8, అక్టోబర్ 2014, బుధవారం

నిషిద్ధాక్షరి - 13

మొదటిపాదంలో కవర్గాక్షరాలను, రెండవపాదంలో చవర్గాక్షరాలను, 
మూడవపాదంలో తవర్గాక్షరాలను, నాల్గవపాదంలో పవర్గాక్షరాలను ఉపయోగించకుండా
భారతమాతను స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

28 కామెంట్‌లు:

  1. భరత మాతను స్తుతియింతు బ్రతి ది నంబు
    గొప్ప కవులను గనెనుగా నిప్పుడమిని
    పుట్టె గాయకు లుమఱి యు బుట్టె వీరు
    లందు వలననే నేనుగా నాశ్ర యింతు

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    భారతమాత :

    01)
    ________________________________

    వేదవేద్యుండు పుట్టిన - వేల్పుటిల్లు
    బోధనామృత మౌ గీత - పుట్టినిల్లు
    పాడి పంటల కిరవగు - పసిడివల్లి
    కరుణ గలతల్లి, జనులను - గన్నతల్లి
    మాతృదేశము భారత - మాత మనకు
    భరత మాతకు జేజేలు - పలుకుడయ్య !
    ________________________________

    రిప్లయితొలగించండి
  3. ఎన్నడు మాయనట్టిదయి యెల్లర పై ప్రసరించుచున్నదై
    మన్ననఁ దోడ ప్రాణముల మాయమకై యొసగంగ నున్నదై
    మిన్నగు భక్తిఁ బెంచుకొన మేలగు నిష్ఠను నాకొసంగుమా,
    దన్నుగ నిల్చి నాదయిన తల్లిగ నేలను కావ, శ్రీహరీ!

    రిప్లయితొలగించండి
  4. ఎల్లలు లేని శాంతి యిట నెన్నను భారతి! పల్లవించెడున్
    కల్లలు మోసముల్ పరుల గౌరవ హానిని సల్పు కార్యముల్
    చెల్లవు హింస మృగ్యమగు శ్రీలిట పొంగెడి శ్రీకరమ్ముగా
    తల్లి! సనాతనీ! సకల తత్త్వవిశారద! నీకు సన్నుతుల్.

    రిప్లయితొలగించండి
  5. జీవ నదులన్ని ప్రవహించు జీవభూమి!
    వేదములు గీత వెలసిన వేదభూమి!
    సకల కళలకు కాణాచి జయము నీకు!
    సుందరంబగు జనని కి జోతలిడుదు!

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    పరమ పావనమౌధర భరతమాత!
    ప్రణతు లందుము మాకు దీవెనల నిడుము
    కాష్మిరము నీకు మకుటమై గ్రాలునంట
    శివుని కైలాసగిరి నీకు శిరసు గాదె

    రిప్లయితొలగించండి

  7. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    జాతివృద్ధియే దివ్యధ్వజమ్ము వోలె
    పౌరసుఖ శాంతు లరయ నాభరణములుగ
    పటు యశమ్ము మకుటముగ వరలుచుండ
    దేశ మాత హాసద్యుతిన్ తేజరిల్లె

    రిప్లయితొలగించండి
  8. వేన వేలేండ్ల చరితున్న వేద భూమి
    గణితమును విశ్వమున కిడి వినుతి కెక్కె
    ప్రేమ భావము కలిగించె పేర్మి కూర్మి
    సకల జనులు సోదరులని జగతి చాటె

    రిప్లయితొలగించండి
  9. కవిమిత్రులు శ్రీనాగరాజ రవీంద్రులు నిషిద్ధాక్షరముల వాడినట్లున్నారు.గమనించ గలరు.
    పలు మతములఁ బలు జాతుల
    నిల వెలసిన భరత మాత యెలరార నుతుల్!
    పలు భాషల భావమ్ములఁ
    దులతూగెడు శౌర్య జనని దోయలి గొనవే!

    రిప్లయితొలగించండి
  10. వింటిమి భిన్నజాతులు విభిన్నమతంబులు చూడనొప్పనీ
    మంటిని మింటినిన్ గలుపు మానితధీవర సుప్రకాశకుల్
    పంటలు సర్వకాలములఁ భవ్యములై వెలుగొంధుచుండగా
    కంటిని శాంతిసౌఖ్యకర కార్యజయాదులు నీయొడిన్ సదా.

    రిప్లయితొలగించండి
  11. మల్లెల వారి పూరణలు

    భారత భూమియె నదులిడు
    వారిని నన్నము నిడగను, బాగుగ వెలిగెన్
    పేరిచి, యశముల భవమయి
    ధారుణి కంతకు కిరీట తౌల్యత నందెన్

    పావనంపు నదులు పారుచునుండవే
    పంట లెన్నొ పండు భవ్య భూమి
    గొప్ప వౌచు వెలుగు గొపురాలవి యిల
    చాల సంస్కృతులను చక్క వెలుగు

    సాధు వయ్యెడి జనములు సౌరునంద
    తరమె పొగడగ? నియ్యది ధన్యభూమి
    ప్రజలె స్వయముగ పాలించు భవ్యభూమి
    వేద కర్మలు ధర్మాన వెలుగు నిటను

    పరమ పావన మైనట్టి భరత మాత
    ఎన్నొ భాషలు కులములు నింపుఁ గలిసి
    వరలు గణములె పాలించు భవ్య భూమి
    వెలుగు వేదాల ధర్మాన విదిత జగతి

    భారత భూమి భాసిలదె, భవ్యము నౌనదులింపు బారుచున్
    భారత భూమి భాసిలదె, భవ్యకవీంద్రుల కావ్య రాశి తో
    భారపు పుణ్యభావముల పాయక వెల్గు ఋషీశ్వరాళిచే
    ధీరులు నెందరో యిలను. దివ్యులు నౌచును వెల్గు నేలయై

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులు మన్నించాలి. ఈరోజు ఉదయమే మా పిన్ని పెద్దకర్మకోసం ఊరికి వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. అందువల్ల బ్లాగుకు అందుబాటులో లేక ఎప్పటికప్పుడు సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో తవర్గ నిషేధం కదా... మీరు ‘భక్తి’ అన్నారు. అలాగే ‘మిన్న + అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కాశ్మీరము’ను ‘కాష్మిరము’ అన్నారు.
    *
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మూడు పాదాలలోను నియమోల్లంఘన జరిగింది. మొదటిపాదంలో ‘గ’న్నట్టి, మూడవపాదంలో వే‘ద’ములకు, నాల్గవపాదంలో ‘భ’రతమాత ... ఇలా నిషిద్ధాక్షరాలను ప్రయోగించారు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చరిత + ఉన్న’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నాగరాజు రవీందర్ గారి పూరణలో దోషాలను గుర్తించి తెలిపినందుకు ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో తవర్గాక్షరం ‘వెలుగొందు’ ప్రయోగించారు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారు,
    బడలికను పక్కనబెట్టి యోపికతో పరిశీలించి పొరబాటు తెలియజేసినందుకు అనేక ధన్యవాదాలు.

    సవరించినాను.గమనించగలరు.

    ఎన్నడు మాయనట్టిదయి, యెల్లర పై ప్రసరించుచున్నదై,
    మన్ననఁ దోడ ప్రాణముల మాయమకై యొసగంగ నున్నదౌ
    మిన్న గుణమ్ముఁ బెంచుకొన మేలగు నిష్ఠను నాకొసంగుమా,
    దన్నుగ నిల్చి నాదయిన తల్లిగ నేలను కావ, శ్రీహరీ!

    రిప్లయితొలగించండి
  14. గురువుగారికి నమస్కారములు.

    ముందుగా మీ ఓపికకు జోహార్లు.

    నా మూడవపాదాన్ని ఇలా సవరిస్తున్నాను.

    వింటిమి భిన్నజాతులు విభిన్నమతంబులు చూడనొప్పనీ
    మంటిని మింటినిన్ గలుపు మానితధీవర సుప్రకాశకుల్
    పంటలు సర్వకాలములఁ భవ్యములై యలరించుచుండగా
    కంటిని శాంతిసౌఖ్యకర కార్యజయాదులు నీయొడిన్ సదా.

    మరియొక సందేహము గురువుగారు. శ్రమపెడుతున్నను. ఏమనుకోవద్దండీ.

    తవర్గ నిషేధము ( త థ ద ధ న ) అన్నప్పుడు ద్విత్వనకారము " న్న " నిషేధమవునా కాదా.

    రిప్లయితొలగించండి
  15. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సూచనకు ధన్యవాదాలు. మొదటి పాదం యిలామార్చాను.
    వేన వేలేండ్ల పేరున్న వేద భూమి

    తరువాత శైలజ గారి పూరణలో మూడవ పాదం లో న” కారాన్ని, నాలుగవ పాదం లో “బ” ను వాడారు. అవి వాడ వచ్చా తెలియ జేయండి.
    మూడవ పాదం - నీకు /
    నాలుగవ పాదం - సుందరంబగు జననికి జోతలిడుదు!

    రిప్లయితొలగించండి
  16. సోదరి లక్ష్మీదేవిగారి పద్యమందుఁ బ్రాసస్థానము ద్విత్వనకారము...(న్న)...కావున మూఁడవపాదమునఁ దవర్గాక్షరమాగమించి, తృతీయపాదమందుఁ దవర్గాక్షర నిషేధమును భంగమొనర్చినది. ప్రాసాక్షరమును మార్చిననేగాని యా దోషము సవరింపఁబడదు.

    ***
    మిత్రులు సంపత్ కుమార్ శాస్త్రిగారూ,
    మీ ధర్మసందేహము సరియైనదే. నకారమన్నను, ద్విత్వనకారమన్ననుఁ దవర్గాక్షరములేగదా! కాన, నా ద్విత్వనకారము నిషేధింపఁదగినదే.

    ***
    మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డిగారూ, మీ సందేహము యుక్తమైనదే. శైలజగారి పద్యమందవి ప్రమాదపతితములైనవి. వానిని తప్పక సవరింపవలసియేయుండును.

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులకు నమస్కారములు!

    (౧)
    శిరము హిమధామ సుందర వర మహాద్రి!
    పాదముల్ మహాలవణాబ్ధి! భవదుపమిత
    రూపవైశాల్య మరసి, కారుణ్యశీలి!
    వైరులుం గొనఁ, ద్రోలిరి వీర సుతులు!

    (౨)
    అమ్మ భారతమాత! హారతులందింతు
    ....నంది యానందమ్ము నందఁజేయ,
    మమ్ము దోషములేని మార్గాన నడిపియు
    ....నుత్తమోత్తమ సుతు లుత్తములని
    మెచ్చుచుఁ బరరాజ్య మేలువారలు వేగ
    ...మిటకడుగిడి చూచి మేర మఱచి
    యానంద వశులయి యాహా యటంచును
    ....నిన్నుఁ గీర్తించఁగా నిఖిల జగతి

    లోనఁ బేరెన్నఁబడ నెప్డు భానుమండ
    లోన్నత ప్రభా సహిత విలోకనములఁ
    గరుణఁ జూచుచు మమ్ముఁ బ్రకట విశాల
    జీవులనుఁ జేయ వినతి సుస్నిగ్ధవదన!!
    (సీసపాదములవలెనే...గీతపాదములలోనను నియమమరయునది)

    రిప్లయితొలగించండి
  18. పూజ్యనీయ భరత భూమిని బుట్టుట పూర్వజన్మములోని పుణ్య ఫలము
    పరమత సహనంపు పరిమళముల తోడ నలరారు మేలిమి యవని తలము
    పాడిపంటల హోరు పసిడిరాశుల జోరు సిరులుకురియు భాగ్యసీమ సుమ్ము
    శాంతి దూతలకును క్రాంతి వీరులకును నెలవైన విలువైన నేల యిదియె
    విశ్వశాంతి కాంక్షించెడు వేదభూమి
    స్వచ్చ వాహిను ల సంగమ భువిఁ
    రాజితాశేతు శీతాద్రి రమ్య దివ్య
    భరతమాత నీకిదె నాదు వందనంబు

    రిప్లయితొలగించండి
  19. మిత్రులు నాగరాజు రవీందర్‍గారూ,
    మీరు సవరించి ప్రకటించిన పూరణమున స్వల్ప దోషములు దొరలినవి.
    తృతీయపాదమున తవర్గాక్షర నిషేధముండఁగా...మీరు.."పుట్టి"ని"ల్లు మి"న్నే"టికి ము"ను"పు, యట్టి"యని "న"కారమును....
    చతుర్థపాదమున పవర్గాక్షర నిషేధముండఁగా..."దేశ"మా"తను నుతియింతు దిన"ము" రాత్రి"యని "మ"కారమును వ్రాసితిరి.
    అటులే...మునుపు యట్టి...యనుచోట యడాగమము రాదు. మునుపట్టి..కావలయును. దానిని మునుపు నట్టి...యని మార్చవలెను.
    విసుగుకొనక మఱల సవరింపుఁడు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమ:

    పరమ పావన మైనది భరతభూమి
    హరికి క్రీడాక్షేత్రమీ హరితవనము
    హిమమహాచల శృంగముల్ మమతజూపు
    కృతుల వర్ణింతు జననిని స్తుతులజేతు

    రిప్లయితొలగించండి
  21. లక్ష్మీదేవి గారూ,
    సవరించారు. బాగుంది. కానీ మీరు ద్విత్వనకారాన్ని ప్రాసగా వేశారు. మూడవపాదంలో తవర్గ నిషేధం కదా.. ఆ లెక్కన అది దోషమే. మీరు మొత్తం పద్యాన్నే మార్చవలసి ఉంటుంది. ఈ విషయాన్ని సంపత్ కుమార్ శాస్త్రి గారు, గుండు మధుసూదన్ గారు చెప్పేదాక నేను గుర్తించలేదు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    సవరించినందుకు సంతోషం.
    ద్విత్వనకారానికి కూడా నిషేధం వర్తిస్తుంది. లక్ష్మీదేవి గారి పద్యాన్ని సరిగా పరిశీలించలేకపోయాను. (చెప్పాను కదా... ప్రయాణపు బడలిక!)
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    గుండు మధుసూదన్ గారి సూచనలను గమనించండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ సవరణ బాగుంది.
    శైలజ గారి పూరణలోని దోషాలు నా దృష్టికి రాలేదు. ధన్యవాదాలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణను సవరించండి.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ముఖ్యంగా ఎత్తుగీతి పాదాలలోను నిషేధనియమాన్ని పాటించడం ప్రశంసనీయం.
    మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షించినందుకు ధన్యవాదాలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    విశేష మేమిటంటే గుండు వారు ఎత్తుగీతిలోను నిషేధాన్ని పాటిస్తే మీ ఎత్తుగీతిలో అన్ని పాదాలలో ఆయాపాదాల నిషిద్ధాక్షరాలున్నాయి. బాగుంది.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని మూడవ పాదంలో మమ‘త’ అన్నచోట తవర్గనిషేధం పాటింపబడలేదు.

    రిప్లయితొలగించండి
  22. నాగరాజు రవీందర్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగుంది.
    ‘కాళిదాసు’ను తొలగిస్తే ఆమె ‘తెలుగుతల్లి’ అవుతుంది :-)

    రిప్లయితొలగించండి
  23. గురువుగారు,
    నా శ్రద్ధ ఎంత మట్టుకున్నదో ఈనాడు బాగానే తెలిసినది.
    తెలిపిన మిత్రులకు మీకు ధన్యవాదాలు. క్షమించండి.

    మళ్ళీ సవరించినాను. గమనించగలరు.

    పుట్టిన మాయనట్టిదయి పున్నమియై ప్రసరించుచున్నదై
    గిట్టుటఁ దెల్సి ప్రాణముల కేల నొసంగగ సిద్ధమైనదౌ
    గట్టి గుణమ్ముఁ బెంచెడి యఖండపు పట్టు యొసంగుమయ్యరో!
    యెట్టులొ దేశరక్షణనె హెచ్చుగఁ జేయవె నాకు, శ్రీహరీ!

    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులు శ్రీపతి శాస్త్రిగారూ! మీ పద్యమున ద్వితీయపాదంపు ద్వితీయ తృతీయ గణములందు గణభంగమైనది.
    శ్రీశంకరయ్యగారి సూచనఁ గూడ (తృతీయపాదమున "త"వర్గాక్షరాగమము) పాటించి, సవరింపఁగలరు.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికి, శ్రీమధుసూధన్ గారికి ధన్యవాదములు.
    సవరించిన పద్యము

    పరమ పావన మైనది భరతభూమి
    హరి విహారపు క్షేత్రమీ హరితవనము
    హిమమహాచల శృంగముల్ హృష్టి గూర్చు
    కృతుల వర్ణింతు జననిని స్తుతులజేతు

    హృష్టి = సంతోషము

    రిప్లయితొలగించండి
  26. మధుసూదన మిత్రుల సీసపద్యం చాలా బాగున్నది.
    గురువుగారూ పూర్ణానుస్వారము పవర్గాక్షరమౌనా కాదా అన్నది నా సందేహం.

    రిప్లయితొలగించండి
  27. శ్రీపతి శాస్త్రి గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    పూర్ణానుస్వారము ఉభయాక్షరాలతో చేరుతుంది. అది హల్లు కాదు కదా.. అది అనునాసికాక్షరంగా ఉన్నప్పుడు ఆయా వర్గాక్షరంగా రూపాంతరం చెందుతుంది. శంక-శఙ్క, వాంఛ-వాఞ్ఛ, కంఠి-కణ్ఠి, కాంత-కాన్త, అంబ-అమ్బ...ఇలా... కాబట్టి ఇదే వర్గంలోనూ చేరదు.

    రిప్లయితొలగించండి