1, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 634 (భార్యను విడిచిన గలుగును)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

76 కామెంట్‌లు:

  1. కార్యా లయమునకు వెడలు
    ఆర్యా! నే పూజ జేతు ననగా రాజే
    శ్వర్యా లయమున ' కార్లో '
    భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శ్యామల రావు గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి శుభాభినందనలు.

    అమ్మా! తెలుగు తల్లీ!

    పరిహాసం బొనరింప కొందరు సదా భాష్యంబు ఖడ్గంబుగా
    కరమొప్పారెడు పద్య లక్షణములన్ గర్హించ బంధాలుగా
    పరితాపంబును చెందుచుంటి జననీ! భాషామతల్లీ! శుభం
    కరి! మా దైన్యము బాపి యీ స్థితిని చక్కంజేయ ప్రార్థించెదన్

    రిప్లయితొలగించండి
  3. మా రాయలసీమ నీళ్ళ కట కట
    ఎండ తాకిడి ఎక్కువయ్యే రోజులు వచ్చే
    పార్వతీశా,కరుణ జూపి మాకు నీ శిరో
    భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో.


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  4. ఆర్యుడు నారాయణుడా
    సూర్యకులమణి! సతి లక్ష్మి!చూడు దశగళా !
    మర్యాదగ నా రాముని
    భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో.

    రిప్లయితొలగించండి
  5. జిలేబి గారూ ! మీ ఆలోచన బాగుంది. కానీ గంగ శివునికి భార్య కాదు కదా ?

    రిప్లయితొలగించండి
  6. శ్రీ నేమాని వారికి నమస్కారములు. మీ ఆవేదన సహేతుక మైనదే. మా వలన జరుగు పొరపాట్లను దోషములను సహృదయం తో పరిష్కరించి మార్గ దర్శకము చేయ వలసినదిగా మా కోరిక.
    మిస్సన్న గారూ ! భలే పూరణ చేశారండీ !

    రిప్లయితొలగించండి
  7. మండోదరి రావణాసురునితో............

    ధైర్యము సడలెను, తమకని
    వార్యము రణరంగమందు పరిభవమెల్లన్
    ఆర్యా! వినుమిక రాముని
    భార్యను విడిచిన కలుగును భాగ్యములెన్నో.

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ గారూ ! బాగుంది. నేను కుడా మీ బాటలో ఒకడుగు వేస్తున్నాను.

    ఆర్యా! యుద్ధము నందున
    నిర్యాణము నొంద గలవు నిలువగ లేవా
    ఆర్యుని ముందర, రాముని
    భార్యను విడిచిన కలుగును భాగ్యములెన్నో.

    రిప్లయితొలగించండి
  9. ఆర్యవసంత కిశోరా!
    “భార్యను విడిచిన గలుగును భాగ్యము” లెన్నో
    పర్యా యముల ట్లననౌ
    నిర్యాణము వరకునామె(యె) నెచ్చెలి నాకున్!

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా ! తొలగు విచక్షణ
    భార్యను విడిచిన , గలుగును భాగ్యము లెన్నో
    కార్యాదుల పట్ల విజయ
    పర్వము లర్థాంగి వలన , ‘భార్య’కు జేజే !

    రిప్లయితొలగించండి
  11. గోలీ వారు,

    శిరో భారమును ఇచ్చు వారలు 'భార్యలు' అని... శిరో భార్యలు !!!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  12. మర్యాద లేదనుచు నొక
    పర్యాయము లక్ష్మి వీడె పతి గేహమ్మున్
    భార్యగ నలమేలు నిలిచె,
    భార్యను విడిచిన కలుగును భాగ్యములెన్నో.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారికి వందనములు
    అత్తమామలున్న ఇంట తాను కాపురముజేయన్న భార్యతో బాధలుపడు వారిపై
    ---------
    సూర్యుని తాపము నిచ్చును
    భార్యయని భుజమును దట్ట పరభార్యవలెన్|
    మర్యాదలు దెలియని యా
    భార్యను విడచిన గలుగును భాగ్యములెన్నో|

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రులారా,
    రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. ముఖ్యంగా నడుము, మోకాళ్ళ నొప్పులు. పైగా నెట్ కనెక్షన్ సమస్య... అందువల్ల వెంట వెంటనే స్పందించలేక పోతున్నందుకు మన్నించాలి.
    *
    నేమాని వారూ,
    మీరు మా కందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉండి మార్గదర్శనం చేస్తున్నారు. వ్యాఖ్యలకు దీటైన సమాధానాలిస్తూ ముందుకు సాగుతూ మమ్మల్ని నడిపించాలి కాని అస్త్రసన్యాసం చేయడం భావ్యం కాదు. మా పట్ల మీ అవ్యాజ కరుణ కొనసాగాలని ఆశిస్తున్నాను. రాగద్వేషాల కతీతమైన సౌహార్దం మీ సొత్తు. మీ సహకారాన్ని ఎల్ల వేళలా కోరుకుంటున్నాము మే మందరం.
    "పద్య మందగవలె గతవైభవమును"

    రిప్లయితొలగించండి
  15. సవరణ...


    ఆర్యా ! తొలగు విచక్షణ
    భార్యను విడిచిన , గలుగును భాగ్యము లెన్నో
    కార్యముల పట్ల విజయము ,
    మర్యాదలు భార్య వలన , మగువకు జేజే !

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గారు,

    మీరు ఈ సభాసదస్సులో తప్పక కొనసాగుతూ వుండాలని, శ్రీ శంకరయ్య గారు తెలియ చేసిన అభిప్రాయమే నాది కూడాను అని మీకు సవినయ మనవి.

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  17. పండితవర్యులకు,
    వారి పలుకులు ఇతరులను బాధించుచున్నవని వారికి తెలిసిన సరిదిద్దుకొన గలరని ఆశిస్తాను.

    పరిహాసంబుల చేయుచు
    తిరిగెడు వారలు నొక తరి తెలిసిన నటుపై
    పరభాషలపై మోహము
    సరికాదని, మన పలుకుల సరియందురికన్.

    గురువు గారు,
    ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొనగలరు.

    రిప్లయితొలగించండి
  18. పండితవర్యులకు,
    పరిహాసములు చేసేవారి పలుకులు ఇతరులను బాధించుచున్నవని వారికి తెలిసిన సరిదిద్దుకొన గలరని ఆశిద్దాము.

    పరిహాసంబుల చేయుచు
    తిరిగెడు వారలు నొక తరి తెలిసిన నటుపై
    పరభాషలపై మోహము
    సరికాదని, మన పలుకుల సరియందురికన్.

    గురువు గారు,
    ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొనగలరు.

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందరి స్పందనలు చూచేను. చాల సంతోషము.

    పలుకుల తల్లి నెల్లరము భవ్య మనమ్మున సత్కరించుచున్
    లలిత పదార్థ వైభవములన్ దులతూగుచు రమ్య సాహితీ
    నిలయముగా నొనర్చి తగు నెయ్యముతో మన బ్లాగు సుస్థితిన్
    జెలగుచునుండ పండుగుల జేయుదమింక సుధీ ప్రశస్తితో

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారు గంగ శివునికి భార్య కాదు కదా అన్నారు. ఈ శ్రీనాధుని ప్రసిధ్ధ చాటు పద్యం చిత్తగించండి.

    కం. సిరిగల వానికి చెల్లును
    తరుణుల పదునారువేల తగ పెండ్లాడన్
    తిరిపెమున కిద్ద రాండ్రా
    పరమేశా గంగ విడువు పార్వతి చాలున్

    జీలేబీగారి దీని స్ఫూర్తితోనే చెప్పారని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  21. ధైర్యముగ శూర్పణఖయనె
    భార్యను విడిచిన గలుగును భాగ్యములెన్నో
    ఆర్యా! నిను వలచితి కద
    మర్యాదగ రమ్ము రామ! మన్మధ రూపా!

    రిప్లయితొలగించండి
  22. నేమానివారూ, శూర్పణఖ అని అంటూ ఉంటాం కాని సరైన పదం శూర్పనఖ అనుకుంటాను. అయితే కవిత్వంలో వ్యక్తుల పేర్లను కొద్దికొద్దిగా మార్చి ప్రయోగించటం సాధారణమే. ఈవిడ పేరును చుప్పనాక అనికూడా మార్చారు మన కవులు. ఆంధ్రదేశంలో వాడుకలో నున్న చుప్పనాతి అనే మాట కూడా ఈ శూర్పనఖ అన్న మాటకు రూపాంతరమే.

    రిప్లయితొలగించండి
  23. మిత్రు లందరికీ నమస్సులతో విన్నపము .....

    వ్రాతల , మాటాడుటలన్
    ప్రాత విధానములు మారు , భాషలు మారున్
    తాతల నాటిది వ్యాకృతి
    చేతులు జోడింతు , మార్పుజెందద ? చెపుడీ!

    చట్రమే ఛంద , మన్వర్థ శక్తి గలుగు
    పసిడి పలుకులే ప్రాణమ్ము పద్యమునకు
    ప్రాణముల్ వోయు భావంపు పసిడి విడిచి
    చట్రమును నింపు ఘనతయే సత్య పథమ ?

    మిత్రు లందరిని మెచ్చి ప్రేమించుటయును ,
    గౌరవించుటయేగాని కలల నైన
    నింద జేయను , నామీద నింద లేల ?
    ఘనులు ద్వేషింతురేల నిష్కారణముగ ?

    మార్పు సైపని పండితమ్మన్యు లార !
    మార్పు సహజము , స్వాగతమ్మందు నేను
    ఏరి పారేయు డిందుండి నెట్టి నన్ను
    తులసి వనమున గంజాయి మొలక యనుచు

    శంకరయ్య గారూ ! శెలవ్ !!
    వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  24. శ్రీపతిశాస్త్రిగురువారం, మార్చి 01, 2012 7:53:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    చంద్రమతీదేవిని హరిశ్చంద్రుడు విక్రయించు సమయములో నక్షత్రకుడు జాలిచూపగా, హరిశ్చంద్రుడు నక్షత్రకునితో పలికినట్లుగా ఊహించి

    క్రౌర్యములగు శిక్షలకున్
    ధైర్యమునన్ నిలచి సత్యధర్మము నిలుపన్
    ఆర్యానాథుని నమ్ముచు
    భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో.

    రిప్లయితొలగించండి
  25. కార్యేషు దాసి యనగను
    భార్యకు విలువెంచ దగునె భర్తల కెపుడున్ ?
    భార్యకు సుగుణము లేకున్న నా
    భార్యను విడచిన గలుగును భాగ్యము లెన్నో !
    ------------------------------------------------------
    తమ్ముడూ ! ఆరోగ్యం జాగ్రత్త .

    రిప్లయితొలగించండి
  26. శ్రీపతిశాస్త్రిగురువారం, మార్చి 01, 2012 8:13:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    శ్రీ లక్కాకుల రాజారావు గారికి శ్రీపతిశాస్త్రి సవినయముగా నమస్కరిస్తూ,

    ఆర్యా మీ కఠోర నిర్ణయమును మార్చుకొని మీ మధుర పద్యాలతో మమ్ములను ప్రోత్సహించవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  27. శ్రీపతిశాస్త్రిగురువారం, మార్చి 01, 2012 8:27:00 PM

    వైద్యో నరాయణో హరి:

    గురువుగారూ మీరు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మాకు పాఠములను బోధించవలసినదిగా వైద్యనారాయణమూర్తిని వేడుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  28. రాజారావు గారికి,
    సభలో భిన్నాభిప్రాయములు ఉండటం అత్యంత సహజం. మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పద్యవైభవము నారాధించి అందుకు తగినట్టుగా ఆరాధించేవారు వ్యాఖ్యలు చేస్తున్నాము.

    ఇక్కడ, మరోచోట పద్యాలను , వ్రాసేవారిని పరిహసించిన వారి గురించి నేను వ్యాఖ్య వ్రాశాను.
    మీ గురించి కాదు. మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీరు ఇతరులను పరిహసించినట్టులేదు.

    దయచేసి మీకు ఆపాదించుకొనవద్దని నా ప్రార్థన. ఎప్పటి లాగే మనోహరమైన మీ పద్యాలను వ్రాస్తూ ఉండవలసినదిగా ప్రార్థన.

    శ్యామల రావు గారు,
    గంగ గురించి ఇదివరలో మన బ్లాగులో జరిగినది. గంగ శివుని భార్యగా ఏ పురాణాల్లో చెప్పబడలేదని, భరించినవాడు భర్తగా జనబాహుళ్యం నోట్లో జానపద గీతాలు గా పాడబడుతుంటుందని పెద్దలు చెపుతారు. శ్రీనాథుని చాటువు ప్రసిద్ధమైనదీ, చమత్కారము కలిగినది. కానీ పురాణాల్లో లేని విషయాలు పురాణప్రముఖులకు ఆపాదించి పూరణలు చేయకపోతేనే మంచిదని గురువు గారు తెలియచేశారు.

    రిప్లయితొలగించండి
  29. అయ్యా!
    శూర్పణఖ అనేది సరియైన ప్రయోగమే. నాకు సంధి సూత్రము రాదు గాని త్రిణయన మొదలగు ప్రయోగములు ఈ కోవలోకి వస్తాయి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  30. మిత్రులారా!

    పండితమ్మన్యులార! అని ఒక కవి గారు వాడుట మీరు గమనించేరు కదా!. అంటే తోటి సభ్యుల మీద వారికి ఎంత గౌరవము ఉందో తెలుస్తున్నది కదా. పరిస్థితి ఈ విధముగా దిగజారుస్తున్నారు కొందరు అని చాల బాధగా ఉన్నది. పాపము ఉపశమించుగాక! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. డి.నిరంజన్ కుమార్గురువారం, మార్చి 01, 2012 9:06:00 PM

    సుర్యాకాంతమువలె యే
    భార్యమణియైనగాని బాధించినచో
    మర్యాదనైన కాదని
    భార్యని విడిచిన కలుగును భాగ్యములెన్నో!

    రిప్లయితొలగించండి
  32. కాల వ్యవధిలో సమస్యా పూరణం చేసి బ్లాగులో ఉంచుతున్న కవి మిత్రులందరికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  33. అతి తక్కువ కాలవ్యవధిలో అని నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  34. డి.నిరంజన్ కుమార్గురువారం, మార్చి 01, 2012 9:23:00 PM

    మర్యాద కాదు రాముని
    భార్యను చేపట్ట తగదు భ్రాతా వినుమా!
    దుర్యశము గూర్చు.యాతని
    భార్యను విడిచిన కలుగును భాగ్యములేన్నో!

    రిప్లయితొలగించండి
  35. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    హనుమంతుడు రావణునితో :

    01)
    _____________________________________________
    దుర్యోగమున న్నీ వతి
    క్రౌర్యంబుగ బట్టి దెచ్చు - కల్లరి వైనన్
    శౌర్య ధనుండగు , మా ప్రభు
    భార్యను విడిచిన గలుగును - భాగ్యము లెన్నో
    _____________________________________________
    దుర్యోగము = మాయోపాయము
    కల్లరి = మోసగాడు
    ******

    రిప్లయితొలగించండి
  36. భార్యయె భర్తకు భాగ్యము
    భార్యయె సుఖ దు:ఖములను బాసట పతికిన్
    మర్యాదకాదు మీరన
    ' భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో'.

    రిప్లయితొలగించండి
  37. ఛందస్సు అంతగా తెలియని ఛాందసుడనైనప్పటికీ, మీ అందరి పద్యాలూ చదవటం ద్వారా ప్రేరేపితుడనై, నా విషయం గణితమైనప్పటికీ, సంగీతంలో ఉన్న మిడిమిడిజ్ఞానంతో, పద్యం పోకడను ఆధారంగా చేసుకుంటూ, నేను కూడా ఒక పద్యం వ్రాయటానికి ప్రయత్నించాను. విజ్ఞులు చిత్తగించగలరు.

    మర్యాదను మరచిపోయి
    నుర్వీపతి నేనె యనుచు కడు గర్వంతో
    నొర్వకు నార్యా ! రాముని
    భార్యను విడిచిన గలుగును భాగ్యములెన్నో
    (భార్యను విడువుము ! గలుగును భాగ్యములెన్నో!)

    రిప్లయితొలగించండి
  38. కవిమిత్రులకు వినమ్రనమస్కారములు. యీ బ్లాగుద్వారా ఎందరో పుణ్యమూర్తుల పరిచయము కలిగినందుకు నేను చాలా ధన్యుడిని. కవిత్వము, సాహిత్యము లాంటివాటియందు ఖచ్చితంగా భేదాబిప్రాయములు సహజములు. అష్టదిగ్గజాలలో కూడా ఈరకమైన భేదాబిప్రాయములు మనము గమనించగలము. కానీ అవన్నీ కూడ ఉత్కృష్టమైన కవిత్వానికి పాండిత్యానికి పునాదులవలె మారినవి. అదే విధంగా మనము కూడా తారతమ్యములను కాదని ఐకమత్యముగా కవిత్వాభివృద్ధికి పాటుపడదామని ప్రార్థిస్తున్నాను.

    పోటాపోటీతత్వము,
    ధీటుగ పద్యములు వ్రాయు తేజంబులు మీ
    కాటాపాట సమానము,
    మాటామాటలను విడచి మాన్యత గనుడీ.

    రిప్లయితొలగించండి
  39. శంకరార్యా ! మీరు త్వరగా కోలుకుని ఆరోగ్య వంతులై బ్లాగు పగ్గములు చేపట్టాలని 'నెట్' ఇబ్బందులు తీరాలని మనసారా కోరుకొను చున్నాను.

    లక్కాకుల రాజారావు గారూ !

    కలిసుందము 'బ్లాగున' మరి
    తులసియు గంజాయటంచు తొలగెద ననుటల్
    తెలిసిన వారికి భావ్యమ
    కలతను మది నెంచ కయ్య కవి "రాజ"! సఖా !

    రిప్లయితొలగించండి
  40. శ్రీ నేమాని వారూ !

    పెద్దలు మీరలు చూడగ
    దిద్దుడు మా దోషములను దీమంతులుగా
    సుద్దుల నేర్పుడు సరి సరి
    హద్దులు జూపించి మాకు హాయిగ బ్లాగున్.

    రిప్లయితొలగించండి
  41. అయ్యా ! నేటి వాదోపవాదములు గమనించిన పిమ్మట
    "తెలుగు ఛందోవికాసము" అన్న గ్రంథముయొక్క అవతారికలో
    "డా.కోవెల సంపత్కుమారాచార్య" గారి పలుకులు కొన్ని యిచ్చట ముచ్చటించ వలెనన్న కోర్కి యుద్భవించినది ! గమనించుడు !
    *****
    ఈ సృష్టిలోని సౌందర్యమును, ఆనందమును జీవుని కందించుటకు సాధనములైన
    ఙ్ఞానేంద్రియములు ముఖ్యముగా నేత్ర శ్రోత్రములు !
    కేవల సౌందర్యానుభవమును నేత్రము కలిగించినచో రసానందానుభవమును శ్రోత్రము కలిగించు చున్నది !
    జీవునికి రసానందము నాదము వలన కలుగు చున్న దనుట స్పష్టమయిన విషయము !
    ఈ నాదము యొక్కముఖ్య లక్షణము లయ ! నాద సౌందర్యమున కీ లయయే ప్రధాన కారణ మగుచున్నది !
    వచన స్వరూపమున నున్న భాషలోని , వాక్కులోని లయను వ్యక్తము చేయునదే చందస్సు !
    చందస్ - అన్న సంస్కృత పదము-చద్-అను ధాతువు నుండి నిష్పన్న మగు చున్నది !
    ఈ ధాతువునకు ఆహ్లాదమని అర్థము !
    ఆహ్లాదము కలిగించెడు వాక్సమూహమే -చందస్సు- అని చెప్పవచ్చు !
    వర్ణ పద సంయోజనముల చేత,
    వాక్య నిర్మాణములలోని ప్రత్యేక లక్షణముల వలన,
    ఆవృత్తి వలన ,
    నియమ పూర్వక మయిన విచ్ఛేదముల వలన,
    స్వరాందోళనము వలన
    చందస్సు ఆహ్లాదము కలిగించు చున్నది !
    చందస్సు రెండు విధములుగా ప్రయోజనవంతమైనది !
    ఒకటి- సౌందర్య దృష్టితో !
    రెండు- స్మరణ దృష్టితో !
    కవిత్వమునకు సౌందర్య సంపాదక మైనది చందస్సు !
    తద్వారా ఆనంద మనుభావ్యమాన మగుచున్నది !

    వచనముకన్న చందోబద్ధమయినది గుర్తుంచుకొనుటకు అధికముగా వీలయినది !నియత విచ్ఛేదాదికము కలదగుట చేత స్మరణమునకు అధిక సహకారి కాగలదు !
    *****

    రిప్లయితొలగించండి
  42. మిత్రుల పూరణలు అలరారుచున్నవి. మిస్సన్న గారి పూరణ అద్భుతము.

    కార్య విలంబిత చర్యలు
    (కార్యముల కడ్డు పుల్లలు )
    క్రౌర్యాతిశయమ్ము కలిత కాఠిన్యంబున్
    చౌర్యాభరణ క్రయములు
    భార్యను విడిచిన, గలుగును భాగ్యము లెన్నో !

    రిప్లయితొలగించండి
  43. మరియు వారిచే " ఛందస్స్వరూపము " అన్న అధ్యాయములో
    చెప్పబడిన విషయములు !
    *****
    లక్ష్యభూతమయిన ఛందో రచనలలో ప్రాచీనతమము లయినవి వేదములు !
    పరంపరగా ఒకరి ముఖతః మరొకరు నేర్చుకొన్నవి కావున వీటికి
    శ్రుతులు అన్న పేరు సార్థకమయినది !
    భాష యేర్పడిన తరువాత కొంతకాలము వరకు లిపి యేర్పడ లేదు !అందువలన ఈ వేదము విని నేర్చుకోవలసిన స్థితియే ప్రాచీనకాలము నుండీ యుండెడిది !

    ఆ వేదము నందలి కొన్ని పదముల, ఋక్కుల ఉచ్ఛారణ యందలి
    పౌనఃపున్యము కూడ ఫలప్రదముగా భావించ బడుచున్నది !
    అందులోని ఒక అక్షరము లేక ఒక మాత్రయొక్క లోపము
    ఉచ్ఛారణయందు జరిగిననూ , అది పాపహేతువుగా తలంపబడు చున్నది !
    ఈ లోపము లేవియూ కలుగకుండా ,
    ధారణ యోగ్యము లగుటకు వేదములు ఛందస్సు నాశ్రయించినవి !
    ఛందోబద్దమగు రచన యందొక్క యక్షరము కాని, ఒక మాత్రకాని తగ్గిపోయినచో , వెంటనే తెలియుటకు అవకాశ మధికముగా నున్నది !
    ఈ ఛందస్సుతో పాటూ ఉదాత్తానుదాత్తస్వరితాది స్వరములను గూడ వేదమునకు సమకూర్చుటచే, మరియు నది లోపము కలుగకుండుటకు హేతువయినది !
    స్వరచ్ఛందస్సులు వేదముయొక్క సుస్థితికి మూల భూతము లయినవి !
    శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము,కల్పము
    అను ఆరును వేదాంగములు !
    ఈ ఆరు వేదపురుషునికి యెట్టి అంగములో పాణిని ఈ క్రింది విధముగా తెల్పినాడు !
    "ఛందః పాదౌతు వేదస్య , హస్తే కల్పో~ థ పఠ్యతే
    జ్యోతిషామయనం చక్షు , ర్నిరుక్తం శ్రోత్ర ముచ్యతే
    శిక్షా ఘ్రాణంతు వేదస్య , ముఖం వ్యాకరణం స్మృతం "

    ఒక వ్యక్తి యొక్క స్థితికి పాదము లెట్లు ముఖ్యమయినవో , వేదములకు ఛందస్సట్టిది !!

    కాబట్టి ఛందస్సు పాదములుగా చెప్ప బడినది !
    *****

    రిప్లయితొలగించండి
  44. గురువు గారూ మీకు సంపూర్ణారోగ్యము సమకూడాలని దైవమునకు నా ప్రార్థన. కిశోర్ జీ ఏదైనా విషయాన్ని చక్కని శైలిలో చెప్పడము మీ ప్రత్యేకత. మీకు ప్రత్యేక అభినందనలు.
    తెలుగు భాషా క్ష్మాజములో ఛందోబద్ధ కవిత్వము, కృతులు, గేయ కవితలు, వచన కవిత్వము, గద్య రచనలు వివిధ పుష్పములు. ఏ ఒక్క ప్రక్రియను నిరసించ వలసిన అవసరము లేదు. ఎవరికి నచ్చినట్లు వారు వ్రాసు కోవచ్చును,చదివి ఆనందించ వచ్చును. తెలుగు సంస్కృత మిళితములతో అలరారే తెలుగు భాష ప్రపంచములో ఏ యితర భాషకు తీసి పోదు. తెలుగు భాషా వికాసమునకు తోడ్పడ గల శ్రీ పండిత నేమాని వారికి శ్రీ లక్కాకుల వెంకట రాజా రావు గారికి మిగిలిన బ్లాగు మిత్రులకు అభివందనములు.

    రిప్లయితొలగించండి
  45. మూర్తీజీ ! చాలా చక్కగా చిక్కగా చెప్పారు !
    నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాను !
    ఈ చర్చకు తెర లేపిన నేమాని వారికీ , రాజారావు గారికీ
    మిగతా బ్లాగు మిత్రులకూ అభినందనలు !

    రిప్లయితొలగించండి
  46. శంకరార్యా మీకు తొందరగా స్వస్థత చేకూరాలని మా ఆకాంక్ష !

    రిప్లయితొలగించండి
  47. వామన కుమార్ గారూ ! సుస్వాగతం !
    చందస్సు తెలియదంటూనే చాలా చక్కగా వ్రాసారు !
    మీ అభిరుచికి జోహార్లు !

    కాకపోతే యతి ప్రాసలు లోపించినవి !
    కొన్ని గణ భంగములు కూడా !

    మీరు ఛందస్సు నేర్చుకొంటే మా కన్నా చక్కగా వ్రాయగలుగుతారు !
    ప్రయత్నించండి !

    రిప్లయితొలగించండి
  48. యతి అనగా పద్యం లోని ప్రతి పాదం లోని మొదటి పదం.

    యతి మరియు యతి మైత్రి :

    పద్య పాదంలో మొదటి అక్షరానికి ఆ పద్యం లక్షణములలో చెప్పబడిన యతి స్థానంలో మైత్రి గల అక్షరాన్ని వాడటాన్నే "యతి మైత్రి" అంటారు.
    యతి అంటే విరామం అని అర్థం.
    లయబద్ధమైన పద్య నడకలో సహజంగా వచ్చే విరామాన్ని యతి స్థానం అంటారు.
    సంస్కృతంలో యతి విరామాన్ని సూచిస్తుంది.

    కానీ తెలుగు పద్యాలలో ఇది అక్షర సామ్యాన్ని నియమిస్తుంది.
    అంటే ఈ యతి స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో "యతి మైత్రి" లో ఉండాలనేది నియమం.

    ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం యతి మైత్రిలో ఉంటాయి.

    1.అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
    2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ
    3.ఉ, ఊ, ఒ, ఓ
    4.క, ఖ, గ, ఘ, క్ష
    5.చ, ఛ, జ, ఝ, శ, ష, స
    6.ట, ఠ, డ, ఢ
    7.త, థ, ద, ధ
    8.ప, ఫ, బ, భ, వ
    9.ణ, న
    10.ర, ఱ, ల, ళ
    11.పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ

    ఇతర నియమములు :
    హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి.
    అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ" కి "జి" తో మైత్రి కుదరదు.
    హల్లులకి యతి మైత్రి లేకపోయినా, అవి రెండూ ఋ అచ్చుతో కలిస్తే వాటి మధ్య యతి చెల్లుతుంది.
    ఉదాహరణకు, "ద" కు "గ" యతిమైత్రి లేకపోయినా, "దృ" కు "గృ" కు యతి కుదురుతుంది.
    సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు.
    ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ" గా గానీ "రొ" గా గానీ భావించ వచ్చు.
    ప్రతి వర్గములో చివర ఉన్న అనునాసిక అక్షరానికి (ఙ, ఞ, ణ, న, మ),
    ఆ వర్గంలో ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి బిందు పూర్వకములైతే యతి చెల్లుతుంది.
    ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన "న" కు "కంద" లోని "ద" కు యతి చెల్లుతుంది.
    ఉచ్చారణ పరంగా "కంద" ని "కన్ద" అని పలుకుతాం. అందువలన "న్ద"లోని "న"తో యతి కుదురుతుంది.
    "మ" కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురుతుంది.
    ఇదే విధంగా, ఒక అక్షరం ముందున్న అక్షరం పొల్లుతో అంతమైతే,
    ఆ పొల్లుతో కూడా యతిమైత్రి జరుగుతుంది.

    ఉదాహరణకి యీ కింద పద్యంలో చివరి పాదం చూడండి:

    "జ"ననీస్తన్యము గ్రోలుచున్ జరణ కం"జా"తంబునన్ గింకిణీ
    స్వన మింపారగ దల్లి మేన మృదుల "స్ప"ర్శంబుగా దొండ మ
    ల్లన యాడించుచు జొక్కు విఘ్నపతి యు"ల్లా"సంబుతో మంత్రి వె
    "న్న"నికిన్ మన్నపు పొంపుమీర నొసగు"న్ భ"ద్రంబు లెల్లెప్పుడున్ !

    చివరి పాదంలో మొదటి అక్షరం "న". యతిస్థానంలోని అక్షరం "భ".
    ఈ రెండు హల్లులకీ యతి చెల్లదు.
    కానీ, "భ"ముందు పదం "నొసగున్"లో "న్" ఉంది కాబట్టి, దానికి "న"తో యతి చెల్లుతుంది.

    యతిస్థానంలో సంధి జరిగినప్పుడు, సాధారణంగా సంధి జరగకముందు ఉన్న అక్షరంతోనే యతిమైత్రి జరుగుతుంది.
    ఉదాహరణకు, ఈ కింద పద్యంలో రెండు, నాలుగు పాదాలు గమనించండి:

    "అం"కము జేరి శైలతన"యా" స్తనదుగ్ధములాను వేళ బా
    "ల్యాం"క విచేష్ట దొండమున "న"వ్వలి చన్ గబళింపబోయి యా
    "వం"క గుచంబు గాన కహి "వ"ల్లభ హారము గాంచి వే మృణా
    "ళాం"కుర శంక నంటెడి గ"జా"స్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ !

    రెండవ పాదంలో, మొదటి అక్షరంలో సంధి జరిగింది, "బాల్య + అంక".
    అలాగే యతిస్థానంలో (10వ అక్షరం) కూడా సంధి జరిగింది, "తొండమునన్ + అవ్వలి".
    సంధి జరగక ముందున్న అక్షరాలు "అం"కు, "అ"కు యతిమైత్రి జరిగింది.
    అలాగే నాల్గవ పాదంలో, "మృణాళ + అంకుర", "గజ + ఆస్య". అక్కడ "అం"కు "ఆ"కు యతిమైత్రి.

    యతి అక్షరాలలో ఒకటి అచ్చు అక్షరం మరొకటి హల్లు అక్షరం అయితే, వాటి మధ్య యతి కుదరదు.
    ఉదాహరణకి పాదంలో మొదటి అక్షరం "అ" అయితే, యతిస్థానంలో "క" అనే అక్షరం ఉండాలంటే, యతిమైత్రి కుదరదు.
    అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది.
    సంబోధనలో చివరి అక్షరం హల్లయినా, దానికి అచ్చుతో యతిమైత్రి కుదురుతుంది.
    ఉదాహరణకి మొదటి అక్షరం "అ" అయినప్పుడు,
    "అక్కా!", "ఔరా!" వంటి పదాలలోని "క్కా", "రా" అక్షరాలు యతిస్థానంలో ఊండవచ్చు,
    వాటికి "అ"తో యతిమైత్రి చెల్లుతుంది.

    పై చెప్పినవి కాక మరికొన్ని ప్రత్యేక యతి మైత్రులు ఉన్నాయి. కాని అవి అరుదు.

    రిప్లయితొలగించండి
  49. ప్రాస నియమములు:

    ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును. అనగా అదే గుణింతము నుండి ఉండవలెను

    ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.

    ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.

    ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.

    ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు మాత్రమే ప్రాస కుదురును.
    మిగిలిన హల్లులకు కుదరదు . అనగా క-ఖ, గ-ఘ మొదలైన వాటికి ప్రాస కుదరదు !

    రిప్లయితొలగించండి
  50. అయ్యా లక్కాకుల వారు,

    మీకు చెప్ప గలిగిన వారము కాము. అయినా మా వైపు నించి విన్నపం.మీరు ఈ సభాస్థలి వదల రాదు.

    సప్త వర్ణములు లేనిదే ఇంద్ర ధనుస్సు లేదు. సప్త వర్ణములు కలవనిదే తెలుపు ధవళ కాంతులు లేవు.

    ఈ బ్లాగు సొబగు నేమాని వారి పాండిత్యం తో ఎంత సొబగు గా వెలుగొందు తుందో, అంతే సొబగు గా మీ తేట తెలుగు తియ్యదనాలతో అలరారు తోంది.
    మీ తేట తెలుగు ని ఆస్వాదించని రోజులు లేవు. మాలాంటి మట్టి బుర్రలకి అదొక్కటే అర్థమాయె. మీ పద్యాలతో మనసుకు హాయి.

    అదే సమయం లో పండిత నేమాని వారి పద సంపదలతో కొత్త కొత్త పదాలని నేర్చుకుంటున్నాము కూడాను.

    శంకరాభరణం కొలువు ఇంద్ర ధనుస్సై వుండాలి .

    కావున దయ చేసి మీరు మీ బ్లాగ్ విరమణ ని వదిలి పెట్టాలని జిలేబీ వినమ్ర మనవి.

    ఇట్లు
    జిలేబి

    రిప్లయితొలగించండి
  51. గురు, లఘువులు :

    మాత్రయన నొక్క లఘువగు
    మాత్రలు రెండైన గురువు - మఱి యెన్న బడున్ !
    ధాత్రిని నఱువది నాలుగు
    మాత్రలుగా గందమునకు - మాత్రలు వెలసెన్ !

    వివరణ-మాత్ర యనగా ఒక చిటిక వేయునంత కాలము !
    ఒక్క మాత్రా కాలములో నుచ్ఛరింపబడు అక్షరము లఘువు !
    అ-ఇ-ఉ- క- చ- ట- య- మొదలగునవి !
    రెండు మాత్రల కాలములో నుచ్ఛరింపబడు అక్షరము గురువు !
    ఆ-ఈ- ఊ- ఐ-ఔ- కా-శ్రీ-పే-మౌ- సీ- మొదలగునవి !
    కంద పద్యమునకు అఱువది నాలుగు మాత్రలుండును !
    *****
    దీర్ఘాచ్చులును, దీర్ఘాచ్చులతో గూడిన హల్లులును గురువు లగును !
    సంయుక్తాక్షరమునకు పూర్వాక్షరము గురువు !
    అమ్మ-లో -అ- గురువు -మ్మ-లఘువు
    కన్య-లో -క- గురువు -న్య-లఘువు
    చక్రము-లో -చ- గురువు -క్ర-లఘువు -ము- లఘువు
    పొల్లుకు , సున్నకు, విసర్గకూ ముందున్న అక్షరములు గురువులు !
    మిగిలినవి లఘువులు !
    *****

    రిప్లయితొలగించండి
  52. గురు లఘువుల గుర్తులు :
    I --- లఘువు
    U --- గురువు

    రిప్లయితొలగించండి
  53. గణము : అక్షర సముదాయము గణ మనబడును !

    A)ఏకాక్షర గణములు : ఇవి - 2

    01) I --- ల - గణము
    02) U --- గ - గణము

    B) రెండక్షరముల గణములు : ఇవి - 4

    01) II--- లలము
    02) UU--- గగము
    03) UI--- హ -గణము
    04) IU--- వ -గణము

    C) మూడక్షరముల గణములు : ఇవి - 8

    01) UUU--- మ - గణము
    02) UII--- భ - గణము
    03) IUI--- జ - గణము
    04) IIU--- స - గణము
    05) III--- న - గణము
    06) IUU--- య - గణము
    07) UIU--- ర - గణము
    08) UUI--- త - గణము

    రిప్లయితొలగించండి
  54. ఈ 8 గణములు 2 కందాల్లో :

    01)
    గురువులు మూడిడ , మ గణము
    పరగంగా, నాది గురువు - భ గణంబయ్యెన్ !
    ధర మధ్య గురువు , జ గణము
    సరసగుణా ! యంత్య గురువు - స గణం బయ్యెన్ !

    02)
    న గణంబు మూడు లఘువులు
    య గణంబున కాది గురువు - యమతనయ నిభా !
    ర గణంబు మధ్య లఘువగు
    త గణంబున కంత్య లఘువు - దాక్షిణ్య నిధీ !

    రిప్లయితొలగించండి
  55. *****
    ఉప గణములు :
    సూర్య , ఇంద్ర , చంద్ర గణములు ఉప గణము లన బడును !

    నల, నగ , సల, భ , ర , త , లునా
    నెలమిని నీ యాఱు గణము - లింద్ర గణంబుల్ !
    గల, నగణము లీ రెండును
    జలజాప్త గణంబు లయ్యె - జగదాధారా !

    వివరణ :
    ఇంద్ర గణములు : ఇవి - 6
    నల, నగ, సల, భ , ర, త

    సూర్య గణములు : ఇవి - 2
    హ , న

    చంద్ర గణములు : ఇవి 14
    వీని కుపయోగము తక్కువ గాన అవసరము లేదు !

    రిప్లయితొలగించండి
  56. కందము యొక్క లక్షణములు :

    సాధారణముగా పద్యమునకు నాలుగు పాదము లుండును !

    కందమున

    01)
    బేసి (1,3) పాదములకు 3 గణములు
    సరి(2,4) పాదములకు 5 గణములు ఉండును !
    02)
    ఇందు - గా - భ - జ - స - నల - అను 5 గణములు మాత్రమే ఉపయోగించవలెను !
    ఈ 5 గణములూ 4 మాత్రలను మాత్రమే కలిగి యుండును
    గావున మాత్రాగణము లందురు !
    03)
    1,2, పాదములలో (3+5) 8 గణములూ
    3,4, పాదములలో (3+5) 8 గణములూ ఉండును !
    ఇందు 6 వ గణము "నల"ము గాని "జ" గణము మాత్రమే గాని యుండవలయును !
    04)
    8 వ గణము చివర తప్పక గురువే యుండ వలెను !
    అనగా 8 వ గణము " స "గణము గాని "గగము" గాని యుండవలయును !
    05)
    బేసి (1,3,5,7) గణములందు " జ "గణము ఉండరాదు !
    06)
    బేసి పాదములు చిన్నవి గావున అచట యతి లేదు !
    07)
    2 వ , 4 వ పాదములందు ఆ పాదాద్యక్షరములకు , 4 వ గణము మొదటి అక్షరమునకు యతి మైత్రి గూర్చ వలెను !
    08)
    ప్రాస నియమము గలదు !

    రిప్లయితొలగించండి
  57. వామన్ కుమార్ గారూ !
    ఇదంతా ఛందస్సు నందు ప్రాథమిక పరిఙ్ఞానము మాత్రమే !
    మిగిలిన విషయములు మీరు పుస్తకముల ద్వారా తెలుసుకొన గలరు !
    ఇప్పుడు మీ పద్యములో తప్పొప్పులు మీరే తెలుసుకొన వచ్చును !

    రిప్లయితొలగించండి
  58. 02)
    _____________________________________________
    భార్యయె శక్తికి మూలము
    భార్యయె రక్తికి నిలయము - భర్తకు సకలమ్
    భార్యయె ! కావున నెట్లగు
    భార్యను విడిచిన గలుగును - భాగ్యము లెన్నో?
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  59. తనను విక్రయించి మాట నిలుపుకొనుమని చంద్రమతి హరిశ్చంద్రునితో :

    03)
    _____________________________________________

    ఆర్యా ! సద్గుణ సాంద్రా !
    శౌర్యము , వీర్యము గలిగిన - సత్యవ్రతుడా !
    కార్యము తీరుట కొఱకై
    భార్యను విడిచిన గలుగును - భాగ్యము లెన్నో?
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  60. శ్రీ వసంత మహోదయా! అమోఘం, ఒక సంవత్సర కాలం పట్టే పాఠం నాలుగు పోస్టింగులలో వేసి నేర్పించారు. మీరు పోస్టు చేసిన రెండవ కందపద్యంలో "న గణంబు మూడు లఘువులు
    య గణంబున కాది (గురువు) - యమతనయ నిభా !..." మరి "య గణంబున కాది (ల-ఘు-వు) - యమతనయ నిభా ! వుండాలి కదా! టైపాటు అని చెప్పకనేతెలుస్తున్నది. పాఠకలోకంతరఫునుంచి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  61. చంద్రశేఖరులకు ధన్యవాదములతో :

    ఈ 8 గణములు 2 కందాల్లో :

    01)
    గురువులు మూడిడ , మ గణము
    పరగంగా, నాది గురువు - భ గణంబయ్యెన్ !
    ధర మధ్య గురువు , జ గణము
    సరసగుణా ! యంత్య గురువు - స గణం బయ్యెన్ !

    02)
    న గణంబు మూడు లఘువులు
    య గణంబున కాది లఘువు - యమతనయ నిభా !
    ర గణంబు మధ్య లఘువగు
    త గణంబున కంత్య లఘువు - దాక్షిణ్య నిధీ !

    రిప్లయితొలగించండి
  62. వసంత కిశోర్ గారు,
    చాలా శ్రమ తీసికొని కొత్తవారికి కావలసిన విషయాలన్నీ చెప్పారు.
    సంపత్కుమారాచార్య గారి మాటలు చాలా నచ్చాయి.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  63. వసంత మహోదయా ఛందస్సు పుట్టుక గురించి మీరిచ్చిన సమాచారం అద్భుతం, అమోఘం, సమగ్రం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  64. మిత్రమా రాజారావు గారూ మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించండి.
    మనమందరం శంకరాభరణంలో మణులం. ఏ మణి శోభ ఆ మణిదే.
    ఏ మణి జారి పోయినా ఆభరణం శోభ మాసిపోతుంది.

    రిప్లయితొలగించండి
  65. హనుమచ్చాస్తి గారూ మూర్తిమిత్రమా ధన్యవాదాలు.
    మీ పద్యాలు రమణీయాలు.

    రిప్లయితొలగించండి
  66. మిస్సన్న మహాశయా ! లెస్స బలికితిరి !
    రాజారావుగారూ ! శంకరాభరణం శోభ నినుమడింప జెయ్యండి !
    మందాకినిగారూ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  67. సూర్యా పత్రికా కార్యాలయంలో పనిచేసే భార్యను నిత్యమూ :
    04)
    _____________________________________________

    కార్యాలయమున కేగను
    సూర్యా పత్రిక ను జేర - స్కూటరు పైనన్
    మర్యాదగ నిత్యంబును
    భార్యను విడిచిన గలుగును - భాగ్యము లెన్నో?
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  68. నమస్కారములు.
    పద్య లక్షణములను చక్కగా వివరించిన పండితు లందరికీ పేరు పేరునా ధన్య వాదములు. అందరూ , పండితులూ , మేధావులు , సరస్వతీ పుత్రులూ ,ఆత్మీయతను పంచే , సోదర సోదరీ మణులూ , అభినంద నీయులూ .
    " శంకరునికి ఆభరణము లైన వీరిలో ఏ ఒక్క ఆభరణం తగ్గినా , వెలితిగానే ఉంటుంది. " కావున [ అందరూ ] అన్ని ఆభరణముల తోనూ అను నిత్యమూ రస రమ్యమైన పద్యములతో అలంక రించి కను విందుగా , గురువులైన శ్రీ శంకరుల వారినీ , శ్రీ పండిత నేమాని వారినీ , కొలిచి తరించ గలమని కోరుతూ . సోదరి .

    రిప్లయితొలగించండి
  69. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ముందుగా మీకు మనస్తాపం కలిగించినందుకు మన్నించండి.
    అయినా ఎవరూ మిమ్మల్ని "పేర్కొని" విమర్శించలేదు కదా! మీరు మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లే వారూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.
    "శంకరాభరణం" సంప్రదాయ కవిత్వానికి పెద్ద పీట వేస్తున్నది. అలాగని మిగిలిన సాహిత్య ప్రక్రియలను కాని, భాషారీతులను కాని ఎక్కడా నిరసించలేదు కదా!
    నేను ప్రకటించే పోస్టులలో, వ్యాఖ్యలలో అచ్చమైన వ్యావహారిక భాషనే వాడుతున్నాను కాని గ్రాంధికంలో వ్రాయటం లేదు కదా! అంతెందుకు? నేను ప్రకటించిన ఛందో వ్యాకరణ పాఠాలను గమనించండి...అవి వ్యావహారికంలోనే వున్నాయి. గ్రాంధిక భాషకు చెందిన వ్యాకరణ పాఠాన్ని వ్యావహారికంలో వ్రాసాను. నాకు కాని, బ్లాగు మిత్రులకు కాని భాషాద్వేషం ఏకోశానా లేదు.
    జిలేబీ గారిని ఎవరైనా, ఎప్పుడైనా "మీరు ఛందోబద్ధంగానే అదీ గ్రాంధికంలోనే మీ భావాలను వెలిబుచ్చాలి" అని కట్టడి చేసారా? నిషేధం విధించారా? వారి వ్యాఖ్యలను స్వాగతిస్తూ మిత్రులు వారి భావాలకు ఛందో రూపం ఇచ్చి ప్రశంసించారే కాని ఎప్పుడైనా నిరుత్సాహపరిచారా?
    మీరు సహృదయంతో సింహావలోకనం చేసికొని మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  70. వసంత కిశోర్ గారూ,
    ఇంత వివరంగా ఛందో పాఠాలను చెప్పిన మీకు ధన్యవాదాలు. వీటిని కూర్చి ఒక పాఠంగా ప్రత్యేకంగా ప్రకటిస్తాను. నా నెట్ సమస్య తీరాక...

    రిప్లయితొలగించండి
  71. వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు. ఎంతో వివరంగా మీరు ఇచ్చిన ఈ సమాచారం నాకు దారి చూపిస్తుంది. మీ సహృదయత నాకు ప్రేరణ నిస్తుంది. గతంలో కొన్ని పద్యాలు ఛందోబద్ధంగా వ్రాసి తప్పులు దిద్దించుకున్నాను. ఢిల్లీలో వెంకటేశ్వరా కళాశాలలో ఉన్న పండిత ఏల్చూరి మురళీధర రావు గారు నాకు ఈ విషయంలో మార్గదర్శనం చేశారు. అయితే ఎక్కువ సార్లు కాలేజీ కి వెళ్లటానికి నాకు సమయం కుదరక, అది తాత్కాలికంగా కుంటు పడింది. అనుకోకుండా ఈ బ్లాగు చూడటం తటస్థించింది. దానితో మరల నూతనోత్సాహం ఇనుమడిస్తున్నది. గతంలో అప్పకవీయం (3వ భాగం) - అనే పుస్తకం కొని చదవటం మరియు అర్ధం చేసుకోవటం కోసం ప్రయత్నించాను. కాని వర్క్ అవుట్ కాలేదు. ఇంకా ఏదన్నా సులభంగా ఉపయోగపడే పుస్తకం గురించి వివరాలు తెలియజేస్తే కొనుక్కొని ఫాలో అవుతాను.

    రిప్లయితొలగించండి
  72. కంది శంకరయ్య గారికి,
    నమస్కారములు. మీ బ్లాగు ద్వారా నాకు లభించిన ప్రేరణతో నేను కూడా పద్య రచన సాగిస్తాను. ప్రతి పనికి ఒక లక్ష్యం ఉండాలని నా సిద్ధాంతం. నా తరువాతి పద్యం మీ మీద వ్రాయటానికే ప్రయత్నిస్తాను. మీ అస్వస్థత నుండి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  73. శ్రీ వామన కుమార్ గారూ!
    శుభాశీస్సులు. మీరు పద్యములను మళ్ళీ వ్రాయుటకు పూనుకొనుచున్నారు. సంతోషము. విజయోస్తు. ఛందస్సు గురించి సులక్షణసారము అనే పుస్తకము దొరికితే కొనండి. సులభముగా అర్థమగుతుంది. మరియొక సలహా: నిత్యము ప్రాచీన కవుల పద్యములను చదువుటను అలవరచు కొనండి. ముఖ్యముగా భారతము మరియు భాగవతము చల్ల ఎక్కువగా ఉపకరించును. కందము, తేటగీతి, ఆటవెలది వంటి పద్యములను ఎక్కువగా చదువుచుంటే వాటి లోని గమనము (లయ) మీకు తెలిసిపోతుంది. దాంతో పద్యము రచించుట సులభము అగుతుంది. స్వస్తి

    రిప్లయితొలగించండి
  74. పండిత నేమాని వారికి ధన్యవాదములు. మీరు చెప్పినట్లు సులక్షణ సారము పుస్తకం తెప్పించుకుంటాను. మీ ఆశీర్వాద బలంతో పద్య రచనను సాగిస్తాను.

    రిప్లయితొలగించండి
  75. సర్యౌ ప్రసూతి గృహములు
    సూర్యా పేటందు లేవు
    సూపర్ డ్యూపర్
    మర్యాదగ పుట్టింటన
    భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో

    రిప్లయితొలగించండి
  76. వర్యుడు మన మోడి వలెను
    ధైర్యము స్థైర్యము గొనుచును దార్ఢ్యము తోడన్
    ఆర్యావర్తము నేలగ
    భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో

    రిప్లయితొలగించండి