28, ఫిబ్రవరి 2011, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - (భీముఁడు భీష్ముఁ జంపె)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
భీముఁడు భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.

    01)

    ___________________________________________

    కాముని గెల్చినట్టి ఘను,- కల్మష కంఠుని,చంద్రశేఖరున్
    తామస భూషణున్,శివుని ,- తాండవ నర్తను,సుప్రతీకునిన్
    స్వామిని,మోహరించి ,పెను - శస్త్రము బొందిన ,సవ్యసాచియా
    భీముఁడు ,భీష్ముఁ జంపె; నతి - భీకర లీల ,జగమ్ము మెచ్చఁగన్.
    ___________________________________________

    తామసము= పాము
    పెనుశస్త్రము = పాశు పతము
    భీముడు = భయంకరుడు
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  2. భీమ పరాక్రమంబు నను వీరత జూపెడి చిన్ని వానికిన్
    తామిడ దీవెనల్ తగును తాతయ యంచును వేడె నత్తరిన్
    భీముఁడు భీష్ముఁ, జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్
    ఆమొన గాడు బాలుడగు నర్జున పుత్రుడు శత్రు మూకలన్.

    రిప్లయితొలగించండి
  3. కిశోర్ మహోదయా హమ్మయ్య వచ్చేశారా.
    గురువు గారన్నట్లు మీరు లేని లోటు కొట్టోచ్చి నట్లు కనుపించింది.

    రిప్లయితొలగించండి
  4. వసంత్ కిశోర్ గారూ,
    భీముడు అంటే (శత్రు) భయంకరుడు అనే అర్థంలో అర్జునుణ్ణి విషయంగా సమస్యను పూరించారు. చాలా బాగుంది. మూఖ్యంగా పద్యంలో ధారాశుద్ధి ఉంది. అభినందనలు. మీ అమ్మాయి విషయంలో మీకు సాంత్వం లభించినందుకు సంతోషం.

    మిస్సన్న గారూ,
    భీముని కోరికపై భీష్ముడు ఆశీర్వదిస్టే అభిమన్యుడు శత్రుసంహారం చేసాడని చక్కగా పూరించారు. భళా! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా !ధన్యవాదములు !

    మిస్సన్న మహాశయా !
    నే నర్జును నండ జేరితే
    మీరు అభిమన్యుణ్ణి
    ఆయుధం చేసుకున్నారు !
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  6. భీముఁడు వాఁడు; గ్రామ నడి వీథుల నాడెడు నాటకంబులన్
    భూమిక లన్ ప్రశస్తముగ పోషణ జేయు; శిఖండి పాత్రకున్
    నామము యైనవాడొక దినంబున వేసము గూర్చియాడి యా
    భీముఁడు; భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  7. కిశోర్ జీ గురువు గారు చెప్పినట్లు పద్యము ధార చాలా బాగుంది. మిస్సన్న గారూ చాల బాగుంది,మీ పూరణ. రవీజీ భీముడి చేత శిఖండి వేషము వేయించారు! బాగుంది మీ పూరణ.

    రిప్లయితొలగించండి
  8. మూర్తీజీ !ధన్యవాదములు !
    రవీజీ !రమ్యంగా ఉంది
    భీముణ్ణి శిఖండి జెయ్యడం !

    రిప్లయితొలగించండి
  9. రవి గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    "నామము + ఐనవాడు" అన్నప్పుడు యడాగమం రాదు. "నామము గన్నవాడు" అందాం.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి.

    రాముని శిష్యు డప్పుడు పరాక్రమమొప్పగ పోరు సల్పగా
    ఏమియు పాలువోక మరి ఎట్టుల జచ్చునొ తాత జెప్పగా
    భీముని తమ్ముడర్జునుడు వ్రేల్చె శిఖండిని ముందు నిల్పి, ఏ
    భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్?

    రిప్లయితొలగించండి
  11. శాస్త్రిగారూ ! బావుంది !

    ఏ భీముడు చంపాడనిగదూ మీ సందేహం !
    చూడండి !

    02)

    ___________________________________________

    రాముడు వల్లగా దనిన - రాగము రంజిల , నాగ్రహమ్ముతో
    భీముని నాశ్రయించి , తన - వేదన దీర ,శిఖండి రూపునన్
    భీముని తమ్ము జేరి, కడు - భీషణ సంగర మందు నంబయే
    భీముఁడు ;భీష్ముఁ జంపె; నతి - భీకర లీల ,జగమ్ము మెచ్చఁగన్.
    ___________________________________________

    రాముడు = పరశు రాముడు
    రాగము = పగ
    భీముడు-1 = శివుడు
    భీముడు-2 = పాండు సుతుడు
    భీముడు-3 = భయంకరుడు
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  12. ఆమెయొ ఆతడో కనులకానని మూర్తిని ముందునిల్పియే
    ఆముదివాని,నర్జనుడు, అస్త్రవివర్జిత వీరకేసరిన్,
    కాముని గెల్చినాతనిని, కాంచగ ధర్మజుఁ,మాద్రిపుత్రులున్,
    భీముఁడు,భీష్ముఁ జంపె; నతిభీకర లీల ,జగమ్ము మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ!ధన్యవాదములు.చిన్న సందేహం.వల్ల కాదనినవాడు భీష్ముడు కదా?రాముడన్నారు, వివరిస్తారా?రాముని శిష్యుపై అలిగి; అంటే సరిపోతుందేమో.


    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    వసంత్ కిశోర్ గారి పూరణకు వివరణ .... అంబ భీష్మునిపై పగసాధించడానికి రాముని (పరశు రాముని) ఆశ్రయిస్తే అతడు తన వల్ల కాదన్నాడు. అప్పుడు అంబ భీముని (శివుణ్ణి) తపస్సుతో మెప్పించి శిఖండి రూపాన్ని పొందింది. ఆ శిఖండి భీముని తమ్ముడైన అర్జును నాశ్రయించి, యుద్ధంలో భీష్మునికి భీముడు (భయంకరుడు) అయ్యాడు. అతని చావుకు కారణ మయ్యాడు.

    ఊకదంపుడు గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో "ధర్మజ" అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ వసంత కిషోర్ గారి పూరణ వల్ల భీమునికి గల నానార్థాలు తెలిసినవి .రెండు పూరణలు బాగున్నవి.రవి,శాస్త్రి,ఊక దంపుడు గారల పూరణలు అలరించుచున్నవి .మిస్సన్న గారి పూరణ భేషుగ్గా ,భీమ పాకంలా ఉంది.

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా!ధన్యవాదాలు.కిశోర్ గారి పద్యమునకు వివరణ తెలియజేసారు.సంతోషం.పీతాంబర్ గారూ! ధన్యవాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  17. కిశోర్మహోదయా! మూర్తిమిత్రమా!పీతంబరధరా! ధన్యవాదాలు.
    అందరి పద్యాలు ఒకరిని మించి మరోకరివి మనోహరంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! నా పద్య భావాన్ని చక్కగా విశదీకరించారు !
    ధన్యవాదములు !

    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి.

    శాస్త్రిగారూ ! మీరు రాముని శిష్యుడు అని మొదలుపెట్టారు గదా !
    నాకు వెంటనే "భీష్మ" సినిమా కళ్ళముందుకొచ్చేసింది !
    కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకూ స్వయంవరం ప్రకటిస్తాడు.
    శంతనుడు మత్స్యగంధి యైన సత్యవతిని పరిణయమాడి వర్ణ సంకరం
    చేసినందువలన కురువీరులకు ఆహ్వానం పంపడు !
    ఈ విషయం నారదుని వలన తెలుసుకున్న భీష్ముడు స్వయంవరానికి వెళ్ళి
    ఎదిరించిన వారిని ఓడించి ఈ కన్యలను నా సోదరురుడైన
    విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చేయుట కొరకు తీసుకు వెళ్తున్నట్టు
    అక్కడే ప్రకటించి వాళ్ళను హస్తినకు తీసుకు వస్తాడు అంబ,అంబిక అంబాలిక లను!
    తీరా తీసుకు వచ్చాక అంబ తాను సాళ్వరాజును ప్రేమించానని చెబుతుంది !
    వెంటనే అంబను సకల రాజ లాంచనాలతో సాళ్వుని దగ్గరకు పంపి,
    మిగిలిన ఇద్దరినీ సోదరుని కిచ్చి వివాహం జరిపిస్తాడు !
    భీష్ముని చేతిలో ఓడిన సాళ్వుడు నీవు భీష్ముడి సొత్తు గావున
    నేను నిన్ను పరిణయ మాడలేనంటాడు !
    అంబ తిరిగి భీష్ముని దగ్గరకు వస్తుంది !
    వేరే వాళ్ళకు మనసిచ్చిన నిన్ను పెళ్ళి చేసుకోమని
    నా తమ్మునికి ఎలా చెప్పగలనంటాడు భీష్ముడు !
    ఐతే స్వయంవరంలో గెల్చి తెచ్చావు గాబట్టి నువ్వే
    చేసుకు తీరాలని పట్టు బడుతుంది అంబ !
    నా కాజన్మ బ్రహ్మ చర్య వ్రతమున్నది !నేను చేసుకోలేనంటాడు భీష్ముడు !
    నారదుని సలహాపై అంబ భీష్ముని గురువైన పరశు రాముణ్ణి
    ఆశ్రయిస్తుంది తనకు న్యాయం చెయ్యమని !
    అంబ వాదనతో ఏకిభవించిన పరశు రాముడు భీష్ముని పిలిపించి
    అంబను నువ్వు పరిణయ మాడడమే న్యాయమని చెబుతాడు !
    నా ప్రాణాలైనా యిస్తాను గాని నా శపథం వదులుకోలేనంటాడు భీష్ముడు !
    అప్పుడు గురు శిష్యులిరువురికీ యుద్ధం జరుగుతుంది !
    యుద్ధంలో ఓడిన పరశు రాముడు అంబతో
    న్యాయం భీష్ముని పక్షాన్నే వుంది అందుకే నన్నోడించ గలిగాడు !
    ఓడిన వాడు ఆఙ్ఞా పించలేడు గదా ! అందుచేత ఈ విషయంలో
    నేనేమీ చెయ్య లేను నావల్ల గాదని చేతులెత్తేస్తాడు !

    ఇక్కడి నుండి నాపద్యం ప్రారంభం !
    తరువాత గురువు గారు చెప్పిందే !

    ఈ సన్నివేశాలు సినిమాలోనే చూడాలి !

    అందరికీ తెలిసిందే గదా అని నేపథ్యమ్ వివరించలేదు !

    తెలియని వారు మీలాగ ఆలోచించే అవకాశం కూడా
    ఉందని నాకిప్పు డర్థమౌతూంది !
    మంచి సందేహం వెలిబుచ్చినందుకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్య గారూ, ధన్యవాదములు, అవునండీ ధర్మజ అని చదివితేనే బాగుంది.

    నేను హారం(http://www.haaram.com/EnglishToTelugu.aspx) వాడతానండీ, అందులో చిన్న 'm' "మ్" గా వస్తుంది.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  20. సంజయుడు దృతరాష్ట్రునితో పలుకు మాటలు:-

    ఏమని చెప్పదన్ కురు కులేంద్ర! ప్రమోదము లేదు సుంతయున్
    కోమలి కృష్ణ కోపమున కోరగఁ జంపెను నీ కుమారునిన్
    భీముఁడు, భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్
    గోముగ గుండె పైన పడు కుంతి సుతుండు కిరీటి వింతగన్!!

    రిప్లయితొలగించండి
  21. "భీముఁడు భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్"
    రాముడు కృష్ణుఁజంపె బహు రమ్యపు రీతి జగమ్ము మెచ్చగన్
    దోమ గజమ్ముఁజంపె నటు తొందర మీర వనమ్ము మెచ్చగన్
    రోముడు మోడిఁజంపెనట రొప్పుచు రోజుచు తల్లిమెచ్చగన్

    రిప్లయితొలగించండి