14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 822 (దుర్వినయంబునన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
దుర్వినయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా.
(ఆకాశవాణి వారి సౌజన్యంతో...)

14 కామెంట్‌లు:

  1. ఉర్విన మోసగించుటయు, ఓరిమిలేనితనంబు, కక్ష, తా
    సర్వము దోచుకొన్ననిక చాలను తృప్తియు లేని దొంగ లా
    గర్వమదాంధ నేతలకు, ఘాతుకు లప్పట వంచకాధముల్
    దుర్వినయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా

    రిప్లయితొలగించండి
  2. అర్వదియేడు వత్సరములయ్యె స్వతంత్ర విధాన పాలనన్
    నిర్వహణం బొనర్చుచును నేతల మాటలు నీటిమూటలై
    సర్వము జెల్లె దోపిడుల సంపద డుల్లగుటెల్ల చూడగా
    దుర్వినయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా

    రిప్లయితొలగించండి
  3. గర్వమసూయ కుత్సితము కల్గిన కల్మష మానసంబులన్
    సర్వుల నిగ్రహించు కడు స్వార్థపరాయణులున్న కాలమం
    దిర్వురి మేలుఁగోరి హితమేర్పడఁజేయుచు నెల్లవేళలం
    దుర్వి నయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా!

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పూరణ....

    శర్వుని గొల్చుచున్; సతత సత్య మహింస మనమ్ముఁ బూనియున్;
    గర్వ మొకింత లేక; మమకారముఁ జూపుచుఁ; గీర్తిఁ గోరకన్;
    సర్వ విశిష్ట మూర్తి యుత సత్పరివర్తన 'నేరు' పూనియుం
    దుర్వినయంబునన్? మనసు దోచెడి 'వారు', హితైషులే కదా!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ గుండు మధుసూదన్ గారి పద్యము 2వ పాదము చివరన గీర్తి గోరకన్ అని వాడేరు. వ్యతిరేకార్థకంబులు కళలు అను సూత్రము ప్రకారము గోరకన్ అని చివర ద్రుతము రాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    పండిత నేమాని వారికి
    మనఃపూర్వక ప్రణామములు!
    తమరు రెండు మూఁడు మారు లీవిషయముఁ (వ్యతిరేకార్థకములు కళలు) దెలిపినను, నెందులకో రాకన్, పోవకన్, తినకన్-ఇటుల మనస్సులో స్థిరపడిపోయినందువలన నిటువంటి తప్పులు దొరలుచునేయున్నవి. తమరు విసుగుకొనక తెలిపినందులకు ధన్యవాదములు! దానిని "కీ ర్త్యనిష్టులై" యని సవరించుచున్నాను. స్వస్తి.
    భవదీయ విధేయుఁడు,
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  7. సర్వము తానెయై సఖుని సంతస మందగప్రేమ జూపుచున్
    గర్వము నొందకుండ తనకెంతయొ ప్రాణ సమానమే యటన్
    నిర్వచ నీయమైన పలు నేరము లెంచక మౌన భాషలన్ !
    దుర్విన యంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా !

    రిప్లయితొలగించండి
  8. ఓర్వగ లేక సోదరుల యోర్మిని కూర్మిని మెచ్చలేక తా
    నేర్వక ధర్మబుద్ధి కురునేత సుయోధను డొందె నాశమున్
    గర్వము ద్రోహమున్ గరపు కర్ణుని మైత్రికి బద్ధుడై కటా
    దుర్విన యంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.

    రిప్లయితొలగించండి




  9. గర్వితులైన నేతలను ,కామవికారవిమోహితాత్ములన్,
    సర్వము వారిదే ఘనత ,సద్గుణరాశులటంచు వారలన్
    చర్వితచర్వణమ్ముగ బ్రచారము జేసి ప్రియోక్తులన్ గడున్
    దుర్వినయంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా !

    రిప్లయితొలగించండి
  10. సర్వశుభంబునన్ జగతి సౌఖ్యముఁ గూర్చగ నారదుండుఁదాఁ
    గార్యముఁబూనినన్ దనుజఘాతకులెల్లరి పంచఁజేరి యౌ
    దార్యముజూపుచున్ గపట దౌత్యముఁజేయుచు మంగళంబిడన్
    దుర్వినయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా!

    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమః
    2,3 పాదములలో ప్రాస తప్పింది.సవరణ:

    2 గర్వము జూపకన్....
    పంచజేరుచున్
    3 దుర్వినయంబునన్ కపట దూత్యము..
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! శుభాశీస్సులు.
    సమస్యా పూరణం:

    ఈనాటి సమస్య "ర్వ" ప్రాసతో ఉత్పలమాల - కాస్త ఇబ్బందిని ఇచ్చినదే - అయినా మిత్రులు చక్కగా పూరించేరు. అందరికీ అభినందనలు.

    శ్రీ చంద్రశేఖర్ గారు:
    దోచుకునే దొంగలు తృప్తిలేని వారు నేతలు కదా అని విచారించేరు. ప్రశస్తముగా నున్నది.

    శ్రీ ఫణి ప్రసన్న కుమార్ గారు:
    కల్మష మానసులు, స్వార్ధ పరాయణులున్న కాలమును అభివర్ణించేరు. ఉత్తమముగా నున్నది.

    శ్రీ గుండు మధుసూదన్ గారు:
    భక్తి ధర్మ పరాయణత్వము కల్గిన వారిని ప్రశంసించేరు. వినూత్నముగా నున్నది.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    మౌన భాషలతో మనసు దోచే వారిని ఉట్టకించేరు. రమ్యముగా నున్నది.

    శ్రీ మిస్సన్న గారు:
    కురునేత కర్ణుని మైత్రికి బద్ధుడై బలి యయ్యెకదా అని విచారించేరు. సొగసుగా నున్నది.

    డా. కమనీయం గారు:
    నేటి నాయకుల నీడలో తిరిగే వారి గుణములను అభివర్ణించేరు. ప్రశంసనీయము గా నున్నది.

    శ్రీ సహదేవుడు గారు:
    నారదుని పాత్రను చక్కగ నిరూపించేరు. సొంపుగా నున్నది.

    రిప్లయితొలగించండి
  13. నిర్వచనీయమైన తమ నిగ్గును చంపుచు గద్దె కోసమై
    గర్వము వీడుచున్ కడకు కాళ్ళను బట్టుచు వోట్లు కోరుచున్
    పర్వము చేయ కాసులను భళ్ళున పంచుచు కల్లు పోయుచున్
    దుర్వినయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా

    రిప్లయితొలగించండి