15, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 647 (భారతంబును బొంకని)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

భారతంబును బొంకని పలుకఁ దగును.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

  1. వేద సారము లెల్లను విశద పరచి
    నీతి బోధగ జెప్పెను నిగమ వేత్త
    భారతంబును ; బొంకని పలుకఁ దగును
    వేద ప్రామాణ్య మొప్పని వెఱ్ఱి వాక్కు

    రిప్లయితొలగించండి
  2. తప్పు, పలుకరాదెన్నడు, తలుపబోకు
    భారతంబును బొంకని; పలుకఁ దగును
    పంచమంపు వేదమ్మని పలుకుమన్న!
    రాయి కాదది, రత్నపు రాశిగనుము.

    రిప్లయితొలగించండి
  3. సకల ధర్మ శాస్త్ర విశేష సారమయము
    భారతము పంచమామ్నాయ వరమటంచు
    కాంచెను ప్రశస్తి, కాని వికారమతికి
    భారతంబును బొంకని పలుక దగును

    రిప్లయితొలగించండి
  4. నిగమ చయము విభాగించు నీతి వేత్త
    నీలివర్ణుఁడు నుడువునె నిజము దక్క
    నింద లందున ముదమును బొంద గోర
    భారతంబును బొంకని పలుకఁ దగును !

    రిప్లయితొలగించండి
  5. శ్రీయుతు లందఱికీ ప్రణామాలు.

    మాయలేడి నిమిత్తమై మనసు కెక్కు
    రామగాథను రం కని వ్రాయఁ దగును;
    ధర్మరక్షణదీక్షమై దారి మలచు
    భారతంబును బొం కని పలుకఁ దగును.

    "రఞ్జయతి రాగే" అన్న వ్యుత్పత్తి వల్ల "రంకు" అంటే అందమైన జింకపిల్ల. "కృష్ణసార రురు న్యఙ్కు రఙ్కు శమ్బర రౌహిషాః" అని అమర కోశం. మాయలేడి నిమిత్తంగా రాక్షససంహారం జరిగింది కాబట్టి రామాయణాన్ని "రంకు" అనవచ్చును. రామగాథ రంజింపజేసేది అని అర్థం.

    ధర్మరక్షణ నిమిత్తం లోకానికి మార్గోపదేశం చేసిన మహాభారతాన్ని "పొంకు" (పొంకమైనది) = శోభాయమానంగా రచితమైనది అనవచ్చును.

    "అంకితంబుగా నా పొంకింపం బూనిన శుకచరిత్రం బను మహాప్రబంధంబు" అని పాలవేకరి కదిరీపతి శుకసప్తశతి (1-49).

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  6. అన్నయ్య గారి పూరణ సుశోభితము. మందాకిని గారి పూరణ అద్భుతము. శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వివరణ రక్తి కలిగిస్తుంది గాని సాధారణ వ్యక్తుల మైన నా బోటి వారలకై వారి నుండి మరో ఉత్తమ పూరణ ఆశిద్దాము.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    వేదవ్యాస మహర్షిచే - వేద్యమైన
    వేద పంచమం బదియని - వినుతి గొనిన
    వేద సారాంశ మదిగాని; - వేరె యెటుల
    భారతంబును బొంకని - పలుకఁ దగును???
    _____________________________________________
    *****

    రిప్లయితొలగించండి
  8. కిశోర్ జీ మన్నించాలి వేదవ్యాసుడు లో ద గురువవుతుంది.

    రిప్లయితొలగించండి
  9. 02)
    _____________________________________________

    పరమ పావను చరితము - భాగవతము !
    పరమ ధార్మిక వర్తనే - భారత మన !
    పాప భీతియె లేనట్టి - వారె యిటుల
    భారతంబును బొంకని - పలుకఁ దగును !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  10. మూర్తీజీ ! ధన్యవాదములు !

    01 అ)
    _____________________________________________

    వేదవేత్తగు ఋషి చేత - వేద్యమైన
    వేద పంచమం బదియని - వినుతి గొనిన
    వేద సారాంశ మదిగాని; - వేరె యెటుల
    భారతంబును బొంకని - పలుకఁ దగును???
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  11. మిత్రులారా!
    ఈనాటి సమస్యలో కనుపించే దోషము ఒక విధముగా చూచినచో దోషము కాదని రంకు పొంకు పదములకు మంచి అర్థములున్నవి అని తెలిజేసిన శ్రీ ఏల్చూరి వారికి అభినందనలు. మనము ఎప్పుడూ చెప్పుకొనే రీతిగా ఒకే పదమునకు అనేక అర్థములు, ఒకే అర్థముతో అనేక పర్యాయ పదములు ఉన్నవి. వినోద ప్రక్రియగా దోషమును స్ఫురింపజేసే పదములను ప్రయోగించి ఇందులో దోషము లేదు అనుట నావంటి వారికి రుచించదు. వాక్కు పవిత్రముగా ఉండ వలెనని నా ఉద్దేశము. ఏది నిరూఢమైన అర్థమో అదే అనుసరణీయము. సంకల్పము లేకపోయినా ఒక్కొక్క మారు వెలువడిన పలుకులు నిజమయి విపరీతమైన ఫలితములను ఇచ్చుట మనము గమనించుచున్నాము. అందుచేత దోష భావములను స్ఫురింజేసే ప్రయోగములను చేయుట తరువాత వానిని సమర్థించుట అనునవి ప్రశంసింప దగినవి కావు అని నా భావము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. సకల శాస్త్రము లొ డ బోయుసార మండ్రు
    భార తంబును , బొంకని బలుక దగును
    ననెడుమాటలు బూటక మగును సుమ్ము
    వేద భగవాని పంచమ వేద మదియ .

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నేమాని గురుదేవులకు ప్రణామములు.

    కృష్ణ పరమాత్మ గీతానదీష్ణబోధ,
    శాంతనవుని ప్రతిజ్ఞ, పాంచాలి సాధు
    చరిత సత్యంబు గాఁగ; నసత్య మెట్లు
    భారతంబును బొం కని పలుకఁ దగును?


    గగనకుసుమంబు, ధూర్తవాక్యప్రశంస,
    మరుమరీచిక, శార్వరీతరణిరోచి,
    శశవిషాణంబు, ననృతార్థయశము, నార్ష
    భా రతంబును బొం కని పలుకఁ దగును.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమానివారి అభిప్రాయమే నాది కూడా. దురర్థము స్ఫురించే పదమో వాక్యమో ఉన్నప్పుడు, పద్యం వ్రాయాలని అనిపించక చాలాసార్లు పూరణలు చేయటం మానవలసి వచ్చింది. సమస్యాపూరణంలో అటువంటివి సహజమే నని తెలుసును. కాని తరచు మనసు రావటంలేదు.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా!
    ఈనాటి సమస్యను, పూరణలను పరిశీలించుదాము.
    ధర్మ శాస్త్ర సారముగా, పంచమ వేదముగా ఇంచుమించు అందరూ భారతమును ప్రశంసించుతూ పూరించేరు. శ్రీ ఏల్చూరి వారు కవి హృదయముతో తొలుత రంకు, పొంకు పదములను వాడినా తరువాత ఆ ప్రయోగములను మాని సరళమైన భావమునే ఎంచుకొన్నారు.
    వారి సంస్కృత సమాస భూయిష్ఠమైన శైలి అనన్య సాధ్యము. మంచి పడికట్టుతో పద్యాలు అలరారుతూ ఉంటున్నాయి. అంతే కాదు చాల కాలముగా అలవడుచున్న విద్య కాబట్టి మన బ్లాగు మిత్రులలో చాలామంది మంచి శైలిని అలవర్చుకొన్నారు. అందరికి అభినందనలు.
    శ్రీ సుబ్బారావు గారు ఇంకా తమ రచనా నైపుణ్యమును పెంచుకోవలెను. అర్థరహిత పదములు కొన్ని దొర్లుతున్నాయి వారి రచనలలో. ఈనాటి వారి పూరణను వారు మరొక్క ప్రయత్నము చేసి మార్చుకొంటే బాగుంటుంది.

    పూరించిన మిత్రులు --
    తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి
    శ్రీమతి మందాకిని గారికి
    శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి
    శ్రీ వసంత కిశోర్ గారికి
    శ్రీ సుబ్బా రావు గారికి అభినందనలు.
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  16. పెద్దలకు నమస్కారం!

    పృచ్ఛకుడు, శ్రోత ఉద్దేశింపని ప్రక్రమాన్ని, అన్వితార్థాన్ని, శాబ్దచమత్కారాన్ని వెలికి తీయటం కూడా సమస్యాపూరణలో ఆశంసితమే. లేకపోతే పూరణీయమూ, పూరణమూ ఏకోద్దిష్టమై శిల్పవైవిధ్యం కొఱవడుతుంది. సందర్భించిన అంశానుసారం అన్ని రసాలూ అనుమంతవ్యాలే కనుక సర్వధోరణులను స్వాగతింపవలసినదే.

    ఈ నియమనం పోతనాది భక్తకవులకూ అనువర్తిస్తుంది. ధర్మప్రబోధాన్ని, సర్వసమర్పణను, ఉత్తమాధమశృంగారాన్ని, జీవితంలోని ఉత్థాన-పతనాలను, సర్వభావాలను ఉజ్జ్వలంగా వర్ణించిన సత్కవులు వారు. వస్తుకవిత పరమార్థం అదే.

    కవిత్వం కళ. చిత్తవిచ్ఛిత్తివిశేషం. ఆనందైకతాత్పర్యం. కవనకుతూహలం ఉన్న విద్యార్థి అన్ని భావధారలనూ అభిమానించాలి. వ్రాసే ప్రయత్నం చేయాలి. మనమూ అంతే. భిన్నాభిప్రాయమైతే మన్నించండి.

    అయితే, సిద్ధవాక్కులు శ్రీ పండిత నేమాని వారి "కవిశ్శుచిః" అన్న అంతరార్థశీర్షణ్యాన్ని మనసారా గౌరవిస్తాను. వారు పెద్దలు. వారి ధర్మనిష్ఠ అటువంటిది.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  17. వేద సారము లందుండి విశద పరచి
    ధర్మ నిరతిని ప్రజలకు దారి జూపు
    భారతంబును బొం కని పలుక దగును
    పామరుని వలె పలుకుట పాడి యగునె ? ? ?

    రిప్లయితొలగించండి
  18. శ్రీమతి రాజేశ్వరి గారి పూరణ బాగుగనున్నది. అభినందనలు. 4వ పాదము సవరించుచూ అన్వయమును చక్కబరచితే ఇంకా బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. క్షమించాలి
    అన్వయం సరిగా తెలియడం లేదు

    వేద సారము లందుండి విశద పరచి
    ధర్మ నిరతిని ప్రజలకు దారి జూపు
    భారతంబును బొం కని పలుక దగును
    ప్రాజ్ఞు లగువారు పలుకుట పాడి యగునె " ? ? ?

    రిప్లయితొలగించండి
  20. అమ్మా! రాజేశ్వరి గారూ! మీ పద్యము 4వ పాదమునకు నా ప్రయత్నము చూడండి.
    సత్యమే యనదగునే రసజ్ఞులార!

    రిప్లయితొలగించండి
  21. విబుధు డనె భార్య తోడను వినుము దృశ్య
    మాన జగమెల్ల భ్రాంతియు, మాయ యగును
    నీవు నేనన సరికాదు, నిజము విను ప్ర-
    భా! రతంబును బొంకని పలుకఁ దగును.

    (రతము=ఆసక్తము)

    రిప్లయితొలగించండి
  22. చాల చక్కని నీతులు చెప్పదగును
    ఆచరించుట కందరి కలవి గాదు
    భారతంబును బొంకని పలుకదగును
    నాటి సత్యము నేమార్చ నలవి గాదు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు చెప్పినట్లు కవిత ఒక కళే, గాని శబ్ద చాతుర్యముతో నింద స్ఫురింప జేసి పాండితీ ప్రకర్షతో వివరణ లిచ్చి నింద నుపసంహరించినా ఓ పది దినముల తరువాత సామాన్యులకు నిందా వాక్యములే మిగులుతాయి తప్ప వివరణలు గుర్తు ఉండవు. అన్య మత గ్రంధములను పర దేవతలను నిందించము. సంయమును అహింసను పాటిం చే హిందువుల పవిత్ర గ్రంధములను దేవతలను మరి హేళన కైనా ఎవరైనా ఎందుకు నిందించాలి ?

    రిప్లయితొలగించండి
  24. దార్త రాష్ట్రుల దౌష్ట్యాల వార్త లేని
    ధర్మ సూనుని తమ్ముల తలపు లేని
    కృష్ణ పరమాత్మ గీతార్థ కృతులు లేని
    భారతంబును బొంకని పలుక దగును !!!

    రిప్లయితొలగించండి
  25. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి కవితా శక్తికి సంస్కృత భాషా పరిజ్ఞానమునకు జోహారులు

    రిప్లయితొలగించండి
  26. ఆర్యశ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
    సప్రశ్రయంగా,

    కవిత్వంలో చమత్కారానికి అతీతమైన కాలాంతరానువర్తనీయతను గుఱించి మీరన్న పలుకులతో నేను పూర్ణంగా ఏకీభవిస్తూ, సమస్యాపూరణ విషయమై నా అభిప్రాయాన్ని సమగ్రీకరించుకొన్నాను.

    మీ సహృదయతకు, సౌజన్యానికి, ఆత్మీయతకు, ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. మీ రచనలోని ధారాశుద్ధి మీ అంతఃకరణశుద్ధికి నిదర్శకంగా అలరారుతున్నది. సిద్ధవాక్కులైన శ్రీ నేమాని వారికి అనుజానుయాయులై మీరు ధన్యులయ్యారు. ఈ విధంగా నాకు "రజతగిరి మీఁద హరిహరారాధనంబు" సమకూడింది.

    ధన్యోఽస్మి. నమోఽస్తు.

    రిప్లయితొలగించండి
  27. మిగిలిన పూరణలను గూర్చి ముచ్చటించుకొందాము.

    శ్రీ మిస్సన్న గారు ప్రభా కాంతులను వెల్లి వెరియ జేసేరు.

    శ్రీ వామన కుమార్ గారు వ్యంగ్య ధోరణిలో పూరించేరు. వారి పద్యము మొదటి పాదములో యతి మైత్రి కుదరలేదు. అక్షరములలోని హల్లులకు మాత్రమే కాదు అచ్చులకు కూడా యతి మైత్రి ఉండాలి. మీ మొదటి పాదమును ఇలా మార్చుదాము: "ఒప్పుగా నీతు లెన్నేని చెప్పదగును" (ఇందులో ప్రాస యతిని వాడేను).

    శ్రీ మంద పీతాంబర్ గారు భారతమునకు సముచిత గౌరవము నిచ్చుచూ, అందులో ఎట్టి లోపములు ఉండవనియు, ఏమైనా దోషములు ఉన్న యెడల బొంకు అనవచ్చు నని సెలవిచ్చేరు.

    రిప్లయితొలగించండి
  28. శ్రీ ఏల్చేరు మురళీధర్ గారికి అభివందనములు. కృతజ్ఞతలు. నేను తెలుగు భాషాభిమానిని మాత్రమే! అమ్మ కృప వలన శ్రీ శంకరయ్య గారి బ్లాగులో పెక్కుమంది మిత్రులతోను,సోదరీమణులతోను ఆత్మీయభావము కలిగింది. ఇప్పుడు మీ సంస్కృతభాషా ప్రావీణ్యము గని ఎంతో పారవశ్యము పొందుతున్నాను. మీ వలన మాకందరికీ లాభము చేకూరుతుంది. మరి మా అన్నయ్యగారి సంగతి, వారి కవితలు వారి ఆధ్యాత్మ రామాయణ కావ్య పఠనానుగ్రహము వారి చరణారవిందములను స్పృశించ గలిగిన అదృష్టము కలగడము నా పుణ్య ఫలముగా దలుస్తాను. అంతా తెలుగు వాణి కృప.

    రిప్లయితొలగించండి
  29. మూర్తిగారికి, పండితులవారికి
    ధన్యవాదాలు.
    చక్కటి చర్చ జరిగినది.

    రిప్లయితొలగించండి
  30. తెలుగు సామెత లెన్నగా తేనె లొలుకు
    తగిన సమయాన చెప్పగా తప్పు లేదు
    రంక ననుచును చూడగా రామ కథను
    భారతంబును బొంకని పలుక దగును.

    రిప్లయితొలగించండి