13, మే 2013, సోమవారం

సమస్యాపూరణం – 1051 (నీ కనుదోయి వెన్నెలలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే!
(దూరదర్శన్ వారి సౌజన్యముతో)

25 కామెంట్‌లు:

  1. ఈ రోజు ఇంతవరకూ పూరణలు లేవెందుకనో!

    నే కలగన్న స్వామివని నిన్ను సదా నెఱనమ్మియుంటి నా
    థా! కనులేల చెమ్మగిలె? తర్కముఁ జేయను, వాదులాడ, నే
    నీ కమలాక్షిగానె? మరి నిక్కము ముఖ్యము నీదు శాంతియే,
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే!

    రిప్లయితొలగించండి
  2. అవునుగదూ లక్ష్మీ దేవిగారూ!

    హనుమ సీతను గూర్చి చెప్పగా రామచంద్రు డామెను దలచుకొని:

    నీ కను లశ్రు బిందువులకు న్నెలవై కళ మాసి మోమునన్
    శోకము సంద్రమై తరిగి శోభన దీప్తులు దేహమందునన్
    నాకయి ప్రాణముల్ నిలిపి నన్ను స్మరించుచునుండ జానకీ!
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే?

    *********

    సోకులు మూకలై చెలగి జోరున నొక్కెడ జుట్టు ముట్టినన్
    నాక పురాధిపుం డసురనాయకు వెంటను నిల్చి పోరినన్
    నీ కమలాక్షులాన యవనీసుత! రావణు గూల్తు నమ్మవో
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే?

    రిప్లయితొలగించండి
  3. రామాంగుళీయకాన్ని జూచి, హనుమ చెప్పిన రామావస్థను దలచుకొని సీత :

    తాకగ నంగుళీయకము దాన పతిం గని సీత పల్కెనో-
    యీ కరుణాలవాల! తగునే సతికై విలపింప వేగమే
    సోకుల రాయనిం దునిమి శోభన మూర్తిగ నన్ను జేరవే
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే?

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    మీ పద్యములు 3 నూ బాగుగనున్నవి. 1వ పద్యము 1వ పాదములో యతి మైత్రి లేదు. కొంచెము పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యా! పొరబాటుకు చింతిస్తున్నాను.
    సవరించిన పూరణ:

    నీ కను లశ్రులం గురియ, నీ నగు మోమున నవ్వు మాయగన్,
    శోకము సంద్రమై, తరిగి శోభన దీప్తులు దేహమందునన్,
    నాకయి ప్రాణముల్ నిలిపి, నన్ను స్మరించుచునుండ జానకీ!
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే?

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మణుడు వనవాసానికి రాముని వెంట వెళ్ళే ముందు తన భార్యతో:

    వ్యాకులపాటు నీకగునె యన్ని యెరింగియు? కానలందునన్
    రాకసి మూకలం దునిమి రామె యయోధ్యకు నేను నన్నయున్?
    చీకటి కోటు లంతమయి చిందవె వెల్గులు? చూడు మూర్మిళా!
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే!

    రిప్లయితొలగించండి
  7. @మిస్సన్నగారూ పూరణ బాగుంది.

    నీ కను లశ్రులం గురియ, నీ నగు మోమున నవ్వు మాయగన్,
    శోకము సంద్రమై, తరిగి శోభన దీప్తులు దేహమందునన్,

    రిప్లయితొలగించండి
  8. @లక్ష్మీదేవి గారూ పూరణ బాగుంది. ఏమిటో మా ఇంట్లో అలా అనే వాళ్ళుంటే బాగుండునని అనిపిస్తోంది.

    నే కలగన్న స్వామివని నిన్ను సదా నెఱనమ్మియుంటి నా
    థా! కనులేల చెమ్మగిలె? తర్కముఁ జేయను, వాదులాడ, నే

    రిప్లయితొలగించండి
  9. ఆకశ మందు తారకలు సాకత మీయును సోముకై సఖీ
    నాకల లందు నీవెపుడు నాగినివై మురిపించ మైకమున్
    శోకము వీడి నీమదిని శోభిల జేసిన నాకు మోదమౌ
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే !

    రిప్లయితొలగించండి
  10. @రాజేశ్వరి నేదునూరి గారూ ఏమి నాభాగ్యం ఇవాళ అణి ముత్యాలు ఏరు కుంటున్నాను.

    "ఆకశ మందు తారకలు సాకత మీయును సోముకై సఖీ
    నాకల లందు నీవెపుడు నాగినివై మురిపించ మైకమున్

    రిప్లయితొలగించండి
  11. కారాగారంలో శ్రీరాముని కై శ్రీరామదాసు విలాపము:

    నీ కని యాలయంబు నిల నిక్కముఁ గట్టగ రామ చంద్రమా!
    శోకము దక్కె నాకు, నిను స్తోత్రము జేసిన జాలి జూపవే?
    పైకముఁ గట్ట లేక పలు బాధల నిచ్చట నోర్చు చుంటిరా!
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే?

    రిప్లయితొలగించండి
  12. నాకము నందు దేవతలు హాయిగ నుండిరి సొంపు మీరగా
    కోకిల గానముల్ వినుచు కోమలి చెంతన గోరు వంకలై
    నీకయి వేచి యుంటినిక నే విర హమ్మును తాళనే చెలీ
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే !

    శ్రీ లక్కరాజు గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  13. ఈరోజు దాదాపు 11 గంటల వరకు ఒక్క పూరణకానీ, పద్యరచన శీర్షికకు ఒక్క పద్యంకాని రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలియక ఏదైనా అశ్లీలార్థం వచ్చే సమస్యనో అంశాన్నో ఇవ్వలేదు కదా అని భయపడ్డాను కూడా. ఇప్పటికీ సమస్యలను ‘ఒళ్ళు దగ్గర పట్టుకునే’ ఇస్తున్నాను కూడా. హమ్మయ్య! ఫరవాలేదు. ఆలస్యంగానైనా మంచి పూరణలు వచ్చాయి.
    *
    నిజానికి ఈనాటి సమస్యలో సమస్య లేదు. భావస్ఫోరకంగా పాదపూరణ చేయడమే... గతంలోనూ దూరదర్శన్ వారు కేవలం పాదపూరణ చేయడానికి అవకాశమిచ్చే ఇటువంటి సమస్యలను కొన్ని ఇచ్చారు కూడా.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ఈరోజు బోణీ మీరే చేసారు. ఇప్పటిదాకా ఎవ్వరూ పూరణలు చెయ్యలేదేమిటా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. ధన్యవాదాలు.
    మీ పూరణ మధురంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ నాలుగు పూరణలూ మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ చక్కని భావసంపదతో అలరిస్తున్నవి. అభినందనలు.
    రెండింటిలోను మొదటపాదాలలో యతిదోషం ఉంది.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    మీ పూరణ కవిత్వ శోభాకలితమై అలరిస్తున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో రెండక్షరాలు తప్పిపోయాయి. టైపాటు అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    నీ కమనీయశీలవరణీయపరీమళపాళి నీ దయా
    లోకశుభస్వభావవిమలోజ్జ్వలితాంశుహిమాంశుదివ్యశో
    భాకలితమ్ముగాఁ బ్రణయపర్వము దేవి! యనుగ్రహింపఁగా
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. మాన్యశ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    మీ సహృదయానికి, ప్రోత్సాహానికి మఱొక్కమాఱు ధన్యవాదాలు!

    కొద్దిసేపు క్రితం నేను, నా అర్ధాంగ"లక్ష్మి" "శంకరాభరణం" బ్లాగును గుఱించి మాట్లాడుకొంటుండగా ఈ ఆలోచన వచ్చింది: కొన్ని వందల మంది కవులచేత కొన్ని వేల పద్యాలను ఈ విధంగా ప్రతి అక్షరం సరిచూస్తూ, సవరిస్తూ, పునారచనకు మరీ మరీ ప్రోత్సహిస్తూ వ్రాయించినవారు మీరు కాక ఈ వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఇంకెవరైనా ఉండి ఉంటారా? అని.

    ఏ ఆడంబరాలూ, భేరీ భాంకారాలూ లేకుండా; నిఃస్వార్థంగా ఇంతమంది పద్యవిద్యార్థుల చేత అవిశ్రాంతంగా సారస్వత వరివస్యను చేయిస్తున్న మీ సేవాహేవాకానికి జోహారులు! నిజానికి తెలుగు విశ్వవిద్యాలయం, ఇతర విద్యాలయాలు, వీథికొకటిగా వెలసిన సాంస్కృతిక సంస్థలు చేయలేని మహాకార్యాన్ని బాధ్యతతో భుజస్కంధాలపై ధరించి ఇటుక ఇటుకగా మీరు నిర్మిస్తున్న ఈ భారతీసౌధాన్ని ప్రతి సాహిత్యాభిమాని దర్శించి తీరాలి. మీ కృషిఫలితం ఎంతమంది కవులు, కవితాభిమానుల జీవితాలను వెలిగించిందో గుర్తించి తీరాలి.

    అలా గుర్తించకపోవటం "శంకరాభరణం" లోనే అన్నట్లు, నిజంగా ఆత్మద్రోహంతో సమానం, ఆ మాటకు వస్తే మహాపాపం!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి



  16. రాధ కృష్ణునితో అంటున్నది.

    నాకిల వేరె స్వర్గమును,నందనమున్ గలవే మనోహరా,
    ప్రాకటరీతి నిన్వలచి,ప్రాణము నిల్పితి నీదు సన్నిధిన్
    మోకరిలంగ నను మోసము చేతువె ,చేర రమ్మికన్ ,
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కెలు నాకు పండునే ?

    రిప్లయితొలగించండి





  17. అందుకే నేనంటున్నది.ఈ రోజు బ్లాగులన్నీ మరునాడు విశ్లేషించమని.

    రిప్లయితొలగించండి
  18. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఎన్నాళ్ళుగానో మీకో సుదీర్ఘ వ్యక్తిగత లేఖ వ్రాయలనుకుంటున్నాను. ఆరోగ్యం సరిగా లేకపోవడం, సమయాభావం వల్ల ఇంతకాలం అవకాశం దొరకడం లేదు. ఆ లేఖకు ‘శీర్షిక’ను నిర్ణయించుకున్నాను కూడా...‘Confession of a Telugu Pandit’. తొందరలోనే పంపిస్తాను. ఇది చదివితే నా వ్యక్తిత్వం, లోపాలు మీకు స్పష్టమవుతాయి.
    నేనేమీ భాషాసేవ చేస్తున్నానని భావించడం లేదు. నాకు ఇదొక కాలక్షేపం మాత్రమే.. మీ అభిమానానికి, సహృదయతకు ధన్యవాదాలు.
    శంకరాభరణం బ్లాగు ప్రసక్తి తీసుకువచ్చినందుకు మీ శ్రీమతి గారికి నా ధన్యవాదాలు తెలియజేయండి.

    రిప్లయితొలగించండి
  19. కమనీయం గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం... ఇలా సవరిద్దాం....
    ‘మోకరిలంగ నన్నిటుల మోసము చేతువె ,చేర రమ్మికన్’
    లేదా...
    ‘మోకరిలంగ నీవు నను మోసము చేతువె ,చేర రమ్మికన్’

    రిప్లయితొలగించండి
  20. గౌరవ నీయులు శ్రీ ఏల్పూరి వారు చెప్పినట్లు నేనైతే ఇక్కడే అక్షరాలు దిద్దుకున్నాను. అందులకు గురువులకు సదా కృతజ్ఞు రాలిని
    అసలు రోజూ ఉదయం లేస్తూనే బ్లాగు చూడందె కాఫీ కుడా తాగ బుద్ది వేయదు ఇక రాత్రి నిద్ర వచ్చేవరకు బ్లాగు చూసి గాని పడుకో బుద్దికాదు.ఆరోగ్యం ఎలా ఉన్నా అనునిత్యం కృషి చేసే శంకరయ్య సోదరునికి చిన్న కృతజ్ఞతలు సరి పోవు ఈరోజు తమ్ముని శ్రమ తగ్గించి ఇన్ని పద్యాలు రాయించిన మా మరదలికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  21. ఏమండీ కంది వారు,

    మీ confessions టపా ప్రచురణ బ్లాగులో వచ్చునా ?

    రెండు, ఏల్చూరి వారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు సహీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. జిలేబీ గారూ,
    అది ‘వ్యక్తిగత’మని పేర్కొన్నాను కదా! చూద్దాం.. ఏల్చూరి వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఆలోచిస్తాను.

    రిప్లయితొలగించండి



  23. శంకరార్యా,అవును .అక్కడ గణదోషం కలిగింది.'మోకరిలంగ నన్నిటుల మోసము చేతువె 'అని సవరిస్తున్నాను.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. 2019 ఎన్నికల సమయం:

    రోకలి పోటులన్ విసిగి రోయుచు మోడిని తిట్టుచుండగా
    పాకుల పైన బాంబులను భళ్ళున దింపగ నోడిపోతివే!
    వ్యాకులతేలనే మమత! వన్నెలు చిందెడి నీదు మోమునన్
    నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే!

    రిప్లయితొలగించండి