12, జనవరి 2016, మంగళవారం

సమస్య – 1912 (వారు వేఱు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వారు వేఱు వీరి వారు వేఱు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

58 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రేమ తోన గలసి పీయూష మునుపంచు
వారు వేఱు , వీరి వారు వేఱు
పరుష భాష లాడి పరిహసిం చిమదిని
కుటిల బుద్ధి తోన కులుకు వారు

shashima.with.ekalamu చెప్పారు...

ఒక్కతల్లిదండ్రి చక్కని జత వారి
తనయులెపుడు జూడ తగవులాడు
కన్న కడుపుతీపి కన్నీరుగార్చేరు
వారు వేఱు వీరి వారు వేఱు.

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మంద పీతాంబర్ చెప్పారు...

అత్త అమ్మ గాదు అరచినా విరిచినా
కోడలమ్మ గాదు కూతురెపుడు
తీరు మార బోదు తీర్థాలు తిరిగినా
వారు వేఱు వీరి వారు వేఱు.

కంది శంకరయ్య చెప్పారు...

శశికాంత్ మల్లప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కార్చేరు’ అన్నది వ్యావహారికం. ‘కన్నీరు గార్తురు’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అరచినన్, విరిచినన్, తిరిగినన్’ అనండి.

విరించి చెప్పారు...

గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు

విరాట రాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసమును నెరుపు చుండిరేమో అన్న అనుమానంతో దుర్యోధనుడు విరటునకు లేఖ పంపాడని ఆలేఖను చదివిన రాజుతో మంత్రి అన్న మాటలుగా నూహించిన పద్యము

విజ్ఞు లైన పాండు వీరుల కొరకంచు
వెదకు చుండె కౌర వేంద్రుడిపుడు
తెలుపు చుంటి మనదు కొలువులో జేరిన
వారు వేఱు వీరి వారు వేఱు.

subbarao చెప్పారు...

వారువేరువీరివారువేరనుటను
సబబుకాదుమనకుసర్వులమిల
నైకమత్యతగసహగమనంబుచితమ
యదియమానవత్వమదియమేలు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ తో అర్థము మారిపోయింది. నాభావన రాలేదు. నేను ఇచ్చిన సమస్య: “ వారి వారి వారి వేరు వేరు” ఇందులోని శ్లేషార్థములను పయోగించాలని నా ఉద్దేశ్యము.

P.suryanarayana rao చెప్పారు...

వధువు మనసు లోని భావాల నూహింప
వారు వేఱు'వీరి వారు వేఱు
కారని తలపించు కాంతుని జూడంగ
మమత పండి నంత సమత నిండు!

P.suryanarayana rao చెప్పారు...

వధువు మనసు లోని భావాల నూహింప
వారు వేఱు'వీరి వారు వేఱు
కారని తలపించు కాంతుని జూడంగ
మమత పండి నంత సమత నిండు!

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

వారు వేఱు వీరి వారు వేఱని మాకు
లేదు భేద భావమేది మదిని
కలసి వీడి వేరు కాపుర మైనను
భావ బంధ మొకటె బాస యొకటె.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
ఏదైనా సమస్యను ఇస్తున్నపుడు ముందుగా దానిని నేను పూరించగలనా లేదా అనీ, దానిని ఎన్నివిధాలుగా పూరించవచ్చునో అనీ బేరీజు వేసుకొని అందరికీ సానుకూలంగా ఉండే విధంగా చూసుకుంటాను. మీరిచ్చిన సమస్యను ఎన్ని కోణాల్లో పరిశీలించినా పూరణకు నాకు దారి దొరకలేదు. వారి = జలం అన్న అర్థాన్నీ పరిశీలించాను. ఇటువంటి క్లిష్టసమస్యనిచ్చి మిత్రులను ఇబ్బంది పట్టవద్దనుకొని దానిని మార్చి ప్రకటించాను. ప్రకటించడానికి ముందు మీకు నేను చేసిన మార్పును తెలియజేస్తూ మన్నించమని కోరుకున్నాను. ఈ విషయంలో మీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించమని మనసారా కోరుకుంటున్నాను.

కంది శంకరయ్య చెప్పారు...

పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ రిచ్చిన సమాచారమింకా చూడలేదు. మన్నించండి.
నాపూరణ పరిశీలించి తప్పులున్న క్షమించండి. ఒప్పయిన్న దీవించండి.

కృష్ణవేణి వారి కృత్స్నముం బంచిరి
మూడు రాష్ట్రములకు ముచ్చటగను
రాష్ట్ర త్రయము నాల్గు రాష్ట్రంబు లయ్యెను
వారి వారి వారి వేరు వేరు
[వాళ్ళ వాళ్ళ నీళ్ళు వేఱు వేఱు ]

కందమూల రతులు కర కమండల ధారు
లు వనచరులు ఋషులు లుబ్ధ యశులు
తాపసులు హరిపద తత్పరులు ఘనులు
వారి వారి వారి వేరు వేరు
[ఎవరి నీరు వారిదే, ఎవరి వేరు (తినుటకు) వారిదే.]

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

అన్నదమ్ములిద్దరాదరనీయులు
పక్షములవి వేరు బాణి వేరు
బృందములుగ వచ్చుపెళ్లి సంబరమందు
వారు వేఱు! వీరి వారు వేఱు!

A.Satyanarayana Reddy చెప్పారు...

వారు గుడిని మ్రింగువా రలు, వీరలు
లింగము మరి గుడిని మ్రింగు వారు
వారికంటె ఘనులు వీరివారలు సుమ్మ
వారు వేరు వీరి వారు వేరు

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Bhagavatula Krishna Rao చెప్పారు...

కోరి పోరు సలుపు కురురాజ పుత్రుల
తీరు పాపమునకు మారు పేరు;
పాపమెరుగ నట్టి పంచ పాండవులను
వారు,వేఱు; వీరి వారు వేఱు.

కంది శంకరయ్య చెప్పారు...

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

పాండుపుత్రులవని పరమ ధర్మాత్ములు
వారు,వేఱు; వీరి వారు వేఱు
పరచి వారి రాజ్య భాగ మిచ్చుటకును
సమ్మతింప నట్టి శఠులనంగ

Unknown చెప్పారు...

పాండుపుత్రులవని పరమ ధర్మాత్ములు
వారు,వేఱు; వీరి వారు వేఱు
పరచి వారి రాజ్య భాగ మిచ్చుటకును
సమ్మతింప నట్టి శఠులనంగ

Unknown చెప్పారు...

కట్నమొసగి కన్య కాంతగమారెనా?
అత్తమామయింట పెత్తనంబు
వారు వేఱు|వీరివారువే ఱుగనౌను
కోడలింటజేర తోడుదొరక|
2.ఊరివారమొక్కటైన ?ఉన్నవీది వేరులే
పరుగు పంధ్య మందువీరు పట్టు వీడ రెప్పుడున్
మరుగుబడరుబహుమతందు మంచి నేర్పు కూర్పునన్
పారు వారు వేఱు|వీరివారువే ఱు నెంచగా.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

మిత్రులు కామేశ్వర రావు గారూ,
మీ పూరణములు బాగున్నవి. రెండవ పూరణము రెండవ పాదమున...లుబ్ధ యశులా...లబ్ధ యశులా...తెలుపఁగలరు. ఋషులు, తాపసులు...అని...పునరావృతమైన దనిపించుచున్నది. పరిశీలింపఁగలరు.
స్వస్తి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

(మహిళా మండలిలోఁ దక్కిన సభ్యులతో నధ్యక్షురాలైన నొకతె తన స్నేహితురాండ్ర భర్తలనుఁ దన భర్తనుం బోల్చుచుఁ బలికిన సందర్భము)

ప్రేమఁ జూపి మిగులఁ బ్రియమారఁ బిలుచుచు
గారవించి ప్రణయ కళలఁ దేల్చి
సుఖము లిడుటఁ బోల్చి చూచువారలకు మా

వారు వేఱు; వీరి వారు వేఱు!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మిత్రులు మధుసూదన్ గారు “లుబ్ధ యశులు” యశమంటే ఆసగలవారనే యర్థములోనే వాడాను.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా పూరణము:

(చెఱువు నీరు, బావి నీరు వేర్వేఱని పలుకు సందర్భము)

చెఱువు నీరు మేము చింతలేకుండయే
త్రాగుచుందుమయ్య తఱచుగాను!
వారి నీరు బావి నీరు! కన, సరసి
వారి; వారి వారి వేఱు వేఱు!!
[వారి వారి=వారి నీరు]

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

అమ్మవైపు వారి నాత్మీయు లౌదురు
యనుచు నుంద్రు కాదె యవని యందు
తరచి తలచి జూడ తారతమ్యమునుండు
వారు వేరు వారి వీరు వేరు.
2.ఆలి వైపు వారి నాత్మబంధువులండ్రు
వారు వేరు:వారి వీరు వేరు
తరచి చూడ నిదియె తరతరములనుండి
జరుగుచున్న తీరు జగతి యందు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఋషులు...తాపసులు...దేనిపైనను ఆశ లేనట్టివారుకదా! కావున, దీనిని..."సవన ధనులు" అనిన నెటులుండును? మూఁడవ పాదమున పునరావృతమునుం బరిహరించుటకు "సత్పథులు హరిపద తత్పరులు ఘనులు" అనిన నెటులుండును? పరిశీలింపుఁడు. అన్యథా భావింపవలదని మనవి. స్వస్తి.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పునరావృతమని నాకూ అనిపించింది. సూక్స్మ భేదముండవచ్చని అలానే ఉంచాను. మీ సవరణ చాల బాగున్నది.
వీరికి యాస యున్నది కానీ ధనము మీద కాదు, సత్కీర్తి నొసగు మంచి పనుల మీదయని నా ఉద్దేశ్యము. నింద లా కనిపించే పొగడ్త.
చక్కని సూచనల తో మీ పరిశీలన నాకు మిక్కిలి యానందము కల్గించినది. ధన్య వాదములు. “లుబ్ధ యశులు” యథాతథముగా నుంచడానికి యనుమతిస్తారని యాసిస్తూ ,

కందమూల రతులు కర కమండల ధారు
లు వనచరులు ఋషులు లుబ్ధ యశులు
సత్పథులు హరిపద తత్పరులు ఘనులు
వారి వారి వారి వేరు వేరు

మీ పూరణ చక్కగ నున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

విశ్వామిత్రుడంతటి మహాత్ముడు బ్రహ్మర్షి పదవికి
యాసపడ్డాడు. కామాన్ని జయించలేక మేనక గురించి తపోభంగము చేసుకున్నాడు. అయినా మనకు భరతుడు లాంటి చక్రవర్తి నిచ్చి ఉద్ధరించాడు కదా.

డా. విష్ణు నందన్ చెప్పారు...

సుకవిత్వ ధనులైన శ్రీ గుండు మధుసూదన్ గారు మరియు శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారల సంభాషణం బాగుంది. ఇక్కడ ఈ చర్చను పరిపూర్ణం చేయవలెననే తలంపుతో మరొక రెండు మాటలు.
1. ఉకారాంతహః పుంలింగ ఇతి కమండలుః - తత్సమం - కమండలువు ; కమండలం వాడుకలోకి వచ్చింది కాని , పండితామోద యోగ్యం కానేరదు. సామాన్య భాషలో చెప్పాలంటే - " కమండలం" అనే పదం లేదు. ఉండదు.
తత్పరిహారార్థం - "కమండలు ధారు ..." అని సవరించవచ్చు , సరిపోతుంది.
2. వనచరులు అంటే రూఢ్యర్థం , నైఘంటికార్థం - కోతి మాత్రమే. వనే చరః ఇతి వనచరః / లేదా అలుక్సమాసమైతే వనే చరః , మహా అయితే ' ఆటవికుడు ' అనే అర్థం చెప్పుకోవచ్చు, కవికంగీకారమైతే - ' లు యతివరులు ---- ' అని సవరించవచ్చు .
3. ఋషి , తాపసుడు రెండు సమానార్థకాలైనా వాటిలో వాటికి సూక్ష్మ భేదం కూడా కలిగినవి కనుక - సవరించినా , సవరించకపోయినా - సరైనదే .
4. తత్పరత్వము - "ఆశ కలిగి ఉండడం" , సాధారణంగా - ధ్యాన , సేవా , పూజా ,అర్చనాదులకు పరపదంగా తత్పరత్వం గోచరిస్తుంది. "పద తత్పరుడు" - పదముల మీద ఆశ కలిగిన వాడు అనడం కన్నా - పద సేవా తత్పరులు , పద ధ్యాన తత్పరుడు , పదార్చనా తత్పరుడు మొదలైనవి సమంజసంగా ఉంటుంది.

ఈ ఈ అంశాలు కావ్య గౌరవ దృష్టితో వ్యాఖ్యానించినప్పుడు మాత్రమే. సరదాగా వ్రాసే సమస్యాపూరణాలకు నియమ నిబంధనలున్నా , లేకున్నా చెల్లుతుంది. స్వస్తి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సుకవులు డా. విష్ణునందన్ గారూ...నమస్సులు! మీ వివరణము బాగున్నది. సంతోషము. అటులనే...లుబ్ధ యశులు...ప్రయోగ సాధుత్వముం గూర్చి తెలిపెన నింకను సంతోషింతుము.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా. విష్ణు నందన్ గారూ నమస్కారములు. శబ్దార్థ ప్రయోగము లందుచితానుచితములను వివరిస్తూ యిచ్చిన మీ వ్యాఖ్యానము నాకు మార్గదర్శకమై యొప్పుచున్నది. ధన్యవాదములు. తదనుగుణముగా నా పూరణ సవరించ గలను.
మీకు, మధుసూదన్ గారికి, పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

ఇక్కడ జరిగిన సౌహార్ద సదసద్వివేక చర్చ ఆనందాన్ని కలిగించింది. విషయావగాహనకు అనుకూలించే ఇటువంటి చర్చలు ఆహ్వానింపదగినవి. పోచిరాజు వారికి, గుండు వారికి, డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలు.

కంది శంకరయ్య చెప్పారు...

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
కామేశ్వర రావు గారి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘పందెము’ను ‘పంధ్య’మన్నారు. ‘బహుమతి+అందు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘బహుమతులకు/బహుమతి గొన’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ చమత్కారభరితమై ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘ఔదురు+అనుచు’ అన్నపుడు యడాగమం రాదు. ‘...నాత్మీయు లన నొప్పు| ననుచు...’ అనండి.

విరించి చెప్పారు...

అడగ వచ్చినట్టి అధికార పక్షమే
యోటు గోరియిచ్చె నోటు, పిదప
ననధికార పక్షమభ్యర్థి యేవచ్చె
వారు వేఱు వీరి వారు వేఱు.

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా. విష్ణు నందన్ చెప్పారు...

శ్రీ గుండు మధుసూదన్ గారూ , లుబ్ధ యశులను గూర్చి 'దత్త సందర్భంలో' భవదభిప్రాయమే సమ్మతము.

డా. విష్ణు నందన్ చెప్పారు...

శ్రీ గుండు మధుసూదన్ గారూ , మీ పూరణ మెచ్చదగినది, చాల బాగున్నది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
కవిమిత్రుల సూచనలను సహృదయంతో స్వీకరించి సవరణలను చేసినందుకు సంతోషం. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదములు డా. విష్ణునందన్ గారూ!

ధన్యవాదములు శంకరయ్యగారూ!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కందమూల రతులు కర కమండలు ధారు
లు ప్రవిమల చరితులు రుచిర మతులు
ధర్మ సత్య పరులు తాపసులు ఘనులు
వారి వారి వారి వేరు వేరు