27, ఆగస్టు 2015, గురువారం

సమస్యాపూరణ - 1771 (దుస్ససేనుని యర్ధాంగి ద్రుపదతనయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దుస్ససేనుని యర్ధాంగి ద్రుపదతనయ.

31 కామెంట్‌లు:

  1. భీమసేనుండు తా జంపి భీకరముగ
    దుస్ససేనుని - యర్ధాంగి ద్రుపదతనయ
    కురులకాతని వేడి నెత్తురును పూసి
    ముడిని వేతునని ప్రతిన బూనినాడు

    రిప్లయితొలగించండి
  2. తొడలు విరిచెను భీముడు మడియు వరకు
    దుస్ససేనుని- యర్ధాంగి ద్రుపద తనయ
    కుసుమ సౌగంధి కమ్మును కోరి నంత
    వెసను బడకుండ దెచ్చెను ప్రియము గాను

    రిప్లయితొలగించండి
  3. మగని మరణము కనుగొని మల్లడిగొనె
    దుస్ససేనుని యర్థాంగి, ద్రుపదతనయ
    కొప్పుముడిచెను బకవైరి యొప్పుగాను
    మొదటి కోర్కె తీరెనటంచు మోదమలర

    రిప్లయితొలగించండి
  4. భీము డెవరిని వధియించె భీకరముగ?
    సత్యవతి యేమగును రాజు శంతనునకు?
    పాండవులపత్ని యెవ్వరు? వరుసగాను
    దుస్ససేనుని, యర్ధాంగి, ద్రుపదతనయ!!!

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    దుస్ససేనుని యర్ధాంగి, ద్రుపదతనయ
    తోడికోడండ్రు గానఁ గ్రతువునఁ గాంచి
    సంతసించిరి తాము స్త్రీసహజమైన
    పేరఁటమ్మునఁ గలసిన విధమెఱింగి!

    రిప్లయితొలగించండి
  6. దుస్ససేనుని యర్థాంగి, ద్రుపదతనయ
    యిరువురొకయింటి కోడండ్రు నరయ గాను
    రాజ్య కాంక్షయే చిచ్చును రగులజేయ
    కౌరవ వినాశనమునకు దారితీసె !!!

    రిప్లయితొలగించండి
  7. కదనమునకును బోవగా కదలుచుండ
    శిరము విదిలించి ముడిలేని కురుల జూపి
    గుర్తుజేసె భీమునకును కూల్చ ననిని
    దుస్ససేనుని, యర్థాంగి ద్రుపదతనయ

    రిప్లయితొలగించండి
  8. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

    అతిగ విలపించె భీకరమృతినిఁ గాంచి
    దుస్ససేనుని యర్ధాంగి; ద్రుపదతనయ
    పతికి నెదురేగి తన కేశతతినిఁ జూప
    రుద్రరూపుఁడు భీముఁడు రుధిర మలఁదె.

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులకు నమస్కృతులు.
    మిత్రులు గుండు మధుసూదన్ గారు ఈనాటి సమస్యలోని ఒక వ్యాకరణాంశాన్ని తెలియజేసారు. ‘దుస్ససేనుని యర్ధాంగి’ అన్నప్పుడు ‘దుస్ససేనుని యొక్క భార్య’ అనే అర్థంలో అది షష్ఠ్యంతం అవుతుంది. కొందరు తమ పూరణలో ‘దుస్ససేనుని’ శబ్దాన్ని ద్వితీయాంతంగా స్వీకరించారు. కాని అది ద్వితీయాంతంమైనప్పుడు ద్రుతాంతం కనుక ‘దుస్ససేనుని నర్ధాంగి’ కావాలి. కాని సమస్య ఆవిధంగా లేదు. క్రమాలంకారంలోను, విరుపుతోను పూరించడానికి అవకాశం లేదు. గమనించండి. ‘దుస్ససేనుని’ శబ్దాన్ని ద్వితీయాంతంగా ఇప్పటి వరకు ప్రయోగించినవారు చంద్రమౌళి సూర్యనారాయణ గారు, రాజేశ్వరి అక్కయ్య, శైలజ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని ‘దుస్ససేనుని’ శబ్దం ద్వితీయాంతమైంది. సవరించండి.
    ******
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని ‘దుస్ససేనుని’ శబ్దం ద్వితీయాంతమైంది. సవరించండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పూరణను గుండు మధుసూదన్ గారు ప్రశంసించారు. ‘బకవైరి.... మొదటి కోర్కె తీర్చె ననుచు...’ అన్న సవరణను సూచించారు.
    *****
    శైలజ గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగున్న్దది. అభినందనలు.
    కాని ‘దుస్ససేనుని’ శబ్దం ద్వితీయాంతమైంది. సవరించండి.
    ******
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని ‘దుస్ససేనుని’ శబ్దం ద్వితీయాంతమైంది. సవరించండి.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీగురుభ్యోనమ:

    వ్రాయమని కోరి విగ్రహవాక్యములను
    కొన్ని పదముల నిచ్చిరి గురువుగారు
    వాటి యందున నీ రెండు వరుస నుండె
    దుస్ససేనుని యర్ధాంగి, ద్రుపదతనయ

    రిప్లయితొలగించండి
  11. కాళిదాసు తాబల్కె కవి కాకమున్ను
    కెంపు చూడగా తానుండు కుంపటివలె
    కోతి తలపైన రెండేసి కొమ్ములుండు
    దుస్ససేనుని యర్ధాంగి ద్రుపద తనయ

    రిప్లయితొలగించండి
  12. భీమసేనుండు తాజంపె భీకరముగ
    దుస్ససేనుని;యర్ధాంగి ద్రుపద తనయ
    కేశములను రుధిరమందు కేలుతోడ
    తడుపు చుండ ముదము నందె తరుణి తాను.

    రిప్లయితొలగించండి
  13. భారతాజిని ఘోరాతి ఘోరముగను
    భీమసేనుడు,పతి జంపి విధవ జేసే
    దుస్ససేనుని యర్ధాంగి.ద్రుపద తనయ
    కొప్పు ముడి వైచి కొనే తన కోర్కె దీర

    రిప్లయితొలగించండి

  14. నా పద్యం తొలిపాదం "కాళి దాసుతాననె కవి కాకమున్ను" అని సవరిస్తునాను

    రిప్లయితొలగించండి
  15. రొమ్ముఁ జీల్చి వెచ్చని రుధిరమ్ముఁ ద్రావి
    పగతు నిర్జింపఁ బతిఁ గోరె బవరమందు
    సరకు గొనదప్డు విధవయై పరితపించు
    దుస్ససేనుని యర్ధాంగి ; ద్రుపద తనయ...


    (యుద్ధంలో పగవాని రొమ్ము చీల్చి వాని వెచ్చని రక్తం త్రాగి చంపివేయమని ద్రౌపది తన పతి యైన భీముని కోరింది. ఆ సమయంలో దాని వలన వైధవ్యం పాలై పరితపించు దుస్ససేనుని అర్ధాంగిని పరిగణనలోకి తీసుకొనదు.)

    రిప్లయితొలగించండి
  16. భీమ సేనుడు వధియించి భీకరముగ
    దుస్స సేనుని, యర్ధాంగి ద్రుపద తనయ
    కేశముల బూసె రక్తమ్ము క్లేశమణగ
    స్త్రీల హింసించ పడియెడు శిక్ష నిదియె !!!


    రిప్లయితొలగించండి
  17. దుస్ససేనుని యర్ధాంగి ద్రుపదతనయ
    ఇరువురును తోడి కోడళ్ళు వరుసచేత
    రాజ్య కాంక్ష దుర్యోధను రణము జేయ
    ఘోరమౌ వైర మేర్పడె వారిలోన.

    రిప్లయితొలగించండి


  18. దుస్స సేనుని యర్ధాంగి ద్రుపద తనయ

    లిరువు రొ కయింటి వారుగా నిలను దనరి

    సాటి వారల యందున మేటి యగుచు

    బేరు పొందిరి యుత్తమ నారి లుగను

    రిప్లయితొలగించండి
  19. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు కూడా ‘దుస్ససేనుని’ శబ్దాన్ని ద్వితీయార్థంలో ప్రయోగించారు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది.అభినందనలు.
    మీరుకూడా ‘దుస్ససేనుని’ శబ్దాన్ని ద్వితీయార్థంలో ప్రయోగించారు. పద్యం చివర ‘శిక్ష యిదియె’ అనండి.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దుర్యోధను రణము జేయ’ అన్నప్పుడు డుప్రత్యయం లోపించి అన్వయక్లేశం ఏర్పడుతున్నది. ‘రాజ్యకాంక్షతో రారాజు రణము జేయ’ అనండి.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘నారులుగను’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. సవరించిన పూరణ.

    భీమడు పతిని వధియింప బేల యయ్యె
    దుస్ససేనునియర్ధాంగి ,ద్రుపద తనయ
    క్లేశ మణగగ ముడిచెను కేశములను
    స్త్రీల హింసించ పడియెడు శిక్ష యిదియె !!!


    రిప్లయితొలగించండి
  21. భర్త పాపమ్ము సగపాలు భార్య కంది
    పతివియోగియై విలపించె ప్రమద యామె
    దుస్స సేనుని యర్థాంగి, ద్రుపద తనయ
    పంతమున్ నెరవేర్చె నా వాయుసుతుడు

    రిప్లయితొలగించండి
  22. పతిని నిలదీసి ప్రశ్నించె పాతకమని
    దుస్ససేనుని యర్ధాంగి, ద్రుపద తనయ
    చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చఁ సింహబలుడు
    ఖేదమెవరికని వగచి ఖిన్నకంఠి.

    రిప్లయితొలగించండి
  23. మంద పీతాంబర్ గారూ,
    మీ సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. భీమ,గాంధారికిన్ మేనమామ నకుల
    దుస్స సేనుని యర్దాంగి ద్రుపద తనయ
    దార్థరాష్ట్రుని తమ్ముడే ధర్మరాజు
    సురభి నాటకమందున చూడగాను.

    రిప్లయితొలగించండి
  25. దుస్ససేనుని- యర్ధాంగి ద్రుపద తనయ
    పతిని కోరెను మదిలోని పగను దీర్చ
    తొడలు విరుచుము నాతడు మడియు వరకు
    వెసను బడకుండ భీముడు విరిచె నంట

    రిప్లయితొలగించండి
  26. దుస్ససేనుని- యర్ధాంగి ద్రుపద తనయ
    పతిని కోరెను మదిలోని పగను దీర్చ
    తొడలు పగులంగ గదతోన మడియు వరకు
    వెసను బడకుండ భీముడు విరిచె నంట

    రిప్లయితొలగించండి
  27. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భీమసేనుడు హతమార్చెభీకరమున
    దుస్ససేనుని , యర్ధాంగి ద్రుపదతనయ
    కేశసంపద ముడివేసి కినుక దీర్చె
    రక్త పూరిత కరముల రక్తిగొలుప

    రిప్లయితొలగించండి
  28. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో అన్వయదోషం ఉంది.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ‘దుస్ససేనుని’ శబ్దాన్ని ఎక్కడో అన్వయింపజేయడం సబబుగా లేదు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని ‘దుస్ససేనుని’ శబ్దం ద్వితీయాంతమైతే ‘దుస్ససేనుని నర్ధాంగి’ అని ఉండాలి. కాని సమస్యలో ఆ విధంగా లేదు.

    రిప్లయితొలగించండి
  29. భీమసేనుడుయచ్చోట భీకరముగ
    రణమున నన్ జంప విధవయ్యె రాణియైన
    దుస్ససేనుని యర్ధాంగి;ద్రుపద తనయ
    పంతమును దీర్చె ముదమున పాండు సుతుడు.

    రిప్లయితొలగించండి
  30. *అయ్యా ఇవి కంది వారి బ్లాగులో మీ పూరణ లని మీరు ప్రకటించుకున్న పద్యాలపై నా సూచనలు*


    🍃🌹🍃🌹🍃🌹🍃🌹
    శంకరాభరణంవారి సమస్య

    " మంచముక్రిందను జొరబడె మానధనుండై ".
    *****************************
    నా పూరణలు..కందములలో
    *******************************
    బృందావనం ధన్వంతరి
    🌹🙌🙌🌹🙌🙌🌹


    త్రుంచగ గొడ్డలి బట్టుచు ,
    యంచితకోపాగ్నివచ్చు నాభార్గవునిన్
    గాంచినజనకుడు, పరుగిడి
    మంచముక్రిందన్ జొరబడె మానధనుండై.౼౼1
    (జనకుడు= జనకమహారాజు).


    *ఇది సరైన పూరణకాదు.*

    క్షత్రీయుడు ప్రాణ రక్షణ నిమిత్తం మంచం క్రిందదూరితే మానధనుడు కానేరడు

    *సమస్య పరిష్కారం జరుగలేదు*
    ******************************
    ఎంచగ బౌరుషమున సా
    ధించెనునైజాముగడ్ఢ ధీరపటేలున్
    వంచితసంస్థానప్రభువు
    మంచముక్రిందన్ జొరబడె మానధనుండై.౼౼2

    *ఇక్కడ కూడ ప్రభువు మానధనుడు కానేరడు*

    ******************************

    ఫింఛనుకార్యాలయమున
    లంచముగొనువాడుదొరికె లాజిక్కున, యా
    వంచితుడంతట పందిరి
    మంచముక్రిందన్ జొరబడె మానధనుండై.౼౼3


    *ఇక్కడ సమస్య పూరణలో మానధనుడు లంచగొండి కానేరడు*
    *పైగా పింఛను లాజిక్కులు పదాలు వ్యావహారికాలు కంది వారు అంగీకరించీనా మన శేషుకుమారు గారు అంగీకరించరు*

    ******************************

    అంచితసేవనొనర్చుచు
    మంచిగవైద్యమునుచేసి మానినులందున్
    వాంఛగలవాని పట్టిరి
    మంచముక్రిందన్జొరబడెమానధనుండే. ౼౼4

    ఇది పరవాలేదు. అతడు మానధనుండెట్లౌతాడు అని ప్రశ్నించారు కాబట్టి.

    *అయినా*
    *ప్రాస చ ..ఛ..లు ఉత్తమములుకావు*
    🙌🌹🙌🌹🙌🌹🙌🌹

    కంది వారు అభ్యంతరం చెప్పలేదంటే ..కవిలోకం ఆశ్చర్యపోతుంది.
    కందివారి బ్లాగు విలువకూడా సన్నగిల్లుతుంది.

    రిప్లయితొలగించండి