20, సెప్టెంబర్ 2014, శనివారం

నిషిద్ధాక్షరి - 10

శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని గురించి 
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

32 కామెంట్‌లు:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

జబ్బున పడినట్టి పతిని
నిబ్బరముగ పరిచరించె నిరతమునెమ్మిన్
మబ్బుల దాటుచు వెనుకొని
యబ్బురపరచి యముని బతియాయువుపెంచెన్

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

సతీసావిత్రి :

01)
_____________________________

అల్ప మాతని యాయువు - యనిన వినక
నతనినే కోరి పెండ్లాడి - యడవి బొదలి
ఆయు వది తీర యమునితో - నాత డేగ
యముని వెంటాడి యమలోక - మపుడు జేరి
పతికి ప్రాణంబు సమకూర్చు - పడతి యాపె !
_____________________________
పొదలు = నివసించు

Unknown చెప్పారు...

మల్లెలవారిపూరణ
భర్త ప్రాణాల కై యము,వరముగాను
అత్తమామలకును జూపు నమరజేసి
తల్లిదండ్రులకును దెచ్చె తనయు లెలమి
కోరి బిడ్డల, పతి నందె కోరకుండ

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఆయువు + అనిన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అల్ప మాతని యాయుష్య మనిన వినక’ అనండి.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

పెండ్లి జరిగిన తదుపరి పేర్మి విభుడు
యిలను వీడును పన్నెండు నెలల పిదప
యంచు తెల్పెను మునివరు డా పడతికి

నొరుల నేనిప్డు వరియించ నొల్లనంచు
మద్ర పతిపుత్రి పెండ్లాడె మాన్యుడైన
గ్రుడ్డి ప్రభువు కుమారుని కోరికోరి
భర్త మరణపు కాలమ్ము పడతి యెఱిగి
యన్నపానీయముల్ ముట్టనట్టి వ్రతము
నాచరించెను పతిఁగావ నర్థితోడ

యడవి కేగెడు భర్తతో నామెయేగి
వనము నందలి వింతలఁ గనుచు నుండ
రాజపుత్రు తలతిరిగి రయముగాను
వ్రాలె పత్ని యంకమ్ముపై ప్రాణముడిగి
కనియె నప్పుడు కోమలి కనుల ముందు
విభుని ప్రాణములఁ గొనిపోవు వేల్పుదొరను
వెంబడించెను కాలుని విజ్ఞురాలు

ముదిత పట్టుదలన్ గని ముగ్దుడైన
యముడు కోరినట్టి వరము లామెకిచ్చె
నామెవాగ్ధాటికిన్ జిక్కి యంచ కాల
దహను డప్డు విడిచి పెట్టె తన్వి విభుని
యట్లు కాపాడె తనపతి నంబుజాక్షి

Unknown చెప్పారు...


పతి ప్రాణమ్ములు పొందగన్ యముని తా ప్రార్ధించి వెంటన్ బడ
న్నతివన్ బ్రోచి వరమ్ము లిచ్చె యమరాజత్యంత ప్రేమమ్ముతో
యితమున్ దెల్పెను పుత్రునిన్ బడయ"నట్లే"య౦చు
ధర్ము౦ డనన్
పతి లేకన్ తనయుండు గల్గడని జీవమ్ముల్ గొనెన్ భర్తకున్

జిగురు సత్యనారాయణ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sailaja చెప్పారు...

పతికి ప్రాణమ్ము లిమ్మని పట్టు బట్టి
వెంబడించెను కంకుని వేడుకొనుచు
దండపాణిని మెప్పించి ధర్మముగను
పతిని, తనయుని బొందెనా భాగ్యవతియె!

జిగురు సత్యనారాయణ చెప్పారు...

ఉత్సాహము:
ప్రాణనాధు ప్రాణమంత పట్టి లాగి వేయగా
నేను వెంట వచ్చెదనుచు నింగి బాట పట్టగా
మానినీ! వలదు వలదిక మరలి పొమ్మనంగనా
చాన చాల పట్టు బట్టి చాల దవ్వు నడిచినన్!!

ఉత్సాహము:
లోన మెచ్చి వరమునివ్వ లోటు లేక బిడ్డలన్
తాను కోరినంత యముని తరమె కదలి పోవగా
జాని లేక బిడ్డలెట్లు జమునికింత తెలియదే
మానని పతి భక్తి గలుగ మార్చదె మగువ గతులన్!!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పతిని మృత్యువు నుండి కాపాడి పేరు
గాంచె వనిత యొక్కర్తుక ఘనముగాను,
నాటి నుంచి నేటికినైన నరులలోనఁ
గలరె యిట్టి ఘనతఁ బొందగా ధరణిని?

Unknown చెప్పారు...

మల్లెల వారి పూరణలు

పతియె దైవంబు గాగను వర్తనమున
అత్తమామల కంధత్వ మదియతొలగ
తల్లి దండ్రులు, తనుకూడ తనయులంద
యముని నుండియు భర్తను నతివఁ బొందె

అల్పమాయువు గలవాడు ననియు నెరిగి
పెండ్లి యాడెను, -పతియొక్క పీడ తొలగ
తనదు పాతి వ్రతంబున, ధర్ము తోడ
వాదు తెలివిగాఁ గొనె గాదె పతికి బ్రతుకు

అతివలందున తానెంతొ నాఢ్యయయ్యె
పతికి యమునుండి ప్రాణాలు భామఁ దెచ్చె
అంతె కాకను తలి,తండ్రి, యత్తమామ
తనరఁ నెంతయు, తనుకూడ తనరె నిలను

లోక మందున ప్రాణాలు లుప్తమైన
వారి కెందున నీయడు యముడు తాను
వాని తోడను వాదించి భర్త బ్రతుకు
దెచ్చె, పావనంబైనట్టి తెలివి తోడ

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కొమరుని బొందగఁ గోరి ని
యమంబుగ తన పతి బ్రతుకు నందగ జూడన్
యమునంతటి వాడైనను
రమణీ మణి ప్రాతివ్రత్య ప్రతభకు దిగడే?

subbarao చెప్పారు...

యముని వేమార్లు నడుగుచు నాపె మిగుల
భర్త ప్రాణాలు గొనియెను బ్రమద మలర
పాతి వ్రత్యపు మహిమచే బడయు కతన
యింతులందున మేటియౌ యింతి యయ్యె

వసంత కిశోర్ చెప్పారు...

శంకరార్యా ! ధన్యవాదములు !
కాని "ష" నిషిద్ధము గదా !
ఇది చూడుడు !

సతీసావిత్రి :

01అ)
_____________________________

అల్ప మాతని యేడది - యనిన వినక
నతనినే కోరి పెండ్లాడి - యడవి బొదలి
ఆయు వది తీర యమునితో - నాత డేగ
యముని వెంటాడి యమలోక - మపుడు జేరి
పతికి ప్రాణంబు సమకూర్చు - పడతి యాపె !
_____________________________
యేడు = ఆయువు
పొదలు = నివసించు

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులకు నమస్కారములు.

కవిమిత్రులు వసంతకిశోర్‍గారూ! తమరి పద్యమం దైదవపాదమున "స"కారము దొరలినది. సవరించఁగలరు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా పూరణము:

మద్రభూపతిపుత్రి ♦ మగని ప్రాణమ్ములఁ
....దిరిగి కొంటకు వెంట ♦ నరుగఁగాను,
యమధర్మరా జప్పు ♦ డామె నాపఁగ నామె
....తల్లిదండ్రులకుఁ బు ♦ త్రవరమిడెను;
మఱల వెన్నాడంగ ♦ మఱియొక్క వరముతో
....మామకు దృ గ్రాజ్య ♦ మందఁగ నిడె;
పిమ్మట వెన్నాడఁ ♦ బెనిమిటి ప్రాణమ్ముఁ
....దక్క నడుగుమనఁ ♦ దనకుఁ బుత్రు

నిడు మటంచునుఁ గోర య ♦ ముఁ డటులె యిడఁ
బతియు లేకుండఁ బడతులుఁ ♦ బడతు రెట్లు
తనయులం? గాన, దయతోడఁ ♦ దనదు మగని
ప్రాణ మిడుఁడని మెప్పించి ♦ పతినిఁ బడసె!!

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ సుదీర్ఘపూరణ బాగున్నది. అభినందనలు.
‘పేరిమి విభు/ డిలను వీడును...’, ‘అర్థితోడ/ నడవి కేగెడు...’, ‘ప్రాణాలఁ గొనిపోవు (ప్రాణముల్ గొనిపోవు)’, ‘విభుని/ నట్లు...’ అనండి.
అంచ కాల విభుడు...?
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
వృత్తంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రేమమ్ముతో/ నితమున్...’ అనండి.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
ఉత్సాహంగా మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
‘వచ్చెదనుచు’ అన్నదానిని ‘వచ్చెదనని/ వత్తుననుచు’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
నిజమే! నేను గమనించక ‘ష’కారాన్ని సూచించాను. మన్నించండి.
మీ సవరణ బాగున్నది. కాని ‘సమకూర్చె’ అన్నారు. అక్కడ ‘చేకూర్చె’ అనండి.
*
గుండు మధుసూదన్ గారూ,
చాలా చక్కని పూరణ చెప్పారు సీసపద్యంలో. అభినందనలు.

వసంత కిశోర్ చెప్పారు...

కవిమిత్రులు మధుసూదన్ గారికి ధన్యవాదములతో !

సతీసావిత్రి :

01ఆ)
_____________________________

అల్ప మాతని యేడది - యనిన వినక
నతనినే కోరి పెండ్లాడి - యడవి బొదలి
ఆయు వది తీర యమునితో - నాత డేగ
యముని వెంటాడి యమలోక - మపుడు జేరి
పతికి ప్రాణంబు మొనయించు - పడతి యాపె !
_____________________________
యేడు = ఆయువు
పొదలు = నివసించు
మొనయించు =సంపాదించు

Unknown చెప్పారు...

కె.ఈశ్వరప్పగారి పూరణ
యముని నెదిరించ గలిగిన యతివ నాడు
అత్తమామలు నారోగ్య మందు నట్లు
మరణ మందిన భర్తకు మనుగడ నిడు
యబల పాతివ్రతము నెంచు రఖిల జగతి

Unknown చెప్పారు...

పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
పద్యముమీ మెప్పు పొందినందుకు
మీసవరణకు ధన్యవాదములు

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా రెండవ పూరణము:

యము వెన్నాడి, పిత కప
త్యము; మామకు నయన రాజ్య ♦ ధనముల్; తనకున్
దమిని నిడఁ బుత్రుఁ; "బతిని ని
డమి నెట్లగు" నని, పతిఁ గొని ♦ ధన్యగ వెలిఁగెన్!!


కంది శంకరయ్య చెప్పారు...

వసంత కిశోర్ గారూ,
మీ సవరణ బాగున్నది. సంతోషం!
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నాడు + అత్త’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘...యతివ యామె/ యత్తమామల...’ అనండి. ‘నిడు/ నబల పతిభక్తి నెంచెద రఖిల జనులు’ అనండి.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ ... చిన్న పద్యంలో విస్తారమైన భావాన్ని ఇమిడ్చి మీ ప్రతిభను చాటుకున్నారు. చాలా బాగుంది. అభినందనలు.

మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీ చెప్పారు...

శ్రీ మధుసూధనరావుగారి రెండవపూరణ సావిత్రీ చరిత్ర అనే సాగరాన్నికంద పద్యమనే అగస్త్యుడు మ్రింగినట్లు ప్రశస్తముగానున్నది ! అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

పతినే పట్టుకు పోవగ
బ్రతుకే తిరిగిచ్చు వరకు ప్రక్కకు పోకన్
మతితోడనె యముని గెలిచి
క్షితిలోననె నిలిచె, పేరు చెప్పకె తెలియున్.

కంది శంకరయ్య చెప్పారు...

మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులు కంది శంకరయ్యగారికి, మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళిగారికి నా రెండవ పూరణము నచ్చి యభినందనములు తెలిపినందులకెంతయు సంతుష్టుఁడనైతిని. ధన్యవాదములు.

A.Satyanarayana Reddy చెప్పారు...

పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరిసవరణలకు ధన్యవాదములు.

ప్రబంద పరమేశ్వరుడు, యమధర్మరాజుని " అంత్యకాల దహన జ్వాలా ప్రచండున్" అని వాడారు. అదిఉపయోగించి నేను " అంత్యకాల దహనుడు అని ప్రయోగించ బోయి పొరపాటున అంచె కాల/ దహను అని వాడాను.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

ప్రాణములను గొనుచు రయమున జనుచున్న
యముని వెంబడించి యతివ తాను
ధర్మనియతి లోని మర్మంబు తెలియగా
ప్రతిన బూని నడచె పతిని గోరి

వసంత కిశోర్ చెప్పారు...

మిత్రులు మధుసూదన్ గారి కంద పద్యం-మహత్తరం

The Other చెప్పారు...

కవిమిత్రులు గుండువారి పదును నిషిద్ధాక్షరిలో బాగా ప్రకటితమౌతుంది. మధుసూదన్ గారూ, మీరు శంకరయ్య మాస్టారిలాగే కూడా వృత్తి రీత్యా తెలుగు (పండితులా) మాష్టారా?

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి వారూ,
నా సందేహం నివృత్తి అయింది. ధన్యవాదాలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
నిజమే. గుండు మధుసూదన్ గారు తెలుగు మాష్టారే. ఇంకా సర్వీసులో ఉన్నారు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులు వసంతకిశోర్‍, చంద్రశేఖర్‍గార్లకు ధన్యవాదములు.

చంద్రశేఖర్‍గారూ, నేను తెలుఁగు భాషోపాధ్యాయుఁడను. ప్రస్తుతము వరంగల్లు జిల్లాలోని శంభునిపేఁట ప్రభుత్వోన్నతపాఠశాలయందుఁ బనిచేయుచున్నాను. పద్యమనిన నాకు చిన్నప్పటినుండి మిక్కిలి యిష్టము. పద్యసంబంధమైన ఈ బ్లాగులోని కవిమిత్రులందఱి పూరణములఁ బఠించి యానందించువారిలో, పద్యరచన చేయువారిలో నేనొకఁడ నగుట నా యదృష్టము. మీవంటి కవిమిత్రులు లభించినందులకును నదృష్టవంతుఁడనేయని నా భావన. నా పద్యమునకు స్పందించి వ్యాఖ్య వ్రాసినందులకెంతయుఁ గృతజ్ఞుఁడను. మఱొక్కమాఱు ధన్యవాదములతో...స్వస్తి.