6, డిసెంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 898 (గోతులను ద్రవ్వువారలే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

20 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా మేనల్లుడి వివాహం జరిగింది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం. రేపు రిసెప్షన్. అందువల్ల గత రెండు రోజులుగా మిత్రుల పూరణలను, పద్యాలను పరిశీలించి వ్యాఖ్యానించే అవకాశం దొరకలేదు. మరో రెండు రోజులు కూడా పనులవల్ల వ్యస్తుడినే. మన్నించండి.
    దయచేసి మిత్రులు రెండు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  2. పూని యవినీతి నే పట్టి పూడ్చివేయ
    పాడు బుధ్ధుల పరికించి పాతివేయ
    బొంకు రంకుల భువిలోన బొంద వెట్ట
    గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

    రిప్లయితొలగించండి
  3. నీతికిన్ ధర్మమునకును నీళ్ళు విడిచి
    కోట్లు కోట్లు గడింతురు కువలయమున
    గోతులను ద్రవ్వు వారలే గొప్ప వార
    లగుదు రారీతి ఎద"గాలి" ప్రగతి గాంచి

    రిప్లయితొలగించండి
  4. చెట్లు ప్రాణ వాయువు నిడు చేయు మేలు
    కల్మషమ్ముల హరియించు గాలి లోన
    మొక్కలను నాటి చెట్లకు ప్రోది సేయ
    గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

    రిప్లయితొలగించండి

  5. భీతి గొల్పుచు వీచుచున్ బెను తుఫాను
    పెక్కు మందిని బొట్టలో పెట్టుకొనగ
    ఖనన సంస్కార మొనరింప గరుణ తోడ
    గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారు,
    మూర్తిగారు విభిన్నంగా అందమైన పూరణలు చేసినారు. అభినందనలు.

    విసుగును విరామమును లేక వేలకొలది
    శవదహనమును, ఖననము సహజరీతి
    జరుగులాగున చేయనశ్రాంత గతిని
    గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

    రిప్లయితొలగించండి
  7. పైరు పంటల తోడన భరత భూమి
    కళక ళా డ వలెననిన ఖచ్చితముగ
    పోటు గొలదిని మొక్కలు నాటు కొఱకు
    గోతులను ద్రవ్వు వారలే గొప్ప వారు .

    రిప్లయితొలగించండి
  8. వెకిలితనము మానుచు గౌరవించ వలెను
    *గోతులను ; ద్రవ్వు వారలే గొప్పవారు
    చరితను పరిశోధించి నిజాలు వెలికి
    దీయ ; ధీమంతులే వారు ధీర గుణులు

    * గోతి చామ మడతి నాతి యింతి

    రిప్లయితొలగించండి

  9. తంతి తీగల కొఱకును తాగు నీటి
    కొఱకు, భూగర్భ యానము కొఱకు మరియు
    నిటులె సుంత కూలికి లోకహితము గూర్చు
    గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

    రిప్లయితొలగించండి
  10. నీటి కొరతను దీర్చగ మేటి గాను
    దేశ నదులన్నటి ననుసంధించ దలచి
    కంకణము గట్టి మొదలెట్ట కాలువులకు
    గోతులను ద్రవ్వు వారలే గొప్ప వారు

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    దౌష్ట్యాన్ని పూడ్చడానికి, పాతిపెట్టడానికి, బొందపెట్టడానికి గోతులను తవ్వించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    త్రవ్వకాలతో కోట్లు గడించిన వారిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    వ్యంగ్యాన్ని సూచిస్తున్నందున ‘ఎదగాలి’ అన్న వ్యావహారికం ప్రశంసాపూర్వకంగా స్వీకరింపదగినదే!
    *
    మిస్సన్న గారూ,
    ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నట్టు మొక్కలు నాటడానికి గోతులు త్రవ్వే వారిని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ కరుణరసాత్మకమై, నీతి బోధకమై ఉంది. బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీరు గన్నవరపు వారి బాటనే పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మిస్సన్న గారి వలనే మీరూ మొక్కలను నాటడానికి గోతులు త్రవ్వించారు. బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. ‘గోతి’ శబ్దానికి స్త్రీ అన్న అర్థంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    లోకహితం కొరకు గోతులను త్రవ్వే కూలివారిని గొప్పవారిని చేసారు. చక్కని పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    కాలువల నిర్మాణం కోసం గోతులను త్రవ్వే వారిని గొప్పవారన్నారు. బాగుంది. అభినందనలు.
    ‘మొదలెట్టి’ అని వ్యావహారికం వాడారు. ‘మొదలిడి’ అంటే సరి. రెండు టైపింగ్ దోషాలున్నాయి. ‘నదులన్నటి - నదులన్నిటి’, ‘కాలువులకు - కాలువలకు’

    రిప్లయితొలగించండి
  12. తేనె పూసిన కత్తులు తెలిసి వెనుక
    గోతులను ద్రవ్వు వారలే ; గొప్పవారు
    ఘను లనఘు లమ్మహాత్ములు గాన, చేయ
    నెంతు రెపుడు లోక హితము సంతసముగ

    రిప్లయితొలగించండి
  13. మొదట పరిహసింతురు శఠు లెదట వారు
    తాముత్రవ్వినగోతిలో పడఁగ, కడకు
    వారుత్రవ్విన గోతిలో పడెడి వారు
    గోతులను ద్రవ్వువారలే; గొప్పవార
    నంగ వారలె తప్పులెన్నక తమ పనిఁ
    జేసుకొను ముందుచూపున్న శ్రేష్టులుగద!
    మనవి: ఐదవ పాదంలో యతి సరిపోయిందా?

    రిప్లయితొలగించండి
  14. శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 5వ పాదములో యతి చక్కగా సరిపోయినది. ఒక సలహా: ఏ పద్యమును ఎత్తుకొనినా 4 పాదములతో సరిపోయే విధముగా చూడండి. పాదము అనగా 4వ వంతు మాత్రమే కదా. ఆ నియమమును పాటించుట శ్రేష్ఠము. 4 పాదములలో ఏ పద్యములో చెప్ప గలిగితే ఆ పద్యమును ఎంచుకొనండి. ప్రయత్నము చేయండి. విజయోస్తు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. నేతి మూతులు నాకుచు నీతి వీడి
    నేతి బీరల బాసల నేత లనగ
    గోతులను ద్రవ్వు వారలే గొప్ప వారు
    తేనె పూసిన కత్తుల తీపి కంటె
    గడ్డి తిని పాలిడు పశువు దొడ్డ గాదె !

    రిప్లయితొలగించండి
  16. శ్రీనేమానివారికి వందనములు. తేటగీతి, ఉత్పలమాల, చంపకమాలలకు నాలుగుకుమించి పాదములుండ వచ్చునని నేర్చుకొన్న పాఠము. మిగతా వాటికి వలె నాలుగుపాదాలే ఉండాలనే నిర్బంధం లేదని మాస్టారు కూడా చెప్పిన గుర్తు. పూరణలు కూడా ఆ రకంగా చూస్తున్నాము. అందుకే భావాన్ని కొంచెం విస్తృతంగా ఎక్కువ పాదాల్లో చెప్పాను. అయితే, నాలుగు పాదాలైతే సొగసుగా, ప్రామాణికంగా ఉంటుంది అన్న సూచన పాటించగలవాడను.

    రిప్లయితొలగించండి
  17. శవము పూడ్చగ గోతిని త్రవ్వ వలయు
    మొక్క నాటుట కన్నను నిక్కము గను
    గృహము నిర్మించ పలుచోట్ల గుంట లిడగ
    గోతులను త్రవ్వు వారలే గొప్ప వారు. !

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీదేవి గారికి గురువు గారికి ధన్యవాదములు. దివిసీమలో 1977 వ సంవత్సరములో వచ్చిన తుఫానులో సుమారు 10,000 మంది మృత్యువాత పడ్డారు. ఆ సందర్భములో స్వఛ్ఛంద సేవల నందించిన ప్రజా సేవకులను తలచుకొన్నాను.

    రిప్లయితొలగించండి