1, డిసెంబర్ 2012, శనివారం

పద్య రచన - 177

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఇహ పర సౌఖ్యము లొసగే
మహారాజువు నీవె తండ్రి మా నావలపై
గుహ! నది దాటింపు మన్న
నహ !నా భాగ్యమ్ము పండె నా రామయ్యా !

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శాస్త్రి గారూ! శుభాశీస్సులుమీ పద్యమును వ్రాసే తొందరలో గణములను మీరు గమనించలేదు. 2, 3 పాదములను సరిజేయండి.స్వస్తి.

Pandita Nemani చెప్పారు...

మా శ్రీమదధ్యాత్మ రామాయణమునుండి:

వనమునకు రామచంద్రుడు వచ్చె ననుచు
వినుట తోడనె గుహుడు వేవేగ యచటి
కరిగి యా స్వామి సన్నిధి కాదరమున
మ్రొక్కి పండ్లను తేనె పూవులు నొసంగి

రాజీవమిత్రకుల భాసుర రత్నదీపా!
రాజీవమిత్ర నయనా! సురరాజవంద్యా!
రాజద్యశోధన! సుశోభిత లక్షణాఢ్యా!
పూజింతు నీదు పద పుష్కరముల్ మహాత్మా!

రామా! ధన్యుడనైతి నిన్ గనుటతో రావయ్య! మమ్మేలగా
స్వామీ! పావనమయ్యె నీ పదములన్ స్పర్శించి మా నేల నీ
వే మా రాజవు నీదు సేవకునిగానే ప్రోవుమా నన్ను నీ
ప్రేమన్ బొందుట భవ్యయోగ మని వ్రాలెన్ తత్పదంబంటుచున్

Pandita Nemani చెప్పారు...

అమ్మా!లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
మీ పూరణలు వేగముగా మంచి ధారతో వస్తున్నాయి. సంతోషము.
ఇడకన్ అని వ్యతిరేక పదమును వేయునప్పుడు చివర ద్రుతము రాదు అనే సూత్రమును నేను అందరికీ మాటి మాటికి గుర్తు చేయవలసి వస్తోంది. స్వస్తి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అయ్యా, మన్నించండి.

రాముని సేవ దా మిగుల రంజిలి జేసి గుహుండు నెప్పుడే
కామితమున్ మనంబునను కాంచక పూజను జేయనెంచె; శ్రీ
రామ పదమ్ములన్ తనదు రంగుల నావయు పావనంబుగా
కేమి? సదా స్మరించునెడ నిట్లొనగూడును భాగ్యమెప్పుడున్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కడలిఁ దాటించు వాడైనఁ బడవ నడగ
గుహుడు కొండంత దేవుని కోర్కెఁదీర్చ
నాతిఁజేయు పాదంబని భీతి తోడఁ
గడిగి యర్చించె ప్రభువుకుఁబడవనిడగ!

కమనీయం చెప్పారు...



దశరథాత్మజ,నీ రాక ధన్యజీవి
నైతి జానకీ సౌమిత్రులమర నీకు
సేవజేయంగ జనుదేర నావ నడపి
నదిని దాటించు భాగ్యమ్ము నాకు గలిగె !

కంది శంకరయ్య చెప్పారు...


రాతిని నాతిగఁ జేసిన
ఖ్యాతి గలుగు నీ పదములఁ గడుగఁగనిమ్మా!
నా తరణిపైన మోపిన
నే తీ రగునొ యనె గుహుఁడు హితమితసూక్తిన్.

(సంపూర్ణ రామాయణం చిత్రంలోని పాటలో క్రింది పంక్తుల స్ఫూర్తితో...
‘నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట
నా నావమీద కాలు పెడితె ఏమవుతాదో తంట
దయచేసి ఒక్కసారి కాళ్ళు కడుగనీయమంట...’)

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా!
శ్రీరాముని పాదముల ధూళి తాకితే నా నావ నాతిగ అగునేమో అనిన వాడు గుహుడు కాడు. అది సినీమాలో చూపించిన వైనము మాత్రమే. అహల్యా శాప విమోచనము తరువాత విశ్వామిత్రునితో బాటుగా శ్రీరామ లక్ష్మణులు మిథిలానగరము చూచుటకై వెడలునపుడు గంగానదిని దాటే సమయములో అక్కడ ఉన్న ఒక పడవ నడిపే వాడు అలాగ అని శ్రీరాముని పాదములు కడిగేడు. గుహుడు దశరథుని మిత్రుడు రాముని సౌహార్దముతో స్వాగతించి తన భక్తిని ప్రదర్శించేడు. అయోధ్యాకాండలోనె మొట్ట మొదటి సారిగా గుహుడు తెరపైకి వస్తాడు. స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

రాముని మ్రొక్కుచు గుహుడనె
రామా దాటించెద నదిని లాఘవ ముగనే !
నామాటను నిరసించక
స్వామీ కరుణించు మనెను శరణా గతుడై

మిస్సన్న చెప్పారు...

దండము సామి! నీ యడుగు దామర పూలకు చల్లనయ్య! మా
దండుకు పండుగయ్య! దరి దాపుల గూడెము లెల్ల నుండు నీ
కండగ నయ్య! నీవిచట హాయిగ నుండ గదయ్య! రామ! త-
మ్ముండును తల్లితో గలసి పుణ్యము పుచ్చగ బోయ జాతికిన్.

మిత్రమ! సంతసించితిని మేలగు భిల్లులకెల్ల! నెంతయో
నాత్రము తోడ గోరితివి హాయిగ నుండు మటంచు కాని యే
మాత్రము వీలుగాదు గద! మా పయనమ్మగు గంగ దాటి యీ
రాత్రికి దూర మేగ వలె రమ్మిక నావను తెమ్ము వేగమే.

ఉండవయ్య రామ! యొకపరి గంగతో
కడగ నీయ వయ్య! కాలు దయను
గంగ పుట్టినిల్లు కద నీదు పాదము!
పుట్టి నిల్లు జేరి మురియు గంగ!

కాళ్ళు కడిగె గుహుడు కన్నీరు నింపుచూ
ధన్యు డైతి నంచు తలచి మదిని
భవ జలధి తరింప భవ్యమౌ తరణ మా
పరమ పురుషు డెక్కె పడవ యపుడు!

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

గంగావతరణపు సమయాన గుహుడు రామునితో :

01)
_______________________________

రాజ్య భారము విడచిన - రఘుకులేంద్ర
రమ్య గుణశీల శ్రీరామ - రమ్ము వేగ
రమణి సీతను , తమ్ముని - తమను గూడ
వారిరథమున నద్దరి - జేరవైతు
నమ్మి నిను గొల్తు, భవసాగ - రమ్ము దాట
ననుచు , చరణముల కడిగె - నా గుహుండు !
_______________________________
వారిరథము = పడవ

వసంత కిశోర్ చెప్పారు...

మిస్సన్న మహాశయా !
బాపుగారి సినిమాని కళ్ళముందుకు తెచ్చారు !

కంది శంకరయ్య చెప్పారు...

గుహునిపై మనోహరంగా పద్యాలు వ్రాసిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి,
కమనీయం గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
మిస్సన్న గారికి,
వసంత కిశోర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
నేమాని వారి సూచన ననుసరించి గోలి వారి పద్యానికి నా సవరణ....
ఇహ పర సౌఖ్యము లొసగెడి
మహనీయుడ వీవె తండ్రి మా నావలపై
గుహ! నది దాటింపు మనిన
నహ !నా భాగ్యమ్ము పండె నా రామయ్యా !

మిస్సన్న చెప్పారు...

వసంత మహోదయా ధన్యవాదములు.