28, నవంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 542 (దోషకాల మొసంగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
దోషకాల మొసంగు సంతోషగరిమ.
ఈ సమస్యను పంపిన
తాడిగడప శ్యామల రావు గారికి
ధన్యవాదాలు.

61 కామెంట్‌లు:

  1. భాను డస్త్రాద్రి జేరగ ప్రకృతి రాగ
    రంజితంబగు వేళ నార్యాసమేతు
    డై శివుడు తాండవమునాడ నలరు నా ప్ర
    దోష కాలమొసంగు సంతోష గరిమ

    (ఈ సమస్య యొకమారు ఆకాశవాణిలో వచ్చినదే).

    రిప్లయితొలగించండి
  2. భాను డస్తాద్రి గ్రుంకెను బక్షు లెగిరి
    గూళ్ల జేరెను గోధూళిగూడి పశువు
    లింఢ్ల జేరి లేగలకు పాలివ్వ నా ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ

    రిప్లయితొలగించండి
  3. స్నాన జప దాన హోమముల్ సలుపుటకు ప్ర
    దోష కాలము శ్రేష్ఠము.ధ్యాస తోడ
    సలుపు నివి యెవ్వ డాతని నిలిపి, యీ ప్ర
    దోషకాల మొసంగు సంతోషగరిమ.

    రిప్లయితొలగించండి
  4. బాధ్యతలు తీరి జ్ఞాన సంపదలు పెరిగి
    యోగ సాధనలందు వేవేగ సాగు
    చుండ ప్రాయము మళ్ళుచునుండు నా ప్ర
    దోషకాల మొసంగు సంతోష గరిమ

    రిప్లయితొలగించండి
  5. నా పూరణ .....

    విఘ్నములు, కార్యనాశము, వెతల నెన్నొ
    దోషకాల మొసంగు; సంతోషగరిమ
    చేకుఱును తిథి నక్షత్ర శివముహూర్త
    మెంచి కార్యముల్ మొదలిడ, హితము గల్గు.

    రిప్లయితొలగించండి
  6. నేమాని వారన్నట్లు, ఈ సమస్య యొకమారు ఆకాశవాణిలో వచ్చినదే. మా పాఠశాలా దినాల్లో, ఒకసారి మాయింటికి వచ్చిన మా చినమామయ్య శ్రీపాలకోడేటి జగన్నాధరావుగారు యీ సమస్యను నాకిచ్చి పూరించమన్నారు. అదీ నాకీ సమస్యతో పరిచయం. అప్పట్లో మా మామయ్యగారు కొవ్వ్యూరు సంస్కృత కళాశాలలో విద్యాప్రవీణ చదువుతూ ఉండి, అప్ప్పుడపుడు అష్టావధానాలూ చేసేవారు. ఇది వారికొక అవధానంలో ఇచ్చిన సమస్యయని చెప్పారు. అన్నట్లు ఆయనకు ఒకసారి అవధానవిద్యా పురస్కారంగా కళాశాలవారు వ్యాసభారతం 18పర్వాల సెట్ బహూకరించారు.

    రిప్లయితొలగించండి
  7. మింట నిండెను కావిరి మిసిమి, పసుపు
    చంద్ర వంకయు పొడచూపె చవితి నేడు
    మంద గాలియు వీచుచు విందు నిడ ప్ర
    దోష కాల మొసంగె సంతోష గరిమ !

    రిప్లయితొలగించండి
  8. గన్నవరపు వారి 'మందగాలి' సరియైన సమాసం కాదు సంస్కృత (మంద) తెలుగు (గాలి) శబ్దాలకు సమాసం చేయరాదు. తప్పుగాదు కాని 'విందు నిడ' కూడా కొంచెం పంటికింది రాయిలాగే ఉందినాకు. ఈ మొత్తం పాదాన్ని సంస్కరించాలి. మొదటిరెండు పాదాల్లోని హాయైన తెలుగుదనం స్ఫూర్తిగా 'పిల్లగాలలు వీవన విందు జేసి ప్ర' అని మారిస్తే బాగుంటుంది. అయితే, ఇంత మంచి పానకం లాంటి పద్యంలోను ఒక పుడక యేమిటంటే, మొసంగు అన్న సమస్యా పాదంలోని తధ్ధర్మకాలిక పదాన్ని మొసంగె అని భూతకాలానికి మార్చటం. ఈ మార్పు అంగీకార యోగ్యం కాదు కాబట్టి పద్యం మొత్తాన్ని పరిష్కరించి తరిగి ప్రకటిస్తే:

    మింట నిండెడు కావిరి మిసిమి, పసుపు
    చంద్ర వంకయు పొడచూపు చవితి దినము
    పిల్లగాలలు వీవన విందు జేయు ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ !

    గన్నవరపు వారు తమ పద్యాన్ని మరింత రసవత్తరం చేస్తారేమో!

    రిప్లయితొలగించండి
  9. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టిని తలచుకొని నవ్వుకొంటూ
    తనదుభార్యను మరచి చింతామణిఁగని
    చొంగకార్చునమాయక సుబ్బిశెట్టి
    కాలి స్పర్శగాదట వెల యాలి స్పర్శ
    దోష కాల మొసంగు సంతోషగరిమ!
    మనవి: సుబ్బిశెట్టికి + ఆలి = సుబ్బిశెట్టికాలి

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్యామలరావు గారు!
    చి. నరసింహముర్తి గారి పద్యమునకు మీరు మార్పులు సూచిస్తూ చెప్పిన పద్యములో 3వ పాదములో చివర గణ భంగము అవుతోంది. చూడండి.

    రిప్లయితొలగించండి
  11. నేమానివారూ. క్షంతవ్యుడను. కట్ - పేస్ట్ వ్యవహారాల చిక్కులు మామూలే. పరాకు కలిగిస్తాయి. 3వ పాదం లో గణభంగం సరిజేయమన్న సూచన ప్రకారం:
    పాత పాఠం: పిల్లగాలలు వీవన విందు జేయు ప్ర
    క్రొత్త పాఠం:పిల్లగాలుల వీవన విందు గాప్ర

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా!
    ముఖే ముఖే సరస్వతి - ఒకే సమస్యకు ఎన్ని రకముల పూరణలో చూస్తున్నాము.
    శ్రీ రాజారావు గారి పల్లెలో సంధ్యాకాల వర్ణన, శ్రీ చింతా రామకృష్ణారావు గారి నియమ నిష్టలతో కర్మాచరణ, చి. నరసింహమూర్తి చంద్రోదయ వేళ వర్ణన, శ్రీ చంద్రశేఖర్ గారి సుబ్బిసెట్టి సరసాలు. శ్రీ శంకరయ్య గారి మంచి ముహూర్త బలము దాని ఫలము -- ఇప్పటికి అన్నీ బాగుగనే ఉన్నాయి. అందరికి అభినందనలు. శ్రీ శ్యామలరావు చేస్తున్న సూచనలు అందరికి ప్రోత్సాహకరముగా ఉంటున్నాయి - వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మన తెలుగు వారి మనవి: సుబ్బిశెట్టికి + ఆలి = సుబ్బిశెట్టికాలి.
    కాని, యడాగమమే అవుతుందండీ. సుబ్బిశెట్టికి + ఆలి --> సుబ్బిశెట్టికి యాలి. సుబ్బిశెట్టి + కాలి --> సుబ్బిశెట్టికాలి అవుతుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  14. సకల దోషములను బాపి జనన మరణ
    చక్ర మందున భ్రమణము సైతమాపి
    ముక్తి నొసగెడి శివుదేవు పూజలీ ప్ర
    దోషకాల ,మొసంగు సంతోషగరిమ.

    రిప్లయితొలగించండి
  15. నిన్న నేమానివారు కొన్ని సౌందర్యలహరీ శ్లోకాల నుటంకించారు. ఆసక్తి గలవారు సౌందర్యలహరీ శ్లోకములు, ఆంగ్లములో పదముల అర్ధములు, శ్లోకతాత్పర్యసంగ్రహము వెబ్ లో చూడవచ్చును. చిరునామా:

    http://te.girgit.chitthajagat.in/soundarya-lahari.blogspot.com

    సౌందర్యలహరీ గ్రంధానికి శ్రీ తుమ్మలపల్లిరామలింగేశ్వరరావుగారి వ్యాఖ్యాంతో ఒక మంచి పుస్తకం ఉంది. తుమ్మలపల్లివారి శ్రీచక్రవిలసనము కూడా శ్రీవిద్యపై చాలా మంచి వివరణాత్మకమైన పుస్తకం

    రిప్లయితొలగించండి
  16. మందాకినిగారూ, మీరు "శివుదేవు" అన్నారు కాని "శివదేవు" అనటం సాధువు. అలాగే, "శివదేవు పూజలీ ప్రదోష కాల మొసంగు" అనికన్నా మీరు ""శివదేవు పూజచే ప్రదోష కాల మొసంగు" అంటే మరింత సొగసుగానూ ఉంటుంది. అన్వయమూ బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  17. పాతదే అయినా సమస్యను ప్రతిపాదించన వాడను కాబట్టి, నా పూరణ యిదిగో.

    పూలు కొనిపోవు చున్నాడు పూజ కేమొ
    మోహనాంగిని మెప్పించు నూహ యేమొ
    ఎటుల నైనను కానిమ్ము నేటి యీ ప్ర
    దోషకాల మొసంగు సంతోష గరిమ

    అసలు నేను చేసే ధోరణి పూరణ యిప్పటికే నేమాని ప్రభృతులు సెలవిచ్చేసారు. కాబట్టి వేరే రకంగా చేయవలసి వచ్చింది.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా, అది టైపింగ్ పొరపాటు, మొదట శివుని అని రాయబోయి మార్చి ని మాత్రమే కట్ చేసినట్టున్నాను. నిజమే , మీరు చెప్పినది. శివదేవు అనే నా ఉద్దేశ్యముకూడా.
    పూజచే _ మీరు చెప్పినది బాగున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! శ్రీ శ్యామలరావు గారు మరియు శ్రీ చంద్రశేఖర్ గారు
    సుబ్బిసెట్టికిన్ + ఆలు కదా. సుబ్బిసెట్టికినాలు అవుతుంది. యడాగమము రాదు. సుబ్బిసెట్టికాలు అని వదిలేయండి - ఫరవాలేదు.

    రిప్లయితొలగించండి
  20. ఆకసానికి రంగద్ది , యాపయి శశి
    రేఖ దిద్ది ,చిత్రము గీచి లేఖిని మురి
    సె నరసింహ మూర్తీ !విరిసె నహ !మీ 'ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ '

    సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  21. అయ్యా! శ్యామలరావు గారూ మీరు భక్తి మరియు రక్తి కూడా ఏక కాలములో పోషించగల సమర్థులు అని మీ పూరణ చెప్పుచున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అయ్యా రాజారావు గారూ!
    మీ ఆకసానికి రంగద్ది అనే పద్యములో భావము బాగున్నది. 3వ పాదము నడక కుంటుపడినది. ఇలా మార్చితే బాగుంటుంది అనుకొనుచున్నాను:
    సినది నరసింహమూర్తి! విచ్చినది మీ ప్ర

    రిప్లయితొలగించండి
  23. సవరణకు, సూచనలకు ధన్యవాదాలు. అందరూ మూస కట్టు లాగ "ప్ర - దోషకాల మొసగు..." అని పూరిస్తున్నారు. తప్పులేదు. నేను, శంకరయ్య మాస్టారూ వైవిధ్యంగా పూరించే ప్రయత్నం చేశాము. వైవిధ్యంకూడా మల్లెమాలలో కనకాంబరాల్లాగా ఒక అందాన్నిస్తుంది. ఇకపై మిత్రులపూరణలలో దానిని కూడా గమనించి వ్యాఖ్యానించగలరు. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  24. చంద్రశేఖర్ గారి సూచన పరిశీలించదగ్గదే. కొన్ని సమస్యలకు దాదాపుగా ఒకేరకమైన పూరణలు రావటానిక కారణం సమస్య ప్రధమాక్షరాలతో అంతమయ్యే తగిన పదాలు భాషలో తక్కువగా లభించటం. ఇక్కడ,
    ప్రదోష లేదా నిర్దోష అనే పదాలను తప్ప వేరే వాటిని నేను గమనించలేదు. ఇచ్చిన సమస్య తేట గీతి. దీనిలో పాదంచివరి అక్షరం గురువు కావటం అసంభవం. కాబట్టి నిర్దోష అన్నమాటకు పూరణలో స్థానం కలిగించ లేము. తప్పనిసరిగా ప్రదోష అనే పదం వేసియే పూరణ చేయ వలసి వస్తుంది. ఇదంతా ఛాందసంగా నా బోటి వాడు సమస్యను అలాగే పద్యం చివరి పాదంగా ఉంచి పూర్తి చేయాలనుకుంటే.

    శంకరయ్యగారి పద్యంలో సమస్యా పద తోరణాన్ని ద్విధా విభజించి, వాటికి మిగతా పద్యంలో క్రమపూరణలు ఇచ్చి పూర్తి చేసారు. ఇదొక ప్రసిధ్ధ పధ్ధతి. ఇలా విభజన చేసిన సమస్యను పద్యం చివరి పాదంగా యెత్తివేసి లోనికి నెట్టాలని నియమం లేదు - నెట్టినా యేమీ దోషం లేదు కాక లేదు.

    ఐతే, చంద్రశేఖరులవారొక అభినందనీయమైన కొత్త త్రోవ త్రొక్కారు. అసమంజసుడికి అసమంజసకార్యకరణంలో సంతోషం దొరుకుతుందనే చమత్కారంతో పూరణ చేసారు. చాలా మంచి ఆలోచన. వారన్నట్లు వైవిధ్యం తప్పక ఆనందం కలిగిస్తుంది. సందేహం లేదు.

    ఇదంతా ప్రక్కన పెడితే, చంద్రశేఖరులవారి సుబ్బిశెట్టికి "వెల యాలి స్పర్శదోష కాల మొసంగు సంతోషగరిమ" ఇందులో, అభినందనీయమైన చమక్కు గురింవి ముచ్చటించుకున్నాక, ఒక చిన్నదోషం గురించి ఆలోచించవలసి ఉంది. "స్పర్శదోష కాలము" కాదు "స్పర్శాదోష కాలము" అవుతుంది. అందుచేత వారు తమపూరణను పునర్నిర్మించవలసి యుందని మనవి.

    రిప్లయితొలగించండి
  25. ఇది చిత్తగించండి:

    పనికిరాని స్నేహాలతో మనసు చెడగ
    నీతినియమమ్ములు హుళక్కి నిశ్చయముగ
    ధనమె నరులకు సర్వస్వ మనుచు దోచు
    దోషకాల మొసంగు సంతోషగరిమ.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ శ్యామలీయము గారి సవరణకు కృతజ్ఞతలు. శ్రీ రాజారావు గారి ప్రశంసకు అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారి ప్రొత్సాహమునకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  27. శ్యామలీయము గారూ దయచేసి యీ ప్రయత్నము ఎలా ఉన్నదో పరిశీలిస్తారా !

    మింట నిండగ గాషాయ మిసిమి, పసుపు
    చంద్ర వంకయు పొడచూప జవితి దినము
    కలలు మెదలుచు మది రేప నలల నా ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ !

    రిప్లయితొలగించండి
  28. మధుర భావపు కుసుమాలు యెదను పూచె
    పిల్ల తెమ్మెర వలయాలు యుల్ల మలరు
    ఆక శమ్మున అరుణారుణ కాంతు లీన ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ

    రిప్లయితొలగించండి
  29. ఇచ్చిన సమస్య నెంతయు
    ముచ్చటగా మిత్రులెల్ల పూరించిరినే
    మెచ్చితి నెల్లర దీవెన
    లిచ్చితి మున్ముందు మిగుల వృద్ధిని గాంచన్

    రిప్లయితొలగించండి
  30. రాజేశ్వరిగారూ, మీ పద్యం కొంచెం పరిష్కరించాలి. కొన్ని సంధులు మీరు తప్పించుకోలేరు. పైగా 3వ పాదం చివర గణభంగం. నా సవరణలతో :

    మధుర భావాల కుసుమంబు లెదను పూచె
    పిల్ల తెమ్మెర వలయంబు లుల్ల మలరు
    ఆకశమ్మున అరుణారుణ కాంతులం ప్ర
    దోష కాలమొసంగు సంతోష గరిమ

    రిప్లయితొలగించండి
  31. నరసింహమూర్తిగారూ, మీ పద్యంలో కాషాయ మిసిమి అని వర్ణాలను విడిగా చెబుతున్నారా? అయినా యీ మాటలతో సమాసం చేయరాదు. కాషాయం సంస్కృతం. మిసిమి తెలుగు. అలాగే పసుపు చంద్రవంక అంటున్నారు. పసుపుపచ్చని చంద్రవంక అని మీ భావం అనుకుంటాను. పచ్చనిచంద్రవంక అనాలికాని పసుపు చంద్రవంక అనరాదనుకుంటాను. ఇంకా బాగా పసిమిచంద్రవంక అంటే భేషుగ్గా ఉంటుంది. చవితిదినము కన్నా చవితనాడు అన్నది బాగుంటుందని నా అభిప్రాయం. మీది గణం ప్రకారం సరైనదే.

    రిప్లయితొలగించండి
  32. నమస్కారములు శ్యామలీయం గారు.
    సవరణ చేసి నందులకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  33. అక్కయ్య గారూ మీ పద్యము చాలా బాగుంది. ప్రకృతి వర్ణనలంటే మీది అందెవేసిన చేయి.

    రిప్లయితొలగించండి
  34. శ్యామలీయంగారూ, మీ సుదీర్ఘ ప్రతిస్పందన చూసి ఆనందించాను. వైవిధ్యంగా పూరించటం ఒక literary challenge అని కూడా ఒక్కొక్కసారి మన బ్లాగు మిత్రులు పోటీపడి పూరణలు చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇక ఈ రోజు సమస్య విషయం – దోషములు పలు రకములు – అర్థదోషము, అన్వయదోషము, జలదోషము, దృష్టిదోషము, స్పర్శదోషము, సంగమ దోషము, ప్రదోషము, నిర్దోషము, త్రిదోషము (ఆయుర్వేదం), వగైరా. అయితే అన్ని దోషకాలాలూ సంతోష గరిమ నిస్తాయని చెప్పలేము. ఏదో సందర్భం పుట్టించి, గణాలు కిట్టించి ఒక పద్యం వ్రాయవచ్చు. ఉదాహరణకు, పడిసెం పట్టిందని sick leave పెట్టి ఇంట్లో హాయిగా “...జల-దోషకాల మొసంగు సంతోషగరిమ”. అయితే ఒక్కొక్కసారి అన్వయదోషం తగిలి పెడర్థం రావచ్చు. శ్రీ నేమాని మహాశయులు (పెద్దనామాత్యులు) బెత్తం ఝళిపిస్తారని సందేహం, కించిత్తు భయం కూడాను. వారికి గౌరవపూర్వక నమస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  35. అక్కయ్య గారూ, మీ పద్యములో మూడవ పాదములో గణములు యతి సరిపోలేదు. పిల్ల తెమ్మెర సుడులు , పూర్తి తెలుగు సమాసమవుతుంది.


    మధుర భావాల కుసుమంబు లెదను పూయ
    పిల్ల తెమ్మెర సుడులతో ఉల్ల మలర
    నభము వికసింప నరుణపు ప్రభల నా ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ

    రిప్లయితొలగించండి
  36. ముదిత చుట్టి యొసగెడు తాంబులము తోడ
    శంకరాభరణ కవన సభను కవుల
    రసభరిత పూరణల తోడ ప్రధమ యామ
    దోష కాల మొసంగు సంతోష గరిమ !

    రిప్లయితొలగించండి
  37. డా.మూర్తి మిత్రమా! మీ పేరు ప్రక్కన బ్లాగు ఐకాన్ లో వేసిన ఫోటో నే స్ఫూర్తి అనుకొంటున్నాను. అందులో కాషాయ రంగు పరుచుకొన్న విధం అద్భుతం.

    రిప్లయితొలగించండి
  38. తమ్ముల అభిమానమునకు ధన్య వాదములు .వ్రా యాలన్న ఆసక్తే గానీ వ్రాయ గల శక్తి నాకు ఆ దేవి ఇవ్వటల్లేదు ఎప్పడికో నాకా అదృష్టం ?

    రిప్లయితొలగించండి
  39. అక్కయ్య గారూ చక్కగా వ్రాసారు. నేను నిజంగానే మీ పద్యములో సొగసులను ఆనందించాను. మరి చూడండి శ్యామలీయము గారు నాకెన్ని వాతలు పెడుతున్నారో ! పరదేశములో ఉండి తెలుగు మరచి పోనందులకు సంతోషిద్దాము.

    రిప్లయితొలగించండి
  40. నరసింహమూర్తిగారు, 'చవితినాడు' అనేది దుష్టసమాసం కాదండీ. చతుర్ధి అనేది సంస్కృతం. చవితి అన్నమాట తెలుగే, చతుర్ధి నుండి పుట్టిన మాట. అయితే, దినము అనేది దినమ్ అనే సంస్కృత పదమే కదా. కా బట్టి చవితదినము అనేది దుష్టసమాసం . కాని చవితినాడు అనేది సరైన ప్రయోగమే.

    రిప్లయితొలగించండి
  41. శ్యామలీయము గారూ చాలా ధన్యవాదములు

    మింట నిండగ గావియు మిసిమి పసుపు
    చంద్ర రేఖయు పొడచూప జవితి నాడు
    కలలు మెదలుచు మది రేప నలల నా ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ !

    రిప్లయితొలగించండి
  42. నాడు లంకను నడుగిడు నపుడు హనుమ
    వామ పాదమ్ము నుంచెను ప్రథమ ముగను
    యెంచె నిట్టుల సరియగు నెడమ కాలు
    దోషకాల మొసంగు సంతోష గరిమ

    రిప్లయితొలగించండి
  43. చవితి అనేది తెలుగు కాబట్టి చవితి దినము అనకూడదా ? చూడబోతే ' వినాయక చవితి ' అనేది కూడా దుష్ట సమాసమే అనేలా ఉన్నారు . అయినా తెలుగు పదం తరువాత సంస్కృతం రావచ్చని సారు గారికి తెలీదా ? ఒక వేళ చవితి తెలుగే అనుకున్నా , దినం సంస్కృతమే అయినా , తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చు . కాబట్టి చవితి దినము అనవచ్చు . ఇలా వచ్చీ రాని పాండిత్యంతో తప్పుడు పాఠాలు చెప్పడం మహా పాపం . అయ్యా శంకరయ్య గారు , మీ బ్లాగు కి నేనో పాఠకుణ్ణి మాత్రమే నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు . దయచేసి ఇలాంటి తప్పుడు పాఠాల్ని బోధింపజేయకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది .
    - రాం మోహన్ శర్మ .

    రిప్లయితొలగించండి
  44. చాలా ఆలస్యంగా గమనించాను. ఈ అజ్ఞాత గారు నన్ను మహా పాపిని చేయటం చూడటం జరిగింది. నేనేమీ పరమపుణ్యాత్ముడనని భ్రమలో లేను కాబట్టి ఆశ్చర్యపోవటం లేదు. ఎవరిక కైనా అపోహ ఉంటే మన్నించాలి. అజ్ఞాత గారు అనుమాన పడుతున్నట్లు నేనేమీ పాఠాలు చెప్పటం లేదిక్కడ. అలా చెప్పేందుకు నేను కవినీ గాను పండితుడనూ కాను. ఈ విషయం యీ బ్లాగులో వారికి ఇప్పటికే ఒకటి రెండు సార్లు విన్నవించటం జరింగింది. 'నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు'నని అన్నారు అజ్ఞాతగారు. నాకేమీ కవితాధార ఉట్టిపడిపోతోందన్న భ్రమ నాకేమీ లేదు. నాకు పెద్దగా తెలుగురాదని నాకు అజ్ఞాతగారు చెప్పకముందే తెలుసు, బ్లాగుమిత్రులకూ తెలుసు. తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చునన తెలియజేసినందుకు కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  45. సందేహ నివృత్తి కోసం యీ మహాపాపిబిరుదాంకితుడు వెబ్ ప్రపంచాన్ని గాలించటం జరిగింది. " నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర బ్లాగులో యీ క్రింది టపా సందేహనివృత్తి చేసింది:
    http://dracharyaphaneendra.blogspot.com/2009/03/haaramcom_31.html
    సూక్ష్మంగా అక్కడి సమాచారం:
    ఆ.ఫ.:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు.......
    ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. .........
    అజ్ఞాతగారు నాకు పాపవిముక్తి ప్రసాదిస్తారేమో చూడాలి!

    రిప్లయితొలగించండి
  46. శ్యామల రావు గారూ,
    అజ్ఞాతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఇంతకుముందే విజ్ఞప్తి చేసాను. గత కొన్ని రోజులుగా నేనొక సమస్యతో సతమతమౌతూ బ్లాగుకు వచ్చే వ్యాఖ్యలను పరిశీలించలేదు. లేకుంటే ఆ వ్యాఖ్యను అప్పుడే తొలగించి ఉండే వాణ్ణి. ఈ మధ్య మన బ్లాగుమీద అజ్ఞాతల దాడి తరుచుగా జరుగుతున్నది. నిజంగా ఆ రోజు జరిగిన చర్చను నిశితంగా పరిశీలించి ఉంటే అజ్ఞాత అలా వ్యాఖ్యానించి ఉండేవారు కాదేమో? ఆనాటి చర్చావ్యాఖ్యలను అజ్ఞాత పూర్తిగా చదవలేదని కచ్చితంగా చెప్పవచ్చు.

    రిప్లయితొలగించండి
  47. పిల్లికి ఎలుక సాక్ష్యం అని ఒకటుందండి . ఈ పై నుదాహరణ అలాంటిది . ఎందుకంటే పాలాభిషేకం ఖచ్చితంగా తప్పు . అక్కడ సంధి తప్పు . అదేం పాలాభిషేకం అని సవర్ణదీర్ఘసంధి ఎలా అవుతుంది ? కాని మర్రి వృక్షము అనవచ్చు- మర్రి తెలుగు , వృక్షము సంస్కృతం , కాని సమాసం తప్పు కాదు . రూపక సమాసం .
    అక్కడ చెప్పినట్టు సంస్కృతం వచ్చిన తరువత తెలుగు పదం తో సమాసం చేస్తేనే తప్పు అవుతుంది . వృక్ష నీడ . అని అంటే అది తప్పు . రెండు వేరు వేరు పదాలైనప్పుడు , తెలుగు ముందు వచ్చిన తరువాత సంస్కృతం రావచ్చని చిన్నప్పుడే నేర్పించే బేసిక్ పాయింటు .

    పెద్ద కుమారుడు , విన్న వాక్యం , కన్న సాక్ష్యం , తీపి జ్ఞాపకం , మంచి వ్యక్తి , ఇంటి దీపం , జంట కవిత్వం ఇలా ఎన్ని పదాలు చెప్పాలండి మీకు ? అన్నింట్లో తెలుగు దాని తరువాత సంస్కృతం తో సమాసం కాలేదా ?

    సంస్కృతం తరువాత తెలుగు తో మాత్రం సమాసం చేయకూడదని తెలుసు , ప్రాణ గొడ్డము , వానర మూక ఇల్లాంటివి .
    ఇవి తెలీకుండా పాఠం చెప్పినందుకే అలా అన్నాను , ఎవరిని నొప్పించాలని కాదు. కావాలంటే మీరింకో తెలుగు పండితుడిని అడిగి సందేహం నివృత్తి చేసుకొండి . అంతే కాని తెలియని వన్ని తప్పులు అనడం తప్పే .
    అన్నట్టు నేను అజ్ఞాత కాదు - నా పేరు రాం మోహన్ శర్మ అని పైనే చెప్పాను . వృత్తిరీత్యా తెలుగు పండితుడిని కాదు కానీ అభిమానం ఈ బ్లాగు రెగ్యులర్ గా చదువుతాను . ఇంక ఇంతకంటే చెప్పడం న వల్ల కాదు. శంకరయ్యగారికి , మనసు నొచ్చుకుని ఉంటే క్షమించండి

    రిప్లయితొలగించండి
  48. అజ్ఞాత/రాం మోహన్ శర్మగారూ, నా పరిమితులు నాకూ, అందరు బ్లాగు సభ్యులకూ చక్కగా తెలుసు కాబట్టి పాఠం చెబుతున్నానుకోరెవరూ. అలాగే పెద్దలను సంప్రతిస్తాను. నన్ను మహాపాపి అంటే అన్నారు కాని, డా. ఆచార్య ఫణీంద్రగారిని మీరు యెలక అనటం వింతగా ఉంది. ఈ చర్చ సమాప్తం.
    శంకరయ్యగారు: మన్నించాలి, అజ్ఞాతగారు ముఖ్యమైన చర్చనీయాంశం లేవనెత్తినందువలనే నేను స్పందించాను. ఒక రకంగా ఇది నాకు మనస్తాపం మిగిల్చింది. నావల్ల మరొక పెద్దమనిషికి చెడ్డమాట తగిలింది. ఇక ముందు మరింత జాగ్రత్త తీసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  49. గురువుగారూ,

    నాదొక చిన్న సందేహము. పైన జరిగిన చర్చలో చూస్తే, తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చు కానీ సంస్కృత పదము తరువాత తెలుగు పదముతో సమాసము చేయలేమనివుంది.

    అప్పుడు, "పాలాభిషేకము" అనే సమాసములో "పాలు" తెలుగు పదము, "అభిషేకము" సంస్కృతపదము కదా, మరి ఎందుకు ఇది దుష్టసమాసము అయింది?? వివరించ వలసినదిగా ప్రార్థన. లేదా తెలుగుపదాలతోటి అన్యభాషా పదాలతో (సంస్కృతపదాలతో కూడా ) సమాసమెప్పుడూ దుష్టసమాసమేనా??

    గురువుగారూ, చర్చను తప్పుదోవ పట్టించేలా వుంటే ఇంకెప్పుడైన సందేహనివృత్తి చేసుకొంటాను. ఇంది ఇంతటితో వదిలేద్దాం.

    రిప్లయితొలగించండి
  50. సంపత్కుమారులవారూ, సంస్కృతాంధ్రపదాలను యేక్రమంలోనూ కలిపి సమాసం చేయరాదని అలాచేస్తే దుష్టసమాసమని నేనూ, అలాగాక తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చునని శ్రీ రాం మోహన్ శర్మగారూ అభిప్రాయ పడ్డాము. వాడి-వేడి ప్రక్కన పెడితే, యీ విషయంలో అందరకూ ఆసక్తి ఉంది. అపండితుడనైన నేను కూడా పెద్దలను అడిగి నిష్కర్ష చేసుకోవా లనుకుంటున్నాను. వాదనకు కాదు, అలా చేయటం వలన నా భాష మరింత పరిపుష్టం అవుతుందని.

    రిప్లయితొలగించండి
  51. సంపత్కుమారులవారూ,
    పాలు + అభిషేకము --> పాలాభిషేకము సవర్ణదీర్ఘ సంధి. ఇది చెల్లదు.
    ఇలా, తెలుగు సంస్కృత పదామధ్య సంధి చేయటం కుదరదు.
    సవర్ణదీర్ఘ సంధి కేవలం రెండు సంస్కృతపదాల మధ్య జరిగే సంధి.

    రిప్లయితొలగించండి
  52. శ్రీ శ్యామలీయమ్ గారు శ్రీ రామ్ మోహన శర్మ గార్లు
    కొద్దిగా సంయమనం పాటిస్తే వారి చర్చల ద్వారా మిత్రులందరికీ
    అమూల్యమైన భాషా జ్ఞానాన్ని అందించిన వారవుతారు.

    రిప్లయితొలగించండి
  53. ఈ చర్చను ఆలస్యంగా ఈరోజే (24-05-2012) చూసాను.
    రాంమోహన శర్మ గారి వాదన కొంత వరకు పండితులు అంగీకరించిందే. అయితే అది పూర్తిగా ఆమోదయోగ్యమయిన వాదన కాదు. "’పాలాభిషేకం’ సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి తప్పు - అంతే కాని, తెలుగుపై సంస్కృతం రావడం వలన కాదు" అన్నారు. మరి ఉత్వ సంధి చేసి .. ’పాలభిషేకం’ అంటే సాధువవుతుందా? ’నల్ల బంగారం’ను ’నల్ల స్వర్ణం’ అంటే బాగుంటుందా? ఇవన్నీ తెలుగు సారస్వత రంగంలో -నిక్కచ్చిగా ఉండే పండితులకు, కొంత ఆధునిక దృష్టితో వెసులుబాటు కోరుకొనే పండితులకు మధ్య ఫలితం తేలకుండా జరిగే చర్చనీయాంశాలు. శ్రవణ సుభగమైతే కొన్ని సార్లు తెలుగుల మీద సంస్కృతాలను కొందరు పండితులు ఆమోదిస్తున్నారు. అందులో నేనూ ఒకణ్ణి. ఎందుకంటే నా దృష్టిలో భాష - నిశ్చల పర్వతం కాదు .. ప్రవహించే జీవ నది. ఈ విషయాన్ని పండితులంతా గమనిస్తే మంచిది.
    అంతో.. ఇంతో పాండిత్యం గల రాంమోహన శర్మ గారు పిల్లులు, ఎలుకల సామెతలు చెప్పడం శోభించదు.

    రిప్లయితొలగించండి