29, అక్టోబర్ 2014, బుధవారం

బ్లాగు మిత్రులు కలిసారు...

నిన్నటి జడశతకం ఆవిష్కరణ సభలో బ్లాగు మిత్రులను కలవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. జడశతకంలో పద్యాలు ప్రచురింపబడ్డ చంద్రమౌళి సూర్యనారాయణ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారలకు తనికెళ్ళ భరణి గారి చేతులమీదుగా సన్మానం జరగడం కనువిందు చేసింది. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యాలు అందులో ప్రకటింపబడక పోవడంతో వారు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారు. నేను పంపిన బ్లాగు మిత్రుల (డా. విష్ణునందన్ గారు, గుండు మధుసూదన్ గారు మొదలైనవారి) పద్యాలు కూడా ప్రకటింపబడకపోవడం నాకూ నిరుత్సాహాన్ని కలిగించింది.
చంద్రమౌళి సూర్యనారాయణ గారు నాకు భోజనం చేయించి, రైల్వేటికెట్ రిజర్వ్ చేయించి, స్లీపర్ బోగీలో ఎక్కించడం వల్ల ప్రయాణం సుఖంగా జరిగింది. వారికి నా ధన్యవాదాలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, 
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారలతో నేను...

11 కామెంట్‌లు:

  1. నిన్న జరిగిన జడ శతకం పుస్తక ఆవిష్కరణోత్సవములో గురువర్యులు.శ్రీ శంకరయ్య మాస్టరుగారిని కలిసి మాట్లాడే అవకాశము కలిగినందులకు ధన్యుడనైనాను.కొందరు కవిమిత్రులను కూడా కలువగలిగాను. చాలా సంతోషము కలిగినది.గుర్తుగా దిగిన ఫోటోను. వివరములతో బ్లాగునందుంచిన మాస్టరుగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. పాతరోజుల్లో కవిత్వం వేరు. నేడు కవిత్వం అన్నది వేరు.

    ఒకప్పుడు కవిత్వం చెప్పటానికి, కవివి అనిపించుకోవటానికీ చాలా లక్షణాలు కావలసి వచ్చేది కవిత్వానికి, కవికి కూడా. కవిత్వంలో ధారాశుధ్ధి, ఛందోబధ్ధత, పదసంపద, పలుకుబడులమీద పట్టు, పదప్రయోగంలో చతురత, రసపోషణలో నైపుణ్యం, కవిసమయాలూ అలంకారాలూ వంటి వాటిపై అధికారం వగైరా చాలా సామాగ్రి ఉండవలసి వచ్చేది కవిదగ్గర. ఇవి కాక కవికి సంస్కృతభాషాపరిచయం, వివిధప్రాంతాలూ వివిధజాతులూ వృత్తులవారి జీవనశైలి తెలిసి ఉండటం, వేదాంతాది‌శాస్త్రాల్లో‌తగినంత పాండిత్యం వంటి అదనపు హంగులు కూడా ఉంటేనే ఆ పాండిత్యానికి రాణ కలిగేది.

    ఈ రోజుల్లో‌ తెలుగుకవి కావటానికి ఏకైక అర్హత తెలుగు అక్షరాలు వచ్చి ఉండటమే. పూర్వకాలపు కవిత్వసరంజామాను కలిగిఉండటం ఒక ముఖ్యమైన అనర్హత కావచ్చును. ఏ‌ మాత్రం పాతతెలుగు వాసన వచ్చినా అది కవిత్వం కాదని నేటి వారు పెదవి విరుస్తారు. ఎందుకంటే అది వీరికి కొరుకుడు పదదు కనుక, కష్టపడి ప్రయత్నించినా అది తప్పక అజీర్ణం చేసుంది కనుక.

    ఎవరూ నిరుత్సాహానికి గురికానవసరం లేదు. రాజును బట్టే రాజపూజ్యత.

    గుండువారూ, విష్ణునందనులవారూ చక్కగా వ్రాస్తారు కవిత్వం అని నేను కితాబు నివ్వనవసరం లేదు. కాని చక్కని కవిత్వానికి రోజులు కావని తెలిసిన వారు కాబట్టి వారు బాధపడకూడదని నా విజ్ఞప్తి. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డిగారు ఏమైన పాతధోరణిలో పొరపాటున రాసేసారేమో పరిశీలించుకోవాలి.

    ఏమాటకామాట చెప్పుకోవాలి. ఒకటి రెండు తెలుగు పజ్యాలు రాసేస్తే సన్మానం రోజులు వచ్చేసాక ఇంకా ఎం‌కావాలీ సాధారణవ్యక్తికి కవిగౌరవం పొందేందుకు?

    టివీల్లో తరచూ చూస్తూనే ఉంటాం ఏదో అవకతవక సినిమాపాట జనాదరణ పొందిదన్న భ్రమ కలిగే సరికి, ఆ పాట రాసినాయన ఛానెళ్ళలో దూరి ఎంత కష్టపడి ఎంతగొప్పగా ఆ పాటా రాసాడో తా నన్నది డప్పుకొట్టుకోవటం. కాలపుతీరు తెలియని వారూ నచ్చని వారూ బాధపడవచ్చు, కాని సాధారణ టీవీ ప్రేక్షకుడు మాత్రం ఆయన పెద్ద కవి అనుకోవటం లేదా? అదీ సంగతి. ఈ‌ కాలం స్వభావం ఏమిటంటే భాషా, సంస్కృతీచట్టుబండలైనా ఫరవాలేదు. మనకి పేరు వస్తోందా లేదా అన్నది ముఖ్యం. ఈ ఆధునిక కవివరేణ్యులకూ, కవిపోషకులకూ కూడా.

    రిప్లయితొలగించండి
  3. మాస్టారిని, బ్లాగ్ మిత్రులను కలవడం ఎంతో ఆనందాన్న్ని కలిగించింది. శ్యామలీయంగారు అన్నట్లు పద్యాలు ప్రచురించ బాధలేదని నిరుత్సాహ పడవలదు . సెలెక్ట్ కాలేదంటే ఆ పద్యాల స్థాయి ఎక్కువగా ఉన్నదనే లెక్క . ప్రచురించబడినవి కూడా ఎడిట్ చేయబడినవే . అంటే మావి కాదనే అనుకోవాలి

    రిప్లయితొలగించండి
  4. >ప్రచురించబడినవి కూడా ఎడిట్ చేయబడినవే . అంటే మావి కాదనే అనుకోవాలి.

    పద్యాలను (మన్నించాలి, నిర్వాహకులు పజ్యాలు అన్నారు కదా, వాటినే) యథాశక్తి సవరించి ప్రచురించారా!

    ఈ విషయంలో నా అసమ్మతిని తెలియజేస్తున్నాను.
    ఈ సవరింపులనుండి తప్పించుకున్నవారు అందుకైనా ఆనందించవచ్చును.

    తెలియక తప్పించుకోలేక దొరికిపోయినవారు, అవసరం అనుకుంటే అలాంటి పరిస్థితి మరలా రాకుండా జాగ్రత్తపడవచ్చును.

    ఈ వ్యవహారాని దూరంగా ఉండిపోయినవారు కూడా ఒకరకంగా అదృష్టవంతులే అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  5. లబ్ధ ప్రతిష్టులు, పద్యవిద్యలో నిగ్గుతేలిన వారి కంటే వర్ధమాన కవులకూ, వ్రాయాలనే తపనపడే వారికి ప్రోత్రాహకరంగానే ఈనాడు చాలా సభలు జరుగుతున్నాయి. ఇదీ అటువంటిదే ననుకుంటా. నాకు తెలిసినంతవరకూ, ఇందులో అందరూ అటువంటి ఔత్సాహికులే ఎక్కువ చోటుపొందారు. ఒకరిద్దరు మినహాయించి.
    సభలో శ్రీ శంకరయ్యమాష్టారిని, శ్రీ గోలి వారిని కలవటం ఆనందకరం.

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణం గురుదేవులను మరియు కవిమిత్రుల కలవటం చాలా సంతోషకరం.ప్రతిభావంతులైన శ్రీ గుండు మధుసూదన్, డా.విష్ణునందన్ మరియు శ్రీ అన్నపరెడ్డి గారలు తదితర గౌరవనీయుల పద్యాలు సెలెక్ట్ కాకపోవటానికి వారు జడశతకం mail ID కి పంపకపోవటం కారణం.విజ్ఞులు గమనించ ప్రార్థన. చంద్రమౌచంద్రమౌళి గారి భావాన్ని పరిశీలించ ప్రార్థన. అక్షరాలు నేర్చుకునే దశలోని వారికి ఎలానేర్చుకోవాలో నేర్పించే గౌరవనీయ స్థాయిలో వున్నవారు అవి నేర్చుకోవటం చాలా కష్టం మీకవసరం లేదు అని నిరుత్సాహ పరుస్తారా? భుజము తట్టి ముందుకు నడునడుప ప్రార్థన. మీ మార్గదర్శకత్వంలో ముఉందు ముందు ఎంతో నేర్చుకో గలమన్న మా నమ్మకానికి మీ విమర్శలు ఇబ్బంది పెట్టాయి.మీ కక్కడి విషయాన్ని తెలపాలనే తపనలో తప్పుగా అని వుంటే క్షమించండి.

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ,
    మీ మెయిల్‍కు పంపిన నా సందేశాన్ని ఒకసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  8. సహదేవుడుగారికి కొంత మనస్తాపం కలిగినది. బహుశః నా వ్యాఖ్యల వలన కావచ్చు ననుకుంటున్నాను. ఎవరినీ నిరుత్సాహానికి గురిచేసే వ్యాఖ్యలు చేయటం నా అభిమతం కాదు. ఈ వ్యవహారంలో నాకు సమ్మతి లేక పోవటానికి నా కారణాలు అందరికీ సుస్పష్టమే. ఔత్సాహికుల నుండి వచ్చిన కవిత్వాన్ని కూడా నిర్వాహకులు తమదైన శైలిలో మెఱుగులు దిద్దారని చంద్రమౌళి సూర్యనారాయణగారు చెప్పాక నిర్వాహకులు కవులను కేవలం విషయసేకర్తల (కాంట్రిబ్యూటర్ల) వలె భావించారనిపించి ఇంకా బాధకలిగింది.

    అపండితుడనే కాని నేను పండితుడను కాను. కొన్ని కొన్ని పద్యాలు వ్రస్తున్నా చెప్పుకోదగ్గ కవిని కూడా కాను. నా కృషిని నేను చేస్తున్నాను. అంతే. దానిలో భాగంగా ఇతరకవిమిత్రులకు ఔత్సాహికులకు తోడ్పడుతున్నాను వీలైనప్పుడు. అంతకు మించి నా దగ్గర విశేషం ఏమీ లేదు. నా విమర్శలలో మరొక కోణం నా ప్రథమకోపం కూడా అన్నది విదితమే. అంతే కాని విరోధాలూ వైమనస్యాలూ నా విధానం కావు. నా వలన ఎవరికైన ఇబ్బంది కలిగితే క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  9. పూజ్య గురువర్యలు కంది శంకరయ్య గారిని తోటి కవిమిత్రులను కలువ గలిగి నందులకు సంతోషము కలిగింది.

    రిప్లయితొలగించండి
  10. శ్యామలీయం గారికి నమస్కారములు. మీరెంతటి ఘనులో మీ విశ్లేషణా విధానమే తెలియజేస్తుంది.మీరు సద్విమర్శకులన్నది సత్యం. మీ లాంటి వారి చేయూత పొందాలనే తపన మీ కర్థమైతే మా కదే పదివేలు.మీరు క్షమాపణలు కోరడం భావ్యం కాదు. సదా మీ ఆశీస్సులు మాకందించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  11. ఏమి భాగ్యమో వారిది యేమి ఘనత !
    యెక్క డె క్కడో వారలు నక్కజముగ
    కలుసు కొంటిరి యుద్దండ కవితిలకులు
    వంద నంబులు వారికి వంద లాది .

    రిప్లయితొలగించండి