11, అక్టోబర్ 2013, శుక్రవారం

పద్య రచన – 491 (సరస్వతీ పూజ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
 “సరస్వతీ పూజ”

31 కామెంట్‌లు:

  1. భారతి వనుచు నుత్తమ భక్తి గొలుతు
    నాదు సేవకుడంచును నన్ను బ్రోచి
    తీయ తేనియ పలుకుల నీయ వమ్మ
    జన్మ తరియించు భావాలు జాలు వార!

    రిప్లయితొలగించండి
  2. తెల్లని హంస వాహనము తెల్లని దుస్తుల తెల్ల తామరన్
    చల్లని చూపుతో నిలిచి జల్లుగ జల్లుచు సర్వప్రాణిపై
    నుల్లము లుల్లసిల్ల పరమోత్తమ జ్ఞానము మాట నేర్పుచున్
    తల్లిగనున్న భారతికి దండము బెట్టుదు వాక్కు శుద్ధికై.


    రిప్లయితొలగించండి
  3. సహదేవుడు గారూ ! జన్మ తరియించు భావాలు జాలు వార!....బాగుంది...

    రిప్లయితొలగించండి
  4. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! మంచి పద్యమును చెప్పేరు. అభినందనలు. వాక్కు శుద్ధికై కి బదులుగా వాగ్విశుద్ధికై అంటే చాల బాగుగ నుండును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. గోలి వారికి ధన్యవాదములు. తమరి పద్యం తెల్లగా, చల్లగా నల్లమలరించేలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. గోలి వారికి ధన్యవాదములు. తమరి పద్యం తెల్లగా, చల్లగా నుల్లమలరించేలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ ! ధన్యవాదములు.
    శ్రీ నేమానిగారికి నమస్కారములు..మీరు చూపిన చక్కని సవరణతో....

    తెల్లని హంస వాహనము తెల్లని దుస్తుల తెల్ల తామరన్
    చల్లని చూపుతో నిలిచి జల్లుగ జల్లుచు సర్వప్రాణిపై
    నుల్లము లుల్లసిల్ల పరమోత్తమ జ్ఞానము, మాట నేర్పుచున్
    తల్లిగనున్న భారతికి దండము బెట్టుదు వాగ్విశుద్ధికై.

    రిప్లయితొలగించండి
  8. శారదా భుజంగోత్ప్రేరిత శారదా స్తుతి:

    మనీషా! ప్రవీణా! మహేంద్రాది పూజ్యా!
    పునీతాంతరంగా! పురంధ్రీ లలామా!
    మనోజ్ఞ ప్రమోదా! మనోஉభీష్ట దాయీ!
    వనేజాంబకాంబా! భజే శారదాంబా!!

    మనః క్లేశ దూరీ! మనోల్లాస కారీ!
    మనః కావ్య కల్పా! మనోత్తేజ వాక్యా!
    మనః పద్య రూపా! మనోజాత భాషా!
    వనేజాంబకాంబా! భజే శారదాంబా!!

    వినోద ప్రదాత్రీ! విశిష్టాధి నేత్రీ!
    కనద్భవ్య తంత్రా! ఘనోద్బీజ మంత్రా!
    సునీతాప్త వాక్యా! సుధాపూర్ణ వాణీ!
    వనేజాంబకాంబా! భజే శారదాంబా!!

    ఘనశ్లోక వంద్యా! కరే పుస్తకాఢ్యా!
    మనుప్రోక్త సూత్రా! మనః కల్పవృక్షా!
    ధనౌన్నత్య విద్యా! ధరవ్యాప్త శాస్త్రా!
    వనేజాంబకాంబా! భజే శారదాంబా!!

    రిప్లయితొలగించండి


  9. భక్తి శ్రధ్ధలతోడన పరమ శివుని
    సోద రిసరస్వతి నిపుడు నాదరమున
    పూజచేసిననిచ్చును బుణ్య మార్య!
    కల్లకాదిది నిజమునే పల్కు చుంటి

    రిప్లయితొలగించండి
  10. శ్రీవాణీ శుభశోభితాంఘ్రియుగముల్ సుస్తోత్ర శ్లాఘార్హముల్
    దేవేరీ పదపద్మముల్ నిరతమున్ తేజిల్లు ద్యుత్యర్హముల్
    శ్రీవిద్యాచరణారవిందములు రాశీభూత కారుణ్యముల్
    దేవీ! నాదు శిరంబు పీఠముగ నుద్దేశించి యర్పింపనో?

    రిప్లయితొలగించండి
  11. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు:

    1. యుగముల్: యుగము అనగా 2 అని అర్థము. యుగముల్?
    2. 1వ పాదములో యతిని విస్మరించేరు.
    3. స్తోత్రము అనినా శ్లాఘము అనినా ఒకటే అర్థము.
    4. తేజిల్లు అన్నారు - తేజరిల్లు అనుట సాధువు అనుకొంటాను.
    పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచేను. కొన్ని సూచనలు:

    1. నాదరమునకి బదులుగా సాదరమున అనండి.
    2. 4వ పాదములో యతిని మరిచేరు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. విద్యాధినేత్రి! మాతా!
    సద్యః స్ఫురణ ప్రదాత్రి! శారద! వాణీ!
    మద్యోగ్య పద్య ధాత్రీ!
    మాద్య న్మంగళ సుగాత్రి! మాన్య!నమస్తే!

    రిప్లయితొలగించండి
  14. అయ్యా,
    ధన్యవాదములు.
    నాకు భాషమీద తగినంత పట్టులేదు. ప్రయత్నమే చేస్తున్నాను.
    మీ వంటి పెద్దవారి మార్గదర్శనము, సూచనలు నాకు అత్యవసరము.
    సవరించేందుకు ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  15. యుగమౌ
    యుగమౌ జ్ఞేయమ్ము
    దీపించు (తేజిల్లు, తేజరిల్లు ఒకటే అని ఆంధ్రభారతిలో చూసినపుడు పొరబాటుగా గ్రహించినాననుకుంటాను.)

    నా సవరణల వల్ల నాకేమీ తృప్తి కలుగలేదు.
    తల్లి అనుగ్రహం చూపినపుడు మరలా ప్రయత్నిస్తాను.
    మీకు మరీ మరీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
    4 మంచి శ్లోకములను వ్రాసేరు. ఒకే ప్రాస తీసుకొని వ్రాయుట ముదావహము. ప్రాస నియమమును పాటించేరు కాబట్టి తెలుగు ఛందస్సును వాడాలి. తెలుగుఛందస్సులో భుజంగప్రయాతమునకు 8వ అక్షరము యతి అయి ఉండవలెను. మీరు సంస్కృతము ప్రకారము 7వ అక్షరమును యతి స్థానముగా పాటించేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. ayyaa! Sree sahadEvuDu gaaroo! SubhaaSeessulu.
    mee padyamu caalaa baaguga nunnadi. abhinandanalu.
    swasti.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు.మరియు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమానిగారికి,గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    అమ్మా!విద్దెలతల్లి!పల్కుకలికీ!అజ్ఞానమున్ బాప రా
    వమ్మా శారద!భారతీ!మినుకుగొమ్మా!శుక్ల!వేదాగ్రణీ!
    అమ్మా బ్రాహ్మి!సనాతనా!మృదులవీణాపాణి!యాశీస్సులన్
    యిమ్మా స్తోత్రము జేతుమమ్మ నితమున్ యీదేశమున్ గావగా

    కచ్ఛపి పైన సౌహృదపు గానము పాడుచు హాయి గూర్చి మా
    తుచ్ఛపు జీవితమ్ములను దుర్భర దుస్సహ వేధ దీర్చుచున్
    మ్లేచ్ఛ మదాంధ నీచులకు మేలగు జ్ఞానమునిచ్చి గావుమా
    స్వేచ్ఛనుగల్గి యెల్లరును స్నేహము సౌఖ్యము శాంతి నొందగన్

    వరములొసంగు ధాతసతి!వాణి!సరస్వతి!నాదు దేశమున్
    స్థిరముగ నిల్పి జ్ఞానమను దీపిక వెల్గు కలు౦గ జేసి నీ
    కరుణను దేశవాసులకు క్లైబ్యము వీడగ ధీరులై తగన్
    సరగున రాజకీయ మత సామ్యము,చేతన గల్గజేయుమా

    రిప్లయితొలగించండి
  20. కాళి దాసును కానంటి కావ్య మలర
    నిన్ను బొగడగ నేనెంత సన్ను తించి
    విద్య వినయము లొసగెడి పద్య రచన
    కరుణ కురిపించి దీవించు కల్ప వల్లి

    రిప్లయితొలగించండి
  21. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు. మంచి పద్యములను వ్రాసేరు. అభినందనలు. చిన్న సూచనలు:

    1, ధాత సతి అనుట సాధువు కాదు -- ధాతృసతి అనుట యొప్పు.

    2. క్లైబ్యము అంటే నపుంసకత్వము అని అర్థము కదా. మీరు ఏ భావముతో ప్రయోగించిరో కదా.

    రిప్లయితొలగించండి
  22. పూజ్యులు నేమానివారికి నమస్కారములు! శారదా స్తుతి తమకు నచ్చినందుకు కృతజ్ఞతలు.

    శంకరాచార్యులవారి శారదా భుజంగ శ్లోకోత్ప్రేరితుఁడనై, నేను సంస్కృత మర్యాద ననుసరించియే వ్రాసితిని. అలవాటు ప్రకారము ప్రాస పడినది. తమ రన్నట్లుగా నివి శ్లోకములే కాన, యతి స్థానము కూడ సంస్కృత మర్యాదననుసరించియే వేయఁబడినది. తమరి సూక్ష్మ పరిశీలనకు జోహారులు! తెలిపినందులకు ధన్యవాదములు.

    సర్వదా
    భవదీయ విధేయుఁడు,
    గుండు మధుసూదన్.

    రిప్లయితొలగించండి


  23. మల్లియ, చందమామ, తెలి మంచు తుషారపు హార దీధితుల్
    తెల్లనఁ బోవు నీ తనువు తెల్లని కాంతికి వాణి! దివ్యమౌ
    తెల్లని యంబరమ్మునను, తెల్లని పద్మము నందు నిన్గనన్
    యుల్లము పొంగదే జనుల కుర్విని యీ నవరాత్రి వేళలో!

    ఏ పాదాబ్జములన్ విరించి కొలుచున్ సృష్ట్యాదిలో శక్తికై?
    ఏ పాదాబ్జపు నీడలో హరి జగమ్మేలంగ సంశక్తుడౌ?
    నే పాదాబ్జ మహద్రజో గరిమచే నీశుండు సంహర్తయౌ?
    నీ పాదాబ్జము లెన్నగా నవియె వాణీ! సంశయ మ్మేలనో.

    తల్లీ! నిన్ను దలంచిన
    యుల్లము లుప్పొంగు వాక్కు లుబుకును ఝరులై!
    ఫుల్లాబ్జాక్షి! సరస్వతి!
    చల్లని నీ చూపు సోక సౌభాగ్య మగున్.

    రిప్లయితొలగించండి
  24. పూజ్యులు నేమానివారికి నమస్కారములు!

    మీ సూచన మేరకు "ధాతసతి"కి బదులుగా"ధాతృసతి"

    అని సవరించుకున్నాను.ధన్యవాదములు.

    ఆచార్య జి.యన్.రెడ్డి గారి తెలుగు పర్యాయ పద నిఘంటువు లో (1316 పేజీ 67) లో క్లైబ్యము అను మాటకు పిరికితనము

    అధైర్యము, అపౌరుషము,భీరుత్వము అను అర్ధములున్నవి. పిరికితనము అను అర్ధములో ఆ మాటను ఉపయోగించితిని.

    రిప్లయితొలగించండి
  25. మిస్సన్న గారూ,
    ఝరులే ఉప్పొంగినాయి. మీ పద్యం లో ఉన్న కవిత్వం ఆకట్టుకుంటున్నది.

    రిప్లయితొలగించండి
  26. నేమాని పండితార్యా! పొరబాటును దిద్దుకొన్నాను.

    మల్లియ, చందమామ, తెలి మంచు తుషారపు హార దీధితుల్
    తెల్లనఁ బోవు నీ తనువు తెల్లని కాంతికి వాణి! దివ్యమౌ
    తెల్లని యంబరమ్మునను, తెల్లని పద్మము నందు చూడగా
    నుల్లము పొంగదే జనుల కుర్విని యీ నవరాత్రి వేళలో!

    ఏ పాదాబ్జములన్ విరించి కొలుచున్ సృష్ట్యాదిలో శక్తికై?
    ఏ పాదాబ్జపు నీడలో హరి జగమ్మేలంగ సంశక్తుడౌ?
    నే పాదాబ్జ మహద్రజో గరిమచే నీశుండు సంహర్తయౌ?
    నీ పాదాబ్జము లెన్నగా నవియె వాణీ! సంశయ మ్మేలనో.

    తల్లీ! నిన్ను దలంచిన
    నుల్లము లుప్పొంగు వాక్కు లుబుకును ఝరులై!
    ఫుల్లాబ్జాక్షి! సరస్వతి!
    చల్లని నీ చూపు సోక సౌభాగ్య మగున్.

    రిప్లయితొలగించండి
  27. లక్ష్మీ దేవి గారూ! ధన్యవాదాలు.
    నిరుత్సాహ పడవద్దు. మీ పద్యం సత్సమాసభూయిష్టమై అలరారుతోంది.
    మీపై శారదా కరుణాకటాక్షం పుష్కలంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  28. శ్రీవాణి నిన్ను మనము
    నావాలము జేసుకొంటి నానందముగా
    నీవే శరణము మాతా!
    కావవె శారద! చదువుల కమ్మని తల్లీ!

    రిప్లయితొలగించండి
  29. శ్రీవాణీ మృదుపాణీ
    తావక కరుణామృతంబు దక్కుట కొఱకై
    కోవిదులెల్లరు గొలిచెడు
    పావన వదనారవింద వందనమమ్మా.

    రిప్లయితొలగించండి