6, మే 2012, ఆదివారం

పద్య రచన - 15


కవిమిత్రులారా,


పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. మా సములే యుండినచో
    మీసములే తీతుమంచు మిక్కిలి ఘన వి
    శ్వాసముతో చాటిన మన
    శ్రీ సత్కవి వర్యులకును చెప్పెద జేజే.

    రిప్లయితొలగించండి
  2. అవధానాంచిత సత్కళాభిరుచితో నాంధ్రావనిన్ దత్ప్రచా
    రవిధానమ్మున నూత్న శోభలొనగూర్పంజేసి సాహిత్య వీ
    ధివిశేషాదరమున్ యశోవిభవమున్ దేజమ్మునున్ గన్న స
    త్కవులన్ తిర్పతి వేంకటేశులను హృత్కంజాన ధ్యానించెదన్

    రిప్లయితొలగించండి
  3. జంట కవులను బేరున శాస్త్రి ద్వయము
    పేరు ప్రఖ్యాతు లార్జించి రార్య సభను
    వేంకట మఱియు తిరుపతి పేరు వారు
    వంద నీ యులు కవులకు బందుగులకు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీమత్తిరుపతి వేంకట
    నామాఢ్యుల కాకవిత్వనైష్ఠికుల కికన్
    ధీమతులకు జేయుదము ప్ర
    ణామము కవిమిత్రులార! నమ్రత తోడన్.

    తిరుపతి వేంకట కవులకు
    నిరతము సాహిత్యసేవ నెరపుచు ఘనులై
    దిరిగిన కవియుగ్మంబున
    కరుసంబుగ జేతు నుతుల ననవరతంబున్.

    ఏనుగు లెక్కిరి మరి స
    న్మానములకు లెక్కలేదు మహిలో మాన్య
    శ్రీనిధులై యలరుచు నవ
    ధానములొనరించునట్టి ధన్యులకు నతుల్.

    భాషాద్వయమున మేమే
    భాషించగ ఘనులమింక బహురీతులలో
    రోషంబున్నను రండిక
    వేషంబులకేల? యనెడు విజ్ఞులకు నతుల్.


    శతసంఖ్యను కావ్యంబుల
    నతిదక్షతతోడ బలుకు ననఘాత్ములకున్
    జతగా నుండెడు వీరికి
    స్తుతిశతములు చేయవలయు సురుచిరభక్తిన్.

    రిప్లయితొలగించండి
  5. 'శ్రవణానందము ' గూర్చు సత్కవన ధారా పూత సాహిత్య మా
    ర్దవ మాంధ్రీ తలమందు పంచిన కవీంద్ర ద్వంద్వ మాహా!కనుం
    గవకున్ దోచెను , పూర్వ పుణ్యమిది , సాక్షాచ్ఛారదాదేవియే
    భువిపై నీ యవధాని చంద్రములుగా పొల్పొందె హేలాగతిన్ !

    ఒక చరణంబతండు మరి యొండు నితండు మహాశుధారతో
    సకల సభాంగణమ్ము మది సంతసమంది శిరః ప్రకంపన
    ప్రకటిత మోదమై , స్ఫురిత పావన వాఙ్మయ వేదనాదమై
    శుకపిక యుగ్మమొండు విన సొంపుగ పాడిన రీతి బల్కుచో
    చకిత మనస్కులై నృపులు సాగిలి మొక్కరె ? పండితోత్తముల్
    ముకుళిత హస్తులై నిలిచి మోదముతో వినుతింపరే ? కవి
    ప్రకరములేకమై భళి సెబాసని పల్కవె ? చారు పుష్ప మా
    లికల నలంకరింపవె? చలింపక వీరవధాన రంగమం
    దొక సుకుమార లీల విజయోద్ధతి జూపిన సంతసించి ప్రే
    క్షకులు రసజ్ఞ శేఖరులు సమ్మతి నేనుగు పైన దిప్పరే ?
    సకల జనానురంజన యశః పరికల్పిత వాగ్విలాసులీ
    సుకవులు , దేశికోత్తములు , సూరివరేణ్యుల నిచ్చ మెచ్చెదన్ !

    తెలుగు సంస్కృత భాషా సుధీ యుతములు
    మీసములు పెంచినారలు రోసమొప్ప
    బ్రాహ్మ్యమొక వైపు కనగ క్షాత్రమొక వైపు
    దర్శనమిచ్చు వీరల తత్వమిదియె !!!

    రిప్లయితొలగించండి
  6. డా. విష్ణునందన్ గారికి ప్రత్యేక అభినందనలు. మంచి ధారాశుద్ధితో పద్యముల విందు చేసేరు. తేటగీతి ఆఖరిపాదములో ఒక టైపు తప్పు దొరలినది.

    శ్రీ హరి మూర్తి గారు కూడా జంటకవుల ప్రాశస్త్యమును పద్యరూపములో విపులముగా వర్ణించేరు.

    శ్రీ గోలి వారు కూడ మంచి పద్యమును అందించేరు.

    శ్రీ సుబ్బారావు గారి పద్యములో కొన్ని తప్పులు ఉన్నవి. మొదటి పాదములో శాస్త్రి ద్వయము (ద్వ ముందరి స్త్రి గురువు అగుచున్నది) నకు బదులుగా శాస్త్రియుగము అందాము. అలాగే 2వ పాదములో యతి చెల్లుటలేదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము.
    ఖ్యాతిని గడించి రవధాన కళమెరయగ.

    అందరికి శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. కవితాభారతి నేలపై తిరిగెనాకారమ్ముమీరూపమై
    అవధానప్రతిభావిశేషముల నవ్యంబైన రీతిన్ సభన్
    వ్యవహారంబొనరించినట్టి బహుప్రజ్ఞాశీలసంపన్నులన్,
    కవిజంటన్ వినుతింతు భక్తి వెలయంగానేడు ధన్యోస్మినై

    రిప్లయితొలగించండి
  8. ఒకానొక శతావధాన ప్రారంభోత్సవ నమస్కార పద్యములలో అవధానులు శ్రీ మేడసాని మోహన్ గారు తిరుపతివేంకటేశ కవివరులను నుతిస్తూ చెప్పిన పద్యము ( ఆశువుగా ).

    సురుచిర సుప్రసన్న రససుందర బంధుర భవ్య భావనాం
    తరులయి యావధాంద్రసముదంచిత భూరివిహారశీలురై
    అరిది శతావధానములనద్భుతలీలనొనర్చినట్టి శ్రీ
    తిరుపతివేంకటేశకవిధీరులకున్ నతులిత్తు భక్తివై.

    రిప్లయితొలగించండి
  9. గురువు గారూ,

    చాలా రోజులుగా చెబుదామనుకుంటున్న మాట..
    శరణం పండితమాసనాపరణం అన్న పై పద్యం శంకరాభరణం వలే ప్రాకుతోందండీ. ఏక బిగిన(?) చదవటం కొంచం కష్టమ్, మరీ ముఖ్యంగా నాబోటి ఏకాగ్రత లేని వారికి. పైగా ఒకటికి రెండు సార్లు చదువుకోవాలిన్పించే పద్యం. ప్రత్యక్షర సత్యం. మొత్తం స్థిరాక్షరాలుగా నాలుగు పాదాలు గా చూపించగలిగితే బావుంటుంది. అలానే మీరు అప్పుడప్పుడు Blog Backup తీసుకుంటున్నారని అనుకుంటున్నాను..
    [జ్యోతి గారు ఈ వ్యాఖ్య చూచెదరు గాక.]

    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  10. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు ఉటంకించిన పద్యం ఇక్కడ చూడవచ్చు.
    http://www.youtube.com/watch?v=7KUWs8hzY_g

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘దోస మటం చెఱింగియును దుందుడు కొప్పఁగఁ బెంచినారమీ
    మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు....’ పద్యాన్ని గుర్తుకు తెచ్చిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    జంట కవుల అవధాన వైదుష్యాన్ని చక్కని పద్యంలో ప్రస్తావించారు. బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను, సవరణను గమనించారు కదా!
    చివరి పాదాన్ని ‘వందనీయులు కవికులబంధువులును’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మనోజ్ఞమైన పద్యాలను వ్రాసిన మీకు ‘స్తుతి శతములు’
    *
    డా. విష్ణు నందన్ గారూ,
    అద్భుతమైన మీ పద్యాలకు జేజేలు. ముఖ్యంగా మీ ‘చంపకమాలిక’ మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    చివరి పాదం ‘దర్శనమ్మిచ్చు’కు టైపాటు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని ధారతో మంచి వృత్తాన్ని రచించారు. బాగుంది. అభినందనలు.
    మేడసాని వారి మధురమైన పద్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    *
    ఊకదంపుడు గారూ,
    ఆ మధ్య తెలిసీ తెలియక బ్లాగు సెట్టింగులు కెలికాను. తత్ఫలితంగా పోస్టులు, వ్యాఖ్యలు గందరగోళమయ్యాయి. జ్యోతి గారిని వేడుకుంటే వారు అన్నీ సవరించి ప్రస్తుత రూపానికి తెచ్చారు. ఇప్పుడున్న సెటప్‌లను నేను మార్చలేక పోతున్నాను. ఏం చేయాలన్నా మళ్ళీ జ్యోతి గారే పూనుకోవాలి.
    ఇంతకు ముందుకూడా పోస్టుల, వ్యాఖ్యల ‘బ్యాకప్’ చేసికొమ్మని ఎవరో సలహా ఇచ్చారు. కాని సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ‘బ్యాకప్’ ఎలా చేసుకోవాలో తెలియదు. కంప్యూటర్ శాస్త్రంలో లెక్చరర్ అయిన మా అబ్బాయినడిగితే తెలియదు అన్నాడు. మన మిత్రు లెవరైనా సలహా ఇవ్వాలి!
    మేడసాని వారి పద్యానికి యూట్యూబ్ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. తిరుపతి వేంకట కవులును
    కురిపించిరి తెలుగువారి గుండెల నిండా
    సరసపు కవితా వర్షం
    మురిపెముతో తడిసి వారు ముద్దయి పోవన్

    రిప్లయితొలగించండి
  13. పంతుల గోపాల కృష్ణారావు గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    ‘నిండా, వర్షం’ అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. అక్కడ ‘గుండెలలోనన్, కవితా వర్షము’ అని సవరిస్తే సరి!
    అన్నట్టు ‘పంతుల జోగారావు గారు’ మీ బంధువా?

    రిప్లయితొలగించండి
  14. శంకరయ్యగారూ,మీ ప్రోత్సాహక వచనాలకి ధన్యవాదాలు.నేను వ్రాసిన ఈ చాటువులో గుండెల నిండా, వర్షం అనే వ్యావహారిక పదాలకు బదులు గుండెల లోనన్ , అనీ వర్షము అనీ గ్రాంథిక పదాలను వాడి ఉంటే బాగుండేదన్నారు.నిజమే కానీ, కావ్యాంతర్గత పద్యాలలో కాకపోయినా ఇటువంటి చాటువుల్లో వ్యావహారికం రాణిస్తుందదనేది నా ఊహ. చెళ్లపిళ్ల వారే ఒక చోట "పద్య రచన లో నేనా యావత్తూ కాక అక్కడక్కడ వ్యావహారికం దొర్లితే అంగీకరిస్తే పాపం చుట్టుకోదనే నేను చెబుతాను" అని అన్నారు.ఇది వారి మీది పద్యమే కదా?

    రిప్లయితొలగించండి
  15. గోపాల కృష్ణారావు గారూ,
    నిజమే! అయితే సంప్రదాయ పద్య లేఖనానికి సమస్యాపూరణం శీర్షిక వేదికగా ఉంటున్నది కనుక ఆ మాట అనవలసి వచ్చింది. నేను గ్రాంధిక వాదిని కాదు. నా వ్యాసాలు, పాఠాలు, వ్యాఖ్యలు వ్యావహారికంలోనే ఉండడం గమనించండి.
    పద్యాన్ని పద్యంగానే వ్రాద్దాం. వ్యావహారిక భాషాప్రయోగానికి వచనకవిత్వం ఎలాగూ ఉన్నది కదా!
    బ్లాగుతో మీ అనుబంధం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

    రిప్లయితొలగించండి