28, జులై 2011, గురువారం

చమత్కార పద్యాలు - 114 A (ప్రహేళిక సమాధానం)

చం.
కలువలరాజు బావ సతి కన్నకుమారుని యన్న మన్మనిన్
దొలఁచినవాని కార్యములు తూకొని చేసినవాని తండ్రినిం
జిలికినవాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడి నింటికిఁ జూడవే చెలీ!

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -
కలువల రాజు - చంద్రుడు
చంద్రుని బావ - విష్ణువు
విష్ణువు సతి - లక్ష్మి
లక్ష్మి కన్నకుమారుడు - మన్మథుడు
మన్మథుని అన్న - బ్రహ్మ
బ్రహ్మ మనుమడు - రావణుడు
రావణుని తొలచినవాడు - రాముడు
రాముని కార్యములు చేసినవాడు - హనుమంతుడు
హనుమంతుని తండ్రి - వాయుదేవుడు.
వాయువును చిలికినవాడు - శేషుడు
శేషుని వైరి - గరుత్మంతుడు
గరుత్మంతుని ప్రభువు - కృష్ణుడు (విష్ణువు)
కృష్ణుని చెల్లెలు - సుభద్ర
సుభద్ర బావ - భీముడు
భీముని అన్న - ధర్మరాజు
ధర్మరాజు తండ్రి - యముడు
యముని వాహనం - దున్నపోతు.
సరియైన సమాధానం పంపిన
మందాకిని, గన్నవరపు నరసింహ మూర్తి గారలకు
అభినందనలు.

7 కామెంట్‌లు:

  1. శంకరార్యా ! చిన్న సందేహం !
    సతి కన్న కుమారుని "యన్న " మనుమనిన్ - అనియున్నది గదా !
    మరి ఈ " అన్న " ఎవరు ? ఏమయ్యాడు ?

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారూ,
    నిజమే! అది తప్పిపోయింది. ఇప్పుడే సవరిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  3. వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదాలు.
    సవరించాను. చూడండి.

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా !

    బహుశా
    లక్ష్మి కన్నకుమారుడు - మన్మథుడు
    మన్మథుని యన్న - బ్రహ్మ
    అనుకోవచ్చా ?

    రిప్లయితొలగించండి
  5. వాయువుని శేషుడు చిలకడమేంటి? వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  6. దీపు గారూ,
    స్వాగతం!
    ‘చిలుకు’ శబ్దానికి త్రచ్చడమే కాక చిందు, ప్రసరించు, మీఱు (మించు), చల్లు అనే అర్థాలున్నాయి.
    ఒకసారి శేషుడు విష్ణుదేవుని ద్వారంవద్ద కాపలా కాస్తున్నాడు. వాయుదేవుడు వచ్చి లోపలికి వెళ్లబోయాడు. శేషుడు అడ్డుకున్నాడు. "విష్ణుమూర్తిని దర్శించడానికి వచ్చాను. ఆపడానికి నువ్వెవడివి?" అని వాయువు లోపలకు వెళ్లబోయాడు. శేషుడు అతణ్ణి గెంటివేసాడు. తమలో ఎవరు బలవంతులో తేల్చుకోవాలనుకున్నారు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. విష్ణువు అక్కడికి వచ్చాడు. వారి కొక పరీక్ష పెట్టాడు. "మేరుపర్వతం కుమారుడైన వేంకటాద్రిని శేషుడు చుట్టుకొని ఉండాలి. వాయువు ఆ పర్వతాన్ని కదిలించాలి. అలా కదిలిస్తే వాయువు బలవంతుడు, లేకుంటే శేషుడు బలవంతుడు" అన్నాడు. శేషుడు వేంకటాద్రిని చుట్టుకొని బిగపట్టి ఉన్నాడు. వాయువు ఆ పర్వతాన్ని కదల్చడమే కాదు, శేషునితో సహా దూరంగా విసిరివేసాడు. శేషుడు చిన్నబుచ్చుకొని వైకుంఠానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. విచారంతో ఉన్న శేషుని దగ్గరికి వచ్చి విష్ణువు అతణ్ణి ఓదార్చాడు. శేషు డక్కడే పర్వతంపై ఉన్నాడు. అదే ఏడుకొండలలో ఒకటైన ‘శేషాద్రి".

    రిప్లయితొలగించండి