2, జనవరి 2013, బుధవారం

సమస్యా పూరణం - 925 (ధర నీ పాదమె నౌక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధర నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

25 కామెంట్‌లు:

  1. ధర సంసారమె భీకరంబగు సముద్రంబట్లు గన్పట్టు దు
    స్తరమయ్యెన్ స్మర మోహ ముఖ్య రిపు బాధల్ మిక్కుటంబౌటచే
    గర మార్తిన్ గొనుచుంటి బ్రోవగదవే గౌరీశ! మందాకినీ
    ధర! నీ పాదమె నౌకయంచు దలతున్ దండంబు నే బెట్టుదున్

    రిప్లయితొలగించండి
  2. ధరలో నెక్కుడు మానవాళి కనగా దారిద్ర్యమున్ దుఃఖసా
    గరమున్ దాటగ లేక నావకొరకై గాలింతురే బైటనే
    కరినే బ్రోచిన శౌరి ! నిన్మనములో కష్టాల నీడేర్చ శ్రీ
    ధర ! నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్.

    రిప్లయితొలగించండి
  3. పరగన్ జీవనమిట్లు సాగరముగా భావింతురే పెద్దలున్
    తరమా నాకిక నీదు వీక్షణలలో దాక్షిణ్యముల్ లేక; శ్రీ
    హరి! నే భక్తిని నిన్ను నమ్ముదును, నీవాలింపరావోయి, శ్రీ
    ధర! నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్.

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ మూర్తి గారు!
    శుభాశీస్సులు.
    మీరు నిన్న వ్రాసిన ఉత్పలమాలిక 2వ పాదములో ఒక చిన్న సవరణ కావాలి:

    హృద్య + ఛందము = హృద్యఛ్ఛందము అవుతుంది. సమాసములో పరపదము ఛ శబ్దాదిగా నుంటే ఆ ఛ కారము ద్విత్త్వముగా (ఛ్ఛ) అగును. అందుచేత తగిన సవరణ చెయ్యాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. ఆర్షసంప్రదాయముల వైదికధర్మప్రతిష్టాపనార్థమై ఈ నేలపై తిరిగిన శ్రీ శంకరాచార్యులనుద్దేశిస్తూ......

    వరసంప్రాప్తి జనించితీవు యిల విద్వాంశుల్ ప్రశంసింపగా
    సురదేవర్షిగణార్చితాంఘ్రిపదముల్ స్తోత్రంబులన్ జేసి శం
    కర నామంబున నార్షధర్మపరిరక్షా పూనికన్ వెల్గుని
    ద్ధర నీ పాదమె నౌకయంచుఁ దలఁతున్ దండంబు నేఁబెట్టుదున్.

    సురదేవర్షిగణార్చితాంఘ్రిపదముల్ = ఈశ్వరుడు, విష్ణువు,

    రిప్లయితొలగించండి
  6. శ్రీ తోపెల్ల శర్మ గారి పద్యములో కొన్ని సవరణలు చెయ్యాలి:
    1. 1వ పాదములో తీవు తరువాత యిల అని యడాగమము రాదు - అందుచేత యిలకి బదులుగా "భువి" అని మార్చాలి.
    2. సురదేవర్షి గణార్చితాంఘ్రి పదముల్ - అని వ్రాసి తరువాత సమర్థించుట కన్నా మరొక లాగ వ్రాస్తే బాగుంటుంది.
    3. పరిరక్షా పూనికన్ అనే సమాసములో ఉత్తర పదము తెలుగు వాడకూడదు - అందుచేత పరిరక్షా దక్షతన్ అని మార్చుదాము.

    ఇప్పుడు ఆ పద్యమును ఇలాగ మార్చవచ్చును:

    వరసంప్రాప్తి జనించితీవు భువి విద్వాంసుల్ ప్రమోదింపగా
    పరమార్థంభును బోధసేసితి జగద్వ్యాప్తంబుగా నాది శం
    కర నామంబున నార్ష ధర్మ పరిరక్షాదక్షతన్ వెల్గు ని
    ద్ధర నీ పాదమె నౌక యంచు దలతున్ దండంబు నే బెట్టుదున్

    రిప్లయితొలగించండి
  7. ఆర్యా!
    నమస్కారములు,
    దోషమును సూచించినందులకు ధన్యవాదములు.
    నిన్నటి నా ఉత్పలమాలికలోని రెండవపాదాన్ని ఇలా సవరిస్తున్నాను.
    ట్లాతతమైన భావముల హాయనముం గని స్వాగతించ నా

    రిప్లయితొలగించండి
  8. కరిచర్మాంబర! చంద్రశేఖర! హరా! కైవల్యసంధాయకా!
    కరుణాసాగర! భక్తరక్షణపరా! గౌరీపతీ! సంసృతీ
    తరణం బందగగోరువారి కిలలో త్వత్పూజనంబుల్ జటా
    ధర! నీపాదమె నౌక యంచు దలతున్ దండంబు నే బెట్టుదున్.

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 02, 2013 3:39:00 PM

    అరవిందాక్ష! మురారి! కైకసిజ సంహారీ! హృషీకేశ! శ్రీ
    వరదా! హేపురుషోత్తమా! యతిజనాభ్యర్చాదినారాయణా!
    పరమేశా! పరమాత్మ! మాధవ! బలిధ్వంసాయ! గోవింద! శ్రీ
    ధర! నీపాదమే నౌక యంచు దలతున్ దండంబునే బెట్టెదన్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తోపెల్ల శర్మ గారి పద్యములో కొన్ని సవరణలు కావాలి:
    1. యతిజనాభ్యర్చాదినారాయణా! కి బదులుగ .. కమలనాభా! ఆదినారాయణా! అని
    2. 3వ పాదములో: బలిధ్వంసాయ కి బదులుగా .. దయాపారీణ! అంటే బాగుంటుంది.
    బలిధ్వంసాయ అంటే బలిని ధ్వంసము చేసిన వాని కొరకు అని అర్థము. ఇందులో సంబోధన లేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ హరి....మూర్తి గారి పద్యము 3వ పాదమును ఇలా మార్చితే అన్వయము బాగుంటుంది:

    "తరణం బంద సహాయ మొక్కటె యగున్ ధాత్రిన్ త్రిశూలీ! జటా" ...

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. ధర నీ స్తుతి భోగ భాగ్యములనే ధారాళమిచ్చుంగదా!
    నిరతంబంతయు నిత్య సత్యమనుచున్ నీ నామ ధ్యానంబునే
    ధర నే జేసెద నన్ను బ్రోవు యనఘా - దాసించు నా పాపముల్
    ధర నీ పాదమె నౌక యంచు దలతున్ దండంబు నే బెట్టెదన్.

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 02, 2013 6:27:00 PM

    పూజ్య పండిత నేమాని వారికి పాదాభివందనములు.దోషములు సవరించుచూ మీరు చెప్పినట్లు గా
    అరవిందాక్ష! మురారి! కైకసిజ సంహారీ! హృషీకేశ! శ్రీ
    వరదా! హేపురుషోత్తమా! కమలనాభా!ఆదినారాయణా!
    పరమేశా! పరమాత్మ! మాధవ! దయాపారీణ! గోవింద! శ్రీ
    ధర! నీపాదమే నౌక యంచు దలతున్ దండంబునే బెట్టెదన్.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి




  14. హర,గంగాధర,పార్వతీరమణ,జన్మాయత్తమౌ దుఃఖసా
    గరమీదంగనశక్తుడన్ గరుణతో గావంగ దిక్కంచు నీ
    వరనామంబె జపింతునెల్లపుడు దేవా ,యీశ్వరా నీలకం
    ధర,నీ పాదమె నౌక యంచు దలతున్ దండంబు నే బెట్టుదున్ .

    రిప్లయితొలగించండి
  15. శ్రీ మారెళ్ళ వామన కుమార్ గారి పద్యమును పూర్తిగా మార్పు చేయవలసి యున్నది. ఇలాగ మార్చుదాము:

    ధర నీ సంస్తుతి భోగ భాగ్యములిడున్ ధర్మ ప్రభా భాసురా!
    నిరతంబున్ పరమాత్మ వీవె యనుచున్ నీ ధ్యానమున్ జేయుదున్
    పరిపాలింపుము నన్ను జన్మ జలధిన్ దాటింపు మో దేవ! శ్రీ
    ధర! నీ పాదమె నౌక యంచు దలతున్ దండంబు నే బెట్టెదన్

    రిప్లయితొలగించండి
  16. చరణం బంటి గుహుండు పల్కె రఘువంశ స్తోమ! శ్రీరామ! య-
    ద్దరి జేర్చ న్నను కోరుటల్ సుజన మందారంబ! నీలీల దు-
    స్తర కల్లోల మహోగ్ర భీకరము సంసారాభ్ధి దాటంగ ని-
    ద్ధర నీపాదమె నౌక యంచు దలతున్ దండంబునే బెట్టెదన్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీనేమాని పండితవర్యులకు,

    నమస్సులు. మీరు సూచించిన సూచనలు సవరణలు సర్వదా గ్రాహ్యంబులు మరియు ఆమోదయోగ్యంబులే కదా.

    ధన్యోస్మి.

    ( పొరబాటున శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారిని సంబోధించినారు ).

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. 3వ పాదములో "భీకరము" అనుట వలన అన్వయము పూర్తి యగుట లేదు. భీకరమైన అనే అర్థము వచ్చేటట్లు చూడండి. లేకుంటే దుఃఖమయ అనే పదము వేయవచ్చునేమొ. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీరామునితో భక్త గుహుని విన్నపం:

    ధరణీజాతను గూడి రాగ కడు మోదంబాయె! నీ కౌగిటన్
    మురిసే రోజెపుడంచు నే వేచితినయా! పుణ్యాత్ము జేయంగ నీ
    సిరి పాదంబుల జేర్చు నేఁగడుగ! నాశీర్వాదమానంద మీ
    ధర! నీ పాదమె నౌకయంచు దలఁతున్ దండంబు నే బెట్టుదున్!

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితార్యులకు కృతజ్ఞలతో సవరించిన నా పూరణ:

    చరణం బంటి గుహుండు పల్కె రఘువంశ స్తోమ! శ్రీరామ! య-
    ద్దరి జేర్చ న్నను కోరుటల్ సుజన మందారంబ! నీలీల! దు-
    స్తర కల్లోల మహోగ్ర దు:ఖమయ సంసారాభ్ధి దాటంగ ని-
    ద్ధర నీపాదమె నౌక యంచు దలతున్ దండంబునే బెట్టెదన్.

    రిప్లయితొలగించండి
  21. నిన్న రోజంతా కొన్ని ముఖ్యమైన పనుల్లో తిరగడం వల్ల కనీసం బ్లాగు చూడడానికి కూడా అవకాశం దొరకలేదు. మిత్రులు మన్నించాలి.
    నిన్నటి సమస్యకు మనోహరమైన పూరణలు చెప్పిన కవిమిత్రులు......
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    మారెళ్ళ వామన కుమార్ గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    మిస్సన్న గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. గరువు గారికి నమస్సులు.
    పద్యం పోస్ట్ చేసిన తరువాత నాకే నా పద్యం నచ్చ లేదు. మరలా ప్రయత్నించాను.
    వీలును బట్టి పరిశీలించ ప్రార్థన.

    ధర నీ స్తోత్రము భోగభాగ్యములనే ధారాళమిచ్చున్ కదా!
    ధర నీవంతయు నిత్య సత్యమనుచున్ ధ్యానంబు నే చేసెదన్
    ధర నీ ప్రార్థన నేను జేతుననఘా! దాసించు నా పాపముల్
    ధర నీ పాదమె నౌకయంచు దలతున్ దండంబు నే బెట్టుదన్.

    రిప్లయితొలగించండి
  23. పరువుల్ పెట్టుచు కౌగలించితిని నే బ్రహ్మాండమౌ ప్రేమతో
    పరువే పోయెను నోడిపోవగను నే ప్రారబ్ధ కర్మంబునన్
    కరుణన్ జూపుచు మోడివర్యునిక వే కాశ్మీరుకున్ పంపు శ్రీ
    ధర! నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్

    రిప్లయితొలగించండి