22, జులై 2012, ఆదివారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 3

          ఈ మహాకావ్యము మహనీయులైన పీఠాధిపతులు, జగద్గురువుల అనుగ్రహము నొందినది.
(1) శ్రీ శ్రీ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతులు తమ సంతొషమును శుభాశీస్సులను తెలిపిరి.
(2) శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు తిలకించి "ఈ గ్రంథము తత్త్వ జిజ్ఞాసువులకు నిత్య పారాయణ గ్రంథముగా వెలుగొంద గలదని" ఆశీర్వదించిరి.  తాము కూడ ఈ గ్రంథమును నిత్యము పఠించుచున్నట్లు దయతో వెల్లడించిరి.
(3) శ్రీ శ్రీ శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులు ఈ గ్రంథము సరళంగా, సుభోధముగా, సూక్తి సురభిళముగా నున్నది అని వెల్లడించి తమ ఆశీర్వచనములను గూర్చిరి.
(4) మహామహోపాధ్యాయ సద్గురు డా. కందుకూరి శివానంద మూర్తి గారు ఈ గ్రంథమును చదివి, వారి సందేశమును కూడా వ్రాసి, "సరళమైన అన్వయ సౌలభ్యము, సముచితమైన మాటల పొందిక అన్ని చదువరికి మిక్కిలి ఆనందాన్ని ఇవ్వగలవు.  ఈ కృతి తప్పక  ప్రజాదరణ పొందగలదు.  ఇంతటి పద్యకావ్యమును రచించిన ఈ కవి ఇంత తపోదీక్షను అవలంబించిన పుణ్యాత్మడగుట నిజము.  వారిని మనసారా అభినందించుచున్నాను."  అని వారి ఆశీస్సులనిడిరి.

          సాహితీమూర్తు లనేకులు ఈ గ్రంథమును ప్రశంసించిరి.
          ఆచార్య సార్వభౌమ డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ కావ్యమునకు విపులమైన ఆముఖమును వ్రాసిరి.  ఈ కావ్యము జిజ్ఞాసువులకు ఆత్మ తత్త్వోపదేశ ప్రధానమైన రచన గాను, కావ్య రసాస్వాదన తత్పరులకి మధుర కావ్యముగాను దర్శన మిస్తుంది.  మూలంలోని తత్త్వ వివరణ అనువాదములో సులభ సుందరముగా నిరూపింపబడినది.  ప్రధాన కథ శబ్ద ప్రయోగ వైచిత్రితో వర్ణనలతో అసదృస కల్పనలతో మహాకావ్య పద్ధతిలో అభివర్ణింప బడినది.  కాబట్టి ఉభయ పక్షాలకు చెందిన పాఠకులు ఈ అధ్యాత్మ రామాయణ పద్య కావ్యాన్ని తప్పక ఆస్వాదింపగలరు." అని వాక్రుచ్చిరి. 
          మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహా రావు గారు, సహస్రావధాని డా.  కడిమిళ్ళ వరప్రసాద్ గారు వంటి వారి ప్రశంసలు కూడా ఈ కావ్యమునకు లభించినవి.శ్రీ కొంపెల్ల వెంకట రామ శాస్త్రి గారు మరియు శ్రీ కోటమర్తి వెంకట నరసింహ మూర్తి గారు  (కొవ్వూరు - పశ్చిమ గోదావరి జిల్లా) ఈ పద్య కావ్యమును పరిశీలించి తగు  సూచనలిచ్చి వారి అభిప్రాయములను తెలిపిరి.  
          ఈ విధముగా ఈ కావ్యము ఎందరెందరో మహనీయ మూర్తుల మన్ననలను అందుకొనినది.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి