16, జనవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1295 (దుష్టజనముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
 దుష్టజనముల సాంగత్య మిష్ట మగును.

12 కామెంట్‌లు:

  1. పంది బురదనే మెచ్చును పరిమళమ్ము
    వలదు వలదంచు వేగమే పరుగుతీయు
    నటులనే దుష్ట జనులకు ననవరతము
    దుష్ట జనముల సాంగత్య మిష్టమగును

    రిప్లయితొలగించండి
  2. సజ్జనంబుల సన్నుతి, సత్యనిరతి,
    ధర్మమార్గానుసరణంబు తగదటంచు
    తలచువారికి పరనింద బలము నొసగు,
    దుష్టజనముల సాంగత్య మిష్టమగును.

    రిప్లయితొలగించండి
  3. చిత్రమేమియు లేదులే శిష్టులకును
    శిష్ట జనముల సాంగత్య మిష్టమగును
    తోడు బలమును పెంచగా దుష్టులకును
    దుష్ట జనముల సాంగత్య మిష్టమగును

    రిప్లయితొలగించండి
  4. శిష్ట జనులతో సంచరించి శుభ ఫలము
    పొందుమయ్య! సావాసము బుద్ధి మార్చు
    నిలను, నొంటిగా నుండగా నేమి యొఱుగు
    దుష్ట? జనముల సాంగత్య మిష్ట మగును.

    రిప్లయితొలగించండి
  5. దుష్ట జనముల సాంగత్య మిష్ట మగును
    దుష్ట జనులకు ,నిజమది దుహిత లార!
    సంది యంబును నిసుమంత చెంద వలదు
    దూర ముండుట మేలది దుష్టు లకును

    రిప్లయితొలగించండి
  6. ఇష్ట గురు బోధ శిష్యుల కిష్టమౌను
    ధర్మ పరులకిష్టము దాన ధర్మనిరతి
    దుర్నయులకిష్ట మవినీతి ,ధూర్తులకును
    దుష్ట జనముల సాంగత్య మిష్టమగును

    రిప్లయితొలగించండి
  7. లోభమున నాస్తులను గూర్చులుబ్ధులకును
    దురలవాట్లకలవడిన ధూర్తులకును
    కన్నుగానక దిరిగెడు కాముకులకు
    దుష్ట జనముల సాంగత్య మిష్ట మగును

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి అందరి పూరణలు బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీ హరి....మూర్తి గారు: ఢర్మమార్గము తగదను దుష్టులను ప్రస్తావించేరు. బాగుగ నున్నది పద్యము.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శిష్టులకు శిష్టులతో మరియు దుష్టులకు దుష్టులతో నుండే సాంగత్యమును చెప్పేరు. బాగుగనున్నది పద్యము.

    శ్రీమతి లక్ష్మీదేవి గారు: దుష్ట అని సంబోధించుచు జ్ఞానబోధ గావించేరు. పద్యము బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు: దుష్టులకు దూరముగా నుండుడని దుహితలకు బోధించేరు. పద్యము బాగుగ నున్నది.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు: ధర్మపరులకు ధర్మనిరతి దుష్టులకు దుష్ట సాంగత్యము సహజమన్నారు. పద్యము బాగుగ నున్నది.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: లోభులు మొదలగు వారి కెల్లరికి దుష్ట సాంగత్యము ఉండునన్నారు. పద్యము బాగుగ నున్నది. దురలవాటు అనుట వ్యావహారికము - సాధువు కాదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    హితవు నొనరించు వారలు కితవు లవగ
    మతము పేరిట మనుజులు మాపు చుండ
    దొరలు దొంగలై వరలుచు దోచుకొనగ
    దుష్టజనముల సాంగత్య మిష్టమగును
    మరియొక పూరణ:ధర్మనిరతి తో బ్రతుకంగ ధరణి యందు
    కఠిన మాయె సజ్జనులకు క్రాంతి వచ్చు
    దనుక మతి మాలి నీ చక్రమున వసింప
    దుష్టజనముల సాంగత్య మిష్టమగును

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గురువర్యులకు నమస్సులు, సవరణతో..

    లోభమున నాస్తులను గూర్చులుబ్ధులకును
    వ్యసనములకలవడినట్టి వారలకును
    కన్నుగానక దిరిగెడు కాముకులకు
    దుష్టజనముల సాంగత్యమిష్టమగును

    రిప్లయితొలగించండి
  11. పోగాలము దాపురించిన వారి గతి......

    చేరి సత్కార్యములఁ తాము జేయలేరు
    కనరు వినరిక మూర్కొనగలరె చూడ
    సజ్జనాళిని దూషించ జంకబోరు
    దుష్టజనముల సాంగత్య మిష్టమగును.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి మరికొన్ని పూరణలను చూద్దాము:
    అందరికీ అభినందనలు.

    శ్రీ తిమ్మాజీ రావు గారు: 2 విధములుగా పూరించేరు.
    1. ధర్మదూరులగు జనుల గూర్చి; మరియు
    2. పరిస్థితుల ప్రాబల్యమును బట్టి, అని.
    పద్యములు బాగుగ నున్నవి.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
    మీ సవరించిన పూరణ బాగుగ నున్నది.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
    కనరు, వినరు, మూర్కొనరు అనే పంచతంత్ర వాక్యమును జ్ఞాపకము చేసేరు. పద్యము బాగుగ నున్నది.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    ప్రశ్నార్థకముతో పూరించేరు. పద్యము బాగుగ నున్నది. 2వ పాదమును ఇలాగ మార్చుదాము:
    గోవు కలియదు నక్కల గుంపులోన

    స్వస్తి

    రిప్లయితొలగించండి