28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 126

నేఁడు గుఱ్ఱం జాషువా జయంతి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. కాకిగ తలచిన చోటనె
    కోకిలగా తాను మారి గొప్పగ నిలచెన్
    ఓ 'కవికోకిల" యిలలో
    నీ కవితలు నిలచు తెలుగు నిలబడు వరకున్.

    రిప్లయితొలగించండి
  2. జన హృదయమ్ములలో నిలి
    చిన కవివర్యుండటంచు జేజేలిడుదున్
    మన జాషువాకు సాదృతి
    మనముల నవ్వాని కవిత మను నెల్లెడలన్

    రిప్లయితొలగించండి
  3. జాషువ కవితలు వ్రాయగ
    నాషామాషీ యటంచు ననిరా రల్పుల్
    దోషము లెంచుచు నవియ వి
    శేష ఖ్యాతిని గొనంగ సిడిముడి పడుచున్.

    ఖండ కావ్యములును గబ్బిలంబును ఫిర-
    దౌసి కావ్య ఘోష వ్రాసె నెన్నొ
    బడుగు జీవి యల్ప బ్రతుకు చిత్రములను
    గీసి పొందె తనదు కృతుల కీర్తి.

    రిప్లయితొలగించండి
  4. http://www.logili.com/home/search?q=jashuva

    అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
    http://www.logili.com/

    మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
    review@logili.com

    రిప్లయితొలగించండి

  5. ఖండ కావ్యాల సంపుటి దండి గాను

    రచన జేసిన గుఱ్ఱము రమ్య కవియె

    నతులు సేతును నీ కెన్నొ నమ్రుడ నయి

    అందు కొనుమయ్య ! జాషువ ! వంద నాలు .

    రిప్లయితొలగించండి
  6. కొంచెపు బుధ్ధులు కొందరు
    పంచముడని పరిహసింప పాటింపకనే
    మంజుల కవితల మనకం
    దించిన జాషువ మనకవి తిలకుడు కాడే!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గురువులకు, పెద్దలకు
    ప్రణామములు!

    విద్యాధికారులే విద్యాధికారులై వెలికిఁద్రోచిననాఁడె పలుక నేర్చె
    “పంచమస్వర” మని క్రించులాడినఁ గూడఁ బంచమస్వరమునే పంచిపెట్టె
    “ఏ కుల?” మన్నచో “బాఁకునఁ గ్రుమ్మిన” ట్లనిపించి, తీవ్రవేదనను గూరె
    సరసోక్తిసరణుల శారద చరణాల గరగరల్ పచరించెఁ గావ్యవితతి

    నాల్గు పడగల హైందవ నాగరాజు
    కాటువైచిన గుండెల నోటువడక
    సుధలు వర్షించి; యార్తుల వ్యధలు మాన్పు
    జాషువా జాళువా పల్కు జగతిఁ గుల్కు.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  8. శ్రీజాషువా కవిశ్వరా!
    తమరు జూపిన దారిలో గమన ముంచి
    కమ్మ నైనట్టి కావ్యాల గరిమ దెలిసి
    శంకరార్యులభాగ్యానశక్తికొలది
    మిత్రబృందపుపద్యాలు మేళ వించ
    తెలుగు భాషాభి వృద్ధియై తేజ రిల్ల
    రచనజేయగనెరిగించులాఘవమ్ము!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కవికోకిలపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    కవివర్యునకు జేజేలు పలికిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    ‘అనిరా యల్పుల్’ అనేది టైపాటు వల్ల ‘అనిరారల్పుల్’ అయినట్టుంది.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    పంతుల గోపాల కృష్ణారావు గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం!
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    జాషువాపై అత్యుత్తమమైన పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    తథాస్తు!

    రిప్లయితొలగించండి
  10. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    పునఃప్రణామములు!

    నా పద్యంలో మొదటి పాదం “విద్యాధికారులే విద్యాధికారులై” (విద్యా+అధికారులే విద్యా+అధిక+అరులు+ఐ అని ఉద్దేశం) అన్నదానికి - శ్రీ జాషువా గారే వ్రాసికొన్న కవిత:

    జనులం బీలిచి పిప్పిఁజేసెడు దురాచారంబులన్ గాలమ
    ట్టని విద్యాబలమేల? విద్య యన మౌఢ్యవ్యాఘ్రి కింపైనచోఁ
    జనమా? మోసపు వ్రాఁతకోఁతలకు రక్షాబంధమా? ఎందుకీ
    మనుజత్వంబు నొసంగలేని చదువుల్? మైరేయపుం మైకముల్!

    రెండవ పాదంలోని “పంచమ స్వరం” ఉదంతం అందఱికీ తెలిసిందే.

    “కవికోకిల బిరుదాంకితుడు జాషువా. ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించిన వారే కోకిల 'పంచమ స్వరం'లో కూస్తుందని శ్లేషల్ని ఆశ్లేషించి, భాషా ప్రౌఢిమ ప్రదర్శించి, తమ అక్కసు చాటుకోలేదా? అయినా సాహితీ ప్రియుల హృదయఫలకాల మీద తన ముద్రను భద్రపరుచుకొన్నాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినా సృజనాత్మకత (చ్రేతివిత్య్)కి కూడా కులమతాల మలాములంటించిన 'భారతీయత'కు మంగళహారతులు పట్టవలసిందే మరి!”

    అన్నారు, సుప్రసిద్ధవిమర్శకులు కఠెవరపు వెంకట్రామయ్య గారు.

    మూడవ పాదంలోని “ఏ కుల?” మన్న అన్న దళానికి 1933-34 ప్రాంతాల జాషువా గారు చెప్పిన చాటువు:

    నా కవితావధూటి వదనంబు నెగాదిగఁ జూచి, రూపరే
    ఖా కమనీయ వైఖరులు గాంచి, 'భళిభళి'! యన్నవాఁడె "మీ
    దే కుల?"మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
    బాఁకునఁ గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్.

    నాల్గవ పాదంలో “గరగరల్ పచరించెద” అన్న దళానికి “నా కథ”లో జాషువా గారు చెప్పిన పద్యం:

    గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న
    న్నెవ్విధి దూఱినన్ నను వరించిన శారద లేచిపోవునే
    యి వ్వసుధాస్థలిం బొడమరే రసలుబ్ధులు! ఘంట మూనెదన్
    రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్.

    నేను చిన్నప్పుడు "పచరించెద" అని చదివుకొన్న జ్ఞాపకం. ఇందాక ముద్రితప్రతి చూస్తే "సవరించెద" అని ఉన్నది.

    ఎత్తుగీతిలో “నాల్గు పడగల హైందవ నాగరాజు” అన్న దళానికి ఆధారం జాషువా గారి “గబ్బిలము” నుంచి:

    ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి
    యినుపగజ్జెల తల్లి జీవనము సేయు!
    గసరి బుసకొట్టు నాతని గాలిసోక
    నాల్గు పడగల హైందవ నాగరాజు.

    “శంకరాభరణం” బ్లాగుముఖంగా శ్రీ గుఱ్ఱం జాషువా గారి అనర్ఘమైన కవిత్వాన్ని మళ్ళీ ఒకసారి స్మరించి, ఆ మహాకవికి నివాళి సమర్పించటానికి అవకాశం కల్పించిన మీకు మఱొక్కసారి ధన్యవాదాలు.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. మందారములనున్న మాధుర్యమునకన్న
    కమనీయమౌ మీదుకవనమన్న
    సెలయేటి జలపాతములనున్న పరవళ్ళు
    పద్యపాదములందు పరిఢవిల్లు
    పదునైన తూటాలవంటిమాటలతోటి
    సమసమాజమునందు సాగసాగె
    అవమానములనెల్లనవరోహణముజేసి
    వెలయించె బహుకావ్య వీచికలను

    కవితలందున పలువిధ గమనమేను
    భావమందున విశ్వసౌభ్రాత్రమేను
    జగతి మురిపించి నవయుగ చక్రవర్తి
    బిరుదమందిన జాషువా! భేషు భేషు.

    రిప్లయితొలగించండి
  12. చక్కని జిగిబిగి చిక్కని మాటల
    నల్లిన పద్యాల యల్లసాని

    కవితా పడతికిని గడు నేర్పు మీరగా
    మెరుగులు దిద్దిన మేటి కవి

    గండ పెండేరము కరమున దొడిగిన
    వాగ్దండి ; సాలీడు వంటి కవిత

    లల్లిన కవిఱేడు ; యలరించు నెమలి
    నెలత భరతమాత తెలుగు తల్లి


    గబ్బిలము ఫిరదౌసను కబ్బములను
    వ్రాసి వన్నె కెక్కిన తెల్గు వాడు ; తెలుగు
    భాష నుడికార సొంపులు ప్రాభవిల్ల
    ఖండ కావ్యముల్ వ్రాసె నతండు నాడు.



    రిప్లయితొలగించండి


  13. సభ్య సంఘమ్మునందు నసహ్య దృష్టి
    పీడనమ్ము నెదుర్కొని ,పేదరికము
    నంటరానితనమ్మును నధిగమించి
    యా సమాజాన మన్నన లందితీవు.

    '' సుకవి నిలుచును ప్రజల నాలుకల యందు ''
    నిజమె ,నీ కావ్యముల్ నిల్చె నేటి వరకు
    గబ్బిలము,ఫిరదౌసియు ,క్రైస్తు చరిత
    కవిత లమరత్వమును నీకు గలుగజేసె.

    రిప్లయితొలగించండి
  14. చిన్న సవరణ :

    కవితా పడతికిని = కవితా వధూటికి

    రిప్లయితొలగించండి
  15. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఎంత ప్రణాళికా బద్ధంగా వ్రాసారు పద్యాన్ని! మీ ప్రతిభకు నమోవాకాలు. పద్యంలోని ప్రతి పదమూ సార్థకమై కవికోకిల సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాక్షాత్కరింపజేసింది. మీ సవివరణ వ్యాఖ్య ఔత్సాహిత కవిమిత్రులకు మార్గదర్శకం. ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    భేషైన పద్యం వ్రాసారు. బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    సీసపద్యంలో ‘మేటి కవి’ అన్నప్పుడు గణదోషం. ‘మేటి సుకవి’ అంటే సరి!
    *
    కమనీయం గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి