1, ఆగస్టు 2013, గురువారం

పద్య రచన – 420 (చందమామలో మచ్చ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“చందమామలో మచ్చ”

28 కామెంట్‌లు:


  1. ఇటాలియన్ లో సోనియా తెలుగులో జ్ఞానం
    హిందీ లో మా , తెలుగులో తల్లి
    జ్ఞానం ఎంతున్నా మమకారం లేకుంటే ఇక
    చందమామలో మచ్చ తెలుగు కే తెగులు తధ్యం !

    జిలేబి


    రిప్లయితొలగించండి
  2. ఇరువదియేడుమంది సతు లిందున కుండియు నేమి చోద్యమో
    గురుసతి గూడి కాపురము కూరిమి చేసెనతండు దోసమం
    చెరిగియు తత్ఫలంబనగ నేర్పడె వానికి పెద్ద మచ్చగా
    నరయగ నందగాడ ననునట్టి యహంకృతి యెల్ల చెల్లెగా

    రిప్లయితొలగించండి
  3. మంచివార లయిన మర్యాదవరు లైన
    వేపపిక్క యంత వెఱ్ఱి యుండు
    చందమామ యందు కందింత లేదయా ?
    కందు నేల ? సుధల గౌముది గొను !

    కందు = మచ్చ ; కౌముది = వెన్నెల

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    ======*=====
    మచ్చ లేని చంద్రు డనుచు మరల మంత్రి
    పదవి నిడ రాణి జత గూడి బరుల కొరకు
    కుంభ కోణములు సలిపి కుళ్ళు నందు
    చందమామ దిరుగు చుండె కంద వలెను
    (రాణి= సోనియా,చందమామ=మన్మోహన్ సింగ్)

    రిప్లయితొలగించండి
  5. ఎదుటి వారి మచ్చ ఎకసక్కెమగును
    తనదు మచ్చ యున్న తగని భయము
    చందమామ మచ్చ చక్కన్ని చుక్కరా
    సావధాన వినుడు సుజనులారా

    రిప్లయితొలగించండి
  6. చంద్రుని మచ్చ "మీద" పద్యము:

    ఎచటి చంద్రుడు వానిపైకెక్కుటెట్లు
    ఎక్కెఁబో; నేనచటమచ్చ నెట్లుజూతు
    అరసెఁబో; పద్యమెటుల వ్రాయవలెనచట
    ఎట్లు చూపుదునదిమీకు నేమిసేతు ||

    రిప్లయితొలగించండి
  7. చందమామ లో న నందమై యామచ్చ
    సోయగంబు గూర్చె జూప రులకు
    అందమెచట నుండు మంది జేరునటకు
    సంది యంబు వలదు సన్ను తాంగి !

    రిప్లయితొలగించండి
  8. శ్రీమతి జిలేబీ గారికి అభినందనలు.

    తమ్ముడు డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు. ఒక మంచి పద్యము నీది. చంద్రునిలో మచ్చను కాదు అమృతమును చూడండి అంటే హంస క్షీర నీర న్యాయమును అనుభవమునకు తెచ్చుకొనుట - ఎంతయును శ్లాఘ్యము. అభినందనలు.

    శ్రీ వరప్రసాదు గారు! శుభాశీస్సులు.
    రాజకీయముల ప్రసక్తితో మీ పద్యము అలరారుచున్నది. అభినందనలు.

    శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగనున్నది. 1వ పాదము చివరలో ఒక అక్షరము తక్కువగా నున్నది. "సావధాన" అనుట సాధు ప్రయోగము కాదు. "సావధానముగా" అనవలెను. చందమామ మచ్చ చక్కని చుక్కరా - అనిన పాదము చాల బాగుగనున్నది. అభినందనలు.

    శ్రీ గూడ రఘురాం గారు: శుభాశీస్సులు.
    మీ భావము వైవిధ్యముతో నలరారుచున్నది. చందమామ పైకి మీరు ఎప్పుడో నాడు ఎక్కగలరు. అభినందనలు.


    శ్రీ సుబ్బారావు గారు: శుభాశీస్సులు.
    మంచి భావముతో పద్యమును వ్రాసేరు. అంద మెచట నుండు మంది చేరు నటకు - పూర్వపు రేడియోలో ప్రకటన - లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందీ గుర్తునకు వచ్చినది.
    అభినందనలు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  9. తారకాస్త్రీలనుద్వాహమిడిన వేళ
    ..........చుబుకపైదిద్దిన చుక్కయేమొ
    హరునిఫాలముపైన నరుడుచాపముఁమోద
    ..........ఆఘాతమొనరించు అంకమేమొ
    మానవుడేగఁ నీమేనుపై రాకెట్టు
    ..........మంటలుగాల్చిన మచ్చయేమొ
    మాఆశలనుజూచి మందహాసముజేయ
    ..........సోకుబుగ్గలపైన సొట్టయేమొ

    మచ్చయున్ననేమికుముదబంధువీవు
    మధువు గృధువు మాధవుఁనవవధువులవలె
    నుల్లమానందసింధువులుద్భవింప
    శీధువులనింపు మాఆర్తబంధువీవు ||

    రిప్లయితొలగించండి
  10. ఎంత వారి లోన కొంత లోపముఁగని
    పించు మాట నిజము! విశ్వ మందు
    మనుజు నూర డించ మహిలోన ప్రభువు!
    చంద మామ కిచ్చె సదరు మచ్చ!

    రిప్లయితొలగించండి
  11. ధన్యవాదములు సహదేవుడు గారు..
    మీ పద్యము చలా బాగున్నది..
    ఆ స్పూర్తితో, కొనసాగింపుగా కూడా భావించవెచ్చునేమో (తమరి అనుమతితో)..

    లోపముండిననదినీకు శాపమేమి
    గాదు దిద్దగానాతప్పు కాన రాదు
    భగముజేసెను పోవంగ పాపమంత
    మచ్చయున్నశశిఁభవుడు మౌళిఁదాల్చె ||

    రిప్లయితొలగించండి
  12. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    పెద్ద మచ్చలున్న,ఖ్యాతి పెరుగునని దిరుగు చున్న వారిపై
    =======*======
    చందమామలో మచ్చయె నంద మనుచు
    చిన్ననాడు జదివి,నేడు వన్నె యనుచు
    మచ్చలకయి దిరుగు చుండె మనుజు లెల్ల
    నీతి నీడను వీడిరి నేత లెల్ల.

    రిప్లయితొలగించండి
  13. శశిని గాంచి నంత శశికమ్ము గనుపిం చు
    మచ్చ గాదు కనిన మెచ్చు కొనుచు
    క్షీర సంద్ర మందు శ్రీకి సోదరు డంట
    అందరికిని మామ చంద మామ

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు. అందరి పూరణలు అలరించుచున్నవి. అందరికీ అభినందనలు.

    శ్రీ రఘురాం గారు:మీ పద్యము బాగుగ నున్నది. భావ వైవిధ్యము చూపించేరు.
    సీసము 2వ పాదములో నరుడు చాపము మోద - అనుటలో అన్వయము సరిగా లేదు.
    తేటగీతి: 3వ పాదములో:ఉల్లమానంద ....... అన్వయము సరిగా లేదు.
    తేటగీతి: 4వ పాదములో ప్రాస నియమము పాటింపబడలేదు.

    మీ తరువాతి పద్యము తేటగీతి : మీ పద్యము బాగుగ నున్నది.
    3వ పాదము నాకు అర్థము కాలేదు.
    4వ పాదములో: శశిధరుడు అనుటకు బదులుగా మీరు శశిభవుడు అన్నారు.

    శ్రీ సహదేవుడు గారు: మీ పద్యము బాగుగ నున్నది.
    3వ పాదములో గణభంగము - ఆఖరి గణము సూర్య గణము కాకుండా ఇంద్రగణము ఉండాలి.

    శ్రీ వరప్రసాద్ గారు: మీ పద్యము బాగుగ నున్నది. పులిని జూచి నక్క వాతలు పెట్టుకొనును కదా.

    శ్రీమతి రాజేశ్వరి గారు: మీ పద్యము బాగుగ నున్నది. శశము అని ఉండాలి - మీరు శశికము అన్నారు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ నేమని గురువర్యులకు ధన్యవాదములు. గణ సవరణ తర్వాత పద్య పాదం:
    మనుజు నూరడించ మహిఁ బరమాత్ముడు

    రిప్లయితొలగించండి
  16. తెలుపు రంగును గమనించి తెలియకుండ
    నలుపు రంగునుఁ దలచుచు నలుగనేల?
    మచ్చ నొక్కటి మనమిక మరచు నెడల
    వెలుగు నెల్లెడ పృథివిని వెన్నెలలవి.

    రిప్లయితొలగించండి
  17. మచ్చను యిలలోనెవ్వరు
    మెచ్చరు తమమీదనున్న, మేదిని జనులే
    మచ్చల చంద్రుని జూచుచు
    మచ్చరమును జెందుదురుగ మైమరపులతో.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నేమాని మాష్టారు గారికి నమస్సులు..

    మీ సవరణలకు ధన్యవాదములు..
    సీసపద్యములో మీరు చెప్పిన అన్వయదోషమును సరిచేసి, తేటగీతి పద్యమును మొత్తముగనే మార్చుతూ.. ఈ కింది పద్యమును సమర్పించుకుంటున్నాను..

    తారకాస్త్రీలనుద్వాహమిడునపుడు
    ..........చుబుకపైదిద్దిన చుక్కయేమొ |
    హరునిఁగొట్టగజూడు నరునిదెబ్బకునడ్డు
    ..........బడనీతలఁగాటు బడినదేమొ |
    మానవుడేగఁనీమేనుపై రాకెట్టు
    ..........మంటలుగాల్చిన మచ్చయేమొ |
    మా తపనలఁజూచి మందహాసముఁజేయ
    ..........సోకుబుగ్గలపైన సొట్టయేమొ |

    ఆష్టమీచంద్రవిభ్రాజదలికభాగ
    శోభితయగు శ్రీలలితకు సోయగమును
    గూర్చు నుదుటిబొట్టుగవెలుగొందు చంద
    మామపైనున్నమచ్చయె మమ్ముఁగాచు ||

    రిప్లయితొలగించండి
  19. గురుసతి తారను హిమకరు
    డరసి గవయ గురుడు యిచ్చె నా శిష్యునకున్
    గురుతర శాపమ్ము క్షయ
    కరుడై మచ్చను ధరించి ఖంబున దిరుగన్

    రిప్లయితొలగించండి
  20. మిత్రులారా! శుభాశీస్సులు. మీ అందరి పద్యములు ప్రశస్తముగా నున్నవి. చాల సంతోషము. అందరికి అభినందనలు.

    శ్రీ సహదేవుడు గారు: మీరు చేసిన సవరణ సరిగా నున్నది.

    2. శ్రీమతి లక్ష్మీ దేవి గారు: వెన్నెలను ప్రశంసించుచు మీరు చక్కని పద్యమును చెప్పేరు.

    3. గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: మంచి శబ్దాలంకారముతో వేసిన ప్రాసతో మీ పద్యము వన్నె కెక్కినది.

    4. శ్రీ గూడ రఘురాం గారు: మంచి మంచి సీస పద్యములను వ్రాస్తున్నారు. మీరు అన్వయమునకు ప్రాధాన్యమును ఈయండి. లలితా మాతను స్మరింప జేయుచు మీరు చెప్పిన 2వ పద్యము చాల బాగుగ నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ తిమ్మాజీ రావు గారూ: శుభాశీస్సులు. మీ పద్యమును చూచేను. బాగుగ నున్నది. కొన్ని సూచనలు:
    1. 2వ పాదములో: గురుడు + ఇచ్చెను -- సంధి నిత్యము కనుక గురుడిచ్చెను అగును.
    2. 3వ పాదము: శాపమ్ము క్షయ - అనునవి 2 విడి విడి పదములే కాని ఒక సమాసము కాదు. కాబట్టి క్ష కి ముందున్న మ్ము గురువు కాదు. అందుచేత అక్కడ మరొక లఘువును చేర్చితే సరిపోవును -- శాపమ్మును క్షయ అనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. మా అమ్మగారు గతంలో వ్రాసిన పద్యం:

    పాలకడలిలోన ప్రభవించె చిన్నారి
    పుచ్చపూలు కురిసె బోసి నవ్వు
    కన్నతల్లి మురిసి కంటికాటుకదీసి
    దిష్టిచుక్క పెట్టి దిష్టిదీసె!

    రిప్లయితొలగించండి
  23. తప్పకుండా మీ సూచనలను పాటిస్తాను నేమాని మాష్టారు గారు..
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  24. అన్నయ్య గారికి ప్రణతులు. చంద్రునిలో కందైనా చూడగలము , కాని అన్నయ్యగారి పద్యా లెప్పుడూ సుందరముగానే ఉంటాయి. మిత్రుల పూరణ లన్నీ అలరారుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ ఆదిత్య గారూ! శుభాశీస్సులు.
    మీ త్qఅల్లి గారు కూడా మంచి కవయిత్రిగా మంచి పద్యములు వ్రాయుచున్నారంటే హర్షదాయకము. అభినందనలు. నేను విజయనగరములో చదువుకొనిన వాడినే. 12వ యేటనే పద్య విద్యలో అడుగుపెట్టి మా తెలుగు ఉపాధ్యాయుల ప్రశంసలు & ఆశీస్సులు పొందేను. స్వస్తి.

    రిప్లయితొలగించండి