార్వతీశం పరాత్పరమ్
|
పరమానంద వారాశిం
విశ్వనాథమహం భజే
||

శుద్ధ స్ఫటిక సంకాశం
సిద్ధ సాద్ధ్యాది సేవితమ్
|
బుద్ధిప్రదం పురారాతిం
విశ్వనాథమహం భజే
||

జ్ఞానప్రదం జ్ఞానగమ్యం
జ్ఞానానంద సుధానిధిమ్
|
అక్షరం యక్షసంసేవ్యం
విశ్వనాథమహం భజే
||

శివం శివకరం శాంతం
భవం భవభయాపహమ్
|
గవీశసేవితం సాంబం
విశ్వనాథమహం భజే
||

భూతాధిపం గుణాతీతం
భుజంగేశ విభూషణమ్
|
త్రిలోచనం త్రయీవేద్యం
విశ్వనాథమహం భజే
||

రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు.

సమస్యా పూరణం - 526 (వాని యనినంతనే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
         వాని యనినంతనే మోక్ష పదమొసంగు.
(ఇక్కడ ‘వాని’ శబ్దం ద్రుతాంతం కాదు)
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

13, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 525 (జగతి మెచ్చు జనులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
జగతి మెచ్చు జనులు జైలు పాలు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 524 (కొడుకున్ బాధలు పెట్టి)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
కొడుకున్ బాధలు పెట్టి నేటికి విడా
కుల్ గోరితే? కోడలా!

12, నవంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 52౩ (కాంతులకున్ కాంతిగూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.
(ఈరోజు యాదగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రానికి వెళ్తున్నాము. రేపు ఉదయం వరకు నాకు బ్లాగు చూసే అవకాశం దొరకక పోవచ్చు. కావున దయచేసి కవిమిత్రులు పరస్పర గుణదోష విచారణ చేయవలసిందిగా మనవి)

11, నవంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 522 (స్వామియే శరణ మనెడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు.
(స్వామియే శరణ మయ్యప్ప! అయ్యప్పల సీజన్ మొదలయింది. ఇప్పటికి పదమూడు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. దీక్షలో ఉండి అయ్యప్ప పడిపూజలు పురాణోక్తంగా చేయించేవాడిని. ఈ సంవత్సరం మాల వేసుకొనే అవకాశం దొరుకుతుందో, లేదో? స్వామి దయ!)

10, నవంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం - 521 (పాడు పున్నమ యిది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాడు పున్నమ యిది పండుగ కద!

9, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 520 (ముని పదముల దాకి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

8, నవంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 519 (భార్యాపదపూజఁ జేతు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

7, నవంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 518 (దోచు కొనిన దొడ్డ దొరకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

6, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 517 (గిరిధారికి భార మావగింజ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గిరిధారికి భార మావగింజ తలంపన్
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 516 (ననుఁ బూజించిన వారె)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
ననుఁ బూజించిన వారె పొందుదు రనం
తంబైన సత్సంపదల్.

5, నవంబర్ 2011, శనివారం

తెలుగు పలుకు

తెలుగు పలుకు

త్ర్యంబక క్షేత్రత్రయాన్వితంబగు రాష్ట్ర
మందు వెల్గొందెడు నమృత భాష
రాజీవ సంభవురాణి భారతి కంఠ
కలనాద రసమయ లలిత భాష
వేనవేలేండ్లుగా విస్తరించుచు మహా
కల్పవృక్షము వోలె క్రాలు భాష
ప్రాగ్దేశ సమ్మాన్య భాషా ప్రపంచాన
సద్యశమ్మునుగన్న సరళ భాష
పాయసమ్ములు, తేనెలు, పండ్లు, జున్ను,
పంచదారల నేనియు మించు మిగుల
తీయ తీయని పలుకుల తెలుగు భాష
విశ్వవాఙ్మయ భూషగా వెలుగు భాష

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

దత్తపది - 16 (మూడు, ఆరు, ఏడు, పది)

కవిమిత్రులారా,
"మూడు, ఆరు, ఏడు, పది"
పై పదాలను సంఖ్యావాచకాలుగా కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.

4, నవంబర్ 2011, శుక్రవారం

ఛందస్సు - 3 (మువిభక్తి, ముకార యతులు)

మువిభక్తి, ముకార యతులు
1) మువిభక్తి యతి (పోలిక వడి)
ఒక శబ్దంలో ప్రత్యయరూపంలో ఉన్న ముకారం యతిస్థానంలో ఉంటే చెల్లే యతి మువిభక్తియతి.తే.గీ.
పున్నపుంసక తత్సమంబుల కడపల
దత్సమానాంధ్రదేశ్య శబ్దముల తుదల
గదిసిన మకార శృంగముల్ కావ్యములను
బొసఁగు మువిభక్తియతులన పుఫుబుభులకు. (అప్పకవీయం)
దీని ననుసరించి సంస్కృత పుంలింగ (వృక్షః, కాకః), నపుంసకలింగ (దైవమ్, వనమ్) శబ్దములు తత్సమాలుగా ప్రయోగించినపుడు (వృక్షము, కాకము, దైవము, వనము) కొన్నిటికి చేరే ‘ము’ అనే విభక్తి ప్రత్యయమునకు, వానితో సారూప్యం ఉండే కొన్ని దేశ్యశబ్దాల (బియ్యము, నెయ్యము) చివర ఉండే ముకారానికి పుఫుబుభులతో యతిమైత్రి చెల్లుతుంది.
పఫబభలకు మకారంతో యతి లేదు. అవి పూర్ణానుస్వారపూర్వక మయితేనే మకారంతో యతి చెల్లుతుంది. (ంప, ంఫ, ంబ, ంభ - మ; బిందుయతి). ఈ యతిభేదం వల్ల శబ్దాంతమందున్న ముకారమునకు, పుఫుబుభులకు మైత్రి చెల్లుతుంది. అంటే ఉకారంతో కూడిన పవర్గమంతా (పుఫుబుభుములు) తమలో తాము మిత్రాలవుతున్నాయి.
ఈ మైత్రికి హేతువు ముప్రత్యయ చరిత్ర వలన తెలుసుంది. మువర్ణం యొక్క పూర్వరూపం పువర్ణకం. ఉచ్చారణాసౌలభ్యం కోసం పకారం బకార మయింది. నాదవర్ణం యొక్క సాన్నిహిత్యం వలన బిందుపూర్వకాన్ని, వర్గపంచమాక్షర స్వరూపాన్ని పొంది పువర్ణకం బు, ంబు, మ్ము, ము రూపాలను పొందింది. కావ్యాలలో మువర్ణకానికి రూపాంతరంగా ంబు, మ్ము అనే ప్రత్యయాలు ప్రయోగింపబడ్డాయి. సరసపుమాట (సరసము + మాట) వంటి సమాసాలలో మువర్ణకానికి పువర్ణం ఆదేశమౌతున్నది. ఈ విధమైన భాషాచారిత్రక కారణాలవల్ల పందాంతంలో ఉన్న మువర్ణానికి పుబులతో, దానివల్ల ఫుభులతో మైత్రి ఏర్పడుతున్నది. దీనిని బట్టి ముకారంతో ఉకారస్వరవర్గానికి చెందిన ఉ ఊ ఒ ఓ లతో కూడిన పవర్గాక్షరాలన్నిటికి మైత్రి చెల్లుతుంది. అంటే ము - పుపూపొపో ఫుఫూఫొఫో బుబూబొబో భుభూభొభో లకు మిత్రాలు.
ఉదా ...
అ)
పుష్కరము సూక్ష్మమధ్యమ*ముగ నొనర్చె
ఫుల్లపంకేరుహము వక్త్ర*ముగ నొనర్చె
బొండుమల్లెలు దరహాస*ముగ నొనర్చె
భోజనృపనందనకు నిక్క*ముగ నజుండు (అప్పకవీయం)
ఆ)
బుట్టిన సదసద్వివేక*ములు గలిగిన దా (భార. ఆది. 5-58)
ఇ)
భూనుత ధాన్యంబు బీజ*ములు వణిజులకున్ (భార. సభా. 1.44)
2) ముకారయతి (చక్కటి యతి)
మువిభక్తి యతి యందు ప్రత్యయాత్మకమూ, పదాంతమూ అయిన ముకారానికి యతిమైత్రి చెప్పబడింది. తద్భిన్నమైన ముకారానికి యతిమైత్రిని ముకారయతి అని అంటారు.
క.
హెచ్చరికను పుఫుబుభులకు
నచ్చపు మాకొమ్ములే మహాకవులాదిన్
మెచ్చులుగ నిలిపి రచ్చట
నచ్చటను ముకారయతు లటంచును గృతులన్. (అప్పకవీయం)
మహాకవు లచ్చటచ్చట పదగతమైన సహజ ముకారంతో పుఫుబుభులకు పాటించిన యతిమైత్రి ముకారయతి. మువిభక్తియతి యొక్క సామ్యం వల్ల ముత్యము, సముద్ధతి, ముందు, వేము మొదలైన వానిలోని సహజ ముకారాలకు (అచ్చపు మాకొమ్ములు) పుఫుబుభులకు యతి చెల్లుతుంది. అచ్చటచ్చట అనడం వల్ల ఈయతి పరిమితప్రయోగం కలదని తెలుస్తున్నది.
ఉదా ...
అ)
స్ఫురదురు వీతిహోత్రుని స*ముజ్జ్వల మేరుసమాన గాత్రునిన్ (శ్రీరంగ మాహాత్మ్యము)
ఆ)
ముక్తకేశాంబరోజ్జ్వల*భూషుఁ డగుచు (భాస్క. రామా. యుద్ధ. 1765)
ఇ)
మ్రొక్కులు గైకొను సమస్త*భువనాధీశా (సులక్షణ సారము. 101)
ఈ)
భువన బీజంబు కైవల్య*మోక్షదాయి (భీమ. 5-50)
చివరి రెండు ఉదాహరణల వలన మువర్ణమే కాక మూ, మొ, మోలకు ఈ యతి చెల్లుతుందని తెలుస్తున్నది.
ఏతావాతా తేలిన దేమంటే ...
‘పుపూపొపో - ఫుఫూఫొఫో - బుబూబొబో - భుభూభొభో - ముమూమొమో’ లకు యతి చెల్లుతుంది.
(ఈ పాఠంపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి)

చమత్కార (చాటు) పద్యాలు - 133

బ్రాహ్మణులను బ్రతికించిన లెక్క యుక్తి
సీ.
తార్కికుల్ నలుగురు, తస్కరు లేవురు,
శ్రోత్రియు లిద్దరు, చోరుఁ డొకఁడు,
భూసురుల్ ముగ్గురు, ముడియవి ప్పొక్కఁడు
సకలార్థనిపుణుఁడు శాస్త్రి యొకఁడు,
యల్లాపు లిద్దఱు, యాచకు లిద్దఱు,
బరివాండ్రు ముగ్గురు, బాపఁ డొకఁడు,
ఆగడీ లిద్దఱు, ఆరాధ్యు లిద్దఱు,
దుష్టాత్ముఁ డైనట్టి దొంగ యొకఁడు,
తే.గీ.
అరసి వారల నొక శక్తి యశనమునకు
సగము గోరఁగ, నవసంఖ్య జగతిసురుఁడు
చెప్ప, దొంగలు హతమైరి, చేటుదప్పి
విజయ మందిరి యావేళ విప్రు లెల్ల.
ఈ పద్యంలోని కథ ....
కొందరు బ్రాహ్మణులు అడవిలో వెళ్తుంటే దొంగలగుంపు అడ్డగించింది. ఎంత బతిమాలినా వదలలేదు. దొంగలు ఆ బ్రాహ్మణులను దగ్గరే ఉన్న శక్తిగుడికి తీసికొనివెళ్ళి బాధించడం మొదలుపెట్టారు. ఇంతలో గుడిలోని మహాకాళి ఘోరాకారంతో ప్రత్యక్షమై "మీలో సగంమంది నాకు బలి కావాలి. లేకుంటే మమ్మల్నందరినీ భక్షిస్తా" నన్నది. దొంగలు పదిహేనుమంది. బ్రాహ్మణులూ పదిహేనుమంది. అందువల్ల ‘బలికావలసిన పదిహేనుమంది ఎవరు?’ అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు బ్రాహ్మణులలో ఒక యుక్తిశాలి "అమ్మా! నీవు పూర్తిగా బ్రాహ్మణులను కాని, పూర్తిగా దొంగలను కాని బలితీసుకొనడం ధర్మం కాదు. మేమంతా నీముందు వరుసగా నిలుచుంటాము. నీవు లెక్క ప్రకారం ప్రతి ఆవర్తనంలో తొమ్మిదవవాణ్ణి బలి తీసుకో" అన్నాడు. శక్తి సమ్మతించింది. దొంగలూ సరే అన్నారు. అతడు చెప్పిన ప్రకారం అందరూ వరుసగా నిలుచున్నారు. ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడు దొంగే అయ్యాడు. అది అతని గణితశాస్త్ర కౌశలం. ఆ విధంగా పదిహేను ఆవర్తనాలలో పదిహేనుగురు దొంగలు బలి అయ్యారు. బ్రాహ్మణులంతా మిగిలారు.
అతడు బ్రాహ్మణులను, దొంగలను నిలబెట్టిన వరుసక్రమం ఇది ...
(X - బ్రాహ్మణుడు; O - దొంగ)
XXXX OOOOO XX O XXX O X OO XX OOO X OO XX O

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)