4, నవంబర్ 2011, శుక్రవారం

చమత్కార (చాటు) పద్యాలు - 133

బ్రాహ్మణులను బ్రతికించిన లెక్క యుక్తి
సీ.
తార్కికుల్ నలుగురు, తస్కరు లేవురు,
శ్రోత్రియు లిద్దరు, చోరుఁ డొకఁడు,
భూసురుల్ ముగ్గురు, ముడియవి ప్పొక్కఁడు
సకలార్థనిపుణుఁడు శాస్త్రి యొకఁడు,
యల్లాపు లిద్దఱు, యాచకు లిద్దఱు,
బరివాండ్రు ముగ్గురు, బాపఁ డొకఁడు,
ఆగడీ లిద్దఱు, ఆరాధ్యు లిద్దఱు,
దుష్టాత్ముఁ డైనట్టి దొంగ యొకఁడు,
తే.గీ.
అరసి వారల నొక శక్తి యశనమునకు
సగము గోరఁగ, నవసంఖ్య జగతిసురుఁడు
చెప్ప, దొంగలు హతమైరి, చేటుదప్పి
విజయ మందిరి యావేళ విప్రు లెల్ల.
ఈ పద్యంలోని కథ ....
కొందరు బ్రాహ్మణులు అడవిలో వెళ్తుంటే దొంగలగుంపు అడ్డగించింది. ఎంత బతిమాలినా వదలలేదు. దొంగలు ఆ బ్రాహ్మణులను దగ్గరే ఉన్న శక్తిగుడికి తీసికొనివెళ్ళి బాధించడం మొదలుపెట్టారు. ఇంతలో గుడిలోని మహాకాళి ఘోరాకారంతో ప్రత్యక్షమై "మీలో సగంమంది నాకు బలి కావాలి. లేకుంటే మమ్మల్నందరినీ భక్షిస్తా" నన్నది. దొంగలు పదిహేనుమంది. బ్రాహ్మణులూ పదిహేనుమంది. అందువల్ల ‘బలికావలసిన పదిహేనుమంది ఎవరు?’ అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు బ్రాహ్మణులలో ఒక యుక్తిశాలి "అమ్మా! నీవు పూర్తిగా బ్రాహ్మణులను కాని, పూర్తిగా దొంగలను కాని బలితీసుకొనడం ధర్మం కాదు. మేమంతా నీముందు వరుసగా నిలుచుంటాము. నీవు లెక్క ప్రకారం ప్రతి ఆవర్తనంలో తొమ్మిదవవాణ్ణి బలి తీసుకో" అన్నాడు. శక్తి సమ్మతించింది. దొంగలూ సరే అన్నారు. అతడు చెప్పిన ప్రకారం అందరూ వరుసగా నిలుచున్నారు. ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడు దొంగే అయ్యాడు. అది అతని గణితశాస్త్ర కౌశలం. ఆ విధంగా పదిహేను ఆవర్తనాలలో పదిహేనుగురు దొంగలు బలి అయ్యారు. బ్రాహ్మణులంతా మిగిలారు.
అతడు బ్రాహ్మణులను, దొంగలను నిలబెట్టిన వరుసక్రమం ఇది ...
(X - బ్రాహ్మణుడు; O - దొంగ)
XXXX OOOOO XX O XXX O X OO XX OOO X OO XX O

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)

10 కామెంట్‌లు:

  1. మైత్రేయి గారూ,
    ‘ఏను’ శబ్దానికి నేను, ఐదు అనే అర్థాలున్నాయి. ఐదుగురు అనే అర్థంలో ‘ఏనుగురు’ వ్యాకరణకార్యం వల్ల ‘ఏగురు’ అవుతుంది.
    ‘అపదాద్యంబయి యసంయుక్తం బయిన గకారంబునకు వకారంబు విభాష నగు’ అనే సూత్రం వల్ల ‘ఏగురు - ఏవురు’ అవుతుంది.
    ‘ఏడుగురు’ అన్నప్పుడు ‘డు’ లోపించి ఏగురు (ఏవురు) కాదు.

    రిప్లయితొలగించండి
  2. మన తెలుగు - చంద్రశేఖర్శుక్రవారం, నవంబర్ 04, 2011 8:17:00 PM

    మాస్టారూ, మంచి లెక్కని సమస్యరూపంలో ఇచ్చారు. ఇదీ, కంద పద్యం గణాల కాంబినేషన్ చూస్తుంటే Computer Science లో Combinatorics అనే సబ్జెక్టు గుర్తుకొస్తోంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మొత్తం ముప్పై గళ్ళు గిసి లేక్కేడుతూ ప్రతి తొమ్మిదవ ఖాళి గడిలో ఒక దొంగ ని నిలపెట్టి మిగిలన గళ్ళలో బ్రాహ్మలు నిల్చుంటే సరి.
    మొత్తానికి ఎలా పరిష్కరించారో అర్థం చేసుకోవడానికి పావుగంట పట్టింది. హ్మం బాగుంది

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ అద్భుతమైన గణితా కవిత్వం! కవిత్వ గణితం!

    రిప్లయితొలగించండి
  5. మన తెలుగు - చంద్రశేఖర్శుక్రవారం, నవంబర్ 04, 2011 10:54:00 PM

    ఇందులో నవ సంఖ్య అనే ఎందుకన్నాడో పాఠకులేమనుకొంటున్నారో తెలుసుకోవాలనివుంది.

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! బావుంది ! ఇటువంటిదే
    పూర్తిగా చిక్కు లెక్కలతోనే ఒకాయన పుస్తకం వ్రాసినట్లు ఎప్పుడో చదివాను !
    పేరు గుర్తులేదు !
    సరస్వతీ గణితమో లేక
    భాస్కర గణితమో ? కాదూ
    లీలావతీ గణిత మనుకొంటాను !

    రిప్లయితొలగించండి
  7. అద్భుతం. భాషపై మక్కువ పూర్తిగా} నశించిపోతున్న ఈ రోజుల్లో, ఇలాంటి} వాటి ద్వారా} ఆసక్తి} పెంచవచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘు గారూ,
      ధన్యవాదాలు. పనుల ఒత్తిడి వల్ల ఆ శీర్షికను కొనసాగించలేకపోయాను.వీలైతే మళ్ళీ తొందరలోనే ప్రారంభిస్తాను.

      తొలగించండి