30, మే 2012, బుధవారం

విశేష వృత్తము - 18

ఉపజాతి -

ఇది అర్ధసమవృత్తములకు చెందినది. 1,3 వ పాదములు ఒక వృత్తమునకు, 2,4 పాదములు మరొక వృత్తమునకు చెందిన లక్షణాలు కలిగి యున్నచో అది అర్థసమ వృత్తము. 

1, 3 పాదములు ఇంద్రవజ్ర (త-త-జ-గగ) మరియు 2, 4 పాదములు ఉపేంద్రవజ్ర (జ-త-జ-గగ) ఉంచి రచించితే వచ్చే వృత్తమే ఉపజాతి. అన్ని పాదములలోను యతిస్థానము 8. ప్రాస నియమ ముండును.
ఉదా:
శ్యామాభిరామా! నయనాభిరామా!
క్షమాసుతా కామ! ప్రశస్త నామా!
స్వామీ! నృపాలాన్వయ వార్ధి సోమా!
సమస్త లోకాధిప! సార్వభౌమా!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

11 కామెంట్‌లు:

  1. ఉపజాతిలో ఒక పాదము ఇంద్రవజ్ర మరొక పాదము ఉపేంద్రవజ్రను వ్రాయదగును. కొన్ని కొన్ని సంస్కృత శ్లోకములను పరిశీలించితే ఏ ఏ పాదములు ఇంద్రవజ్ర ఉండాలి ఏ ఏ పాదములు ఉపేంద్రవజ్ర ఉండాలి అనే నియమము ఉన్నట్లు లేదు. అలాగే ఎన్ని పాదములు ఇంద్రవజ్ర ఉండాలి ఎన్ని పాదములు ఉపేంద్రవజ్ర ఉండాలి అనే నియమమునూ కనుపడుట లేదు. ఈ నియమములను ఇతర వృత్తములకునూ అన్వయించుచున్నట్లు కనుపట్టుచున్నది. అయితే తెలుగులో మనము ఒక నియమమును పాటించుటను మంచిది.

    శ్రీరామరక్షా స్తోత్రము చూచితే ఒక శ్లోకములో 2 పాదములు శార్దూలము 2 పాదములు స్రగ్ధర గను ఉన్నది, చూడండి:

    రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
    కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం (శార్దూలం)
    రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
    వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం (స్రగ్ధర)

    ఒక సంస్కృత పండితుని అడిగితే ఇలాగ 2 పద్యముల పాదములను కలిపి వ్రాయ వచ్చును అన్నారు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. ప్రాస నియమము:
    ఉపజాతి అనే పేరుగల ఈ వృత్తానికి ప్రాస నియమము ఉన్నది. అయితే ఒక పాదములో తొలి అక్షరము గురువు ఉంటుంది, మరొక పాదములో తొలి అక్షరము లఘువు ఉంటుంది కదా అనే అనుమానము రావచ్చును. అది యేలాగున ఉన్నా 2వ అక్షరమును ప్రాసగా నియమమును పాటించుటే చెప్పబడినది. వేరొక మార్గము గానీ ఉపాయము గానీ లేదు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా!శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు:

    ఉపజాతి పద్యము ఉదాహరణలో 4వ పాదములో "లోకాధిప" అని ఉండాలి. కాని "లోకాభిప" అని టైపు చేయబడినది. కాస్త సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. నే నమ్మితిన్ దేవర, నిన్ను చేరం
    గ నాగభూషా!కరుణాకరా! రా!
    దీనాళి రక్షించెడి దేవదేవా!
    వినంగ రాదా, మొఱలన్ శివయ్యా!

    ఈ విశేష వృత్తాల్లో నాలుగైదు గణాల్లో చిన్నవిగా అనిపించే వృత్తాలను ప్రత్యేక సందర్భాల్లో వాడాలనే నియమం ఉన్నదా?
    పదుకొండవ చందస్సు త్రిష్టుప్ అనుచో మొత్తం ఎన్ని ఉన్నాయి?
    స్తోత్రాల్లో తఱచూ వచ్చే అనుష్టుప్ గురించి తెలుసుకోవాలని ఉన్నది.
    త్రిష్టుప్, అనుష్టుప్ ల్లో ఎన్నేసి వృత్తాలు ఉంటాయి. ఎన్నో సందేహాలు వస్తున్నాయి గురువుగారు, సంస్కృతవ్యాకరణము చదవండి అంటారా?

    రిప్లయితొలగించండి
  5. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యము 4వ పాద్ములో యతి కుదరలేదు. "వినంగ రావ మొర వేదవేద్యా" అని పాదమును మారిస్తే బాగుంటుందేమో.

    అనుష్టుప్పు:

    పాదానికి 8 అక్షరములు చొప్పున ఉంటాయి. సంస్కృత వాఙ్మయములో మొట్టమొదటి శ్లోకము అనుశ్టుప్పే. వీల్మీకి నోటి వెంట ఆశువుగా వచ్చినది. "మా నిషాద ప్రతిష్టాం త్వా" అని మొదలిడే శ్లోకము. రామాయణమునకు మూలము.

    అనుష్టుప్పులు తెలుగులో వాడుట చాల తక్కువ. ఎవరో వ్రాసేరని విన్నాను. అనుష్టుప్పులలో అనేక రకములు ఉన్నవి అంటారు. ప్రస్తుతము ఎక్కువగా వాడుకలోనున్న అనుష్టుప్పు లక్షణములు ఇలాగ ఉంటాయి.

    శ్లోకే షష్ఠం గురుం జ్ఞేయం
    సర్వత్ర లఘు పంచమం
    ద్వి చతుః పాదయోర్ హ్రస్వం
    సప్తమం దీర్ఘ మన్యథా

    పాదమునకు 8 అక్షరములు ఉండాలి. ప్రతి పాదములోని 6వ అక్షరము గురువు, 5వ అక్షరము లఘువు. 7వ అక్షరము 1,3 పాదములలో గురువు, 2,4 పాదములలో లఘువు అయి ఉండాలి. అంటే 1, 2, 3, 4 అక్షరములకు నియమము లేదు - గురువైన కావచ్చు, లేక లఘువైన కావచ్చు. 5, 6, 7, 8 అక్షరములకు నియమములను పైని చెప్పబడినవి. యతి వేయ నక్కరలేదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. నా వ్యాఖ్యలలో అక్కడక్కడ టైపు తప్పులు దొరలినవి.

    (1) పాదము (ఒప్పు) .. పాద్ము (తప్పు)
    (2) వినంగ రావా (ఒప్పు) .. వినంగ రావ (తప్పు)
    (3) వాల్మీకి (ఒప్పు) .. వీల్మీకి (తప్పు)

    రిప్లయితొలగించండి
  7. అయ్యా,
    వివరణకు, సవరణకు అనేక ధన్యవాదములు.
    యతి మఱచి పూరణ చేసినందుకు మన్నించండి.

    నే నమ్మితిన్ దేవర, నిన్ను చేరం
    గ నాగభూషా!కరుణాకరా! రా!
    దీనాళి రక్షించెడి దేవదేవా!
    వినంగ రావా మొఱ వేదవేద్యా"!

    రిప్లయితొలగించండి
  8. స్వారాజ్యముం గోరుచు శాంతమూర్తుల్
    భరించి కష్టంబులు భవ్యరీతిన్
    నిరంతరాత్యద్భుత నిష్ఠతోడన్
    వారెందరో పో్రిరి వందనీయుల్.

    పరాధినేతృత్వపు పాపకృత్యా
    లరాజకత్వంబు లనాదరంబుల్
    దురాగతంబుల్ బహుదుష్టబుద్ధుల్
    పోరాడి వారింపగ బూని రంతన్.

    శ్రీగాంధి యన్నింటను శ్రేష్ఠుడౌచున్
    మృగాకృతిం దాల్చిన మ్లేచ్ఛకోటిన్
    భగీరథుండాతడు పారద్రోలెన్
    భోగంబులందించెను పుణ్యభూమిన్.

    రిప్లయితొలగించండి
  9. అమ్మా శ్ర్రీమతి లక్ష్మీదేవి గారూ!
    శ్రీ హరి .. .. .. మూర్తి గారూ!
    మీ కృషి ప్రశంసనీయమయినది. ఎంతటి క్రొత్త వృత్తమునైనా అందముగా చక్కని ధారతో హృద్యముగా వ్రాస్తున్నారు. మాకెంతో ఆనందముగా నున్నది. మీ ధారాపటిమ ఇతోధికముగా వృద్ధిచెందు గాక. స్వస్తి.

    రిప్లయితొలగించండి