17, అక్టోబర్ 2015, శనివారం

పద్యరచన - 1036

కవిమిత్రులారా!
ఈరోజు పద్యరచనకు అంశము...
“సూర్యోదయ వర్ణనము”
ఛందము - సీసము.

50 కామెంట్‌లు:

  1. నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారి పద్యం......

    కలకల మనిపక్షి గణముల రవములు
    వీనుల విందుగ వేడ్క జేయు
    తెలతెల వారంగ తీగలు విరియుచు
    పుడమిపై కాంతులు పొలుపు మీఱు
    తూరుపు దెశనుండి తొలిప్రొద్దు కిరణాల
    నింగిని బంగారు నీలి మెరుపు
    బాలభా నుడుతేరు పైబయలు వెడల
    విశ్వమం దంతట వెలుగు నిండె
    తే.గీ
    పుడమి పులకించి తనువంత పొంగి పొరల
    తొలగె చీకట్ల తెరలన్ని మలిగి పోయె
    కోడి కూయంగ పిలుపందె కొండ లందు
    మారు మ్రోగంగ జగమంత మత్తు వీడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ఇది మీ మొదటి సీసపద్యం అంటే నమ్మలేకున్నాను. చక్కగా, సలక్షణంగా ఉంది. అభినందనలు.
      ‘దెస’ను ‘దెశ’ అన్నారు..అంతే!

      తొలగించండి
    2. ధన్య వాదములు
      నేనింకా తప్పులేమొ అని కుస్తీ పడుతున్నాను

      తొలగించండి
    3. రాజేశ్వరమ్మ గారూ , ఇది మీ మొదటి సీస పద్యమంటే ఆశ్చర్యంగా ఉంది. చాల చక్కని పద్యం విరచించినారు. ' తనువంత పొంగిపొరల ' బదులు ' తనువెల్ల పొంగి పొరల ' అనండి.పద్య / కావ్య భాషలో "అంత" అనే పదానికి- వాడుక భాషలో మనమనుకునే "అంతా" అన్న అర్థం రాదు. " ఎల్ల " అంటే అంతా అనే అర్థం వస్తుంది.

      తొలగించండి
    4. గౌరవ నీయులైన శ్రీ విష్ణు నందన్ గారికి కృతజ్ఞతలు

      తొలగించండి
  2. ముసిరిన చీకట్ల ముద్దాడ దలచియె
    కశ్యపాత్మజుడంత కదలి వచ్చె
    పులుగుజాతులుచేరి భూపాలరాగాన
    స్వాగతాలు పలికి స్వాగతింప
    ప్రాగ్దిశ గగనాన ప్రభవించె నరుణుడు
    నభమందు కెంజాయ ప్రభలు వెలుగె
    తిమిరాంతకుని గాంచి రమణితామసి తాను
    బిడియాన విడిచెను పుడమినంత

    అంధకారమడిసె నలరించె కాంతియే
    నిదుర వీడెనయ్యె నిఖిల జగతి
    శీతలానిలమ్ము స్వేచ్ఛగా విహరించి
    పులకరింపజేసె పూర్వ సంధ్య

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      ‘స్వాగతాలు పలికి స్వాగతింప’ అన్నచోట పునరుక్తి. ‘స్వగతాలు పలికి సంతస మిడ’ అందామా?

      తొలగించండి
  3. కావుకా వుమనుచు కాకుల రవములు
    వినబడం గమరిని వీనులకును
    ప్రాగ్ది శా భాగాన భానుండు రధముపై
    బయలుదే రంగను బ్రభలు వెలుగ
    వేకువ జామున వేలకొ లందిగ
    నడకకై మార్గాన నడచు చుండ
    చీకట్లు మాయమై చిరువెలుం గులుదోప
    పుడమితల్లి యపుడు పులక రించ
    యంధ కారము మాయమై యచట యచట
    కాంతి వెలుగుల తోడన కానుపించ
    తెల్ల వారెను జూ డుడు మెల్ల మెలగ
    శంక రార్యుడ ! వందన మింక మీకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      మీరు గణాలవారిగా కాక పదాలవారిగా టైప్ చేయండి. ‘కావుకావు మనుచు... వినబడంగ మరిని...బయలుదేరంగను... వేలకొలందిగ..చిరు వెలుంగులు దోప...’ ఇలా.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  4. అరుణకంతుల తోడుత నంబరమణి
    తూర్పుదిక్కుననుదయించ, తోయజములు
    విచ్చె సంతసమున కని వెలుగురేని
    పసిడకాం తులు వెదజల్లె పైరు లన్ని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      ఎత్తుగీతి వ్రాశారు. బాగుంది. అభినందనలు.
      కాని పైన సీసం వ్రాయడం మరిచినట్టున్నారు.

      తొలగించండి
  5. అక్కయ్యగారి ఆదిత్యోదయం అద్భుతం! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. తిరుమాడ వీధుల తిరిగెడి వెంకన్న
    ..........చని చూతమని యుష సంబర పడ
    నింద్రకీలాద్రిపై నీశ్వరి దుర్గమ్మ
    ..........సంబరాలని సంజ్ఞ సంజ్ఞ చేయ
    నోరుగల్లున కాళి భూరియుత్సవములు
    ..........బయలుదేరుండని పద్మిని యన
    స్కందమాతగ నేడు కనుపించు భ్రమరాంబ
    ..........వేగ రండని ఛాయ వేడ తనను

    లేచి చుక్కల నదలించి, చూచి నిశను
    వీడుకోలుగ చేయూచి, వేచి చూచు
    సరసిజమునకు ముద్దిడి, సతులగూడి
    హరితహయరథ మెక్కినా డర్కు డదియె.

    రిప్లయితొలగించండి
  7. గురుమూర్తి ఆచారి గారి పద్యం.......

    సుమశరమ్ములు వేసి సొలసిపోయిన. యట్టి
    మదను౦డు తా విశ్రమ౦బు చె౦దె
    బాలార్కు డుదయి౦చె ధ్వా౦తము నశియి౦చె
    పా౦డు ద్యుతి దిశలన్ ప్రబలె నౌర
    ద్విజకులారావ గీతిక యుషోదయకాల
    పుణ్యాహవచనంపు స్ఫూర్తి నొసగె
    జనసమూహ౦ బెల్ల దినచర్య గావి౦చి
    "మేలు" గా౦చగ ని౦క మేలుకొనియె

    కాల మను ఘన ప్రవహణ గమన మ౦దు
    ప్రగతి తీరము జేరగ జగతిఁ బ్రజలు
    తరలు చున్నారు మిగుల నుత్కర్ష మొదవ.
    లోకబా౦ధవుడే వారిఁ బ్రోవగలడు

    ప్రవహణ గమనము = ఓడ ప్రయాణము, నౌకాయానము

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పద్యం.....

    మిత్రులందఱకు నమస్సులు!

    సీ.
    "కొక్కొరో...కో" యని కోడి కూయంగనే
    .....పక్షుల కిలకిలల్ బదు లిడఁగనె
    ప్రాగ్దిశా ముఖ మెఱ్ఱఁ బాఱిన యంతనే
    .....లోకంపుఁ బెనునిద్ర లొకపరి సన
    నుఱుకు పర్వులతోడ నువిద లెల్లఱు పనుల్
    .....చక్క దిద్దంగను సరభసిలఁగఁ
    దల్లిఁ గానక లేచి పిల్లవాం డ్రందఱు
    .....గగ్గోలు పెట్టుచు బిగ్గ నేడ్వఁ
    గీ.
    దెల్లవాఱిన దోయంచు ముల్లె మూఁట
    నెత్తి కెత్తి యమ్మఁగ వీథి నెక్కి యఱచి
    "కూరగాయల, సరుకులఁ గొను గొనుఁ" డని
    మొత్తుకొన, సూర్యు నుదయమ్ము నెత్తి నెత్తె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ సూర్యూదయ వర్ణనము సహజసుందరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  9. తూర్పు దిగంగన తోరంపు నుదుటిపై
    ********దిద్దిన గుండ్రని తిలకమనఁగ
    ముజ్జగమ్ముల నేలు ముదిత శీర్షము వీడి
    ********రాలి పడిన శిరో రత్నమనఁగ
    హేల దిక్కరి తతి యెగురవేయుచు పైకి
    ********తోసిన యెర్ర కందుకమనంగ
    నాకాశ సుందరి యందాల కొప్పులో
    ********ముడిచిన మందార పుష్పమనఁగ

    క్షీర సాగరమును మున్ను జిలుకునపుడు
    పైకి వచ్చిన వర సుధా భాండమనఁగ
    జీకటులఁ జీల్చి వెలుగుల రేకలొదవ
    వచ్చుచున్నాడు బాల దివాకరుండు !

    విధులను జాలించి విధుఁడు తారకలతో
    ********విశ్రాంతిఁ గోరుచు వెడలి పోవ
    విచ్చిన నళినమ్ము వెలికి వచ్చిన తేటి
    ********' బ్రతుకు జీవుడ ' యని పరుగులెత్త
    నినుఁ జూడఁగాఁ బాపమని కల్వ భామిని
    ********ముంగోపమునఁ దన మూతి ముడువ
    నిల్వ నీడయు లేదని నిశాచర గణమ్ము
    ********లాదిక్కు కీదిక్కుకడరి పార

    నాద మరచిన జనులెల్ల సేద తీరి
    నిదుర మేల్కాంచి తమ తమ నిత్య కృత్య
    ములకునై పూనికొనుచుండ వెలుగు రేడు
    వచ్చుచున్నాఁడు బాల దివాకరుండు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. విష్ణునందన్ గారూ,
      మనోజ్ఞమైన పద్యాలను అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
  10. పాలక డలిన నుద్భవ మొంది దర్పించి వెడలు లక్ష్మి తిలక బింబ మనగ
    మునులు నదీ తోయముల మునిగి నట బాలార్కు నర్చించుచు నర్ఘ్యము లిడ
    శార్వరీ తిమిరమ్ము సన్నగిల్ల యరుణ కాంతులు జగతిని క్రమ్ముకొనగ
    చౌర సంఘమ్ముల జారుల చిత్తంబు లెల్లను మొత్తంబు తల్ల డిల్ల
    ఆల మంద లచట నంబారవమ్ముల
    పల్లె పడతులంత పాలుబిదుక
    కొక్కురోయనంగ కుక్కుట ములు కూయ
    భానుడు కనిపించె భాసురముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర శర్మ గారూ,
      మీ పద్యం ప్రశంసార్హంగా ఉంది. అభినందనలు.
      ‘మునిగి యట..’ అనండి.

      తొలగించండి
    2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  11. సూర్యోదయంబున?శుభ సూచకంబగు
    ----వేల్పుల వేడుకల్ వెలికివచ్చు|
    ఉదయించ సూర్యుడు కదలించు మనసును
    ----జీవరాసులయందుభావనలను
    అరుణ కిరణమందు మరుగున శక్తియే
    -----మంచు కరుగజేయు మహిమగలది|
    లేతకిరణ మందు లీలలు గమనించ
    -------సోకిన పువ్వుల సొగసునింపు
    స్వార్థ పరులను చీకటి సాకుచుండ
    నీతి వెలుగునులోకాన నిలుపదలచి
    తూర్పు నుదయించు సూర్యుడు మార్పులేక
    చూడ ముచ్చట జూడరేసూర్యు నెపుడు
    2.తూర్పును జీల్చుచు మార్పులు బంచగ
    ------చీకటి పరు గెత్తె సిగ్గుచేత
    తెలవార చుక్కలు వెలవెల బోవగ
    ------కిరణాలుసోకగ మరుగుబడెను
    మసక చీకట్లన్ని మరియాదగావెళ్ళె
    ------సూర్యుని రాకనే చూడబోక
    ఆకస మంతయు నలరించు రీతిగా
    ***---నీలిరంగుపులుమ నేలజేరె
    తూర్పు మార్పులందు తొందర బడబోక
    పశ్చి మానవెలుగు బరచినపుడు
    ఉత్తరమ్ము లూహ చిత్తమ్ము గమనించి
    దక్ష ణమ్మె సూర్యదండ మిడెను|

    రిప్లయితొలగించండి
  12. తిమిరముఁజీలిచి దినమణి యుదయించ
    పాదపమ్ములు మిగుల పరవశించె
    కలువలు చంద్రుని గాంచక చదలపై
    నడరుచు భువిపైన ముడుచుకొనియె
    కమలబాంధవుఁగని కమలముల్ వికసించి
    కమలాకరము లిడె కనులవిందు
    పసిడిపంటలతోడ భరణి తానుప్పొంగి
    బంగారు చాయతో చెంగలించె

    కర్షకులు కరమగు హర్షమ్ముతోడుత
    పయనమైరి పొలము పనులఁజేయ
    నావుదూడలు కడు ఆనందమొందుచు
    గంతులేయు చుండె గయములందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  13. చీకట్లు తొలగించి వెలుగుల నొసగంగ
    చిరునవ్వు తోవచ్చె పూర్వదిశను
    రవిబింబమునుగన రవళించు మనముతో
    రాత్రికి వీడ్కోలు చెప్పినట్టి
    కమలాలు ముదముతో కన్నులు దెరచుచు
    కమలాప్తు గాంచుచు మురిసి పోవు
    చద్దిమూటలు గట్టి చంకనిడుకొనుచు
    చల్లని వేళలో చల్ల చిలికి
    ఆ.వె:ముదము తోడ పతితొ ముచ్చట్లు పల్కుచు
    పొలతి సాగనంపు పొలము కడకు
    తరణి వచ్చు సరికి తానట చేరుచు
    భాను బింబముగని పరవశించె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యభావం బాగుంది. అభినందనలు.
      మొదటిపాదం పూర్వార్ధం, ఉత్తరార్థం, రెండవపాదం ఉత్తరార్ధం, మూడవపాదం ఉత్తరార్ధం యతి తప్పిన స్థానాలు. ‘పతితొ’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. సవరించండి.

      తొలగించండి
  14. తూర్పు తలుపుదీసి దువ్వారమందున
    ..........తొంగి జూడ భువిని తొవలసూడు
    తపనుని తళుకులు తనువంత సోకగ
    .........సరసులోన విరిసె సరసిజములు
    పగలింటిదొర తాక పరువంపు విరులకు
    ...........సిగ్గుతో నెరుపెక్కె బుగ్గలెల్ల
    నిదురమత్తునువీడి విధులకు వెడలంగ
    .........పరుగు దీయు చునుండె ప్రాణికోటి


    ఆలయమ్మునందు నర్చక స్వాములు
    మేలుకొలుపు పాడె వేలుపులకు
    అర్ఘ్య మిడుచు జగతి నరుణోదయమ్మున
    వందనములు జేయు భాస్కరునకు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దువ్వారం’ ద్వారం అనే అర్హంలో కేవలం మాండలికపదం. దానికి గ్రాంధికంలో స్థానం లేదు. ‘తూర్పు తలుపు దీసి తొలుత ద్వారమునందు’ అందామా? ‘స్వాములు... పాడె’ అనారు. పాడిరి అని ఉండాలి కదా. ‘స్వాములు ... పాడ’ అనండి.

      తొలగించండి
  15. అరుణకాంతులతోడ నలరారె గగనమ్ము - భాస్కరునకు చెప్ప స్వాగతమ్ము
    వూల రెమ్మల పైన ముత్యమై మెరిసేను -మంచు బిందువు దిన మణికి మ్రొక్క
    పడుచు హృదయమంత పరచి వేసెను ముగ్గు - సూర్యాగమనవేళ శోభ పెంచ
    విచ్చుకొనగ తాము వెచ్చని కిరణాల - స్పర్శకై కమలాలు పరితపింప

    కక్కొరొక్కొ యనుచు కోడికూయుచునుండ
    గణగణమను గుడి గంట మ్రోగ
    తూర్పుదిక్కునుండి దూసుకొనుచు పైకి
    వచ్చుచుండె బాల భానుడపుడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది అభినందనలు.
      ‘మెరిసేను’ అన్నారు. అది ‘మెరిసెను’కు టైపాటు కావచ్చు.
      ఎత్తుగీతి రెండవ పాదాన్ని ‘గణగణ మనుచు గుడి గంట మ్రోగ’ అనండి. గణదోషం ఉండదు.

      తొలగించండి
  16. రక్త వర్ణపు కాంతి రాజీవములు మెచ్చ
    సూర్యోదయంబయ్యె చురుకు బుట్టె
    అరుణారుణ ప్రభలు అంతటను వ్యాపించి
    అంధకారమునకు ఆశలుడిగె
    నుదుట సింధూరమై నేత్ర పర్వము గాగ
    ఆకాశ మార్గమ్ము అందగించె
    పుడమి పులకరించె పూవులు విచ్చెను
    జన జీవనానికి జవము దోచె
    తే. గీ. దినము నేలిన సూర్యుండు దెసను పొడమి
    వైనతేయుడు సారథై వేగ పడగ
    అర్ఘ్యమిచ్చుచు విప్రులు అంజలింప
    పయనమై సాగె పగటికి పాలకుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మణ మూర్తి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ప్రభలు+అంతటను’ అని విసంధిగా వ్రాశారు. ‘అరుణారుణప్రభ లంతటను...’ అనండి. ‘సారథి+ఐ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘సూతుడై’ అనండి.

      తొలగించండి
  17. పరమేశు కౌగిట పరవశమందగన్
    బడలిక వదనాన పలుచఁ బడగ!
    సరసాలఁ దేలిన మురిపాలె గురుతుగన్
    చిరు దరహాసంపు యరుణిమొదువ!
    నరుణమ్మ మోమున చిరువెల్గు మెరయంగ
    కువకువలవి మేలుకొలుపులనగ!
    కాటుక కంటిని కారు చీకటి రెప్ప
    తొలగించఁ దెరువగ తూర్పు దిశను!

    సూర్యబింబమై కనుగ్రుడ్డు శోభతోడ
    సృష్టి సర్వము జాగృత శృతులఁబొంద
    కరుణ నిండిన ననురాగకిరణగతుల
    జీవరాశుల దినచర్య శ్రేయమందు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దరహాసంపు+అరుణిమ=దరహాసంపు టరుణిమ’ అవుతుంది. కాని ‘అరుణిమ+ఒదవ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘దరహాసంపు టరుణ మొదవ’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
      పరమేశు కౌగిట పరవశమందగన్
      బడలిక వదనాన పలుచఁ బడగ!
      సరసాలఁ దేలిన మురిపాలె గురుతుగన్
      చిరు దరహాసంపు టరుణమొదువ!
      నరుణమ్మ మోమున చిరువెల్గు మెరయంగ
      కువకువలవి మేలుకొలుపులనగ!
      కాటుక కంటిని కారు చీకటి రెప్ప
      తొలగించఁ దెరువగ తూర్పు దిశను!

      సూర్యబింబమై కనుగ్రుడ్డు శోభతోడ
      సృష్టి సర్వము జాగృత శృతులఁబొంద
      కరుణ నిండిన ననురాగకిరణగతుల
      జీవరాశుల దినచర్య శ్రేయమందు!

      తొలగించండి
  18. గండూరి లక్ష్మినారాయణ గారి పద్యము....

    తూరుపు కొండల దారులలో వచ్చు
    తొలి మినుకునుగని తొలగు రజని
    దినకరు డుదయించ దిక్దిగాంతమ్ములు
    వెలుగు మనోహరం బలుము కొనును
    సుప్రభాతమును జూచి ప్రకృతి కన్య
    ప్రమదమొప్పమిగుల పరవశించు
    జంతు పక్షి చయము జనతతి మేల్కొని
    కరము తోషమున స్వాగతము పలుకు

    కమల బాంధవు పొడగని కమలములును
    విచ్చుకొని ప్రియ తేటుల పిలుచుచుండు
    పిల్ల గాలికి సుమములు మెల్లగాను
    పంచు సూర్యోదయపు వేళ పరిమళములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దిగ్ధిగాంతమ్ములు, సుప్రభాతమ్మును’ అనవలసింది టైపాటు కావచ్చు.

      తొలగించండి
  19. రక్త వర్ణపు కాంతి రాజీవములు మెచ్చ
    సూర్యోదయంబయ్యె చురుకు బుట్టె
    అరుణారుణ ప్రభలు అంతటను వ్యాపించి
    అంధకారమునకు ఆశలుడిగె
    నుదుట సింధూరమై నేత్ర పర్వము గాగ
    ఆకాశ మార్గమ్ము అందగించె
    పుడమి పులకరించె పూవులు విచ్చెను
    జన జీవనానికి జవము దోచె
    తే. గీ. దినము నేలిన సూర్యుండు దెసను పొడమి
    వైనతేయుడు సారథై వేగ పడగ
    అర్ఘ్యమిచ్చుచు విప్రులు అంజలింప
    పయనమై సాగె పగటికి పాలకుండు

    రిప్లయితొలగించండి
  20. కొక్కొరోకో యని కుక్కుటంబులు గూసె
    భూపాళరాగములు భువిని యంతయు నిండె
    కేకి పింఛము క్రేంకరించె
    కిల కిలా రవముల కీర పికాదులు
    గువ్వ కపోతముల్ గూడు విడీచె
    అజ్ఞానతిమిరంబు అస్తమించెడు రీతి
    ఉదయభానుడు తూర్పు నుద్భవించె
    తే.గీ/ జీవ జాలమ్ము పుడమియు చేతనమ్ము
    పొంద,నూత్నకాంతులమర పొద్దు పొడిచె
    పల్లె జనాలను పట్టి లేపె
    మిత్రుడై ప్రభాకరుడయి మింటి మార్గ
    మూని చరియింప యుదయించె మోదముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మణ మూర్తి గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో నేను పైన సూచించిన దోషాలు అలాగే ఉన్నాయి. సవరించలేదు.
      రెండవపద్యంలో మొదటిపాదం ఉత్తరార్ధంలో గణదోషం. ‘భూపాలరాగముల్ భువిని నిండె’ అనండి. రెండవపాదం పూర్వార్ధం టైప్ కాలేదు. ద్వితీయార్ధంలో గణదోషం. ‘కేకి పింఛము విప్పి క్రేంకరించె’ అనండి. మూడవపాదం పూర్వార్ధంలో క్రియాపదం లోపించింది. ‘కిలకిల రవముల కీరపికములు చేసె’ అనండి. ‘తిమిరంబు అస్తమించెడు’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ సంధి నిత్యం. ‘అజ్ఞానతిమిరమ్మె యస్తమించెడు’ అనండి. ఎత్తుగీతి మూడవపాదంలో గణదోషం. ‘పల్లె జనులను పశువులన్ పట్టి లేపె’ అందామా? ‘చరియింప నుదయించె’ అనండి.

      తొలగించండి