22, ఆగస్టు 2013, గురువారం

సమస్యాపూరణం – 1151 (రామభక్తులలో మేటి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
రామభక్తులలో మేటి రావణుండు.

25 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


లక్ష్మణుడు సోదర వాత్సల్యము తో , సీతమ్మ పతి భక్తి తో కొలిచె
హనుమ రామ భక్తీ తో, విభీషణుడు ప్రాణ రక్షకై రాముని కొలిచె
రావణుడు తన్ను పూర్తీ గ అర్పింప రాముని తలచె అహరహం
మరి కాదె రామభక్తులలో మేటి రావణుండు ?

జిలేబి

జిలేబి

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

విష్ణువుం జేరఁ ద్వరపడె! ప్రేమ వీడి,
వైరమును బూనె! పలుమఱు వైష్ణవులను
బాధపెట్టె! సీతను దెచ్చె! వైరులైన
రామభక్తులలో మేటి రావణుండు!!

Pandita Nemani చెప్పారు...

తపమొనర్చెను భక్తి తత్పరత మెరయ
నాత్మ లింగమున్ బొందెను హరుని గొల్చి
శివ శివా! యంచు కైలాస శిఖరి నెత్తె
రామ! భక్తులలో మేటి రావణుండు

అజ్ఞాత చెప్పారు...

కంది శంకరయ్య గారు,
పండిత నేమాని గారు ధన్యవాదాలు,

"గురువులైన మీరు కొండంత ధైర్యాన్ని
నూరిపోసినారు భారమనక !
గురువులార , జ్ఞానకోవిదులార -మీ
పాదపద్మములకు వందనములు "

-ఆ.వె. 2,4 పాదాలు సమర్థవంతంగా వ్రాయడానికి సూచనలు ఇవ్వగలరని ఆశిస్తూ...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా రెండవ పూరణము:

తల్లి పనుపున శివునికై తపము సేసి,
యాత్మలింగమ్ము కొఱకు దేహమును మిగులఁ
జిదుపలుగఁ జేసి, గెలిచిన శివమతాభి
రామ భక్తులలో మేటి రావణుండు!

Pandita Nemani చెప్పారు...

శ్రీ జయసారథి గారికి శుభాశీస్సులు.
మీ ఆటవెలది పద్యము చాల బాగుగ నున్నది. దానిలో చిన్న చిన్న మార్పులు చేసేను చూడండి:

గురువులైన మీరు కొండంత ధైర్యమున్
నూరి పోసిరి కద భారమనక
సరస హృదయులార! జ్ఞానాఢ్యులార! మీ
పాద పద్మములకు వందనములు

మీ ప్రయోగము: ధైర్యాన్ని అనేది వ్యావహారిక భాష.
మొదటి పాదములో గురువులైన అని వాడేరు కావున 3వ పాదములో మరొక పదమును సరసహృదయులార! అంటే పునరుక్తి అనే దోషము ఉండదు. ఒకే పదమును ఎక్కువ సారులు పద్యములో వాడితే దానిని పునరుక్తి దోషము అంటారు.

ఆట వెలది పద్యములు కొంచెము ప్రయత్నముతో చాలా హాయిగా వచ్చును. ఏమీ సంశయము వలదు - మీకు మా సహాయము ఎల్లప్పుడును ఉండును. స్వస్తి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆత్మలింగమ్ము సాధించె నతడు నాడు
శివుని కీర్తించి మెప్పించి నిలిచినాడు
తెలియ భువిజూడనా పార్వతీ మనోభి
రామభక్తులలో మేటి రావణుండు.

Pandita Nemani చెప్పారు...

జయసారథి గారూ! శుభాశీస్సులు.
మీరు "సమర్థవంతముగా" అని ప్రయోగించేరు. "సమర్థముగా" అనుటయే సాధు ప్రయోగము.

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
======*========
రామ రసమును గ్రోలిన "రామజోగి "
రామ భక్తులలో మేటి,రావణుండు
నాత్మ లింగము బొందిన యసుర రాజు,
శివుని భక్త గోటిన మేటి స్థిరము గాను.

subbarao చెప్పారు...

వాయువేగము గల య ట్టి వాయు సు తుడు
రామ భక్తులలో మేటి, రా వ ణుం డు
శివుని భ క్తుడు , నూ టొ క్క శివుని లింగ
ములకు బ్రతిదిన మభి షేక ము నొన గూర్చు

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

పవన సూతుడ నిశమ్మును పరమ పాద
మునను జేరి తారక మంత్రమును పఠించు
రామ భక్తులలో మేటి, రావణుండు
రామ బాణమునకు జేరె రాముని దరి

భద్ర గిరులపైననిశమ్ము నిద్ర జేయు
రామ భద్రుని జేరిన రామ దాసు
రామ భక్తులలో మేటి, రావణుండు
వైరమును కోరి, దను స్వామి వరము నొందె

పరమ సాధ్వి సీతను గన్న పక్షి రాజు
రణము జేసె రాక్షసునితో, ప్రాణ మిడువ
రామ భక్తులలో మేటి, రావణుండు
స్థిరము గా గొలిచె పరమ శివుని భువిని.

భావజ జనకుని పదము బహువిధముల
బొగడి దిరిగిన త్యాగయ్య పుడమి యందు
రామ భక్తులలో మేటి, రావణుండు
బ్రహ్మ వంశమందున శివ భక్త వరుడు.

Unknown చెప్పారు...

పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు .

శ్రీ హరి ద్వారమందున సేవకుండు
శాపవశమున లంకలో జనన మంది
రాము వైరియై మోక్షమ్ము ప్రాప్తినొందె
రామ భక్తులలో మేటి రావణుండు


శివుని అంశను పుట్టే కపివరుడు పవ
నసుతు డహరహమ్మును సేయు నామ జపము
రామ భక్తులలో మేటి రావణుండు
రాము వైరియై జగముల ప్రబలె గాదె

sailaja చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sailaja చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sailaja చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

గురువులందరికి వందనాలు!
నా పద్యాన్ని సవరించి చెప్పిన శ్రీ నేమాని గార్కి కృతజ్ఞతలు...
"స - జ్ఞ " యతిమైత్రి భోదపడలేదు. తెలియజెప్పగలరు..

sailaja చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా రెండవ పూరణమునఁ గొన్ని చిన్న మార్పులను జేసిన తదుపరి...

తల్లి యాత్మలింగముఁ గోరఁ దపము సేసి,
తనువు ఖండించుకొని, రజతాద్రి నెత్తి,
శంకరుని గెల్చుకొనె, గిరిజా మనోభి
రామ భక్తులలో మేటి, రావణుండు!

sailaja చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sailaja చెప్పారు...

పవన సుతుడు హనుమ పక్షి రాజు
భక్త కంచర్ల గోపన్న బడుగు శబరి
రామ భక్తిభావమ్ముల రాజిల్లినన్
రామ భక్తులలో మేటి రావణుండు


కందుల వర ప్రసాద్ చెప్పారు...


వారధిని గట్టు వానర వీరులకును
మన ధనమ్ము బంచె నుడుత మంచిగాను
రామ భక్తులలో మేటి, రావణుండు
రామ వైరి రాక్షసులలో ప్రభల జెందె
------*-------
మధుర ఫలముల రుచి గాంచి మంచి గాను
పరమ పురుషుని కిచ్చిన భక్త శబరి
రామ భక్తులలో మేటి, రావణుండు
నాతి యెడ మోహమును జూపి నాశ మయ్యె

Pandita Nemani చెప్పారు...

శ్రీ జయసారథి గారికి శుభాశీస్సులు.

జ్ఞ అను అక్షరమునకు ఈ క్రింది అక్షరములతో యతి మైత్రి చెల్లును:

క ఖ గ ఘ చ చ జ ఝ శ ష స న ణ

స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శివుని పూజించి తరియించె చిత్త మలర
దైవ మెవరైన నొక్కడె దాస్య మునకు
ముక్తి నొందగ తపియించి యుక్తి పన్నె
రామ భక్తులలో మేటి రావ ణుండు

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి సమస్యకు వచ్చిన పూరణలు ఎక్కువగా మంచి విరుపుతో సాధించినవి. చాల బాగుగ నున్నవి. ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీ గుండు మధుసూదన్ గారు: రావణుని వైర భక్తిని ఉట్టంకించుచు మంచి పద్యమును చెప్పేరు. చాలా బాగుగ నున్నది.

శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: 2 విధములుగ పద్యములను చెప్పి 2వ పద్యమును కూడా మరల సవరించేరు. అన్నియును బాగుగ నున్నవి. ఆత్మ లింగమును సాధించిన రావణుని భక్తిని వర్ణించుచు మొదటి పూరణ బాగుగ నున్నది. 2 వ పూరణలో పార్వతీ మనోభిరాముడనియు; గిరిజా మనోభిరాముడనియు మంచి కూర్పుతో సాధించేరు. చాలా బాగుగ నున్నవి.

శ్రీ వర ప్రసాద్ గారికి 7 పద్యములు వ్రాసినా ఇంకా తృప్తి ఉన్నట్లు లేదు. అన్నియునూ మంచి మంచి భావములతో రామ భక్తులందరినీ ఉదహరించుచూ ఆ భక్తిలో లీనమై పోయిరి. ఆ పద్యముల వరుసలో -- రామజోగిని గూర్చి; ఆంజనేయుని గూర్చి; (3) భద్రగిరి రామదాసును గూర్చి; (4) జటాయువును గూర్చి; (5) నాద బ్రహ్మ త్యాగరాజును గూర్చి; (6)ఉడుత సాయమును గూర్చి మరియు (7) మధుర ఫలముల నిచ్చిన భక్త శబరిని గూర్చి చాల మనోహరముగా నున్నవి.

శ్రీ సుబ్బా రావు గారు: వాయువేగము గలయట్టి వాయుసుతుడు అని మొదలిడి చక్కని విరుపుతో మంచి పద్యమును వ్రాసేరు.

శ్రీ తిమ్మాజీ రావు గారు: శ్రీహరి ద్వారపాలకుడైన వాడే రావణునిగా వైరభక్తితో విలసిల్లెను అని వక్కాణించేరు. అలాగుననె మంచి విరుపుతో ఆంజనేయుని రామభక్తిని గురించి వర్ణించేరు. చాల బాగుగ నున్నవి.

శ్రీమతి శైలజ గారు: అమ్మా మీ పద్యమును తేటగీతిగా ఈ విధముగ సవరించేను:
పవన సూనుండు, హనుమయు, పక్షిరాజు,
భక్త కంచర్ల గోపన్న, పడతి శబరి,
రామ భక్త శేఖరులు, వైరమ్ము వలన
రామ భక్తులలో మేటి రావణుండు.

శ్రీమతి రాజేశ్వరి గారు: మంచి భావముతో రామునికి శివునికి సమానత్వమును చెప్పుచూ చక్కగా సాధించేరు. చాల బాగుగ నున్నది.

స్వస్తి.