28, నవంబర్ 2011, సోమవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/4

                    అయ్యప్ప కథాగానం - 1/4

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


మెరుపుతీగను బోలు మేని హొయలును చూపి
        రతిని మించిన సుందరాంగియై కనిపించి
        భస్మాసురుని దృష్టి తనవైపు తిప్పింది || భస్మా ||
ఆమె పొందును కోరుతూ - రాక్షసుడు
        ప్రాధేయపడె నంతట - మోహాన
"నాకు దీటుగ నాట్యమే - చేయరా
        సొంతమౌతా" నందిలే - మోహిని


దేవతలు యక్ష గంధర్వ కిన్నరు లంత
        అతివిస్మయంతోడ వీక్షించుచుండగా
        తాధిమ్మి తకధిమ్మి నాట్యమే చేసారు || తాధిమ్మి ||
వివిధభంగిమ లొప్పగా - తనచేయి
        తలపైన పెట్టుకొనెను - మోహిని
ఆమెనే అనుకరిస్తూ - తనచేయి
        తలపైన పెట్టుకొనెనే - రాక్షసుడు || శ్రీకరం ||


వరము మరచి చేయి తలపైన పెట్టుకొని
        భగభగా భగ్గుమని మంటలే లేవగా
        భస్మాసురుడు కాలి భస్మమై పోయాడు || భస్మా ||
విపరీత బుద్ధితోడ - రాక్షసుడు
        తనకు తానై చచ్చెనే - దుష్టుడై
మోహినీవేషమ్ముతో - విష్ణువు
        శంకరుని కాపాడెను - యుక్తితో


మోహినీ రూపలావణ్యాలు తిలకించి
        మోహాలు రేపు కనుసైగతో పులకించి
        మరుని చంపిన హరుడు మరులు గొన్నాడు || మరుని ||
కామదేవుని బాణము - తగులగా
        మోహినిని మోహించెను - శంకరుడు
విష్ణువే ప్రకృతి కాగా - శివుడేమొ
        పురుషుడై పొందినారు - సుఖములను || శ్రీకరం ||


మోహినీరూపుడగు శ్రీమహావిష్ణునకు
        లయకారకుండైన ఆ పరమశివునకు
        అతిసుందరుండైన బాలుడే కలిగాడు || అతి ||
మహిషిని సంహరించే - హరిహరుల
        కొడుకు జన్మించె ననిరి - దేవతలు
దివినుండి పూలవాన - కురిపించి
        సంబరాలే చేసిరి - అందరు


ఉత్తరాయణ పుణ్యకాలాన ఉత్తరా
        నక్షత్ర పంచమీ శనివారమందున
        వృశ్చికలగ్నాన జన్మించె నా శిశువు || వృశ్చిక ||
విష్ణు వొక మణిహారము - బహుమతిగ
        శిశువు మెడలో  వేసెను - ప్రేమతో
ధర్మాన్ని శాసించగా - జన్మించె
        ధర్మశాస్తా అందుము - అనె బ్రహ్మ || శ్రీకరం ||


ఆ ధర్మశాస్తా తనతండ్రి శివునితో
        కైలాసమే పోయి అక్కడే పెరిగాడు
        గణపతి సుబ్రహ్మణ్యుల తమ్ముడై ఎదిగె || గణపతి ||
భూతాలు ప్రేతాలకు - అతనిని
        అధిపతిగ చేసినాడు - శంకరుడు
భూతనాథుం డనుచునూ - దేవతలు
        కీర్తించి సేవించిరి - అప్పుడు


మంతతంత్రాది విద్యావిశారదు డైన
        నేపాళదేశ రాజైన పళింజ్ఞన్ కు
        పుష్కళాదేవి అను కూతురే ఉన్నాది || పుష్కళా ||
మరణమ్ము లేకుండగా - కాళికి
        కన్నెలను బలి ఇచ్చును - ఆ రాజు
శంకరుని భక్తురాలు - కన్నికను
        బలి ఇవ్వబోయినాడు - ఒకసారి || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

1 కామెంట్‌:

  1. అయ్యప్ప స్వామి కధని ఎంతో వివరం గా చక్కగా తెలియ జెప్పి నందుకు ధన్య వాదములు తమ్ముడూ !

    రిప్లయితొలగించండి