3, జులై 2010, శనివారం

చమత్కార పద్యాలు - 9

"కాఖా గాఘా కిఙ కాటన్నాయా టీఙ"
పిసుపాటి చిదంబర శాస్త్రి (1892-1951) తిరుపతి వేంకట కవుల సమకాలికుడు. అద్భుతమైన అవధాన కౌశలం, ఆశుకవితా నైపుణ్యం కలవాడు. ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల్లో ఎన్నో రాజాస్థానలను దర్శించి, ఆయన పొందిన సత్కారాలకు లెక్క లేదు.
1925లో బెజవాడలో జరిగిన శతావధానంలో ఒక పృచ్చకుడు ఇచ్చిన సమస్య ఇది ...
"కాఖా గాఘా కిఙ కాటన్నాయా టీఙ"
దానికి చిదంబర శాస్త్రి పూరణ -
చాఛా జాఝా చిఙ చంచన్నాయా ఛీఙ
తాథా దాధా తిఙ తాతన్నాయా థూఙ |
పాఫా బాభా పిఙ పాపన్నాయా ఫీఙ
కాఖా గాఘా కిఙ కాటన్నాయా టీఙ ||
పృచ్ఛకుడు "నే నిచ్చిన సమస్యకు అర్థం ఉంది. కాటన్నాయుడనే ధనవంతుడు విద్యాగంధం లేని వాడు. కాని పొగడ్తకు ఉబ్బి కానుక లిస్తాడు. ఈ రహస్యం తెలిసిన ఒక కవి ఈ సమస్య పాదాన్ని రకరకలుగా గానం చేసి దానాన్ని పొందాడు. మరి మీ పూరణకు అర్థం ఉందా?" అని ప్రశ్నించాడు.
చిదంబర శాస్త్రి ఇలా సమాధాన మిచ్చాడు. "ఈ అనంతమైన సృష్టిలో మీ కాటన్నాయుని వంటి వాళ్ళు మరో ముగ్గురున్నారు. అందులో మొదటి వాడు చంచన్నాయుడు, రెండవ వాడు తాతన్నాయుడు, మూడవ వాడు పాపన్నాయుడు. వీళ్ళను పొగిడి దానాలు పొందారు ముగ్గురు కవులు. మీ కవి కంటె నా కవులు మేధావులు. కాబట్టి వ్యంగ్యంగా వాళ్ళ మూర్ఖత్వాన్ని "ఛీ, థూ" అని నిందిస్తూనే వాళ్ళ చేత సత్కారాలను పొందారు"
("తెలుగులో చాటు కవిత్వము" సిద్ధాంత గ్రంథ రచయిత్రి ప్రొ. జి. లలిత గారికి కృతజ్ఞతలతో)

1 కామెంట్‌: