21, జులై 2012, శనివారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 2

          25-3-2009 నాడు అమెరికా చేరుకొని అచ్చట నొక సంవత్సర కాలము నివసించితిని.  ఆ సమయమున నిత్యము అధ్యాత్మరామాయణము సంస్కృత మూలమును తెలుగు తాత్పర్యమును చదువుట, బాగుగా అర్థము చేసికొనుట, దానిని తెలుగు పద్యములలో వ్రాయుటను ఒక దీక్షతో గావించితిని.  ప్రతి దినము ముప్పది పద్యములకు తక్కువ కాకుండ వ్రాయుట, ఆ విధముగ 3 రోజులలో సుమారు నూరు పద్యములు వ్రాయుట అగుట తోడనే మనస్సునకు విశ్రాంతి 2 రోజులు ఇచ్చుట, పిదప 2 రోజులలో ఆ వ్రాసిన పద్యములను సరిజూచు కొనుట, టైపు చేయుట జరుగు చుండెడిది.  ఆ విధమైన పట్టుదలతో ఈ కావ్యమును 2009 సంవత్సరము వినాయక చవితి పర్వదినమున (సెప్టెంబరు) ముగించితిని.
          ఆ రచనానుభవము వర్ణించుటకు వీలుకానిది.  నిత్యము రామాయణమును అధ్యయనము చేయుట, అందులోని పాత్రలలో లీనమగుట, తదనుగుణముగ మంచి భావముతో పద్యములను వ్రాయుట, వివిధములైన స్తోత్రములను రచించుట, అధ్యాత్మ విషయములను బాగుగ అధ్యయనము చేయుట, మొదలగు ననేక విషయములతో నిత్యము గడపుట అనునది ఒక గొప్ప తపస్సు అని నా భావము.  అట్టి మహాయోగమును పొందితిని.
          ఈ కావ్యములో శ్రీరాముడు పరమాత్మగా (పురుషోత్తమునిగా) వర్ణించబడెను.  సీతాదేవి యోగమాయ.  పరమాత్మను సగుణ బ్రహ్మముగను, నిర్గుణ బ్రహ్మముగను చెప్పుదురు.  కావున నేను శ్రీరాముని స్తుతించుచు ఈ క్రింది శ్లోకమును చెప్పితిని.
     రామం విశ్వమయం వందే  బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ |
     శాంతం సనాతనం సత్యం  చిదానందం పరాత్పరమ్ ||

          ఈ కథను పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పుచున్నటుల నుండును.  రామకథను ఒక ఆధారముగ చేసికొని వివిధములైన వేదాంత విషయములను వివరించుటయును, భక్తిపూర్ణమైన అనేక స్తోత్రములను చేయుటయు నిందు ముఖ్యముగా కనుపట్టును.  అందుచేత నిది కర్మ, భక్తి, జ్ఞాన యోగములను త్రివేణీ సంగమముగ గోచరించును.  ఆ త్రివేణీ  సంగమమున నిత్యము స్నాన పానాదుల నొనర్చు వారి పుణ్య ఫలమును ఏమని వర్ణింపగలము - సర్వయోగ ఫలప్రదము. 
స్వస్తి!  (సశేషము)

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

3 కామెంట్‌లు:

  1. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    నేమాని మహాశయా,
    ‘నానృషిః కురుతే కావ్యమ్’ అన్నమాట మీ విషయంలో అక్షరసత్యం అనిపిస్తుంది. మీ రామాయణాన్ని చదువుతున్నపుడు పదపదంలో ఆ వాస్తవాన్ని చూడగలుగుతున్నాను. నిజంగా మీది తపస్సే విశ్వశ్శ్రేయస్సు కోసం! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. కీర్తి శేషు లైన మా నాన్నగారు వాల్మీకి రామాయణమును ముప్పది పర్యాయముల పైన పారాయణ చేసారు. మా పితామహులు కూడా వాల్మీకి రామాయణమును పెక్కు పర్యాయములు పారాయణ చేసారు. ఆ వంశాచారమును కోనసాగించ లేక పోయినా శ్రీ పండిత నేమాని వారి ఆధ్యాత్మ రామాయణమును ఓ రెండు పర్యాయములు చదివిన అదృష్టమునకు నోచుకొన్నాను . శ్రీమదాధ్యాత్మ రామాయణమును చక్కని శైలిలో అద్భుతముగా రచించగలగడము ఆయన పూర్వజన్మ సుకృతమే . ఆ ఆధ్యాత్మ రామాయణమును పఠించ గలగడము మన పూర్వజన్మ సుకృతము . చక్కని గ్రంధ రచన చేసిన శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు అన్నయ్యగారికి పాదాభివందనములు.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    అసలు నేను ఎప్పుడు , పురాణ గ్రంధములు అంతగా చదవలేదు. కానీ పండితుల వారి నుంచి వారి రామాయణ గ్రంధమును పొందిన ప్పటి నుంచీ చదువుతూనే ఉన్నాను. సులభ శైలిలో చదివించ గలిగిన ఈ గ్రంధం నేను పొంద గలగడం నా జన్మ సుకృతం . వారి దంపతులకు పాదాభి వందనములు

    రిప్లయితొలగించండి