1, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్య - 5200

2-8-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల”

(లేదా...)

“మానముఁ గాంచి మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే”

(విరించి గారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

పరిమితిని మీరినందున భటులతనిని 
చెరనువేయ , బాడుగగొని జేరినట్టి
జనుల యెదుటనె వానికీ జరిగిన యవ
మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
దీన మనుష్య యూధ నిజ తీవ్ర మనావిధి దర్పణంబుగా
జాను తెలుంగునం గవిత చక్కగ వ్రాయు కవీంద్రు నింపుతో
నేనికపైన సంబరము నిండగ నూరెరిగించి చేసె స
న్మానముఁ, గాంచి మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే !

విరించి చెప్పారు...


ఉన్నతచదువులు గల మహోన్నతుండు
సద్గుణముల పుట్ట యతడు సభను జేరి
పండితులకు మ్రొక్కగ వారిపై గల యభి
మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల.


జానెడు పొట్టనింపగను చాకిరి తప్పదటంచు చేఃసినన్
జ్ఞానమపారమున్ గలుగు జ్ఞాని యతండ నెఱంగి వెంటనే
వానిని వేదికన్ బిలిచి ప్రాజ్ఞుడ వంచు వచించి చేయ స
మ్మానముఁ , గాంచి మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కవుల కలయిక జరిగిన గ్రామ మందు
మిగుల నాసక్తి కలిగియు మేర లేని
హర్ష పులకితు లై చూపు నాద రాభి
మానము గాంచి మెఛ్చి రి మాన్యు లెల్ల

M.B.G.TILAK చెప్పారు...

నవయువకవి సృజించిన నవ్య కవిత
సాటిలేనిదని వచించి సభికులెల్ల
వేదికపయి సన్మానింప నాదరాభి
మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల

ఆనవ యౌవనుండు పరమాద్భుత కావ్యము వెల్వరించగా
తానొక చుంచుకుఱ్రయని తల్చిన పండితు లెల్ల పిమ్మటన్
దానివిశిష్టతన్ గొనిరి తత్క్షణ మాతనిఁ బిల్చి చేసి స
న్మానముఁ గాంచి మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తానొక సత్కవీంద్రుఁడు నితాంత యశోవిభవమ్ముతోడ వి
న్నాణముగా రచించె గడు నైపుణితో నరిదైన కావ్యముల్
జ్ఞానగుణాఢ్యుడౌ కవిని సన్నుతిఁజేయుచు సల్పినట్టి స
మ్మానముఁ గాంచి మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:కావ్యమును వ్రాసి నట్టి యా కవివరుండు
ప్రాథమికివిద్య నేర్పిన పంతులయ్య
బిలచి సన్మాన మొనరింప విలువగు నభి
మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల”
(కవులు సామాన్యం గా తమకి ఛందోవ్యాకరణాదులు నేర్పిన గురువులని గౌరవిస్తారు కానీ ఈ కవి తన ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కి కూడా సన్మానం చెయ్యటం ప్రత్యేకం.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:కాళిదాసమహాకవి కావ్యములను
శంకరాద్వైత మందున చవుల గూర్చు
నల యలంకార తత్త్వాల నమరిన యుప
మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల”
(కావ్యాలలో ఉపమానం ఒక అలంకారం.తర్కశాస్త్రం లో ప్రత్యక్షము,అనుమానము, ఉపమానము, శబ్దము అనే నాలుగు ప్రమాణాలు.కాళిదాస మహాకవి లో ఆ ఉపమానం అలంకారం గా ఆది శంకరులలో అది తర్కతత్త్వాలు గా వెలిగింది.శంకరులు తమ అద్వైతం లో లోతైన విషయాలను ఉపమాన ప్రమాణం తోనే వివరించారు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:"వానికి నేలనో బిరుదు? వాడొక శుంఠయె "యంచు వాని స
న్మానము గూర్చి చాటున మనమ్ముల గుందిరి కాని యెల్లరున్
వానికి మిత్రు లౌట పది పద్యము లల్లుక జెప్పి యట్టి స
న్మానముఁ గాంచి, మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే”
(వాడొక శుంఠ అని చాటున బాధపడ్డారు కానీ స్నేహితుడు కాబట్టి పద్యాలు రాసి మెచ్చుకొన్నారు.)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ తేనెలు విరియు కైతలఁ దీర్చి వరల
శాస్త్ర శోధనఁ గావించ సంయతిఁ గని
ప్రతిభ వెలుఁగఁగఁ బ్రకటించఁ బ్రభుతయె బహు
మానమును, గాంచి మెచ్చరి మాన్యలెల్ల

ఉ॥ తేనెలు చిందు మాధురినిఁ దీర్చెడు కైతలు విచ్చు రీతిగన్
మానవ శాస్త్ర శోధనలు మన్నన నొందెడి తీరు నెంచుచున్
బూనిన సాధనా గరిమఁ బోషణఁ జేయ నటుల్ ప్రభుత్వ తీ
ర్మానముఁ గాంచి మెచ్చిరట మౌనము వీడుచుఁ బండితాళియే

(ఎందులో రాణించినా పండితులే నండి)

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కవివరేణ్యుఁడు విజ్ఞాన ఖనియతండు
కావ్యములనెన్నొ లిఖియించి గణుతికెక్కె
నట్టి విద్వన్మణికిజూపు హరుసము నభి
మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

రెండు వందల కోట్లు ఖరీదు చేయు
నాస్తి పాస్తులు తిరుమల యాలయమ్ము
నకు వితరణ యొనర్చినా రొకరు స్వామి
పైన గల భక్తి తోడను, వారల యభి
మానమును గాంచి మెచ్చిరి మాన్యులెల్ల.

Surya చెప్పారు...

వీనుల విందులౌనటుల వేగముగా పలు పద్యముల్ భళా
తానటు ధారణంబు వినుతంబుగ సేయ వధాని ప్రౌఢి వి
జ్ఞాన సరస్వతీ విభవ సాదృశమై మనముల్లసిల్ల స
మ్మానముగాంచిమెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కాన రాదెన్నఁ డే నిట్టి గౌరవమ్ము
భాగ్య వశమునఁ గల్గెను భామ వలన
మానినీ మణి సూపిన మాని తాభి
మానమును గాంచి మెచ్చిరి మాన్యు లెల్ల


కానఁగ రా యశో ధనులు కావ్య పరంపర కర్త లెల్ల స
న్మానము సేయ వారల కమంద విధమ్మున నెల్ల చూపఱుల్
ధ్యానము నిల్పి చక్క మది , నౌనన నంతట సమ్మతమ్మునన్,
మానముఁ గాంచి మెచ్చి రట, మౌనము వీడుచుఁ బండితాళియే

[అట = అక్కడ; అన్వయము: చూపఱుల్ మెచ్చిరట, ఔనన పఁడితాళి]

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
"సరివైన కావ్యముల్"

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“మానముఁ గాంచి మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే”

ఉ.మా

కానము కానమింక మహి కావ్యము వ్రాసెడి పూర్వ ప్రాజ్ఞులన్
తేనియ చిందు భాష మరి తేలిక చేసిరి వ్రాతకోతలన్
యానమునన్వధానముల యాత్రత జేయుచు పొంగు సాహితీ
“మానముఁ గాంచి మెచ్చిరట మౌనము వీడుచు పండితాళియే”