1, మే 2013, బుధవారం

సమస్యాపూరణం – 1040 (కుండెడు పాలు బోసి యిడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.
(కల్వకుర్తి అష్టావధానము - ఆశావాది వారి ‘అవధాన కౌముది’ గ్రంథమునుండి)

36 కామెంట్‌లు:

  1. పండువునాడు చేరి కనుపండువుగా నొకచోట బాలికల్
    వండుచు నున్నయట్లు పలు వంటకముల్ పొనరించునట్టులన్
    మెండు ముదాన నొండొరుల మెచ్చుచు చక్కని బొమ్మ లాటలన్
    కుండెడు పాలుబోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్

    రిప్లయితొలగించండి
  2. ఆశావాది ప్రకాశరావు గారి పూరణ.....

    వండిన దెల్ల చేఁదనుచు వాసి చెడన్ మది కోపమందుచున్
    మండెడు కన్నుదోయిఁ గన; మానిని మాటున జేరి నవ్వుచున్
    పిండిన ప్రేమ కన్నుఁగవ వ్రేలఁగ; వ్రేల్మిడి లోపమొండు లే
    కుండెడు పాలుపోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.
    సమస్యను ఉండెడు అని మొదలిడు భావముతో పూరించ వచ్చును అనుకొన్నాను కానీ, యతి స్థానములో "అఖండ యతి" అనే శంకతో ఆ విధముగా పూరించుటను మానుకొంటిని. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. బండెడు చాకిరీనిటుల పట్నము కే చని చేసివచ్చి తా
    పండెను చేతగాక తన భార్యకు జెప్పెను సైగ జేయుచున్
    దండిగ వేసి పౌడరును, తక్కువ చక్కెర, మీగడేది రా
    కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారికి నమస్సులు.
    అఖండ యతిని మన బ్లాగు మిత్రులే యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. మీరు గమనించే ఉంటారు. నేను వ్రాసే పద్యాలలో అఖండయతిని ఎప్పుడూ ప్రయోగించను. కాని ఎవరైనా ప్రయోగిస్తే దానిని దోషంగా పరిగణించను.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మీ బొమ్మలాట పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీగడ రాకుండా కాఫీ చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మండెడు నెండలన్ మనకు మానిని సత్తువనిచ్చు తీయగా
    వండుము పాయసమ్మనగ భర్త ముదమ్మున జీడిపప్పులన్
    దండిగ యాలకుల్ గుడము తండులముల్ తగిలించి చేసెరా
    కుండెడు పాలుబోసి, యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్

    రిప్లయితొలగించండి
  8. మండెడు నెండలన్ మనకు మానిని సత్తువనిచ్చు తీయగా
    వండుము పాయసమ్మనగ బంధువు వండెను క్రొత్త బియ్యమున్
    గుండిగ లోన జీడి పలుకుల్ గుడమున్ తగ జేర్చి కల్తి గా-
    కుండెడు పాలుబోసి, యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్

    రిప్లయితొలగించండి
  9. శంకరయ్య గారు!
    రసాత్మకంగా మలిచేప్పుడు అఖండ యతిని అంతగా పట్టించుకోవలసిన పని లేదేమో!
    రస మాధుర్యాన్ని త్యాగం చేసి, మరీ మడి గట్టుకోవలసిన అవసరముందా? ... అనిపిస్తుంది నాకు.
    "మానసమం దెదో తళుకు మన్నది పుష్ప విలాప కావ్యమై" - (కరుణశ్రీ పద్య పాదం) హృదయానికి హత్తుకొని నరుల నాల్కల పైన శాశ్వతంగా నాట్యమాడడం లేదా?
    ఏ లక్షణకారుడైనా రీతినో, రసాన్నో, ధ్వనినో .. కావ్య లక్షణాలుగా పేర్కొన్నారు గాని, కేవల వ్యాకరణాన్నో, ఛందస్సునో కావ్య లక్షణంగా చెప్పలేదన్నది వాస్తవం.
    మీరు సున్నిత హృదయులు .. ఎవరినీ నొప్పించరని నాకు తెలుసు. కాని ఈ బ్లాగుకు మీరు గురుపీఠంలో ఉన్నారు. సత్య ప్రవచనం చేసేప్పుడు మొహమాటపడ కూడదు.
    అన్నట్టు "టోరి రేడియో" లో మీ గురించి, మీ బ్లాగు గురించి చెప్పాను. విన్నారా?

    రిప్లయితొలగించండి
  10. " మండును నాకు కాఫి తగు మాత్రము పాలను జేర్చ కిచ్చి నీ
    వుండగ గమ్మునన్ " మగడు హుమ్మని లేచెను, " చంటి వాడు ప-
    స్తుండును పాలనన్నియును సుష్టుగ త్రాగుడు మీరె " యంచు నా
    కుండెడు పాలుబోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్

    రిప్లయితొలగించండి
  11. అఖండయతిని గురించిన చర్చ చూసాను.

    లాక్షణికులు దీన్ని తప్పుపట్టినా ఆదునికులు యధేఛ్చగా ప్రయోగిస్తున్నారు. తిక్కనాదికవులూ అఖండయతిని అక్కడక్కడ వాడారని విన్నాను. వాసుదాసుడు శ్రీవావ్లిలికొలను సుబ్బారావు గారు ఆంద్రవాల్మీకి బిరుదాంకితులు, వారు అఖందయతిని ఆదరించారు.

    రసాత్మకంగా మలిచేప్పుడు అఖండ యతిని అంతగా పట్టించుకోవలసిన పని లేదేమో అన్నమాట బాగుంది. కాని సాధ్యమైనంతవరకు పరిహరించటమే బాగుంటుంది. అలా పరిహరించినంతమాత్రాన పూర్వకవులకు ఇబ్బంది రాలేదు, రసప్రకర్షకు అడ్డుకాలేదు.

    అఖండయతిని ఒక exception క్రింద మాత్రం తీసుకొని యేదైనా పెద్దకృతుల్లో ఒకటి రెండు తప్పనిసరి పరిస్థితుల్లో వాడవచ్చును. కాని పద్యవిద్యను సాధనం చేసే వారు పెద్దకవులు ప్రయోగించారుకదా అని యధేఛ్ఛగా వాడటం ప్రయత్నపూర్వకంగానే మానుకోవటం ఉచితం.

    రిప్లయితొలగించండి
  12. అఖండ యతిని వేయాలా? వద్దా? ... అన్నది ఒక భావాన్ని పద్యంలో చెబుతున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి రస దృష్టి విచక్షణతో ఆ కవి మాత్రమే తీసుకోవలసిన నిర్ణయమే గాని; పెద్ద కవి, చిన్న కవి అని వ్యక్తిగతంగా కాదు. ఆ పరిస్థితి ఒకానొక భావ ప్రకటనలో పెద్ద కవికీ రావచ్చు. చిన్న కవికీ రావచ్చు. అలాంటి పరిస్థితులలోనే పూర్వకాలంలో కూడ పెద్ద కవులు సైతం అఖండ యతిని ప్రయోగించింది. నేటి చిన్న కవులైనా అఖండ యతిని పరిహరించే నెపంతో పద్యాన్ని రస హీనం చేయకూడదు. మొత్తానికి రస దృష్టి ప్రధానమన్నది నా ఉద్దేశ్యం. రసంపై ప్రధానంగా దృష్టి గలవాడు కవిగా ఎదుగుతాడు. వ్యాకరణంపై, ఛందస్సుపై ప్రధానంగా దృష్టి గలవాడు పండితునిగా మారుతాడు. సమాజానికి కవుల ఆవశ్యకతే ఎక్కువ.
    ఎందుకంటే పండితులను బోధించి తయారు చేయవచ్చు. కవి స్వీయ ప్రతిభతో, స్వీయాభ్యాసంతో ఎదగవలసి ఉంటుంది.
    పాండిత్యం శాస్త్రాధ్యయనంతో అబ్బుతుంది. కవిత్వం పరిశోధనతో, ప్రయోగాలతో ముందుకు సాగుతుంది.

    రిప్లయితొలగించండి
  13. ఫణీంద్రగారూ, మీరు నా వ్యాఖ్యను అపార్థం చేసుకున్నారు. కాని నేను చర్చను పొడిగించ దలచుకోలేదు. నేను పండితుడనూ కాను కవినీ‌ కాను. అల్పజ్ఞుడను మాత్రమే. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. శ్యామలీయం గారు!
    నేను పాండిత్యం, కవిత్వం .. మధ్య తేడాను వివరించానే గాని, వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమీ అనలేదే! చర్చ మాత్రమే చేసాం గాని, ఇందులో నేను మిమ్మల్ని అపార్థం చేసుకోడానికి ఏముంది?
    సరళంగా చెప్పాలంటే - పాండిత్యం(వ్యాకరణం,ఛందస్సు,అలంకార శాస్త్రం మొదలైనవి) మరియు కవిత్వం అన్నవి సైన్స్, ఇంజినీరింగ్ లేక చట్టం, న్యాయవాద వృత్తి లాంటి యుగళాలు. వీటిలో మొదటివి గైడ్ లైన్స్ అందిస్తే రెండవవి వాటి ఆధారంగా ప్రజోపయోగమైన పనులు చేస్తాయి. వీటిలో రెండవ పని చేసేవారు కార్య సాధనలో కొంత వారి ’ఇంటర్ ప్రిటేషన్’ చేసే స్వేచ్ఛను కలిగి ఉంటారు.
    కవులూ అంతే. దీనిని ప్రాచీన కాలంలోనే కొందరు పండితులు అంగీకరించారు. అందుకే వారు "కవయః నిరంకుశాః" అని ఆమోద ముద్ర వేసారు. అది అంగీకరించని పండితులూ ఉన్నారు. వారు "పాండిత్య హీనాః కవయో భవంతి" అని దూషించారు.
    కాని ఇప్పుడు కవిత్వం ఛందస్సు బంధనాలను ఛట్ పట్ మని త్రెంపామంటూ, కొందరు వచన కవిత్వం, మినీ కవిత్వమే నేటి కవిత్వమంటూ, పద్య కవిత్వం ఒక ఛాందస కవిత్వమని నిరసిస్తున్న తరుణంలో, పద్య కవిత్వమంటేనే నేటి యువకులు దరిజేరడానికి భయపడుతున్న రోజులలో ... రసదృష్టితో ప్రాచీన కవులు తీసుకొన్న స్వేచ్ఛను కూడ నేటి కవులు తీసుకోకూడదు అనడం భావ్యమా? లేదా రసదృష్టితో అక్కడక్కడా అలాంటి స్వేచ్ఛను తీసుకొంటూ ఇంపైన సొంపైన పద్యాలను రచిస్తూ ఎక్కువ మంది పాఠకులను పద్యం వైపు ఆకర్షించడం ముఖ్యమా? అంతే కాకుండా ఎప్పుడూ అవే పురాణ గాథలు, పురాణ విషయాలపై కాకుండా, వచన కవిత్వంలోలా నవీన వస్తువులను తీసుకొని, పద్యంలో అంతకన్న అందంగా చెప్పవచ్చు - అని నిరూపిస్తూ నవీన పద్ధతిలో అందమైన పద్యాలను చెప్పవలసిన అవసరం లేదా? ఇదీ అసలు చర్చించవలసిన విషయం. ఇదే మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు గారు నాకు అందించిన ఉపదేశం. ఈ బాటలో నడిస్తే పద్య కవిత్వం కొత్త పుంతలు తొక్కుతుంది. ఎక్కువ మంది మంచి పద్య కవులు రూపొందుతారు. ఇదే మా ఆంధ్ర పద్య కవితా సదస్సు ఆశయం. కాబట్టి ...
    రస దృష్టి వర్ధిల్లు గాక!
    నవ్య పద్యం వర్ధిల్లు గాక!!
    ( తమ బ్లాగులో నేను ఈ చర్చ జరిపేందుకు తీసుకొన్న స్వేచ్ఛను మిత్రులు శంకరయ్య గారు ఆమోదిస్తున్నారని భావిస్తున్నాను.)

    రిప్లయితొలగించండి
  15. " గండము త్రాగకున్న! వడగాడ్పగు నా దినమెల్ల! వేసవిన్
    మండెడు వేళలో మలయ మారుత వీచిక! లేదు చిక్కగా
    నుండక నామన స్సునకు నూరట! " పద్యము చెప్పి మాట రా-
    కుండెడు! పాలుబోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్

    రిప్లయితొలగించండి


  16. పండుగనాడు మిత్రులకు బంధులకెల్లను బాయసమ్ము దా
    వండగ నిచ్చగించి కావలయు వస్తువు లన్నియు సేకరించగా
    పండిన భర్త లేవగనె భార్యయు కాఫిని జేసె ; పాత్రలో
    కుండెడు పాలు బోసి ;యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

    రిప్లయితొలగించండి




  17. శ్యామలీయంగారికి,ఫణీంద్రగారికి,Sir Roger de coverly చెప్పినట్లు much might be said on both sides. పద్యరచనకి వ్యాకరణం,చందస్సు ముఖ్యమే.అలాగే రసపోషణ కూడా ముఖ్యం.కవుల్లో అత్యధికసంఖ్యాకులు పద్యరచనకు దూరమౌతున్న యీ రోజుల్లో,మరీ కఠినంగా ఉండనవసరం లేదనుకొంటాను. అలా అని విశృంఖలత్వం మంచిదికాదు.( M.A. TELUGU)డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా నామాత్రం కూడా పద్యాలు వ్రాయలేకపోతున్నారు కదా!

    రిప్లయితొలగించండి
  18. ఫణీంద్రగారూ, మీరు నన్నేదో అన్నారని అనలేదండీ. నేను పెద్దగా తెలిసినవాడను కానని మాత్రం అన్నానంతే. మీ ఆంధ్ర పద్య కవితా సదస్సు గురించి యిదే వినటం. ఆశయం‌ బాగుంది. ప్రాచీనులైన మహాకవులు పద్యాన్ని అందంగా చెప్పారు, నవీనులూ చెప్పగలరు ప్రయత్నిస్తే. . యతిప్రాసలను వదలి పద్యకవిత్వం చెప్పిన వాళ్ళూ ఉన్నారు. ఇతర భాషల్లోనూ తెలుగులోనూ‌ కూడా. అయితే స్వేఛ్ఛ తీసుకునే ముండు సంప్రదాయంపై పట్టు సాధించటం అవసరం అని నా భావన. అది కొందరి దృష్టిలో తప్పో అనవసరమో కావచ్చును. దానికేమి. అవసరమైన సేఛ్ఛ తీసుకోవటం గురించి మరింత వ్యాఖ్యానించేంత అధికారం నాకుందని అనుకోవటం లేదు.

    మీరన్నట్లు పద్యకవితకు ఈ రోజుల్లో‌ఆదరం తక్కువే. నేను నాతోచినట్లు నా బ్లాగులో పద్యకవిత వ్రాస్తున్నాను కాని పెద్దగా చదువరులు లేరనే చెప్పవచ్చును.

    రిప్లయితొలగించండి
  19. డా. కమనీయం గారికి నమస్సులు. మీ పద్యము చాల బాగుగ నున్నది. 2వ పాదములో చిన్న పొరపాటు దొరలినది. వండగ నిచ్చ గించి అనుటకు బదులు వండగ బూని అంటే సరిపోతుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. తల్లి భారతీ!

    వరహృదయమ్ముతో కవులు పద్యము లల్లుచునుండి శంకరా
    భరణము నందు సభ్యులయి వన్నెలు చిన్నెలు గూర్చుచుండిరా
    సరణిని వారి పద్యములు సర్వ విధమ్ముల పుష్టినొంది యం
    దరి నలరించు రీతిగ సదా పొనరింపుము తల్లి భారతీ!

    రిప్లయితొలగించండి
  21. పండుగ నాడు కోరినను బంగరు సొమ్ములు లేక పోయినన్
    నిండుగ కట్టు కొందమని నేరక తెమ్మనె పాతచీర తో
    దండుగ వీని కంచు కసి తాపము నొందుచు నొళ్ళు మండి యా
    కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్త కున్ !

    రిప్లయితొలగించండి
  22. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    "కుండెఁడు పాలుబోసి యిడెఁ గోమలి కప్పెఁడు కాఫి భర్తకున్" అన్న సమస్య చిత్రంగా ఉన్నది. మానార్థకమైన "ఎఁడు" ప్రత్యయం తద్ధితార్థంలో "కప్పెఁడు" అని సాహిత్యంలో గాని, లోకవ్యవహారంలో కాని ఎక్కడా కనుపింపలేదు. కేవలం వైచిత్రీమాత్రప్రయోగం అనుకోవాలి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. డా. ఏల్చూరి వారి వ్యాఖ్య చూశాక నా కనిపిస్తోంది. సాధారణంగా కప్పెడు అనడం కన్నా కప్పుడు అని వ్యావహారికంలో వింటూంటాం.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ శంకరయ్య గారికి , ఈనాటి సమస్యే ఒక విచిత్రం . లాక్షణికుల గురించి చర్చ జరుప వలసినంత పెద్ద శాస్త్రీయమైన కావ్య లక్షణాలు కలిగిన పద్యపాదమేమీ కాదు . నిజానికి డా ఆచార్య ఫణీంద్ర గారితో కొంత వరకు ఏకీభవించవలసి ఉన్నది , పద్యపూరణాలు అన్నవే ఆటవిడుపు కొరకు . పొడుపుకథల వంటివి . ఇక ఆధునిక కాలంలో వరుస పెట్టి నెరసులెంచ వలసి వస్తే , శంకరాభరణమే కాదు , అస్మదాదుల పద్యాలేవీ - శాస్త్ర చర్చకు నిలువ జాలనివే . నిజాన్ని నిష్కర్ష గా చెబుతున్నందుకు మన్నించండి కానీ , శాస్త్రబద్ధమైన నిర్దోష పద్యమే ఈ వేదిక మీద ప్రచురించాలనుకుంటే క్వాచిత్కం గా ఒకటో అరో తప్ప ఏవీ నిలువజాలవు .
    CUP ని కప్పు అని ఆంధ్రీకరిస్తూ అంటూ పాత్రా సూచకమైన ఇతర భాషా పదాన్ని తీసుకున్న సమస్యలో , దానికి ఏల్చూరి మురళీధరరావు గారు చెప్పినట్టు అపదాదిస్వర సంధి చేసి విచిత్రమైన " కప్పెడు " పదాన్ని సాధించిన పద్యపాదంలో సాధుత్వాసాధుత్వాలను , లక్షణావలక్షణాలను , అఖండ యతి గత్యాది అగత్యాలను విమర్శించడం - పాశ్చాత్య సంగీతం లో ఫలానా రిషభమెందుకు వచ్చింది అని ప్రశ్నించడం లాంటిదే అని నా భావన .

    ఇకపోతే విద్వత్కవులు ఏల్చూరి వారు చెప్పినట్టు ఇదొక వైచిత్రీమాత్ర ప్రయోగమే కాని , శ్రీశ్రీ మార్కు

    ఎప్పుడు పడితే అప్పుడు
    కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
    చొప్పడిన యూర నుండుము
    చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా !

    లాంటి విలాస పద్యాలుండనే ఉన్నాయి కదా !

    రిప్లయితొలగించండి
  25. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఈ కాలానికి ' ఔదాసీన్యమే ' శరణ్యం .

    రిప్లయితొలగించండి
  26. మండెడు పొయ్యిపై కుదురు మద్యన పాలను బెట్టి, చూడ తా
    నుండెను దూరదర్శనున నుల్లము దోచెడు ధారవాహికన్
    మండుచు నావిరై మిగుల మాడిన పాలను కాఫి చేయగన్
    కుండెడు పాలు పోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్!

    రిప్లయితొలగించండి



  27. పండిత నేమానివారికి,నమస్తే.అవును తప్పు దొర్లినది.ఇచ్చగించి స్థానంలో 'పూని ' అని సవరిస్తున్నాను.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. నిన్నటి సమస్యా పూరణం:

    భర్త ఎవరి వెంటపడతాడో ననె పార్వతి భావించినట్లు :

    పన్నగ భూషణుండు తను వంకలు వంపుల మెచ్చి దాల్పగన్!
    వెన్నుడు మోహినీ వలెను వేషము మార్చగ వెంట బోవగన్!
    చిన్నెల దేవకన్నియలు చేరెడు నద్భుత దివ్య సీమయౌ
    'కన్నెల వంకఁ' జూచి మెటికల్ విఱిచెన్ నగజాత భీతితో!

    రిప్లయితొలగించండి
  29. మాన్య విద్వత్సుకవివరేణ్యులు డా. విష్ణు నందన్ గారికి
    నమస్కృతులతో,

    తెలుగులో పద్యరచయితలు పాదం చివఱ పదాన్ని విఱిచి రెండవ పాదంలోకి తీసికొనివెళ్ళే సౌకర్యం ఉన్నది. నన్నయ గారు "... భూరిభుజాకృపాణధా, రా జల శాంతశాత్రవపరాగుడు" అన్నట్లు. సంస్కృతంలో ఆ సౌకర్యం లేదు. పాదం చివఱ పదాన్ని విఱిచి తీరాలి. ఆ విధంగా లేని ప్రయోగాలు సంస్కృతంలో ఎంతో అరుదుగా కాని కనబడవు. అలాగని సంస్కృత లాక్షణికులు (ఎక్కడో ఒకే ఒకచోట తప్ప) తమ లక్షణగ్రంథాలలో ఆ విషయాన్ని నొక్కి చెప్పలేదు. ప్రయోగాలను పరిశీలించి మనము గ్రహింపవలసిందే.

    అయితే, తెలుగు లాక్షణికులు "అఖండయతి"ని అలా పాఠకుల ఊహకు విడిచిపెట్టలేదు. పదే పదే లక్షణనిర్వచన చేశారు. అందుకు కారణం శ్రీ తంజనగరం తేవప్పెరుమాళయ్య, శ్రీ రావూరి దొరసామిశర్మ మొదలైన పెద్దలు చెప్పే ఉన్నారు కనుక మనము పునరుక్తం చేయనక్కర లేదు. ఆ నాటి వ్రాతప్రతులలో దోషాలను పరిహరించటానికి అదొక సాధనం. అందువల్ల వారు మహాకవులు విరళంగా ప్రయోగించిన ప్రయోగాలను తాము చూసి ఉన్నా, లాక్షణికులు వాటిని ఉపేక్షించారు. పద్యవిద్యకు మెఱుగులు దిద్దారు.

    ఆధునిక కాలంలో ఆ ఆలోచనలు మాఱాయి. మీరన్నట్లు ఈనాడు అన్నింటికీ ఉపేక్షా నికషోపలమే శరణ్యం. శరణ్యాంతరం లేదు కనుక.

    శ్రీ మిస్సన్న గారన్నట్లు "కప్పుడు" అనటం కూడా ఉన్నది. చూ. http://kinnerasani.blogspot.in/2006_08_01_archive.html

    శ్రీశ్రీ గారి ప్రయోగాన్ని గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు.

    "చమత్కార శ్చిత్తవిస్తారరూపో విస్మయాపరపర్యాయః" - సాహిత్యదర్పణం.

    ఈ చర్చకు మీ వ్యాఖ్య భరతవాక్యమై భవ్యంగానూ, భావ్యంగానూ ఉన్నది.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  30. ఈనాటి సమస్య ఆసక్తికరమైన చర్చకు దారితీయడం, డా. ఆచార్య ఫణీంద్ర గారు, కమనీయం గారు, ఏల్చూరి మురళీధర రావు గారు, డా. విష్ణునందన్ గారు స్నేహపూర్వకంగా పాల్గొని శాస్త్రీయంగా, సహేతుకంగా వివరణలిచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి చర్చలు ఆహ్వానింపదగినవి.
    *
    చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    కమనీయం గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    సహదేవుడు గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    టోరీ రేడియోలో నా గురించి, బ్లాగు గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. కానీ ఈ టోరీ రేడియో అంటే ఏమిటో నాకు తెలియదు.
    *
    పండిత నేమాని వారూ,
    శంకరాభరణ సభ్యుల కవిత్వానికి పుష్టినొసగమంటూ భారతీదేవిని స్తుతించిన మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. ఏది ఏమైనా విద్వత్కవులు డా. ఏల్చూరి మురళీధరరావు గారు, డా.విష్ణు నందనులు వీరి వ్యాఖ్యా సంభాషణలు యెంతో హుందాగా చదువ సొంపుగా ఉంటాయి కదూ?

    రిప్లయితొలగించండి
  32. అఖండయతిని గూర్చిఅనవసరంగా చర్చ/వాదానికి తెరలేపానేమోనని కొంచెం విచారపడిన మాట వాస్తవం. శ్రీశంకరయ్యగారు "ఇటువంటి చర్చలు ఆహ్వానింపదగినవి" అనటం ద్వారా ఊరట కల్గించారు. వారికి నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. శ్యామలీయం గారికి చెప్ప దగిన వాడిని కాదు కానీ , గురువుగారన్నట్లు సౌహార్ద్ర పూర్వకమైన వాతావరణంలో జరిగే ఇటువంటి చర్చల ద్వారా మా బోటి వారికి తెలుగు భాషలోని మెలకువలు, వ్యాకరణ విశేషాలు తెలిసే అవకాశం కలుగుతుంది. అందుచేత వారెటు వంటి విచారమూ పెట్టుకో నవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  34. శ్రీ కంది శంకరయ్య గారికి


    నమస్కారములు మండు వేసంగిలో మనస్సుకి ఆహ్లాదాన్నిచ్చే సమస్యపూరణలనూ, కవిపండితుల చర్చలనూ అందించినందుకు ధన్యవాదాలు. సాహిత్యానికి చెందిన ఇతర ప్రక్రియలఫై కూద చర్చలను ప్రారంభించ వలసిందిగా కోరుతున్నాను. అంతర్జాలం ద్వారా కొనసాగే ఇటువంటి చర్చలు తెలుగు భాషాసాహిత్యాలను ప్రపంచవ్యాప్తంగా సజీవంగా , చైతన్యవంతంగా నిలపడానికి దోహదపడతాయి .ఈ సందర్భంగా నాదొక సందేహం. మీరు పంపిన చర్చలో డా. ఆచార్య ఫణీన్ద్ర
    గారు ఒక చోట "నవీన పద్ధతిలో అందమైన పద్యాలను
    చెప్పవలసిన అవసరం లేదా? ఇదీ అసలు చర్చించవలసిన విషయం " అన్నారు .నవీన పద్ధతి అంటే వారి ఉద్దేశంలో ఏమిటో వివరించగొరుతున్నను.
    విధేయురాలు,
    ఆకొండి (ముద్దు) వెంకట లక్ష్మి
    ఆంగ్ల అధ్యాపకురాలు, ఆంధ్రా స్కూల్, న్యూ ఢిల్లీ

    రిప్లయితొలగించండి
  35. చండిని బోలు కోడలిది చారెడు నోరని గేలిజేయగా
    వండుచు పాయసమ్మునట భాద్రపదమ్మున పండుగందునన్
    గుండెలు మండ నత్తయని కూడలి నందున గాంచి గుండునన్
    కుండెడు పాలు బోసి;..యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్

    రిప్లయితొలగించండి