7, అక్టోబర్ 2012, ఆదివారం

పద్య రచన - 135

నన్నయ
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. సరస కవిత్వ తత్త్వ విలసన్నిధి నన్నయభట్టు వాక్ప్రభా
    కరుడు మహాత్ముడాదికవి ఖ్యాత చరిత్రుడు భారతాఖ్య కా
    వ్యరచన బూని చేసెను సమర్థముగా తొలి మూడు పర్వముల్
    వరమతి నమ్మహాశయుని ప్రస్తుతి చేయుచు నంజలించెదన్

    రిప్లయితొలగించండి
  2. నన్నయ్య తెలుగు కవులకు
    అన్నయ్యై నిలఛి నాడు ఆదికవాయెన్
    వన్నెగ నిలచును భువి తెలు
    గున్నంత వరకు నిజము రోరన్నయ్యా !

    రిప్లయితొలగించండి
  3. శారద భిక్షగా నిడిన సత్తువ గల్గిన పండితుండుగా,
    భారతకావ్యమున్ తొలుత పామరులెల్ల పఠించురీతిలో,
    దా రచనల్ మహా దృఢత దాల్చిన నిష్ఠను బూనిజేసెనే,
    బారులు దీరి వందనము భక్తిని జేయగ రండు రండికన్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వావ్ !

    నన్నయ్య తెలుగు కవులకు
    అన్నయ్యై నిలఛి నాడు ఆదికవాయెన్

    రిప్లయితొలగించండి
  5. ముందుగా శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి చక్కని పద్యం చెప్పినందుకు శుభాభినందనలు తెలియ జేస్తూ...

    నన్నయ్యను భవ్యంబుగ
    నన్నయ్యగ చిత్రించిన నీదగు వైనం
    బెన్ని విధంబుల పొగడుదు
    నన్నయ్యా! హనుమశాస్త్రి! యనవరత హితా!

    రిప్లయితొలగించండి
  6. నా పూరణః

    వేద శాస్త్ర సారములకు వీలు చిక్కు రీతిలో
    భేదములను తెలుపుచూ ప్రబంధమే రచించి యు
    న్నాదికవి యటంచు, నన్నయాఖ్య నామధేయుడౌ
    జోదునే స్మరింతుమిచట చూడ వేడ్క రాఘవా!

    రిప్లయితొలగించండి
  7. ఆది కవిగను బేరొం ది యాంధ్ర మందు
    రచన జేసితి వీ వ భా రతము న న్న
    యార్య ! వందన మొనరిం తు నయ్య !గొనుము
    శబ్ద శాసన ! కవివర ! సత్క వీం ద్ర !


    రిప్లయితొలగించండి
  8. వరపదబంధమాలికలు పాదములందు ప్రసిద్ధసూక్తులన్
    జొరనిడి సంస్కృతాంధ్రపదసోయగముల్ కవితావిశేషమై
    పరమము వేదసారమగు భారతమున్ తెనిగించి యాద్యుడై
    పరగుచునున్న నన్నయకపారనమస్సులనందజేసెదన్.

    రిప్లయితొలగించండి
  9. రాజరాజ నరేంద్రు కోర్కున వ్రాసి భారత గాథలన్
    మోజుదీర్చెను రాజుగారికి మోదమబ్బెడు రీతిగన్!!
    జాజి, మల్లెల హారమట్లుగ జాలు వారెడు పద్యముల్
    తేజరిల్లుచు, నోళ్ళ నానుచు దెచ్చె పేరును నన్నయా!

    శబ్ద శాసనుడన్న పేరుకు సార్థకత్వము గూర్చుచున్
    అబ్ధి బోలిన యాంధ్ర భాషకు వ్యాకృతిన్ తొలి వ్రాయుటన్
    లబ్ధి గూర్చెనఖండ వాణికి; గ్లౌ శుభాన్వయజాత ప్రా
    రబ్ధ కావ్యము నొజ్జవై తగ వ్రాసె మూడగు పర్వముల్!!

    * గ్లౌ శుభాన్వయజాత - పాండవులు

    రిప్లయితొలగించండి


  10. రాజనరెంద్రు యర్థన చేత తెలుగున
    భారత రచనకుపక్రమించి
    ఆంధ్ర కావ్యమ్ముల కాద్యుడవై వెలసి
    మార్గదర్శివి యైన మహితమూర్తి
    గాసట బీసటగానున్న తెలుగుప
    ల్కుల కొకతీరు తెన్నులను జూపి
    పాండితీగరిమయు ,భావనా శక్తియు
    మధురకవితా ధార మానితముగ
    భారతీయ సద్ధర్మ ప్రచార సహిత
    మహితనీతి ప్రబోధనాత్మకము గాను
    బహుళ శాస్త్ర విజ్ఞాన సంభరితముగను
    నేటి కిని గూడ వర్ధిల్లు నీదు రచన.

    రిప్లయితొలగించండి
  11. శ్రీకారముఁజుట్టెనతం
    డాకారమునొందభారతాంధ్రీ కరణం,
    బాకాశంబునతారక
    లాకారములున్నదాక రాజిలుకవిగా!

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులు శ్రీ లక్కరాజు గారికి వామనకుమార్ గారికి ధన్యవాదములు.
    చక్కని పద్యములు వ్రాసిన కవిసత్తములందరకూ అభినందనలు.
    నన్నయ్య మీద కవితలు
    మిన్నగ నే వ్రాసినట్టి మిత్రులు మీకున్
    చెన్నుగ మిన్నులనుండే
    అన్నన్నయ రచన శైలి నందించునుగా !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులందరికీ శుభాశీస్సులు.

    చాల ముచ్చట గొలిపే పద్యములు ఈనాటి ఈ బ్లాగునకు వన్నెలు దెచ్చినవి.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    ఆదికవి గారికి చేసిన స్తుతి ఉత్తమముగ నున్నది. 2వ పాదములో "ఆదికవాయెన్" అనెడి ప్రయోగము సరికాదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము:
    "అన్నయ్యై యాదికవిగ నలరారె కదా" అని.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
    చక్కని ఉత్పలమాలను సమర్పించేరు ఆ సరస్వతీ భిక్ష నొందిన పండితునికి. పద్యము అత్యుత్తమముగ నున్నది.

    శ్రీ మారెళ్ళ వామన కుమార్ గారు:
    శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారిపై మీరు చెప్పిన పద్యము బాగున్నది. 2వ పాదములో యతి మైత్రి లేదు. అలాగే 6వ గణము "భగణము" వేయుట సరికాదు.
    మీ ఉత్సాహ వృత్తము చాల బాగున్నది. భేదములను తెలుపుచూ అని వాడేరు; భేదములను తెలుపుచున్ అని మార్చుదాము. ఉత్తమముగా నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారూ:
    శబ్దశాసనునికి వందనము అనుచు చెప్పిన పద్యము అందముగా నున్నది.

    శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు:
    వేదసారమగు భారతమున్ తెనిగించిన నన్నయ్యకు నమస్సులు అని చెప్పిన పద్యము సొంపుగా నున్నది. సంస్కృతాంధ్ర పద సోయగముల్ అనే సమాసములో "సోయగముల్" అనే దేశ్యమును చివరి పదముగా వాడుటచే సమాసము వైరి సమాసము అయినది. దాని ఇలాగ మార్చుదాము: సంస్కృతాంధ్రముల సోయగముల్ అని.

    చి. రాంభట్ల వేంకట రాయ శర్మ:
    నాయనా! నీ 2 మత్తకోకిలములు రమణీయముగా నున్నవి.
    శబ్దశాసనుడన్న పేరుకు - అనే చోట పేరుకు బదులుగా నామము సార్థకత్వము నొందగా - అని మార్చుదాము. ఆఖరి పాదములో "నొజ్జవై"కి బదులుగా "నొజ్జయై" అని మార్చుదాము.

    డా. కమనీయము గారు:
    విపులమైన సీస పద్యము చాల భావ సౌష్ఠవముతో శోభిల్లుతూ నున్నది.
    రాజ నరేంద్రు యర్థనలో యడాగమమునకు బదులుగా నుగాగమము చెయ్యాలి.
    2వ పాదములో చిన్న పొరపాటు సవరించాలి: "ఆద్యుడవై వెలసి" - అనుటలో గణభంగము.

    శ్రీ సహదేవుడు గారు:
    ఆంధ్రీకరణమునకు శ్రీకారము చుట్టిన ఆదికవిని స్తుతించుచూ చెప్పిన అందమైన కంద పద్యము ప్రశంసనీయముగా నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. ఆదికవికి ప్రణతులర్పింతు భక్తితో
    తెలుగుభాష నెంతొ తీర్చిదిద్ది
    యంత భారతంబు నాంధ్రీకరించంగ
    నుద్యమించినట్టి యున్నతునకు.

    రాజరాజు కోర రమ్యాతిరమ్యంపు
    ఫణితి భారతంబు పలుక దలచి
    శబ్దజాల మపుడు సంస్కరించినయట్టి
    నన్నయార్యఘనుని సన్నుతింతు.

    సురుచిరంబులైన సూక్తులనిధి యౌచు
    రమ్యమైన యక్షరంబులుంచి
    క్రమత మథురములగు కథలతో నిండిన
    కైత లల్లినట్టి ఘనుని గొల్తు.

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ మీ పద్యాన్ని ఇప్పుడే చూశాను మెచ్చుకోకుండా ఉండలేను.

    శ్రీకారముఁజుట్టెనతం
    డాకారమునొందభారతాంధ్రీ కరణం,

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమః
    గురువర్యులకు వందనములు మరియు ధన్యవాదములు.అలాగే కవిమిత్రులు శ్రీలక్కరాజుగారికి క్రింది విధంగా ధన్యవాదములు:

    మెరుపు మెరయంగ పద్యము
    న రసహృదయులై వచించు నాణ్యతగురయన్
    వరమది నొసంగె దేవుడ
    లరెడు గుణంబిచ్చి 'లక్కరాజా' మీకున్!

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారు చెప్పినట్లు ఈనాటి పద్యరచన శీర్షిక శోభాయమానంగా ఉంది కవిమిత్రుల చక్కని పద్యాలతో... అందరికీ ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఖ్యాత చరిత్రుడైన నన్నయను గురించి ప్రశస్తమైన పద్యాన్ని రచించి మనోల్లాసం కలిగించారు. ధన్యవాదాలు.

    సరస కవిత్వ వాగ్విభవశాలివి నీవు ముదమ్మున్నన్ ప్రభా
    కర వరవంశ్యు రాముని యగణ్యగుణోత్తము సత్కథాఖ్య కా
    వ్య రచన జేసి సాధుజను లందరు మెచ్చగ గీర్తి గాంచితే
    వరమతి నెల్లవేళలను బ్రస్తుతి చేయుచు నంజలించెదన్.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారు, లక్ష్మీదేవి గారు, మారెళ్ళ వామన కుమార్ గారు, సుబ్బారావు గారు, సంపత్ కుమార్ శాస్త్రి, రాంభట్ల వేంకట రాయ శర్మ గారు, కమనీయం గారు, సహదేవుడు గారు ఒకరిని మించి ఒకరు మనోహరమైన పద్యాలు రచించారు. అందరికీ అభినందనలు. నేమాని వారు వ్యాఖ్యానించిన కారణంగా నేను వేరు వేరుగా వ్యాఖ్యలు పెట్టలేదని గమనించ మనవి. వారి అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. వారికి ధన్యవాదాలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పద్యాలలో ఆదికవి నన్నయ భారతాంధ్రీకరణం, శబ్దానుశాసనత్వం, నానా రుచిరార్థ సూక్తినిధిత్వం, అక్షర రమ్యత, ప్రసన్న కథాకలితార్థయుక్తి మొదలైన అంశాలు ప్రస్తావించబడ్డాయి. మధురమైన పద్యాలు. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన కుమార్ గారూ,
    మీ మొదటి పద్యంలో రెండవ పాదాన్ని ఇలా సవరిద్దాం... ‘అన్నయ్యగ జేసి చూపు శ్రేష్ఠమగు నీ వైనం..’
    రెండవ పద్యములో ‘రచించుచూ’ అన్నదానిని ‘రచించుచున్’ అందాం. ‘రచించియు/న్నాదికవి..’ ని ‘రచించువా/డాదికవి...’ అందాం.
    *
    కమనీయం గారూ,
    ‘రాజనరేంద్రు యర్థన చేత’ను ‘రాజనరేంద్రు ప్రార్థనచేత’ అంటే ఇంకా బాగుంటుందని నా సలహా.
    *
    లక్కరాజు వారూ,
    మీ బ్లాగ్మిత్రుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నేమాని వారికీ, శంకరార్యులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా సహదేవుడు గారూ మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  20. పండిత శ్రీ నేమాని వారికి, మా హెడ్మాస్టారు శ్రీ శంకరయ్యగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. జయమున్ యాంధ్రము జేసి వి
    జయు సహజన్ముల నరణ్య చారులు గన్ వీ
    డి యరిగె కైలాసము న
    న్నయ! యా యనఘుకున్ ప్రణతులీ పదముల్

    రిప్లయితొలగించండి


  22. పండితవర్యుల సవరణలు గమనించాను.వాటిని పాటిస్తాను.

    రిప్లయితొలగించండి