2, నవంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 148

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. పండు ముదుసలి శబరియె
    పండును తా రుచిని జూచి భక్తిని వెట్టన్
    పండెను భాగ్యమ దాహా !
    పండును దినె రాము డపుడు పరమాత్ముండై.

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, నవంబర్ 02, 2012 8:01:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    తియ్యని ఫలముల దెచ్చితి
    నయ్యా శ్రీరామచంద్ర! అబలను ధన్యం
    బయ్యెను జన్మము దేవా
    చయ్యన నీ శరణు గోరు శబరిని నేనున్

    రిప్లయితొలగించండి
  3. రామచంద్రా! రమ్ము రమ్మంచు మ్రొక్కిడి
    ....యవనిజేశా! యని యాసనమిడి
    కల్మషహర! యంచు కడిగి పాదమ్ములు
    ....సురసన్నుతా! యని స్తుతి నొనర్చి
    యాప్తబాంధవ! యని యంగపూజలు చేసి
    ....భక్తివశ్యా! యని ఫలము లొసగి
    నిగమవేద్యా! యని నీరాజనము నిచ్చి
    ....ముక్తిదా! యని మంత్రపుష్పములిడి
    శ్రిత జనావన! యని ప్రదక్షిణ లొనర్చి
    రసవినోదన! యనుచు కీర్తనలు పాడి
    పరమ భక్తితో రామ సేవల నొనర్చి
    పరమ సంతోష భరితయై వరలె శబరి

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు
    ========*======
    రామ లక్ష్మణులకు నిచ్చె రయమున ఫల
    ములను శబరియు ,పుడమి పులక రించ
    వింత జూడ నెమలి తోడ వేగిరమున
    వచ్చె నుడుతలు రాముని వరము బొంద

    రిప్లయితొలగించండి

  5. ఎంగిలి తినెదవు భక్తుల
    ముంగిలి వీడవు దశరధ మోహన రామా
    మంగళమీకిక భక్తికి
    లొంగిన నీగాధ స్థిరము లోకము నంతన్

    నానా జిహ్వలు పలికిన
    నీ నామమె పండ్ల రీతి నిలిచెను రామా
    నానా జన్మల చేదును
    నీ నామపు తీపి దీర్చు నీలశ్యామా

    చేరితివీ శబరిని యీ
    తీరుగ దయచూడనెంచి దినకర తేజా
    నీ రమ పలుకుల మధురిమ
    మారెను యీ ఫలములవలె మది( స్థిరపడుమా

    రిప్లయితొలగించండి
  6. తానుకొఱికినపండ్లను దాశరథికి
    భక్తిఁనుడివుచు బోధించె ప్రజలకెల్ల
    "దైవమునకీయవలెనుసత్ఫలములెల్ల"
    ననెడు తత్వంబు తానుగానాచరించి.

    సత్ఫలములు = తానుచేసిన సత్కార్యములకు కలిగిన ఫలములు

    రిప్లయితొలగించండి
  7. వేచిన రాముడె వచ్చెను
    బ్రోచగ పండిన శబరిని! భోజనమటఁజే
    సాచిన యెంగిలి పండ్లే!
    తూచడె దేవుడు మనసును ధోరణిఁదెలియన్!

    రిప్లయితొలగించండి
  8. గోరు ముద్దలు దినిపించు నారి వోలె
    దాను రుచి జూసి తీయని దైన ఫలము
    రాము జేతికి నిచ్చిన రామ , యరయ
    శబరి నాబడు గురువర ! సద్వ నిత యు .

    రిప్లయితొలగించండి
  9. పేద గుండెను పిడికెడు ప్రేమ దప్ప
    పండ్లు ఫలముల కంటెను మెండు గాను
    ఏమీయ గలను ప్రియముగ రామ చంద్ర
    మోద మలరగ తినుమయ్య నొవ్వ కుండ !

    రిప్లయితొలగించండి
  10. నేమాని పండితార్యుల బాటలో......

    ఎన్ని జన్మల నుండి యెదురు చూచుచు నుంటి
    ..................రామ చంద్రా రమ్ము రావె యనును
    అసలు చూపానదే ఆపైన కన్నీరు
    .................కనులార నిన్నెట్లు కాంతు ననును
    నడచి వచ్చితి వీవు నాకోసమై రామ
    ................కడిగెద నుండుము కాళ్ళ ననును
    ఆకలి గొంటివి అయ్యయో నా బిడ్డ
    ................పండ్లను గొని తెత్తు పదవె యనును

    పండ్ల రుచి చూచి తినుమను భక్తి మీర
    రాము డెంగిలి తినె నంత ప్రేమ తోడ
    శబరి తరియించె నాతని చరణ మంటి
    హద్దు లేదుగదా పర మాత్మ కృపకు.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    భక్త శబరి :

    01)
    _______________________________

    పండు ముదుసలి శబరంత - భక్తి తోడ
    పరమ పూరుషు రాము , నా - దరము సేయ
    పండ్లు పూవులు తెచ్చె, తా - వనము నుండి
    పండు రుచిచూచి పిమ్మటే - బాతి మీర
    ఫలము లందున మంచివే - ప్రభువు కిడుట
    భక్త శబరిగ లోకాన - వాసి కెక్కె !
    _______________________________

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    నిన్న బంధువుల ఇంట ఒక కార్యక్రమానికి వెళ్ళి రాత్రికి ఇల్లు చేరాను. బడలిక కారణంగా నిన్నటి పద్యరచనపై వెంటనే స్పందించలేకపోయాను. మన్నించండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    మొదటి పాదంలో ‘శబరియె’ అంటే గణదోషం. ‘శబరియే’కు టైపాటనుకుంటా.
    ‘అది + ఆహా’ అన్నప్పుడు సంధి లేదు. ‘భాగ్య మ్మాహా’ అందాం.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    షోడశోపచారాలలో కొన్నిటిని ప్రస్తావించిన మీ సీసపద్యం శబరి భక్తిని వివరిస్తూ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కళ్యాణ్ గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘భక్తిఁ నుడివుచు’ ఇక్కడ అరసున్నా ఎందుకు? అది ‘నుడువుచు’ కదా!
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘పండ్లు - మెండు’ అన్నప్పుడు ప్రాసయతి తప్పింది. అక్కడ ‘పండు’ అంటే సరి!
    మూడవ పాదంలో ‘ఏమీయగలను’ అన్నచోట గణదోషం. ‘ఏమి యిత్తును’ అంటే సరిపోతుంది.
    *
    మిస్సన్న గారూ,
    ‘హద్దు లేదుకదా పరమాత్మ కృపకు’ అంటూ మీరు చెప్పిన సీసపద్యం శ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ‘శబరి + అంత’ అన్నప్పుడు సంధి లేదు. ‘శబరి సద్భక్తితోడ’ అందాం.

    రిప్లయితొలగించండి