26, జూన్ 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1714 (సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్.

29 కామెంట్‌లు:

  1. వింతైన మనుషులిచ్చట
    సుంతైనను బాధ లేక సొల్లుకబురులన్
    మంతనముల వ్యస్తులగుచు
    సంతాపసభల్ జనులకు సంతసమొసగున్

    రిప్లయితొలగించండి

  2. అంతము జేయగ ప్రముఖుల
    వింతగ నటియించి తుదకు వెన్నున పొడువన్
    చింతను ప్రకటిం చుటకని
    సంతాప సభల్ జనులకు సంతస మొసఁగున్

    రిప్లయితొలగించండి
  3. కొంతైనను బాధ కలుగు
    సంతాపసభల్ జనులకు, సంతసమొసగు
    న్నెంతటివారల కయినన్
    సొంతంబగు నూరు జూడ సొక్కును మనసే!!!

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అయినా అలాంటి సభలంటే జనులకు ఏవగింపే కాని సంతోషం ఎలా కలుగుతుంది?
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్న్దది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  5. ఎంతో క్రూరుండా నర
    హంతకనరకాసురుండు హతుడై పోవన్
    కాంతుల దీపావళిగా
    సంతాపసభల్ జనులకు సంతసమొసగున్

    రిప్లయితొలగించండి
  6. పంతముతో ప్రతి పక్షము
    గొంతులు కడు జించుకొనుచు కుటిలత్వముతో
    వింతగ చేసెడి దూషణ
    సంతాపసభల్ జనులకు సంతసమొసగున్

    రిప్లయితొలగించండి
  7. సుంతైన బాధనించును
    సంతాపసభల్, జనులకు సంతసమొసగున్
    హంతకుడౌ దుష్టప్రభు
    వంతంబైనను ప్రదేశ మందనిశమ్మున్

    రిప్లయితొలగించండి
  8. పంత మదేలా తుచ్ఛుం
    డంతకు కడకేగినాడు హాయి కదయ్యా!
    వింతయగు వాడి కేగతి
    సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్?

    రిప్లయితొలగించండి
  9. సుబ్బారావు గారి పూరణ

    వింతగఁబల్కిరి యార్యులు
    సంతాపసభల్ జనులకు సంతసమొసగున్
    కొంతైనఁగలదె న్యాయ మ
    వంతీ మరిచెప్పునీవు భయమదిలేకన్

    రిప్లయితొలగించండి
  10. చింతను దెలుపగ ప్రముఖుల
    సంతాప సభలు జనులకు, సంతసమొసఁగున్
    వంతుగ నా పదవిన్ గొన
    పంతమ్మున నభిలషించు బలవంతులకున్!

    రిప్లయితొలగించండి
  11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ ప్రశ్నార్థక పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గంతలు గట్టెడి మాటల
    పొంతనతో దాన ధర్మ పోషణ కొరకై
    వంతుగ బీదల కొసగగ?
    సంతాప సభల్ జనులకు సంతస మొసగున్.
    2.వింతగు నాలోచనలే
    సంతాప సభల్ జనులకు సంతసమొసగున్|
    అంతటి కారణ మేమన?
    చింతందున వస్త్ర,దాన చిత్రము గాంచే|

    రిప్లయితొలగించండి
  13. క్షంతవ్యుడు గాడని నర
    హంతకు డైన గసాబు నంతము సేయన్
    వింతగ పగతురు జరిపిన
    సంతాప సభల్, జనులకు సంతసమొసగున్

    రిప్లయితొలగించండి
  14. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...

    పంతము నూనియుఁ బగతుఁ డ
    నంతునిచేఁ జచ్చినట్టి నరకుఁ దలఁచుచున్
    వింతగఁ గూర్చెడి రాక్షస
    సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్!

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు స్వర్గస్తులైన విషయము కవిమండలికి తెలిసే ఉంటుంది. మరణం సహజమైనదని తెలిసినా, వందలాది సంస్కృత పుస్తకాలను, వాటి వ్యాఖ్యానాలను వెలికి తెచ్చి, అనువదించి, ముందుమాటలు వ్రాసి మన నిధులు మనకు చూపిన కొందరు ప్రముఖుల్లో ఒకరైన వారు వెళ్ళిపోయినా, వారి శ్రమను గుర్తించి నాలుగు మాటలు గొప్పపనులను గురించి కనీసం వినగలిగే సంతాపసభలు ఆయా సాహిత్యాభిమానులకు సంతసాన్నే కలిగిస్తాయి. కాదంటారా?

    ఎంతలు శ్రమలను నా ది
    గ్దంతులు సంస్కృతి సురక్ష ధర్మము గా భా
    వింతురను స్మరణ- వ్యధలో
    సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్.

    రిప్లయితొలగించండి
  16. మహా మహోపాధ్యాయ, సంస్కృత పండితుడు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సంస్కృతాచార్యుడిగా సుపరిచితుడైన పుల్లెల వారు రెండు దజన్లకు పైగా మహా గ్రంథాలను వ్రాశారు. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనదని, ఆదరినీ కలిపెదాని లోకాలను నిలబెట్టేదని మానవులను రక్షించేదని వారు తన హిందూమత గ్రంథం ప్రారంభంలో వ్రాసుకున్నారు. భారత ప్రభుత్వం వారిని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం వారిని గౌరవించి మహా మహోపాధ్యాయ పురస్కారాన్ని అందించింది. వాచస్పతి పురస్కారాన్ని బిర్లా సంస్థ అందించింది. ఈ రెండు పురస్కారాల తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్న పుల్లెల 1927 లో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని ఇందుపల్లిలో జన్మించారు. తండ్రి సత్యనారాయణ శాస్త్రి ఆయన తోలి గురువు. తండ్రివద్దే ఆయన సంస్కృతం నేర్చుకున్నారు. కావ్యశాస్త్ర నాటక సిద్ధాంత కౌముద్యాది అనేక అంశాల్లో నిష్ణాతులయ్యారు. కొంపల్లె సుబ్బరాయశాస్త్రి వద్ద సంస్కృత వ్యాకరణ గ్రంథాలపై వచ్చిన వ్యాఖ్యాన గ్రంథాలను అధ్యయనం చేశారు. చెన్నైలోని సంస్కృత మహావిద్యాలయంలో వేదాంత శాస్త్రం నేర్చుకున్నారు. విశ్వవిద్యాలయంలో సర్వప్రధముడిగా ఉత్తీర్ణులయ్యారు. వేదాంత శిరోమణి ఉపాధిని పొందారు. తెలుగులో విద్వాన్ చదివారు. కాశీలోని హిందూ వర్శిటీలో సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషల నుండి ఎంఎ పట్టాలు పొందారు. ఉస్మానియా వర్శిటీలో సంస్కృత విభాగంలో రస గంగాధరం పై పరిశోధన చేసి పిహెచ్ డి పట్టా పొందారు. ‘డి కంట్రిబ్యూషన్ ఆఫ్ పండిత రాజ టు సంస్కృత పోయిటిక్స్’ అనే గ్రంథం వారికి విశేష ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. పిహెచ్డి పూర్తయిన తర్వాత ఆయన ఉస్మానియా వర్శిటీలో సంస్కృత శాఖలో ఉపన్యాసకుడిగా చేరారు. ఆ శాఖలోనే రీడర్ గానూ, ప్రొఫెసర్ గానూ పదోన్నతి పొందారు. శాఖాదిపతిగా బాధ్యతలు నిర్వహించారు.
    సంస్కృత అకాడమీ సంచాలకుడిగా సేవలు అందించారు. ఆయన లెక్కలేనన్ని గ్రంథాలు, వ్యాసాలూ వ్రాసారు. అందులో ముఖ్యంగా కావ్యశాస్త్ర గ్రంథాలకు ఆయన చేసిన బాలానందిని వ్యాఖ్యానాలు సంస్కృతాంధ్ర సాహిత్యాల అధ్యయన శీలురకు పాధేయంగా నిలిచాయి. పరిశోధకులకు ఆయన ఒక కల్పవృక్షంగా చెబుతారు. వక్రోక్తి జీవితం, కావ్యాలంకారం, కావ్యాదర్శం, కాల్యాలంకార సూత్రం, కావ్య ప్రకాశం చెప్పుకోదగిన గ్రంథాలు. కావ్యదర్శం లోని పీఠిక సైతం తెలుగు సంస్కృత శాస్త్రాల గ్రంథాలు చదివే వారికి ఓ గైడ్ గా నిలిచాయి. ముఖ్యంగా అలంకార శాస్త్ర ప్రారంభం, నాట్యశాస్త్రం, భామహుడు, వామనుడు, ఉద్భటుడు, రుద్రటుడు, ఆనంద వర్ధనుడు, అనినవ గుప్తుడు, కుంతకుడు, మహిమభట్టు, ధనుంజయుడు, మమ్మటుడు, క్షేమేంద్రుడు, రుయ్యకుడు, విశ్వనాధుడు, అప్పయ్య దీక్షితులు, జగన్నాధ పండితరాయలు గురించి వారి అలంకార శాస్త్ర విశేషాల గురించి సంగ్రహంగా అందించిన సమాచారం శాస్త్ర ప్రబోదాలై ఎత్తయిన శిఖరంలో నిలిచాయి. వాల్మీకి రామాయణ బాలానందిని వ్యాఖ్య, ఉత్తరకాండతో పాటు అన్ని కాండలకు సమగ్ర వ్యాఖ్యానం అందించి వ్యాఖ్యాన పితామహుడుగా కీర్తి పతాక ఎగురవేశారు. మల్లెమాల రచించిన మాత్రు సందేశ వ్యాఖ్యానాన్ని విని అదే శైలిలో రామాయణం వ్రాయండి అని ప్రేరణ ఇవ్వడంతో అదే స్ఫూర్తితో మల్లెమాల రామాయణం వ్రాశారు. 1985లో అఖిల భారత ప్రాచ్యవిద్యా పరిషత్ పురస్కారం, 1997లో గుప్తా ఫౌండేషన్ సాహిత్య పురస్కారం అందుకున్నారు. సాహిత్య రత్నాకర, పదమంజరి, సంస్కృత కవి జీవితం, సంగీత చంద్ర, క్రియాస్వర లక్షణ, పారశీక లోకోక్త్య, నీలకంఠదీక్షిత కృషి, పారిభాషేందుశిఖర ఇలా చెప్పుకుంటూ పోతే పుల్లెల వారు రచించిన అనేక గ్రంథాలు లోక ప్రసిద్ధం అయ్యాయి.

    రిప్లయితొలగించండి
  17. పైదంతా నెట్లోంచి స్వీకరించిన సమాచారము. నేను టైప్ చేసినది కాదు.

    రిప్లయితొలగించండి
  18. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘చింతందున’...?
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గార్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నిన్న కూకట్‍పల్లిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన దాశరథి రంగాచార్య, సద్గురు శివానంద మూర్తి, పుల్లెల శ్రీరామచంద్రుడు గారల సంతాపసభకు వెళ్ళి వచ్చాను. ఆ సంతాప సభ మనస్సులో మెదులుతూ ఉన్నందున ఇవాళ్టి సమస్య తయారయింది.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    దాంతులు గతించ జరుగును
    సంతాపసభల్ ;జనులకు సంతస మొసఁగున్.
    సంతత మా పరమాత్మను వే
    దాంతులు వర్ణించ వారి తత్వములు వినన్

    రిప్లయితొలగించండి
  20. వింతగు ప్రవృత్తి గల నర
    హంతకులను బట్టి చంప నతిరేకులకై
    చింతన జరిపెడు దుష్టుల
    సంతాపసభల్ జనులకు సంతసమొసగున్!

    రిప్లయితొలగించండి
  21. గురువులకు నమస్కారములు
    అంటే చెయ్యవలసిందంతా చేసేసి ,మాబాగా కుదిరిందన్నట్టు లోపల సంతోషం ,పైకి మొసలి కన్నీళ్ళు అదన్నమాట .అసల్ సంగతి

    ఇంతకీ నేను బోస్టన్ వెడుతున్నానుగా ! అందుకని మండే వరకు ఉం.... డనూ.......

    రిప్లయితొలగించండి
  22. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *******
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినంజనలు.

    రిప్లయితొలగించండి
  23. అవునా, అయితే అక్కడి విషయాలు ఒక పోస్ట్ గా పెడితే బాగుంటుందనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  24. వింతగ దుష్టుని మరణపు
    సంతాప సభల్ జనులకు సంతసమొసగున్
    ఎంతయొ తామంద శుభము
    సంతోషమౌచు తెలుపరె సర్వులకపుడే

    వింతగ దుర్మార్గు మరణ
    సంతాప సభల్ జనులకు సంతసమొసగున్
    అంతరమందున,బయటకు
    చింతింతు మనియు పలుకుచు చేయరె నటనన్

    ఎంతటి దుష్టుడు నైనను
    చింతింతుము మరణమంద;చేసిన చెడుగుల్
    అంతరమణచుక మదినా
    సంతాపసభల్ జనులకు సంతసమొసగున్

    ఎంతయు కీడుననేమౌ?
    పంతముతో నేతలేమి వాడుక పెడుదుర్?
    అంతమవకీడు నేమగు?
    సంతాపసభల్;జనులకు;సంతసమొసగున్
    (క్రమాలంకారము)

    రిప్లయితొలగించండి
  25. వింతగ ప్రభుతయె మరచిన
    వంతుగ తమ మదిని దలచి పండిత వరులన్
    కొంతైన పొగడ ప్రజలిడు
    సంతాప సభల్ జనులకు సంతసమొసగున్

    రిప్లయితొలగించండి
  26. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణ చివరిపాదంలో ‘షమౌచు’ అని జగణం వేశారు. అక్కడ ‘సంతోషపడుచు’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. చింతలతో సతమతమౌ
    సంతగనై జీవితమ్ము శషభిషలాడన్
    కొంతయు నిశ్శబ్దమొసగు
    సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్

    రిప్లయితొలగించండి


  28. కొంతయు చేసెనకో మా
    కింతైనన్ మేలు నేత! కితకిత జేర్చన్
    వింతగ నభమున కెత్తెడు
    సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. చింతించగ డబ్బు లిచట
    బొంతలలో దాచి పెట్ట పోడిమి యగునే?
    అంతయు మిధ్యయని తెలుపు
    సంతాపసభల్ జనులకు సంతస మొసఁగున్

    రిప్లయితొలగించండి