11, సెప్టెంబర్ 2013, బుధవారం

పద్య రచన – 461 (వేటపాలెము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“వేటపాలెము”

17 కామెంట్‌లు:

  1. వేటపాలెమునందు వెలసెను సారస్వ
    ....త నికేతనమ్మన దనరు సంస్థ
    సుబ్రాయ మహలను శుభమందిరమ్మున
    ....నతి విశాలంబగు ప్రాంగణమున
    విజయ దశమి నాడు విద్యల తల్లి సం
    ....కల్ప బలమ్ముతో కళల నిధిగ
    నతి పవిత్రంబైన ఆ మహాలయములో
    ....నడుగు పెట్టిన చాలు నబ్బు విద్య
    సకల విద్యల నిలయమా సంస్థ యందు
    వివిధ విద్యలలోన ప్రావీణ్యము గని
    వెలిగి రెందరు నెందరో పెద్దలకట
    ఆ కళానిలయమ్మున కంజలింతు

    రిప్లయితొలగించండి
  2. విజయ దశమి పర్వ దినాన విజయ ముగను
    వేట పాలెము నందున మెప్పు నొందు
    సంస్థ నెలకొల్ప బడెను సా రస్వత పర
    మైన విద్యాలయం బట యార్య! గనుడు .

    రిప్లయితొలగించండి
  3. “వేటపాలెం”
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. తెలుగు పుస్తకాల అమూల్య నిలయమైన సారస్వత నికేతనం వేటపాలెంలోని ఒక గ్రంధాలయము.
    వేటపాలెం గ్రామ పంచాయతి చీరాల పట్టణానికి 9 కి.మీ దూరంలో వుంది. ఈ వేటపాలెం మండలంలో ఆరు గ్రామాలు కలవు. వేటపాలెం గ్రామం తెనాలి - మద్రాసు రైల్వే లైనులో ఉంది. చీరాల నుండి వేటపాలెంకు బస్సు ప్రయాణం అరగంట పడుతుంది. "వేటపాలెం" పేరును సంస్కృతీకరించి "మృగయాపురి" అని కొన్నిచోట్ల వ్రాస్తారు.
    ఈ గ్రామము కోస్తా ప్రాంతంలోనే జీడిపప్పు వ్యాపారానికి ఎంతో పేరు గాంచినది.
    “సారస్వత నికేతనం”
    ‘సారస్వత నికేతనం’ అనే గ్రంధాలయం ద్వారా వేటపాలెం ప్రసిద్ధమైనది. ఇది తెలుగు భాషకు 80 సంవత్సరాలుగా మహోన్నత సేవలు చేసింది. దీన్ని 1918లో వి.వి.శ్రేష్టి స్థాపించాడు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో కెల్ల ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము సారస్వత నికేతనం.
    ఈ గ్రంథాలయానికి 1929లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించి ఆశీర్వదించారు. కట్టడము పూర్తైన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు.
    ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ కలదు. కొన్ని వార్తాపత్రికలు 1909వ సంవత్సరమునుండి కలవు. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బస చేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు.
    (తెలుగు వికీపీడియా నుండి ధన్యవాదాలతో)

    రిప్లయితొలగించండి
  4. సుప్రసిద్ధ గ్రంథమ్ముల శోభ వెలయు
    వేఁటపాలెము తెలుఁగుల పేర్మి ధనము!
    నిత్య పరిశోధకాంచితౌన్నత్య గృహము!
    తఱచు దర్శించవోయి గ్రంథాలయమ్ము!
    రమ్ము సారస్వత నికేతనమ్మునకును!!

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    సుబ్బారావు గారూ,
    మీరు ‘సారస్వత నికేతనం’ను విద్యాలయంగా పొరబడ్డారు. అందుకు అవకాశం ఉంది. పూర్వజన్మ సుకృతం, ఆసక్తి, పెద్దల శిక్షణలో పద్యరచన అలవరచుకొన్నవారికి దాని గురించి తెలిసి ఉండదు.
    వేటపాలెం గ్రంధాలయం గురించి తెలుగు సాహిత్యం ప్రాధానాంశంగా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారికి తప్పక తెలిసి ఉంటుంది.
    జీవితంలో ఒక్కసారైనా ఆ గ్రంధాలయాన్ని దర్శించాలని నా కోరిక.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
    ======*======
    సారస్వత నికేతనమ్ము సహృదయులను వేడు చుండె
    రారండి!రారండి మీరు! రక్షింప తెలుగు వెలుగును
    కోరిన గ్రంధముల్ గలవు కోవిధులార యనుచును
    భారమయ్యె నేడు పాత భవనమ్ములకు క్రొత్త వెలుగు
    కోరి సహాయమ్ము మిమ్ము కోరు చుండెనుదాతలార!

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    వేటపాలెము గ్రంథాలయము గురించి విపులముగా వివరించిన మీకు అభినందనలు. మీరు తప్పక ఆ గ్రంథాలయమును త్వరలోనే చూడ గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. వేట పాలెము నందున వెలసి యున్న
    మేటి గ్రంధా లయమ్మది సాటి లేని
    తెనుగు భాషకు నిలయమై తేజ మలరు
    ప్రముఖు లెందరొ నిలిపిన ప్రాభ వమ్ము
    వమ్ము గాబోదు నికేత నమ్ము జూడ

    రిప్లయితొలగించండి
  9. వేట వలదోయి గ్రంథాలు వేలకొలది
    ఒక్కచోటనె దొరకును నిక్కముగను
    వేటపాలెపు శాలను వేడ్కమీర
    చదివి తరియింపుమా నీవు శక్తికొలది.

    రిప్లయితొలగించండి
  10. ఒక అపురూపమైన సాహితీ నికేతనమును పరిచయం చేసిన గురువుగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. సారస్వత నికేతనం ప్రకాశం జిల్లా వేటపాలెం లోని తెలుగు గ్రంధాలయము.

    తెలుగు భాషకు 80 సంవత్సరాలుగా మహోన్నత సేవలు చేసిన ఈ గ్రంధాలయము చాలా మంది సాహితీకారులకు కూడా తెలియదంటే నమ్మశక్యము కాదు.

    ఈ గ్రంథాలయము అక్టోబరు 15, 1918 లో వి.వి.శ్రేష్టి స్థాపించాడు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో కెల్లా ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము సారస్వత నికేతనం. మహాదాత, గాంధేయుడు గోరంట్ల వెంకన్న గ్రంథాలయమునకు మొదటి దశలో భూరి విరాళము ఇచ్చాడు.

    ఏదైనా తెలుగు పుస్తకము వెతకడములో ఇంతవరకు మీ ప్రయత్నాలు సఫలముకాకపోతే వేటపాలెం సారస్వత నికేతనంలో ఆ పుస్తకము దొరికే అవకాశము ఉన్నది. ఈ గ్రంథాలయము ఆంధ్ర ప్రదేశ్ లో పరిశోధనా-ఓరియంటెడ్ గ్రంథాలయాలలో అగ్రగణ్యమైనది. ఈ గ్రంథాలయానికి 1929 లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించి ఆశీర్వదించారు. కట్టడము పూర్తైన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. స్వాంతంత్ర్యోద్యమ కాలములో ఎందరో యువకులకు స్పూర్తి ప్రదాత అయినది. ఆ తరువాత కాలములో వచ్చిన ముఖ్య మంత్రులు మరియు ఎందరో విద్యావేత్తలు గ్రంథాలయమును సందర్శించారు.

    ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ కలదు. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి కలవు. 70,000 కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు. ఈ గ్రంథాలయము తన చుట్టు ఉన్న ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితము చేసినది. విద్య మరియు సమాజ కళ్యాణ ఉద్యమాలెన్నింటికో కేంద్రబిందువైనది. ఈ గ్రంథాలయము అందరికీ అందుబాటులో ఉన్నది. చిన్న ఒక అంతస్థు భవనము నుండి ప్రస్తుతము ఇది రెండంతస్థుల భవనముగా ఎదిగినది.

    గ్రంధాలయం అభివృద్ధిలో కొన్ని ముఖ్య ఘట్టాలు:

    1918 అక్టోబరు 15 స్వర్గీయ శ్రీ. వి.వి. శ్రేష్ఠి F.A.R.U., హిందూ యువజన సంఘం గ్రంధాలయాన్ని స్థాపించారు.

    1924 ఒక పెంకుటిల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రంధాలయాన్ని తరువాత 'సారస్వత నికేతనం' అని నామకరణం చేశారు. ఈ భవనాన్ని స్వర్గీయ శ్రీ. జమ్నాలాల్ బజాజ్ గారు ప్రారంభోత్సవం చేశారు.

    1927 లో ఈ గ్రంధాలయం, 1927 సొసైటీ చట్టం క్రింద రిజిస్టరు కాబడినది.

    1929 క్రొత్త భవంతికి శంకుస్థాపన, జాతిపిత మహాత్మా గాంధి చేశారు. తరువాత ఈ భవంతిని ప్రకాశం పంతులు ప్రారంభించారు.

    1930 ఈ గ్రంధాలయం, జిల్లా కేంద్ర గ్రంధాలయంగా గుర్తింపు పొందినది.

    1935 బాబూ రాజేంద్ర ప్రసాద్, గ్రంధాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని శంకుస్థాపన జేశారు. ఇదో జ్ఞానమందిరంగా అభివర్ణింపబడినది.

    1936 గాంధీగారు రెండో సారి విచ్చేశారు.

    1942 గుంటూరు జిల్లా గ్రంధాలయాల సభ జరిగినది.

    1943 అంతర్జాతీయ సహకార ఉద్యమం.

    1949 6-వ దక్షిణ భారత యువత విద్యా సదస్సు జరిగినది.

    1950 జర్నలిజం కొరకు తరగతులు, వావిలాల గోపాలకృష్ణ ప్రధానాచార్యులుగా వ్యవహరించి, జరిపించారు.

    1975 శ్రీ. ఏ.శ్రీనివాసరావు, గౌరవ కార్యదర్శి, హైదరాబాదులో జరిగిన, ప్రపంచ తెలుగు మహాసభలలో గౌరవించబడ్డారు.

    1985 RRLF, కలకత్తా వారిచే ఇవ్వబడిన మ్యాచింగ్-గ్రాంటు సహాయంతో, క్రొత్త వింగ్ ను ఏర్పాటు గావించారు.

    (ఈ పై విషయాలన్నీ http://librarians-library.blogspot.in/2009/08/saarasvataniketanam.html అన్న బ్లాగులో ఉన్నాయి.)

    మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,

    పై వ్యాసంలో వి.వి. శ్రేష్ఠి అంటే ఊటుకూరి వెంకటశ్రేష్ఠి గారు. నాళం కృష్ణారావు గారికి బంధువులు.

    సారస్వత నికేతనం అనగానే దానిని ఈ స్థాయికి తీసికొనివచ్చి ఇప్పటికీ ఉత్తరవయస్సులో సైతం ఆ అమూల్యసంపదను సుభద్రంగా పరిరక్షిస్తున్న మాన్యులు శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారిని సంస్మరించాలి.

    శ్రీ తల్లావఝల శివశంకరశాస్త్రి గారు, శ్రీ తల్లావఝల కృత్తివాస తీర్థులు గారు, మహాకవి శ్రీ బండ్ల సుబ్రహ్మణ్యం గారు, శ్రీ మాచిరాజు దేవీప్రసాద్ గారు, శ్రీ నేలనూతల కృష్ణమూర్తి గారు, శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారు సారస్వత నికేతనం గ్రంథాలయం గుఱించి తమ రచనలలో విపులంగా వ్రాశారు.

    వేటపాలెము వాస్తవ్యులు, ఆర్థిక - గణాంక శాస్త్రనిపుణునిగా దేశవిదేశాలలో ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఉత్తమ సాహితీవేత్త శ్రీ బందా లక్ష్మీ నరసింహారావు గారు ఇప్పుడు ఆ సంస్థ చరిత్రను బృహద్గ్రంథంగా వ్రాస్తున్నారు.

    మంచి విషయాన్ని ఎన్నుకొన్నారు, ఈ రోజు! నిజంగా సరస్వతికి ఆవాసమందిరం అది!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  12. వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    విద్యార్థి దశనుండి చూడాలనుకుంటున్న వాగ్దేవీమందిరం అది! నా కోరిక ఎప్పటికి తీరేనో?
    సారస్వత నికేతనం గురించిన సమగ్ర వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
    శ్రీ పండిత నేమాని గారికి వందనములు

    కడగె హిందూ యువజన సంఘమ్ము పేర
    తొలుత శ్రేష్టి కృషి వలన శిష్టు డైన
    జాతిపిత గాంధి కడగాలు రాతి నిడగ
    జమునలాలు బజాజు పక్రమ మొనర్చె
    టంగుటూరి పాల్గొనెను సభాoగణమున
    అమరె సారస్వత నికేత మాంధ్రులకును
    పదియు తొమ్మిది నూర్లు ముప్పది ఆరవది
    వత్సరమ్మందు రాజేంద్ర బాబు వచ్చి
    ఆశి షులనిడె ను యిచట నధ్యయనము
    జరుప అమెరికా జాపాను లరుగు దెంత్రు
    తెలుగు సీమను కాదు యీ దేశమందె
    ఒక్క పరివారము చేత చక్కగాను
    ఎనుబదేoడ్లకు పైబడి ఏను వర్ష
    ములుగ నడచిన సంస్థగా ముద్ర బడియె
    సంస్థ పోష కులకును విశా రదులకు
    కార్య నిర్వాహకులకును కార్మికులకు
    నిర్విరామము పనిచేయు నిపుణులకును
    సతత మొనరింతు వందన శత శతమ్ము

    రిప్లయితొలగించండి
  14. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    వేటపాలెం చరిత్రను, ప్రాశస్త్యాన్ని ఛందోబద్ధం చేశారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
    మీరు మంచి భావములతో చక్కని పద్యమును వ్రాసేరు తేటగీతి (మాలిక). మీ కృషి ప్రశంసనీయము. అభినందనలు. కొన్ని సూచనలు:
    1. 2వ పాదములో యతి మైత్రిని మీరు గమనించ లేదు.
    2. ఆశిషుల నిడెను యిచ్చట - ఇచట యడాగమము రాదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము: ఆశిషమ్ముల నిడె నిట .....
    3. కాదు ఈ దేశము - అనుచోట కూడా యడాగమము రాదు.
    4. ఒక్క పరివారము చేతను చక్క గాను - అనే పాదములో ఒక లఘువు తక్కువ గానున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. అద్భుతమన నిదియె యాశ్చర్యమానంద
    ములును కలిగెనయ్య! మ్రొక్కులిడుదు
    జ్ఞానదాహపరుల సామర్థ్యములకెల్ల!
    వారి కరుణ వెలుగు భారతమ్ము.

    రిప్లయితొలగించండి