14, ఆగస్టు 2014, గురువారం

దత్తపది - 38 (కలి-పులి-బలి-వెలి)

కవిమిత్రులారా!
కలి - పులి - బలి - వెలి
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
వెన్నెలరేయిని వర్ణిస్తూ పద్యం వ్రాయండి.

47 కామెంట్‌లు:

  1. కలికి వెలుగుల నిశల గన
    పులికాటు సరసు సొగసును పొగడగ తరమా
    లలనల ప్రబలిన హోయలును
    వెలికాంతుల వెన్నెలఁ దలపించుచునుండెన్
    (కలికి -మనోజ్ఞము, ప్రబలు= అతిశయిల్లు, వెలి=తెలుపు)

    రిప్లయితొలగించండి
  2. కలిగిన ధీద్యుతి మరుగై
    బలిసిన కొరికల చిత్ప్రభావము నిండన్
    వెలితికి భానుడు శశి క
    ప్పులిచ్చెనన కురిసె విరిసె పున్నమి పూవుల్

    రిప్లయితొలగించండి

  3. కలికి మోమున కురులేమొ కదలినట్లు
    మబ్బులూగగ నాచందమామ వెలిగె
    గగన సీమను, నౌషధుల్ కాపులీయ
    బలిమితోడను మరుడేమొ బయటికేగ

    రిప్లయితొలగించండి

  4. మాస్టరుగారూ ! మీ నిర్ణయము మాకెంతో సంతోషకరమైనది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. కం. పులివంటి దైన చలినే
    బలిగొను వెన్నెలను విరహబాధాతప్తుల్
    వెలివేయ కేమి చేతురు
    కలికియు సఖు డిండ్లు వెడల గాకుండినచో

    రిప్లయితొలగించండి
  6. నాగరాజు రవీందర్ గారూ
    నమస్తే
    తొలుత తెలుగుపదముండి పిదప సంస్కృతపదమున్నా అది సాధుసమాసమే అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  7. కలికి ముఖమును వర్ణింతు రార్యులు గద
    యెంత వర్ణించిన వెలితి యేయ గునుగ
    నంద మందున బలియుడై నట్టి చంద్రు
    పులిన కిరణాలు బోల్చగ భువిని సామి !

    రిప్లయితొలగించండి
  8. చెల్లి చూపులిపుడొకనిఁ జేరి రక్ష
    నుంచి తనకు సేమము కలిగించ గోర
    ప్రబలి కౌముది నల్దెస బ్రాకు చుండ
    వెలిగె శ్రావణ పూర్ణిమ వింత గాను

    రిప్లయితొలగించండి
  9. వెలివెన్నెల వెలుగు కురిసి
    పులికడిగిన ముత్యమంటి పున్నమి రేయిన్
    బలితమగు ప్రేమ జూపిన
    కలికిని గని మానసమున కలవరమాయెన్

    రిప్లయితొలగించండి
  10. నాగరాజు రవీందర్ గారికి ధన్య వాదములు. సవరించిన పద్యము :
    కలికి వెలుగుల నిశల గన
    పులికాటు సరసు సొగసును పొగడగ తరమా
    లలనల ప్రబలిన హోయలును
    వెలి మెఱపుల వెన్నెల దలపించుచునుండెన్
    (కలికి -మనోజ్ఞము, ప్రబలు= అతిశయిల్లు, వెలి=తెలుపు)

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు మనవి...
    ఈరోజు మా పిన్ని చనిపోయింది. పైడిపెల్లి అనే గ్రామానికి పోతున్నాను. ఏరాత్రికి తిరిగి వస్తానో... దయచేసి పూరణ, పద్యాల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళిగారి ప్రయోగించిన వెలికాంతి అనే పదం విషయంలో కొద్దిగా చర్చ జరిగింది. బాగుంది. నాగరాజుగారు ఇది సాధువు కాదన్నారు. రెండు తెలుగు పదాలు లేక రెండు సంస్కృత పదాలను మాత్రమే ఉపయోగించి సమాసము చేయాలని వారి మతం. తొలుత తెలుగుపదముండి పిదప సంస్కృతపదమున్నా అది సాధుసమాసమే అనుకుంటానని ఆదిభట్లవారు అన్నారు. ఇదే బ్లాగులో లోగడ దుష్టసమాసం గురించి ఒకటి రెండుసార్లు చర్చలు జరిగాయి. కొన్నాళ్ళుగా దూరంగా ఉండబట్టి ఈ మధ్య అటువంటి చర్చలు జరిగాయేమో నాకు తెలియదు. అప్ప్టట్లో జరిగిన చర్చను ప్రస్తావిస్తూ ఆచార్యఫణీంద్రగారి బ్లాగులో ఒక టపా దుష్ట సమాసాలు - చర్చ వచ్చింది. పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    వెండి తీవె లివియె జాబిల్లి తెచ్చె
    యింపు సొ౦పులిమ్మని గోరె ఋక్షములను
    పోకలిచ్చెను తార తా౦బూలమందు
    బలితమయ్యెను వెన్నెల పాన్పు జగతి

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. మల్లెల వారి పూరణలు

    బలిమగు వెన్నెల రేయిని
    చలిపులి బాధైన లెక్క సలుపరు జనముల్
    చెలిపై హెచ్చును నా కలి
    వెలి వెలుగుల చంద్రు గనిన విరహము రేగున్

    కలిమి గల్గు వారి కైనను, కనగ నం
    బలిని, గొనెడి పేద వానికైన
    పులిని వలెనె విరహ పూరము భయమిడు
    వెలిగ వెల్గు చంద్రు వెన్నెలెంతొ

    రిప్లయితొలగించండి
  16. పులితినునాశాకము లా
    కలి మిక్కుటమైనను, తిను కమ్మని తాజా
    పలలము బలిపెట్టి మృగము
    వెలివేయునుమిగిలినట్టి పెరసు తునకలన్
    పలలలు / వెరసు : మాంసము

    రిప్లయితొలగించండి
  17. మొదటి రోజు శంకరాభరణంలో వ్రాసినట్లు భయంతో వ్రాశాను. కవి మిత్రు లందరి సలహాలను / సవరణలను సంతోషంగా స్వీకరిస్తాను.

    రిప్లయితొలగించండి
  18. నాగరాజు రవీందర్ గారూ. నాకు తెలిసీ పదుగురు పెద్దలదగ్గర వినీ చెపుతున్నదేమిటంటే, తెలుగు పదము తరువాత సంస్కృతపదం కలిపి సమాసం చెయ్యవచ్చును. చాలా పదాలు ఉదాహరణకు దొరుకుతాయికూడా. ఐతే వెలికాంతి మరి దుష్ట సమాసం ఎలా అయింది. వినసొంపుగా లేదు అది నేనుకూడా అనుకున్నాను. మరికాస్త వివరంలోకి వెళితే నా స్వీయ రచన(గురుచరిత్ర)లో ఒక పద్యం ఇలా ఉంటుంది

    ఘనుడ యతీంద్రుడేననెడు గర్రు మనంబును వెర్రిసేయగన్
    మణులు మహేంద్రనీలముల మల్చిన పైడికిరీటమున్ తృటిన్
    కనగ శిరానదాల్చె ఘనకార్యముగా మదినెంచి యంతటన్
    అనఘు మహేశసూను నతడద్దరిగానక బుద్ధి హీనతన్

    పై పద్యంలో రెండవపాదంలో పైడికిరీటము అనే సమాసం ఉంది. పైడి తెలుగు, కిరీటం సంస్కృతమూనూ. చాలా మంది పండితులకూ,పెద్దలకూ(బేతవోలు రామబ్రహ్మము గారూ, గరికిపాటి నరశింహారావు గారూ)చూపించి ఈ సమాసం యొక్క బాగోగులు అడిగేను. అంతా ఒప్పన్నారేగాని తప్పని ఒక్కరు కూడా చెప్పలేదు మరి. ఆ ధీమాతోనే చెప్పగలిగేను కాకుంటే నేనెంత.

    రిప్లయితొలగించండి
  19. ఆదిభట్లవారూ,
    ఆచార్యఫణీంద్రగారి బ్లాగులో ఒక టపా దుష్ట సమాసాలు - చర్చ వచ్చింది. నా ముందటి వ్యాఖ్యలో లింకుగా ఇచ్చాను దానిని. గమనించారా?

    దాని URL http://dracharyaphaneendra.blogspot.in/2012/05/blog-post_2183.html

    మీ సందేహానికి అందులో సమాధానం దొరకవచ్చునని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  20. నమస్కారం శ్యామలీయంగారూ

    చూసేనండీ.
    నాకుగా సందేహంలేదండీ. తెలుగూ సంస్కృత పదాల కలయికతో చేసిన సమాసం సాధువనే నమ్ముతున్నాను.ఐతే తెలుగు ముందుండి సంస్కృతం పిదప ఉండాలి. కాకుంటే అది వైరి(దుష్ట)సమాసమే

    రిప్లయితొలగించండి
  21. కలిలో హరినామమొకటె
    పులివలె భంజించు పాపపుణ్యములను తా
    బలిరిపు డొక్కడె తగునట
    వెలిజేయగ జననమరణ వేసటలుర్విన్

    రిప్లయితొలగించండి
  22. పున్నమి వెన్నెల వెలిసెను
    పన్నుగ నెరవేర్తు నీదు బలిసిన కోర్కెన్
    కన్నుల నెర చూపులికన్
    క్రన్నన చాలించి రమ్ము కలికి మిటారీ.

    రిప్లయితొలగించండి
  23. నాగరాజు రవీందర్ గారూ, కొన్ని తప్పులు ఒప్పులుగా జనబాహుళ్యంలో స్థిరపడిపోయేయి. పాలాభిషేకం తప్పేకదా, పాల + అభిషేకం అని సంధిచేయటానికి "పాల" అనే పదం ఎక్కడుంది? పాలు + అభిషేకం కలిపితే పాలాభిషేకం కాదుకదా, ఇక గర్భగుడి అనేది శుద్ధ తప్పు, ఈ శుద్ధ తప్పుకూడా వైరి సమాసమే. ఇవి మాట్లాడుకునేటప్పుడు ప్రయోగించబడినవే గానీ ఎక్కడా గ్రంధస్థమైన దాఖలాలు లేవుకదండీ. కనుక వ్యవహారికాలను ప్రమాణంగా తీసుకుందామంటారా??
    అదీగాక, సమాసాలను గురిచి చెప్పిన లాక్షణికులు తెలుగు+తెలుగు, సంస్కృత + సంస్కృత మరియూ తెలుగూ+ సంస్కృత పదాల కలయికను సమ్మతించినట్లుగా శ్రవణసుభగాలను సమ్మతించినట్లు కానరాదు మరి. మనం ప్రస్తావించిన గర్భగుడీ, శుద్ధ తప్పులే ఇందుకు ఉదాహరణలు. ఏమంటారు?? ఈ సమాసాలు ఆధునిక వచన కవిత్వంలో అగుపించేయేమోగాని పద్య కవిత్వంలో కనిపించేయా??

    రిప్లయితొలగించండి
  24. నాగరాజుగారూ, దయచేసి మీరు కూడా ఒకసారి నేను మీ పరిశీలనుకు గాను ఇచ్చిన పాత చర్చను గమనించ కోరుతాను. ఐతే ‘పాలాభిషేకం ' అనే సమాసం సాధువా వంటి సంగతి అక్కడ చర్చితమే. మరల మనం అవే సంగతులను ఇక్కడ పునశ్చరణ చేయనవసరం లేదేమో.

    రిప్లయితొలగించండి
  25. శ్యామలీయంగారి సూచనమేరకు ఇక్కడితో ఈ చర్చకు స్వస్తి చెప్పడమే సమంజసం.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    గురువు గారరు మీ నిర్ణయం మాకెంతో సంతోషకరమైనది. మమ్ము కరుణించి నందులకు ధన్యవాదములు.

    సరదగా
    =========*===========
    పులిమేడున వెన్నెలకున్
    బలి యయ్యి రట గనుడనుచు పావన యను చా
    కలి జూపెను దిన పత్రిక
    వెలివెన్ను జనులకు నేటి వేకువ జామున్ !

    రిప్లయితొలగించండి
  27. ఈ నాటి అంశం దత్తపది. కలి - పులి - బలి - వెలి అనే పదాలను ఉపయోగిస్తూ మనకు నచ్చిన ఛందస్సులో వెన్నెలరేయిని వర్ణిస్తూ పద్యం వ్రాయమని చెప్పటం జరిగింది.

    చంద్రమౌళి సూర్యనారాయణగారు, ఎం.ఆర్. చంద్రమౌళిగారు, శైలజగారు, ఆర్.ఎల్. మాధురిగారూ, అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి గారు, షీనాగారు, గండూరి లక్ష్మీనారాయణగారు, కందుల వరప్రసాద్‌గారు, నేను వ్రాసినవి కందపద్యాలు. ఇతర ఛందస్సులలో పద్యాలు చెప్పినది గోలి హనుమచ్ఛాస్త్రిగారు (తే.గీ), సుబ్బారావుగారు (తే.గీ), భాగవతుల కృష్ణారావుగారు (తే.గీ), మాధురి (ఆ.వె), కెంబాయి తిమ్మాజీ రావుగారు (ఆ.వె). మొత్తానికి కందాల సందడే హెచ్చు.

    చంద్రమౌళి సూర్యనారాయణగారు మనోజ్ఞము అన్న అర్థంలో కలికి అన్న పదం ప్రయోగించారు. కలికి అన్నమాటకు రూఢార్థం వేరేగా స్త్రీ అని ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం అన్వయ క్లిష్టత ఉంది. కాని దోషం కాదు.

    సుబ్బారావుగారు పులినకిరణాలు అన్న సమాసం ప్రయోగించారు. ఇది వింతగా అనిపించింది. పులినం అంటే ఇసుకతిన్నె కదా. పులినకిరణాలు అన్నది అసంగతంగా అనిపిస్తున్నది.

    భాగవతుల కృష్ణారావుగారు "చెల్లి చూపులిపుడొకనిఁ జేరి రక్షనుంచి తనకు సేమము కలిగించ గోర" అన్నారు. చెల్లి చూపులేమిటో అర్థం కావటం లేదు. ఇక్కడ నుంచి అన్న పదం మార్చి నుండి అని వ్రాయాలి పద్యభాషలో అన్నది వేరే సంగతి.

    శైలజగారివెలివెన్నెల అన్న సమాసం అందంగా ఉంది కాని అది పొరబాటు. వెన్నెల అన్న పదం విడదీస్తే వెల + నెల ఇక్కడ వెల అంటే తెల్లని, నెల అంటే కాంతి. అందుచేత వెన్నెల ముందు మరలా వెలి (తెల్లని) అన్న విశేషణాన్ని పునరుక్తి చేయకూడదు. అలాగే వారి "పులికడిగిన ముత్యమంటి పున్నమి రేయిన్" అన్నది ఆహ్లాదకరంగా ఉంది. ఐనా, ముత్యమంటి అన్నది విచార్యప్రయోగం. ముత్యము + వంటి => ముత్యము + అంటి => ముత్యమంటి. వ్యవహారంలో పదాది వకారం జారిపోయి అచ్చు మిగలటం సహజమే కాని గ్రంథభాషలో అది ఉచితం కాకపోవచ్చును. ఆలోచించ వలసిన విషయం. పద్యం చివరన 'కలికిని గని' అన్నది బదులుగా'కలికిని గన' అని ఉంటే బాగుంటుంది.

    తిమ్మాజీరావుగారి పద్యం హృద్యంగా ఉంది. పదాలన్నింటి మీదా విరుపులుండటమే కాక భావశబలత గలిగి శోభించింది.

    మాధురిగారు రెండు పద్యా చెప్పారు. వారి కందంలో బలిమగు (బలిమియగు అని యడాగమమే సాధుస్వరూపం) వారి ఆట వెలదిలో 'పులిని వలెనె' అన్నది 'పులికి వలెనె' అని మార్చాలి. చివరన 'వెన్నెలెంతొ' అన్నది కూడా విచార్యం ఎంతయో అన్నది ఎంతో అని వ్యవహారంలోనే కాని గ్రంథభాషలో ఒప్పదు. పోనీ 'వెన్నెలకట' అందామా?

    అన్నపురెడ్డిగారు 'తాజాపలలము' అన్న ప్రయోగం చేసారు. ఈ తాజా అనేది ఉర్దూపదం. పలలం అనేది సంస్కృతపదం. దేశ్యపదం ప్రక్కన సంస్కృతపదంతో మిశ్రసమాసం. దీన్ని గురించి క్రింద కొంచెం విడిగా వ్రాస్తాను. అలాగే వారి 'పెరసుతునుక' అన్నది ఉర్దూతెలుగుల మిశ్రసమాసం. బాగుంది రెండూ దేశ్యపదాలేగా.

    షీనాగారిపద్యం ధారాశుధ్ధిగా బాగుంది.

    లక్ష్మీనారాయణగారి ప్రయోగం 'బలిసినకోర్కె' అన్నది చిత్రంగా ఉంది.

    కందులవారి ప్రయోగం 'బలి యయ్యిరట' అలోచనీయం 'బలియైరట' సాధువే కాని వారిప్రయోగం లోని అయ్యిరి అనేది సాధువైతే ఆ ప్రయోగమూ సాధువే కావలసి ఉంది.

    గోలివారు ధీద్యుతి అన్నమాట వాడారు. ద్యుతి అంటే కాంతి. ధీః శబ్దం బుధ్ధి వాచకం. ఈ సమాసం అర్థం ఏమౌతున్నది? బుధ్ధి యొక్క తేజస్సు. బాగానే ఉంది. కాని అనిదం పూర్వమైన ప్రయోగం అనుకుంటాను. ఐతే 'వెలితికి భానుడు శశి కప్పులిచ్చెనన' అన్నది నాకు అన్వయం స్ఫురించటం లేదు.

    మొత్తం మీద చిన్నచిన్న ఇబ్బందులున్నా పద్యాలన్నీ తగిన ధారకలిగి ఉండటం చాలా ముదావహం.

    ఈ రోజున తెలుగుపదంమీద సంస్కృతపదం పరపదం చేసి సమాసం చేయవచ్చునా అన్నది చర్చకు వచ్చింది. ఈ విషయంలో పాతసంగతులు ఇప్పటికే నేను మనవి చేయటం జరిగింది. తెలుగు అనే కాకుండా తాజాపలలం వంటి సమాసాలు కూడా అలోచిస్తే దేశ్యపదంపై సంస్కృతపదంతో సమాసం అమోదయోగ్యం అని చెప్పవలసి ఉంది.

    రిప్లయితొలగించండి
  28. శ్రీ శ్యామలరావు గారికి నమస్కారములు. మీ సోదహరణ, సవివరణ మైన సమీక్ష చూచి చాలా కాలమైనది. ఓపికగా సమీక్షించినందులకు ధన్యవాదములు...ఇంతకూ మీరు చంద్రమౌళి గారి పద్యాన్ని నా పూరణగా భావించి సమీక్షించారు...నా పూరణ పై కూడా మీఅబీప్రాయమును చెప్పగోరతాను..

    రిప్లయితొలగించండి
  29. శ్యామలీయం గారికి నమస్కారములు. మీ సమీక్షకు ధన్య వాదములు. సమాసముల గురించి మీరిచ్చిన లింక్ కు కూడా ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  30. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు మా అందరి అభ్యర్థనను అంగీకరించినందుకు కృతజ్ఞుడను.

    సాహితీ మిత్రబృందానికి నమస్సులు.

    మిత్రులు శ్రీ శ్యామలరావుగారు పద్యవిశ్లేషణ చేయడం ముదావహం. వారికి నా అభినందనలు.

    ఇకపోతే, నేటి చర్చ మిశ్రసమాస సాధుత్వాసాధుత్వాలపై జరగడం...ఆలస్యంగా ఇప్పుడే చూశాను. పనుల ఒత్తిడివల్ల ఆలస్యమయింది.

    ఈ క్రింద ఇచ్చిన ఉదాహరణలు చూడండి...

    ౧. ...వెలకాంత లెందఱున్నను, గులకాంతకు సాటిరారు గువ్వలచెన్నా!
    ౨. ...నిక్కమైన మంచినీల మొక్కటి చాలు;
    తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల?...
    ౩. ...విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?
    ౪....మించుముక్తాచ్ఛటలె క్రుమ్మరించెననఁగ...(ఆము.4-149)
    ౫. ...కొఱప్రాణముతోడ...(ఆము.3-23)
    ౬. చలిగాలి బొండుమల్లెలు పరాగము రేఁచి,
    నిబిడంబు సేసె వెన్నెలరసంబు...(మను. 6-29)
    ౭. ...రాకాసిదేహంబు...(మను. 6-115)
    ౮. మిట్టయురమున నిడుయోగపట్టె మెఱయ...(మను. 1-59)

    వీటిలో...వెలకాంతలు, మంచినీలము, మఱ్ఱివృక్షంబు, మించుముక్తాచ్ఛటలు, కొఱప్రాణము, వెన్నెలరసంబు, రాకాసిదేహంబు, నిడుయోగపట్టె...అనేచోట పదప్రయోగాలను గమనించగలరు.

    సమాసములు మూఁడువిధములు. అవి: సాంస్కృతికము, ఆచ్ఛికము, మిశ్రము. మన చర్చ మిశ్రసమాసమునకు చెందినది.

    మిశ్రసమాసంలో సంస్కృతసమం+ఆచ్ఛికం కలిసిన శబ్దాలు సమసిస్తాయి. ఉదా. రాజుముదల, సిరివల్లభుఁడు, చెఱువునుదకము మొ.వి
    కేవల సంస్కృతం+కేవల ఆచ్ఛికం సమసింపవు.(సూ. కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు) ఉదా. అనేకమాఱులు, అల్పదండు...వీటిని వైరిసమాసము లంటారు.
    అనేక...సంస్కృతం, అనేకము...తత్సమం
    అల్పం...సంస్కృతం, అల్పము...తత్సమం
    మిశ్రసమాసం కావాలంటే...అనేకపుమాఱులు, అల్పపుదండు...గా మార్చాల్సివుంటుంది.

    ఇకపోతే...పాలాభిషేకం...పాల+అభిషేకం అనుకొని, క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, స్వర్ణాభిషేకం, స్వరాభిషేకం వంటి సమాసాల ననుసరించి, పొరపాటుగా సవర్ణదీర్ఘసంధి చేయబడింది. ఇది దోషమే. మఱొకటి...గర్భగుడి > గర్భాలయం, అంతరాలయం (గుడిలో మూలవిరాట్టు ఉండే గది) అనే అర్థంలో పొరపాటుగా స్థిరపడిన సమాసం.

    పద్యాలు రాసేటప్పుడు ఇలాంటి జనంలో స్థిరపడిన వ్యావహారికాలను కొన్ని సందర్భాలలోనే ఉపయోగించాలి.

    అలాగే తెలుగుపదం తరువాత తత్సమపదం వాడి మిశ్రమసమాసంగా కూర్చిన ప్రయోగాలను నేను పైన ఉదాహరించాను. మరో ఉదా. కొదమ (తెలుగుపదం) + సింహము = కొదమ సింహము. బ్లాక్ మనీని నల్లధనము అనడం చూస్తున్నాం కదా. ఇక్కడ నల్ల (తెలుగుపదం) ధనము (తత్సమపదం).
    ఈ ప్రకారంగా "వెలికాంతి" దుష్టసమాసంకాదు.


    అదేవిధంగా...సంస్కృతసమం (తత్సమం)తరువాత తెలుగుపదంవాడి సమాసం చేయవచ్చు. ఉదా. సింహం(సంస్కృతం) > సింహము(తత్సమం) + కొదమ = సింహపుఁ గొదమ.
    పద్యం అంటేనే సంప్రదాయబద్ధం...వ్యాకరణబద్ధం...గ్రాంథికభాషాప్రయోగలక్షితం. కాబట్టి పద్యం రాసేటప్పుడు సంప్రదాయాన్ననుసరించి గ్రాంథికాన్నే స్వీకరించాలి, సాధుప్రయోగాల్నీ వాడాలి, వ్యాకరణబద్ధంగా రాయాలి. వ్యావహారికంలో రాస్తానంటే, వచనాన్నో, మరో ప్రక్రియనో స్వీకరించాలి.

    సంస్కృతం + తెలుగు...దుష్టసమాసం అవుతుంది. సంస్కృతసమం (తత్సమం) + తెలుగు...మిశ్రసమాసం అవుతుంది (దీనిని ప్రాచీనకవిప్రయోగాలననుసరించి ప్రయోగింపవలసి వుంటుంది.
    తెలుగు + సంస్కృతసమం...మిశ్రసమాసం అవుతుంది. ఇది కవిప్రయోగాల్లో విరళంగా కనిపిస్తుంది. (దీనిని కూడా ప్రాచీనకవిప్రయోగాలననుసరించి ప్రయోగించాలి). నిరంతర సాధనతోనే పద్యరచన పట్టుబడుతుంది. బహుగ్రంథపఠనం దీనికి తప్పక అవసరము.


    మిత్రులు నా మాటల్ని అన్యథా భావించకుండా ఆదరిస్తారని ఆశంస. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. శ్యామలీయం గారూ తెలుగు సమాసాలపైన మంచి సమాచారంతో కూడిన చక్కటి చర్చను పరిచయం చేశారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. గోలివారిపద్యాన్ని తప్పిపోయినాను!

    "కలికి మోమున కురులేమొ కదలినట్లు మబ్బులూగగ నాచందమామ వెలిగె" అన్న ఊహాచిత్రం బాగుంది అద్భుతంగా! ఐతే ఇందులో అన్వయక్రమాది దోషాలు కనబడుతున్నాయి. కాబట్టి, కొంచెం చిత్రిక పట్టవలసి ఉంది. సరిచేసి, ముంగురుల చాటున కలికి మోము వోలె మబ్బులకు వెన్క నా చందమామ వెలిగె" అందాము. మరుడు బయటి కేగటం ఏమిటో అర్థం కాలేదు - పైగా వెన్నెల విరహోద్దీపనసామాగ్రిలో ఒకటాయె! అందుచేత వదిలేద్దామా ఈ‌ మన్మధుడిని? ఈ సవరణలు చేసి తిరుగ ఈ‌ పద్యాన్ని వ్రాయటానికి సాహసిస్తున్నాను.

    ముంగురుల చాటున కలికి మోము వోలె
    మబ్బులకు వెన్క నా చందమామ వెలిగె
    గగన సీమను నౌషధులు కడిది బలిమి
    కాపులీనంగ వెన్నెల కాయ జొచ్చె

    ఈ‌ సవరణలు గోలివారికి ఆమోదయోగ్యంగా ఉంటాయని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  33. గుండువారి దీర్ఘవివరణ అవశ్యపఠనీయం. చిన్నయసూరిగారు బాలవ్యాకరణం సమాసపరిఛ్ఛేదంలో ఒక చోట "మువ్విధములు" అన్న మిశ్రసమాసాన్ని ఉటంకించారు. గమనించవలసింది.

    రిప్లయితొలగించండి
  34. మిత్రులు మధుసూదన్ గారు కూడా మంచి సమాచారాన్ని అందిస్తూ కవిమిత్రులకు చక్కని హితవు చెప్పారు.

    రిప్లయితొలగించండి
  35. మిత్రులు తాడిగడప శ్యామలరావు, మిస్సన్న గారలకు ధన్యవాదాలు.

    నా పూరణము:

    కలిమి లేములు కలిగిన గగనగామి
    పులిన తటముల వెన్నెల వెలుఁగుఁ బఱుప,
    బలిమినిం బ్రేమికుల కాంక్ష వడిగఁ బెకలి,
    వెలికివచ్చెను బరిణయాభీప్సితమయి!

    రిప్లయితొలగించండి
  36. నా పూరణను సమీక్షించి తగు సూచనలతో పాటు సవరించి వ్రాసిన శ్రీ శ్యామలరావు గారికి ధన్యవాదములు...నా భావమేమిటంటే కురుల చాటుననున్న కలికి మోము లాగా చందమామ వెలిగి పోటూఉంటే ఆ వెన్నెలకు ఓషధులు పెరుతున్నాయని, జంటలపైకె తన బాణాలను ప్రయోగింఛటానికి మరుడు జంటలను వెతుకుతూ బైటకు వచ్చాడని.. అన్వయం సరిగా లేదేమో.. సవరణ చక్కగా ఉన్నది ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  37. చంద్రిక లిఖించు వెలుగులు
    సంద్రానికి, కానలందు సాగు పులికి, రా
    జేంద్రున, కంబలి గతికెడు
    చింద్ర విభవుకైన వెలితిఁ జేకూర్చదయా!

    రిప్లయితొలగించండి
  38. పెద్దలు శ్యామలీయం గారికి ధన్యవాదాలు.
    కవిగా నావయస్సు రెండు సంవత్సరాలు.అరువది రెండో యేట మొదలు పెట్టాను. ఏది తెలుగు పదమో, ఏది సంస్కృత పదమో, ఏది ఉర్దూ పదమో సరిగా తెలియదు.అన్యదేస్యములెన్నో తెలుగు భాషలో మిళితమై పోయాయి.వాటి నన్ని వాడు తున్నాను. మీలాంటి పెద్దల సూచనతో / సలహాలతో వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాను. కవిమిత్రులందరి సలహాలు సవరణలను స్వీకరిస్తాను. తప్పులు సరి దిద్దితే సంతోషిస్తాను.

    రిప్లయితొలగించండి
  39. మరొకొన్ని పద్యాలు వచ్చాయి ఈ దత్తపదికి.
    గుండువారి పూరణ హృద్యంగా ఉంది. అందులో‌కొన్ని విశేషాలు గోచరించాయి.

    కలిమి లేములు కలిగిన గగనగామి
    పులిన తటముల వెన్నెల వెలుఁగుఁ బఱుప,
    బలిమినిం బ్రేమికుల కాంక్ష వడిగఁ బెకలి,
    వెలికివచ్చెను బరిణయాభీప్సితమయి!

    గగనగామి చందమామ వెన్నెల ఎల్లెడలా వ్యాపించినా ప్రయేకంగా పులినతటముల పరచుకొన్నది అని చెప్పటంలో ఒక సొగసుంది. అవి ఉండేది నదీతీరానకదా, ప్రేమికులకు విహారస్థలాలు కదా, అందుకని అలా చెప్పటం అన్నమాట. ఐతే వారివారి సమాగమాలన్నీ వివాహేఛ్ఛతోనే అని వాటికి ఉదాత్తత ప్రసాదిస్తున్నారు. బాగుంది. ఐతే ఎత్తుగడలోని కలిమిలేముల ప్రసక్తి ఎలా అన్వయం? తరచుగా ఆ జాబిల్లి వెన్నెలసామాగ్రిని కోల్పడటం ఆతని కలిమిలేమి అవటం ఎట్లాగున్నా ఆ ప్రేమికిఉలకు సంకటంగా ఉంటోంది అందుచేత అది వారిని ముఖ్యంగా బాధించేది. ఇక వీడిసాయంతో కాదులే అని వారు ఈ‌ బాదరబందీ అక్కరలేదు వివాహాలు చేసుకుందాం అనుకుంటున్నారన్న మాట. బాగుంది బాగుంది. ఇదొక గడుసుపద్యం!

    మిస్సన్నగారు ఈ దత్తపదికి ఒక చంపకమాల నల్లారు. ధారాశుధ్దిగా ఉంది. గాడుపుతండ్రిని బదులు వారు గాడుపుతండ్రికి అనదలచారనుకుంటాను. కాని గాడుపుతండ్రి అంటే వాయుదేవుడి తండ్రి. ఈ ప్రయోగం నాకు అర్థం కాలేదు. అలాగే పేదకొంపల్లో పులిసిపోక, భూరిభవంతుల్లో వెన్నముద్దలుగా వెన్నెలను చంద్రుడు కురిపించుతున్నాడంటూనే ఆ చంద్రుదు విశ్వహితైషి కాబట్టి భేదభావం చూపడు కదా అని అనటం పొసగటం లేదు. నా అల్పజ్ఞత కావచ్చును. మొత్తానికి గందరగోళపడుతున్నాను. మిస్సన్నగారు కొంచెం వివరిస్తే బాగుంటుంది.

    ఇకొంక పూరణను సహదేవుడుగారు కందంలో పంపారు. వెన్నెలకు పక్షపాతం లేదని చెప్పటం వారి పద్యంలో భావం. మంచి ఊహ. వారి పట్టికలో "సంద్రానికి, కానలందు సాగు పులికి రాజేంద్రున" అన్నది కొంచెం సుభగంగా లేదనిపిస్తోంది. ప్రత్యేకకారణం లేదు. "సంద్రమునకు ఘోరవిపినచరి పులికిని రాజేంధ్రునకు" అంటే మరికొంచెం గంభీరంగా ఉంటుందేమో యోచించండి. ఐతే చివరిపాదంలోని చింద్రవిభవుడు అన్న ప్రయోగం చిత్రంగా ఉంది. బీదవాడన్న అర్థంలో వాడారు.

    రిప్లయితొలగించండి
  40. శ్యామలీయం గారూ! ధన్యవాదాలు. మీరు విజ్ఞులు. అల్పజ్ఞులు కారు.

    గాడుపుతండ్రి అంటే అంబరము, ఆకాశము, అంతరిక్షము అని నిఘంటువులో అర్థాలు కనుపించాయి.

    అలాగే పులియుట అంటే గర్వించుట, దర్పించుట, అతిశయించుట అనే అర్థాలు కనుపించాయి.

    ఆకాశంలో చంద్రుడు తన శక్తికి గర్వించక భేదభావం లేకుండా పేదలను, ధనికులను ఒకే రీతిలో ఆదరిస్తున్నాడని నాపద్యంలో చెప్పదలిచాను. బహుశా అన్వయం సరిగా ఉండి ఉండదు.

    రిప్లయితొలగించండి
  41. కలిమియు లేమియుం గలవె గాడుపుతండ్రిని చందమామకున్?
    పులియక, పేదకొంపలను, భూరిభవంతుల పండువెన్నెలన్
    బలిమిని వెన్నముద్దలను భావన దోచెడు రీతి మార్చడే
    వెలిగెడు నంతకాలమును? విశ్వహితైషి విభేద మెంచునే?

    రిప్లయితొలగించండి
  42. శ్రీ శ్యామలీయం గారి విశ్లేషణకు ధన్యవాదములు. తమరి చక్కని సవరణకు కృతజ్ఙతలు. చింద్ర విభవుడు అనే పదం చిత్రంగా వుందన్నారు కానీ ఆమోదయోగ్యమో? కాదో? దయతో వివరించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి