25, ఆగస్టు 2013, ఆదివారం

పద్య రచన – 444 (కృష్ణానదీ స్తవము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"కృష్ణానదీ స్తవము"

25 కామెంట్‌లు:

  1. కృష్ణానదీ తల్లి! కీర్తింప లేమమ్మ!
    నీ వైభవమ్ముల నిర్మలాత్మ!
    అతి మధురమ్ములై యలరుచునుండు నీ
    యంబులెల్లను పవిత్రంబులమ్మ!
    భక్తితో నినుజేరి ప్రార్థించి స్నానమ్ము
    జేయగా పాపముల్ చెల్లునమ్మ!
    నీ మంత్రము జపించి నీ నీరమును ద్రావ
    నెల్ల రోగములు నశించునమ్మ!
    పండు ముక్కాలముల చాల పంట లెన్నొ
    నీదు తీరాన భూములన్నియును దల్లి!
    పావన క్షేత్రములు చాల పరగు నీదు
    చెంతనే తల్లి! నిన్ను నే జేరి గొలుతు

    రిప్లయితొలగించండి
  2. శ్రీ పండిత నేమాని, శ్రీ కంది శంకరయ్య గురువు గార్లకు పాదాభివందనాలు.

    పసిడి పంటలనొసగెడి పాలవెల్లి !
    పావనంబు నీ నీరము పాపహరిణి !
    రోగముల్ బాపి మమ్ములఁ బాగుజేయ
    శ్రేష్ఠమౌ ! కృష్ణానదీ ! మాకుఁ క్షేమమివ్వు ..

    రిప్లయితొలగించండి
  3. కీలు డను యక్షు కోరగ కీ లద్రి యన
    కనక వర్ణము నుండిన కనక దుర్గ
    కృష్ణ వేణమ్మ తీరాన కోరి వెలసె
    పుణ్య క్షేత్రాల వలయమ్ము పుణ్య నదిగ

    రిప్లయితొలగించండి
  4. శతావధాని ప్రతాప వేంకటేశ్వర కవిగారి ‘అవధాన మంజరి’ గ్రంథంనుండి.....
    పతితుల్ పావనులై విరాజిల నొనర్పన్ దక్షయై కాంచన
    ప్రతియై పంకవిహీనయై విమలయై భాగీరథీతుల్యయై
    యతి గంభీరత నొప్పి రత్ననిలయుండై భర్తఁ గూడంగ సం
    తతముం బాఱెడి కృష్ణవేణి సుమహత్త్వం బెన్న సామాన్యమే!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ జయసారథి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమంతా బాగున్నది కానీ చివరలో చిన్న సవరణ. క్షేమ మివ్వు అనుట సాధువు కాదు. క్షేమమిమ్ము అనుట మంచిది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో కొన్ని సవరణలు చేసేను -- ఈ విధముగా చూడండి.

    యక్షు కోర్కెపై నింద్రకీలాద్రియంచు
    తనరు నొక గిరి దానిపై కనక దుర్గ
    వెలసె బంగారు చాయతో ప్రేమమూర్తి
    కృష్ణవేణీ తటమున సుక్షేత్రమందు

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    కృష్ణవేణీ ప్రాశస్త్యాన్ని వర్ణించిన మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    జయసారథి గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    నేమాని వారి సవరణ చూసారు కదా!
    నాల్గవ పాదంలో గణదోషం. ‘శ్రేష్ఠ కృష్ణానదీ..’ అంటే సరి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    నేమాని సవరణానంతరం మీ పద్యం అందంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ పండిత నేమాని, శ్రీ కంది శంకరయ్య గురువు గార్లకు పాదాభివందనాలు.
    సవరించిన మీకు ధన్యవాదాలు..
    మనవి...
    ఏవి సాధువులో , యేవి కావో అర్థంకావడంలేదు.
    తెలయజేయగలరు

    రిప్లయితొలగించండి
  9. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,
    పండిత శ్రీ నేమాని గురుదేవులకు,
    సుకవిమిత్రమండలికి ప్రణామాలతో,

    చాలా కాలం తర్వాత ఈ రోజు "శంకరాభరణం" బ్లాగును సందర్శించి, పద్యరచనకు ఇచ్చిన "కృష్ణానదీస్తవము" అన్న విషయాన్ని చూసి ఎంతో సంతోషం కలిగింది.

    ముప్ఫైరెండేళ్ళ క్రితం 1981లో నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉన్నప్పుడు రచించి ప్రసారం చేసిన ఈ "కృష్ణాతరంగాలు" శ్రవ్యరూపకాన్ని దయతో మీకు వీలైనప్పుడు వినగోరుతున్నాను:

    http://www.maganti.org/audiofiles/air/dramas/pushkaram.html

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. క్రిష్ణ వేణమ్మ పారెడు క్షేత్ర మంత
    పంట భూములు నిండెను పైరు తోడ
    పుణ్య క్షేత్రాలు వెలసెను ముక్తినొసగ
    జీవ నాధార మయ్యె సజీవులకును.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! శ్రీ జయసారథి గారూ! శుభాశీస్సులు.
    మీరు ప్రాచీన కవుల రచనలను చదువుచున్నచో భాషా పరిజ్ఞానము తప్పక గణనీయముగా పెరుగును. అప్పుడు ఏవి సాధువులో ఏవి కావో మీరే చెప్ప గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! డా. మురళీధర్ గారూ! శుభాశీస్సులు.
    మీరు కృష్ణవేణీ పుష్కరముల గురించి పంపిన లింకును చూచేను. దానిని వినియోగించుకొనుట మాకు తెలియలేదు. అందుచేత ఏమీ వినలేకపోయేము. మీకు ఆదృతి ఉన్నా మాకు ఆ భాగ్యము అబ్బాలి కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. పోవు నఘములు నీ నీట మునుగ తల్లి !
    కలుగు శుభములు నీనామ పలుకు కతన
    నిన్ను నమ్మిన వారికి నీడ నిత్తు
    వోయి కృష్ణమ్మ ! వందన మొప్ప జేతు

    రిప్లయితొలగించండి
  14. శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    కృష్ణ అను శబ్దము సాధువు. శీర్షికలో కూడా ఆలాగుననే ఇచ్చేరు. మీరు క్రిష్ణ అని ఏలాగ ప్రయోగించారో తెలియదు. సవరించండి. మరియు, పుణ్య క్షేత్రాలు అనుచోట ణ్య అనే అక్షరము గురువు అగును అందుచేత గణ భంగము. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సుబ్బా రావుగారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో ఓయి కృష్ణమ్మ అనే సంబోధన బాగు లేదు. ఓయి పురుష సంబోధన మాత్రమే కదా. నీ నామ పలుకు అనే ప్రయోగము సరి కాదు నీ నామము పలుకు అనవలెను లేకపోతే నీ పేరు పలుకు అనవలెను. గణములు సరిపోవుటకు నీ పేరు పలుకు అందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. భ్రమరాంబనుఁ గొలుచు పరమహంసవగుదు
    జోగుళాంబకుఁ జెలి సుందరాంగి!
    కనకదుర్గ చరణ కమలమ్ము విరియగ
    కాసారమయినట్టి కల్పవల్లి!
    యమరలింగేశుని యర్థాంగి పిలుపులం
    దుకొనంగఁ బరుగులఁ దుళ్ళు తల్లి!
    ప్రవహించు చోటెల్ల ప్రజలకు కడుపుల
    నింపుచున్న యతివ! నెనరులమ్మ!

    తుంగభద్రఁ బోలు తోడు నదులఁ గూడి
    సాగరమ్ముఁ గలియు సంతసమున
    శుభముఁ బలికి మమ్ము చూపుల దీవింప
    గదె సుభిక్షమమర కరుణ తోడ.

    పరమహంస స్త్రీలకు సంబోధన కాని యెడల భక్తురాలవగుచు అని వ్రాయవచ్చును.

    రిప్లయితొలగించండి
  17. మాన్య లక్ష్మీదేవి గారికి
    నమస్సులతో,

    "పరమహంస" శబ్దం సంజ్ఞావాచకంగా ఉభయలింగార్థకమే కనుక యథేచ్ఛగా ప్రయోగింపవచ్చును. ద్వితీయార్థంలో "ను" తర్వాత అర్ధబిందువు ఉండదు.

    భ్రమరాంబను గొలుచు పరమహంస వగుదు
    జోగుళాంబకుఁ జెలి! సుందరాంగి!
    కనకదుర్గ చరణకమలమ్ము విరియంగఁ
    గాసారమయినట్టి కల్పవల్లి!
    యమరలింగేశుని యర్ధాంగి పిలుపు లం
    దుకొనంగఁ బరుగులఁ ద్రుళ్ళు తల్లి!
    ప్రవహించు చోటెల్లఁ బ్రజలకుఁ గడుపుల
    నింపుచున్న యతివ! నెనరు లమ్మ!

    తుంగభద్రఁ బోలు తోడు నదులఁ గూడి
    సాగరమ్ముఁ గలియు సంతసమున
    శుభముఁ బలికి మమ్ము చూపుల దీవింపఁ
    గదె సుభిక్ష మమరఁ గరుణ తోడ.

    మీ పద్యం అమోఘంగా ఉన్నది!

    రిప్లయితొలగించండి
  18. అయ్యా ,
    ధన్యురాలను.
    మీ సూచనలు, సవరణలు శిరోధార్యము.

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు.

    మహాబలుండగు మహాబలేశ్వరు
    మహరాష్ట్రమందు జన్మమ్మునంది

    సాంగ్లీ సతారాల సత్కారమున్ పొంది
    గణపతి విశ్వేశు గారవించి

    ముక్తాల సంగమమ్మున మురియాడుచు
    సంగమేశ్వరునితో జంటకలిపి

    దురితాపహారియై దుర్గను సేవించి
    హoసలదీవి మహాబ్ధి కలిసి

    పాడిపంటల నొసగుచు ప్రజలకెపుడు
    హితము గూర్చిన మాతల్లి కృష్ణవేణి
    గంగగోదారి నదుల కనుంగు చెల్లి
    ప్రణతులందు కొనుచును కాపాడవమ్మ

    రిప్లయితొలగించండి
  20. కరుణచిలికెడి కమ్మని అమ్మవమ్మ
    కరములు జోడించి మ్రొక్కెద కావుమమ్మ
    కలుష హారిణి కలుముల కల్పవల్లి
    క్రిష్ణవేణిని కీర్తించకలుగు శుభము

    వాసుదేవుడు కృష్ణగ వసుధ వెలసె
    ఇంద్ర కీలాద్రి దుర్గమ్మ ఎదుట నిలిచె
    పండు ముక్కాల పంటలు తల్లి దయతొ
    కొంగు బంగారమ్ముకద కృష్ణానది

    నీవు అడుగిడుచోటెల్ల నిత్యశుభమై
    సర్వసంపదలీయుమాసంతసమున
    పరమ పావనతల్లిమాపాలవెల్లి
    ప్రణతులిడెదనుకృష్ణమ్మపాద్యమిమ్మ



    రిప్లయితొలగించండి
  21. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదాలు.
    మీరిచ్చిన లింకు నా సిస్టమ్ లో ఓపెన్ కావడం లేదు. నాది వోడాఫోన్ 98 రూపాయల ప్లాను. మా మిత్రుని ఇంట్లో చూసి, నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను.
    *
    కృష్ణానదిపై అందరూ చక్కని పద్యాలను వ్రాసారు. వాటి గుణదోషాలను పండిత నేమాని వారు పరామర్శించారు.
    బొడ్డు శంకరయ్య గారికి,
    సుబ్బారావు గరికి,
    లక్ష్మీదేవి గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    శైలజ గారికి
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శైలజ గారూ,
    మొదటి పద్యం 2వ పాదంలో, రెండవ పద్యం 4వ పాదంలో, మూడవ పద్యం 1వ పాదంలో గణదోషం.
    మొదటి పద్యం 1వ, 4వ పాదాలలో, రెండవ పద్యం 3, 4 పాదాలలో యతి తప్పింది.
    ‘ముక్కాల - ముక్కారు’ అనండి. ‘దయతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ఉపయోగించరాదు. ‘సంపద లీయుమా’ అన్నదానిని ‘సంపద లొసగుమా’ అనండి.

    రిప్లయితొలగించండి
  23. అయ్యా! శ్రీ తిమ్మాజీ రావు గారూ!
    శుభాశీస్సులు.
    మీరు కృష్ణా నదిని గూర్చి వ్రాసిన సీసపద్యము చాల బాగుగ నున్నది. అందులో మొదటి పాదము మాత్రము సీసపద్య పాదము కాదు. పరికించండి:
    "మహాబలుండగు మహాబలేశ్వరు మహారాష్ట్ర మందు జన్మమ్మునంది"
    ఈ పాదమును మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి


  24. శ్రీ నేమాని గురు దేవులకు నమస్కారములు, తప్పిదము జరిగినది. క్షంతవ్యున్ని.నిన్న కంప్యూటర్ చెడి పోవటంతో చూసుకోలేదు. సవరణతో........

    కృష్ణ వేణమ్మ పారెడు క్షేత్ర మంత
    పంట భూములు నిండెను పైరు తోడ
    పుణ్య మిచ్చు క్షేత్రమ్ములు పుట్టెనచట
    జీవ నాధార మయ్యె సజీవులకును.

    రిప్లయితొలగించండి