15, జులై 2012, ఆదివారం

పద్య రచన - 51


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. నీలపు మేఘములారా!
    జాలిని చూపంగ మీరు చప్పున రాగా,
    చాలా సంతోషమ్మిక,
    నాలస్యంబేలనొ? కురియంగను భువిపై!

    కొలువైన రంగశాయిని
    తలచినయంతట మనమున , దయతో పుణ్యం
    బుల ఫలమై కనిపించగ
    నిలలో ననుఁ బోలు భాగ్యమేరికి కలుగున్?
    (నిన్నటి విషయముపై నింకొక కందము.)

    రిప్లయితొలగించండి
  2. నీ లి మేఘము లయ్యవి లీ ల గొలుప
    వాన రాకను సూచించు నాన వాలు
    ఆక సంబున గని పించ యాశ కలిగె
    బోర్లు పని జేయు నిటు పైన చాల వరకు

    రిప్లయితొలగించండి
  3. పుడమి తల్లి మించు పుణ్య మాత గలదా
    తిండి నిచ్చు పైన నుండ నిచ్చు
    ధూర్త మానవుండు దుర్బుద్ధి జేసెడి
    గాయములను సైచు కరుణ కురియు.

    అన్నదాత జేరి యామెకు మ్రొక్కిడి
    దున్ని విత్తు చల్లి తోయ మిడుచు
    నన్ను గావు మన్న నాగేటి చాలున
    సిరుల గురియు నామె కరుణ మురియు.

    కొండ నిలుచు ధరను మెండు గంభీరమై
    శిరసు వంచ బోక శిధిలమైన
    కష్ట సుఖములందు కలత కూడదటంచు
    తెలియ జెప్పు నీకు దిద్దుబాటు.

    ఆరయంగ నునుపు దూరపు కొండలు
    దరికి జేర తెలియు తత్త్వ మపుడు
    మోసగించు నిన్నె మూఢుడా నీకన్ను
    నిజము తెలియు మనుచు భుజము దట్టు.

    గ్రీష్మ తాప మెన్న భీష్మ మై బాధింప
    నరుగు దెంతు వన్న నాశ తోడ
    వేచి యుంటి మయ్య వేళ మీరెను గాని
    కరుణ లేద నీకు వరుణ రావ.

    నల్ల మబ్బు జూచి యుల్లముప్పొంగును
    జల్లు కురియు పుడమి చల్ల బడున-
    నెంతు మయ్య మేమ దేమౌనొ యేమాయొ
    అంతలోన మాయ మగును తాను.

    ప్రకృతి కరుణ లేక బ్రదుకునా మనుజుండు
    విర్ర వీగు తానె పెద్ద ననుచు
    భూనభోంతరాళముల మధ్య నాతడౌ
    నల్ప జీవి తెలియ నగును తాను.

    రిప్లయితొలగించండి
  4. నీలకంధర బళి! నీ దర్శనమునొంది
    పరవశింతురంట ధరణి జనులు
    నీలకంఠ వితతి నృత్యవిన్యాసాల
    ప్రకృతి కాంత మెచ్చు పరమపురుష!

    (నీలకంధర శబ్దము శివుడు మరియు నీలి మబ్బులను నర్థము లిచ్చును. అటులనే నీలకంఠ శబ్దము శివుడు మరియు నెమిలి యను నర్థముల నిచ్చును. శివుడు పరమ పురుషుడుగను పార్వతి ప్రకృతి మాతగను చెప్పబడుచుందురు. స్వస్తి.)

    రిప్లయితొలగించండి
  5. (చిన్న మార్పుతో నా పద్యము)

    నీలకంధర బళి! నీ దర్శనమునొంది
    పరవశింతురంట ధరణి జనులు
    నీలకంఠ సరస నృత్యవిన్యాసాల
    ప్రకృతి కాంత మెచ్చు పరమపురుష!

    రిప్లయితొలగించండి
  6. నేమాని పండితార్యా ప్రకృతిలో పరమేశ్వర దర్శనం చేసిన మీ పూరణ పవిత్రం.

    రిప్లయితొలగించండి
  7. నీలి మేఘంపు సొగసుల మేలి ముసుగు
    గాలి కెరటంపు కౌగిట కరిగి మురిసి
    రాలు చుండగ నీలంపు రాశు లనగ ?
    ఏల కురియంగ నింతటి హేల నీకు ?

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మేఘాన్ని ఆహ్వనిస్తున్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీరూ ‘బోరు’బాధితులేనా?
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    వర్షాభావాన్ని ప్రస్తావించిన మీ ఖండిక చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    చిన్న పద్యంలో మహార్థాన్ని ఇమిడ్చిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    సుందరమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. వార్షుకమేఘమా! కనుల పండువుగాగ కృషీవలుల్ మనో
    హర్షము పొందఁగా చినుకు లవ్వియె యేరులు గాగ పాఱఁగా
    కర్షణఁ జేసి ధాన్యమును గాదెలు నిండఁగఁ బండఁ జేయఁగా
    వర్షము లెన్నియో బ్రతుకువారుగ లోకులు నిన్ను మెత్తురే!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ మిస్సన్న గారూ! బాగున్నవి మీ పద్యములు. అభినందనలు. మీ ప్రశంసలకు ధన్యోస్మి.
    శ్రీ శంకరయ్య గారూ నమస్సులు.

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పద్యములు......

    వ్యాపన మ్మయె నాకాశ పథము నందు
    వార్షుకాభ్రమ్మొ, శారదాభ్రమ్మొ యిదియ?
    వార్షికపు మేఘ మైనచో వర్ష మేది?
    యిల శరన్మేఘ కాల మహిమ మిదేమొ?! (1)

    ఆ.వె.
    ప్రిదిలె జవము, శక్తి, గ్రీష్మాతపమ్మునఁ;
    బ్రజలు వేచి యుండ్రి వర్షమునకు!
    పంట పండు టదియ పదివేలు, లక్షలు;
    కాల మహిమ మేమొ కానరాదు! (2)

    కం.
    చిను కొకటి రాలఁ గానే,
    వెనుకటి యుత్సాహ మెలమి పెల్లుబుకంగన్,
    మును ముందు కేఁగు రైతుకుఁ
    జిను కిట్టుల నాగఁ గాను చెడు కాలమ్మే? (3)

    ఆ.వె.
    గంపె డాశ తోడఁ గనిపెట్టుకొని యుండ,
    వాన రాదు పంట పండు కొఱకు;
    పంట పండ కున్న నింట వంటయు సున్న;
    వంట సున్న యైన బలము సున్న! (4)

    జలద వృత్తము
    న్యాయము నీకుఁ గాదు;మరియాదయుఁగా;
    దీయఁగ రావె వర్షమును నీ క్షణమే;
    మాయును బాధ లో జలదమా, మహిలో
    శ్రేయము లెల్ల మా కిడఁగఁ జేతు నతుల్! (5)

    రిప్లయితొలగించండి
  12. మధుసూదన్ గారూ,
    మీ ఖండకృతి చాలా బాగుంది. అభినందనలు.
    ముఖ్యంగా జలదాన్ని గురించి వర్ణిస్తూ ‘జలద’ అనే విశేష వృత్తాన్ని స్వీకరించడంలో ఔచిత్యం ప్రశంసనీయం.

    రిప్లయితొలగించండి
  13. మధుసూదన్ గారి విశేషవృత్తం ‘జలద’ను పొడిగిస్తే ఉత్పలమాల అవుతుంది. వారి పద్యాన్నే తీసికొని సరదాగా నేను వ్రాసిన
    జలద గర్భిత ఉత్పలమాల...
    న్యాయము నీకుఁ గాదు;మరియాదయుఁగాదిక కాటకమ్ము వె
    న్దీయఁగ రావె వర్షమును నీ క్షణమే కురిపించినంతనే
    మాయును బాధ లో జలదమా, మహిలోని జనాళి మెచ్చ సు
    శ్రేయము లెల్ల మా కిడఁగఁ జేతు నతుల్ సతతమ్ము భక్తితోన్.

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....
    ధన్యుడను శంకరయ్య గారూ, తమకు అభినందనలు! జలదవృత్తము ఉత్పలమాల యందలి పూర్వత్రయోదశాక్షరములతో (యతితో సహా)చక్కగా సరిపోవును. సందర్భమునకు సరిపడునట్లీవృత్తము నెన్నుకొన్నాను.తమరు రాసిన జలదగర్భితోత్పలమాల బహు చక్కగానున్నది. ప్రశంసనీయమైన ఈ ప్రయత్నము నిటులనే కొనసాగించగలరు.
    ధన్యవాదములతో...స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రావణ మేఘమాలిక విశాలనభమ్ము నతిక్రమించె ,నా
    రావభయంకరమ్ముగ ,విరామములేకయె వర్షధారలన్ ,
    భూవివరమ్ములన్ గురిసె ,పుణ్యమహాతటినీప్రవాహముల్ ,
    జీవనదాతలై ,వెలసి జీర్ణవికల్ప వనాంతరమ్ములన్ .

    నందనాఖ్య సంవత్సరమందు జనులు ,
    ఎదురుజూచిరి నీకయి ఇంతకాల
    మోయి, నీలాంబుధర బంధు, ఉరిమి మెరసి ,
    వర్షధారల గురియుమా వందనమ్ము.
    క్రింది రెండు పద్యాలు భావకవితా స్ఫూర్తితోను,సినిమాటిక్ గాను రాసాను.
    నీలిమేఘ మాలికలలో గాలికెరట
    ములను ,నీపాట వినిపించు చెలియ యెపుడు
    మధురభావాలసుమమాల మదిని విరియు
    ఎవ్వియో స్మృతులను రేపు నీనిశీధి.

    కవికులగురువు,మహనీయ కాళిదాసు
    మేఘసందేశ కావ్యమ్ము మెరయు మదిని
    నిన్ను జూడంగ మదిపొంగి ,నీలమేఘ
    మాలికా,తాపమునుదీర్చు మహిమ యేమొ .

    రిప్లయితొలగించండి
  16. గురువు గారు,
    మీరు వ్రాసిన ఉత్పలమాల, జలదగర్భితోత్పలమాల రెండూ చాలా బాగున్నాయి.
    మధుసూదన్ గారు,
    కొత్త వృత్తాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    కమనీయం గారి పద్యాలూ బాగున్నాయి.

    రిప్లయితొలగించండి