24, జూన్ 2013, సోమవారం

పద్య రచన – 382




కవిమిత్రులారా,
 పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. కంటిరే చిత్రాన గల సైనికుల తీరు
    ....మానవత్వమునకు మచ్చు తునక
    నది పొంగుచుండ యా నదికి నడ్డంబుగా
    ....వారధియైరి యా వీరవరులు
    వీరసైనికులంచు పేరు గాంచుటె కాదు
    ....వారి సేవలు మహోదారములగు
    నతులిత ధైర్య సాహసముల జూపుచు
    ....నాపదల్ తొలగింతు రనవరతము
    లక్ష్య మొక్కటే దేశ సంరక్షణమ్మె
    ప్రాణముల కేనియు దెగించి బహువిధముల
    సేవజేయు సైనికులకు జేతులెత్తి
    మ్రొక్కి జోహారులనెదు ప్రమోదమెసగ

    రిప్లయితొలగించండి
  2. వంతెన గూలగనే తమ
    వంతని సాయమ్ము జేయ వాలిరి వరుసన్
    చింతను వీడుఛు నడిచిరి
    ఇంతగు సైన్యంపు ఋణము లెవ్విధి దీరున్.

    రిప్లయితొలగించండి
  3. వీరతతో నుదారతను పేరిమిఁ జూపు మహానుభావు,లే
    యూరికిఁ జెందువారనుచు నూహలఁ జేయక గాచనెంచిరీ
    వీరుల జన్మ ధన్యమయె, పృథ్వినిఁ బుట్టిన దేవజాతియౌ
    వీరలఁ జూడుడీ, నదుల వెల్లువలో జన రక్షణమ్ముకై
    చేరుచు నిష్ఠతో జనులఁ జేర్చిరి యిండ్లకు; ధన్యవాదముల్.

    రిప్లయితొలగించండి
  4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    మీ పంచపాద ఉత్పలమాల బాగుగనున్నది. 4వ పాదములో జనరక్షణమ్ముకై అనేచోట జనరక్షణమ్మునకై అని ఉండాలి. అందుచేత "జనరక్ష సేయగా" అని మార్చుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. ఆ భాగీరథికిన్ హిమాత్మజతొ వాదవ్వంగ తత్క్రోధమం
    దున్ భూతేశ్వరి పుట్టినింట వరదై దూకెన్ మహోద్రిక్త తా
    నై; భీతిల్లిన భక్తులన్ శివునిసైన్యంబొచ్చి రక్షించినా
    రా భారంబునుమ్రోసి వారధిగయై ఆరాధ్యదైవంబులై ||

    రిప్లయితొలగించండి
  6. సైనిక దళములు మెండుగ
    పూనికతో కలసి మెలసి పృధివీ తలమున్ !
    ప్రాణ ములను లెక్కింపక యభి
    మానము గలిగి దేశ మాతను కొలువన్ !

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా! శుభాశీస్సులు,
    కొద్దిరోజులుగా మనము శ్రీ మిస్సన్న గారిని మన బ్లాగులో చూడలేక పోవుచున్నాము. దీనికి కారణము వారు చెప్పేరు - వారి కంప్యూటరుకి ఉన్న సమస్యలే అని. త్వరలో మళ్ళీ వారు మన బ్లాగులోకి వస్తారు అనుకొందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. పింగళి శశిధర్ గారూ,
    మానవత్వం పరిమళించే ఈ అద్భుత చిత్రాన్ని నాకు పంపినందుకు ధన్యవాదాలు.
    ఉదయమే చెప్పవలసింది. ఆలస్యంగా చెప్తున్నందుకు మన్నించండి.
    *
    పండిత నేమాని వారూ,
    చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ, ఆ సైనికుల సేవను ప్రశసిస్తూ చక్కని పద్యం చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రఘురామ్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసార్హమైనదే. కానీ కొన్ని గమనించవలసిన లోపాలున్నాయి.
    రెండవ పాదంలో ప్రాసదోషం ఉన్నది.
    ‘హిమాత్మజతొ’ అన్నప్పుడు ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరారు.
    ‘వచ్చి’ని శివుని సైన్యంబు ‘ఒచ్చి’ అన్నారు. ఒచ్చి గ్రామ్యం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    3,4 పాదాలలో గణదోషం. నా సవరణ....
    ప్రాణముల గణింపక యభి
    మానమ్మది గలిగి దేశ మాతను కొలువన్ !

    రిప్లయితొలగించండి
  9. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    దేశ రక్షణ చేయుచు దీక్ష తోడ
    ప్రజల ప్రాణముల్ కాచుచు ప్రతిభ తోడ
    మానవత్వము చూపెడి మాననీయ
    సైనికుల ముందు నెవ్వరు సాటిరారు.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు,
    మీ పద్యములో 4వ పాదము సందేహాస్పదముగా నున్నది. దానిని ఇలాగ మార్చుదాము:

    "సైనికుల ముందు నెవరేని సాటిరారు"
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారు గదా!

    రిప్లయితొలగించండి