24, ఆగస్టు 2012, శుక్రవారం

పద్య రచన - 91

 
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. బుద్ధుడవట గురులందు ప్ర
    బుద్ధుడవట దనుజ సతుల మును జెరచిన యో
    యిద్ధచరిత! ధర్మరతా!
    శుద్ధమతిన్ దలతు నీదు శుభకర లీలల్

    వరబల మత్తులై విజయవైభవులై భువనాళి నేలుచున్
    పురదనుజుల్ దురాత్మకులు ముప్పులు గూర్చుచునుండ నార్తితో
    సురలు మునీశ్వరుల్ నలుగుచున్ దమ గోడును విన్నవింపగా
    హరి హరు లాపరిస్థితుల నన్నిటి దిద్దగ బూని కూర్మితో

    త్రిపురాసురుల సతుల్ స్నిగ్ధ పాతివ్రత్య
    ....మహిమాన్వితలు గాన మాయజేత
    వారి పాతివ్రత్య భంగమ్ము గానంత
    ....వరకు నా దనుజు లవధ్యులగుట
    పన్నాగ మొక్కటి పన్నెను బుద్ధుడై
    ....యసుర పత్నుల గురువై మురారి
    వారిలో పెంచె విశ్వాసమ్ము తదుపరి
    ....మానభంగము జేసె మాయవలన
    నటుల నవ్వారి మహిమలు నంతమొంద
    జేసి శ్రీహరి శంభుని జీరి యతని
    నయ్యసుర నాయకుల డాయనాహవమున
    కఖిల సన్నాహములు జేసి యనిపె నంత

    అఖిల భూవలయమ్ము స్యందనంబయ్యెను
    ....రవి సుధాకరులు చక్రంబులైరి
    తోరంబుగా శ్రుతుల్ తురగంబులయ్యెను
    ....సారథి యయ్యెను జలజసూతి
    కాంచన శైలంబు కార్ముకంబయ్యెను
    ....నాగాధిపుడు వింటి నారియయ్యె
    నారాయణుడు పటు నారాచమై యొప్పె
    ....నగ్నినేత్రుడు రథియై చెలంగె
    నతి భయంకరంబైన యయ్యాహవమున
    త్ర్యంబకుండు విజృంభించి దనుజులపయి
    వేసి నారాయణాస్త్రమున్ దీసె వారి
    ప్రాణముల దేవబృందముల్ ప్రస్తుతింప

    అటుల త్రిపురాసురులు గూలి రాహవమున
    మూడు లోకములకు దప్పె ముప్పులటుల
    జయము జయము మహేశ్వరా జయము జయము
    జయము జయము జనార్దనా జయము జయము

    రిప్లయితొలగించండి
  2. మిత్రులారా!
    ఈనాటి శీర్షికను "పౌరాణిక బుద్ధునిగా" నేను భావించి యటులనే పద్యములను వ్రాసేను. పురాణముల ప్రకారము త్రిపురాసురులు మహా దర్పముతో మూడు లోకములను పీడించుచుండగా హరిహరులు వారిని సంహరించుటకు పూర్వము శ్రీహరి బుద్ధావతారమున మాయా గురువుగ జని ఆ త్రిపురాసుర పత్నుల మానభంగము గావించి వారి పాతివ్రత్య బలమును నశింపజేసెను. పిదప శంకరుడు నారాయణాస్త్రముతో ఆ త్రిపురురాసురులను సంహరించెను.

    తత్త్వ ప్రయోజనము:
    జీవునికి గల మూడు దేహములే త్రిపురాసురులు. జీవుడు త్రిపురముల ప్రభావమునకు లొంగి తన నిజ స్వరూపమును మరచును. అంతట గురువుల ఉపదేశముతో ఆ దుష్ట భావన (దేహ భావన) పోయి ఆత్మ భావన కలుగుటయే త్రిపురా సంహారములోని అంతరార్థము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. నేమాని పండితార్యా అందరినీ ధన్యులను జేసినారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. చపల చరిత్రులసత్యము
    లపరీణులధర్మరతుల దమమునడచగా
    నపరాధుల నిర్మూలన
    ము పరగ బుద్ధుడదె సలిపె మోదములలరన్.

    రిప్లయితొలగించండి

  5. అవతారము లన్నిట నీ
    యవతా రమె మహిమ గలది యార్యా ! బుద్దా !
    యె వ రి ని బాధించ కు డ ని
    వివరముగా దెలిపి తీ వు విశ్వంబు నకున్ .

    రిప్లయితొలగించండి
  6. నరవర నందనుండు సుగుణమ్ముల రాసి విరాగియై మహీ
    శ్వర పదమున్ ద్యజించి విలసన్మతి తీవ్ర తపమ్ము జేసి స
    ద్గురువయి చెట్టు నీడ తనకున్ సుఖవాసముగా వసించె స
    త్పురుషుడు ధర్మ వర్ధకుడు బుద్ధుడు వానికి నంజలించెదన్

    తిరిగె సన్యాసియై చాల దేశములను
    బౌద్ధమును వ్యాప్తమొనరించె భైక్షుకమగు
    వృత్తిమేలనె మరియు నహింస నెల్ల
    యెడల బోధించె నా బుద్ధు నెద దలంతు

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    మీ ‘త్రిపురాసుర సంహారము’ ఖండకృతి మనోహరమై జ్ఞానదాయకమై శోభిల్లుతున్నది.
    ‘పౌరాణిక బుద్ధుని’ చిత్రం ఏదైన దొరుకుతుందేమో అని గూగుల్‌లో వెదికాను. కాని లభ్యం కాలేదు.
    ఐతిహాసిక బుద్ధుడి గురించిన మీ పద్యాలు కూడా మనోరంజకంగా ఉన్నాయి.
    త్రిపురసంహారఘట్టమున్ దీయనైన
    తెలుగు పలుకుల ఖండకృతిగ రచించి
    మానసోల్లాసముం గూర్చు మాన్యుఁ డీవు;
    ‘జయము పండిత నేమాని జయము మీకు!
    *
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యభావం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మన్నించండి.
    సవరించిన పద్యము.

    చపల చరిత్రులసత్యము
    ల పరీణులధర్మనిరతులను పలువురనా
    యపరాధుల నిర్మూలన
    ము పరగ బుద్ధుడదె సలిపె మోదములలరన్.

    మరొక ప్రయత్నము

    జగమున సత్యము నెలకొ
    ల్పగ, ధర్మనిరతి నిలిపెడు పథమును బూనెన్
    భగవంతుడె బుద్ధుడగుచు
    తగు రూపము దాల్చివచ్చె దయతో నిలపై.

    రిప్లయితొలగించండి
  9. బుద్ధిని బెంచగ నరులకు
    నిద్దరలో శాంత్య హింస నిల్పగ మరి స
    మృద్దిగ యోచించుచు పలు
    బోధనలను జేసి నట్టి బుద్ధుడ! జేజే!

    రిప్లయితొలగించండి


  10. నాకు బుద్ధుని గూర్చి పురాణాలలో వ్రాసింది నచ్చదు.అందుచే చారిత్రక బుద్ధుని గురించి వ్రాస్తున్నాను.

    హింస పెచ్చరిల్లిన యప్పు డిలను జనుల
    శాంతి దు@ఖ భారమున వేసారినపుడు
    శాంత్యహింసల బోధించె సరళభాష
    పంచశీల మార్గమ్మును భవ్య రీతి.

    భరతవర్ష మొక్కటె కాదు వ్యాప్తి జెందె
    దేశదేశాల బుద్ధుని దివ్యవాణి
    భగవదవతారముగ జనుల్ బహువిధముల
    కొలువసాగిరి చైత్యముల్ నిలిపి యందు.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    సమృద్ధిగ అనే పదములో "స" గురువు కాలేదు. లఘువే. అందుచేత మీరు సవరించాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. మూడు పురమ్ములన్ దునుమ మూడగు కన్నుల వేల్పు పూనగా
    తోడుగ నిల్చి బుద్ధునిగ తోడ్కొని శిష్యుల కల్ల చర్చలన్
    వాడిగ సల్పుచున్ కుటిల వాక్కుల దైత్య సతీ లలామలన్
    వాడగ జేసి తీవు గద భర్తల యాయువు దీర శ్రీహరీ!

    రిప్లయితొలగించండి
  13. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!

    మంచి ప్రశంసను జేసితి
    వంచితముగ శంకరయ్య పండితవర్యా!
    నించు ముదమ్మున మిము దీ
    వించెద సుఖ శాంతులొంది పెంపున్ గనుమా!

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    మీ ప్రశంసలు బాగుగ నున్నవి - మీ పద్యములు కూడా బాగుగ నున్నవి. శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. జీవపరిణామ సిద్ధాంత చిత్రములను
    విష్ణు దశరూప సరళియే విశద పఱచు
    లౌకికాలౌకికమ్ము రక్తిఁదెలిసి
    భువిని కోరికల్వీడియున్ బుద్ధుడయ్యె!

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండవ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    నేమాని వారి చెప్పిన గణదోషమే కాక ప్రాసదోషం కూడా ఉంది. నా సవరణ....
    బుద్ధిని బెంచగ నరులకు
    నిద్దరలో శాంత్య హింస నిల్పగ సదస
    బుద్ధిని యోచించుచు పలు
    పద్ధతులను జెప్పు బుద్ధ భగవానుడవే!
    *
    కమనీయం గారూ,
    మీ పద్యాలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. సహదేవుడు గారూ,
    బుద్ధావతార వైశిష్ట్యాన్ని తెలిపిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘లౌకికాలౌకికమ్మగు రక్తి’ అందాం.

    రిప్లయితొలగించండి
  18. బుద్ధుడవై జనించితివి పుణ్య ధరిత్రిని భారతమ్మునన్
    బద్ధుడవై యహింసకు నిబద్ధుడవై దరిలేని ప్రేమకున్
    సిద్ధుడవై దయాంబుధిని శ్రీకర సూక్త విశేష బోధలన్
    శుద్ధుడవై రహించి పురుషోత్తమ చూపితివొక్క మార్గమున్.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికి ప్రణామములు.
    ధన్యవాదములు.టైపుచేయటంలో దొర్లిన తప్పుసరిజేసినందులకు మరోమారు ధన్యవాదములు.స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    గౌతమబుద్ధుడు :

    01)
    _______________________________

    శాక్యవంశంబు నుదయించి - శాంతి కొరకు
    సకల బంధముల్ విడనాడి - సాధువయ్యె !
    సకల ధర్మాది శాస్త్రాల - సారమిదియె
    శాంత్యహింసల పాటించి - సంఘమందు
    సత్య ధర్మాచరణమున - సాగుడంచు
    సంఘ హితమును దెల్పిన - సజ్జనునకు
    శాక్యమౌనికి వందనం - సలుప రండు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  21. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
    శంకరార్యా!చక్కని సవరణ చేసిన మీకు ధన్యవాదములు. రెండవపాదం చివరి పదం నే వ్రాసినది సరియైనదేనా..తెలుపగలరు.

    బుద్ధిని బెంచగ నరులకు
    నిద్దరలో శాంత్య హింస నిల్పగ సదస
    ద్బుద్ధిని యోచించుచు పలు
    పద్ధతులను జెప్పు బుద్ధ భగవానుడవే!

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ,
    సన్మార్గదర్శియైన బుద్ధుడిపై మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ‘శాక్య’ప్రసక్తి ఎవరూ చేయలేదని చూస్తున్నా. మీరు చేసారు. బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘వందనం’ అని వ్యావహారికాన్ని వాడారు.
    ‘శాక్యమౌనికి వందన శతము లిండు’ అని నా సవరణ....
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భావపరంగా మీరు ప్రయోగించిన పదం సరైనదే. కాని సమృద్ధిగ అన్నప్పుడు ‘స’ లఘువే కదా!
    *
    పండిత నేమాని వారూ,
    మీ శుభాశీస్సులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి