23, జూన్ 2012, శనివారం

సమస్యాపూరణం - 744 (కల్ల లాడువారు కవులు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కల్ల లాడువారు  కవులు  సుమ్ము!

ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. కల్లలాడువారు కవులు సుమ్మని చాల
    మేలమాడుచుండు టేలనయ్య!
    సంఘమునకు హితము సలుపు సత్సాహిత్య
    స్రష్టలయ్య! సత్యద్రష్టలయ్య!

    రిప్లయితొలగించండి
  2. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    చిన్న ఘటనయైనఁ దన్ను స్పందింపఁ జే
    యఁగను శీఘ్రమె సమయానుకూల
    ముగను తల్లడిల్లి, చిగురాకు వలె దాని
    కల్లలాడువారు కవులు సుమ్ము!

    (అల్లలాడు = చలించు, బాధపడు)

    రిప్లయితొలగించండి
  3. అందమైన వారె యాడువారనుచును,
    వీరశూరవరులు, పేర్మి ఘనులు,
    పురుషపుంగవులని పొగడుచు నుందురు,
    కల్లలాడువారు కవులుసుమ్ము.

    రిప్లయితొలగించండి
  4. కడు మనోహరముగఁ గావ్యమ్ము రచియించి
    దాని నొక్కఁ డంకితమ్ము గొనఁగఁ
    గృతిపతియగు వాని నతిశయమ్ముగ మెచ్చి
    కల్ల లాడువారు కవులు సుమ్ము!

    రిప్లయితొలగించండి
  5. ఈ సమస్య కూడా పునరుక్తే.

    బూచి వచ్చునంచు బువ్వను తినిపించి
    పిల్లవాని సాకు తల్లి రీతి
    సంఘహితము కోరి సందర్భమును బట్టి
    కల్ల లాడువారు కవులు సుమ్ము!

    రిప్లయితొలగించండి
  6. పాప భీతి లేక పాపముల్ సేతురు
    కల్ల లాడు వారు , కవులు సుమ్ము
    కావ్య రచన చేయ గల యట్టి మనుజులు
    కల్ల లాడ రెపుడు కల్ల గాదు .

    రిప్లయితొలగించండి
  7. స్త్రీలఁ బొగడునపుడు మేలు వర్ణనలందు
    రాజభోగరచనలాజియందు
    నతిశయోక్తిదెల్ప్లి యద్భుతరీతిగా
    కల్లలాడు వారు, కవులు సుమ్ము.

    రిప్లయితొలగించండి
  8. ధర్మపాలనెంచి తల్లడిల్లెడివారు
    తరుణులందుఁబెళ్ళితంతులందు
    ప్రాణభయముఁదీర్చ, ధన,మాన,రక్షకై
    కల్లలాడువారుకవులుసుమ్ము

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిశనివారం, జూన్ 23, 2012 9:25:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    నేర్పు కలిగి వోటు తీర్పు కోరెడువారు
    కల్ల లాడువారు, కవులు సుమ్ము
    ప్రజల కష్టములను ప్రభుతకు తెలుపంగ
    శిక్ష కైన తాము సిద్ధపడిరి.

    ప్రజల కష్టములను సాహిత్యములో చూపిన కవులు ఆకారణముగా జైలుశిక్షలు అనుభవించినవారూ ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  10. శ్రిగురుభ్యోనమః
    మూడవ పాద సవరణ తరువాత :
    ధర్మపాలనెంచి తల్లడిల్లెడివారు
    తరుణులందుఁబెళ్ళితంతులందు
    ప్రాణ మాన విత్త హానులదప్పింప
    కల్లలాడువారుకవులుసుమ్ము

    రిప్లయితొలగించండి
  11. శ్రీ మిస్సన్న గారికి
    వందనములు.
    మీ పూరణ సులలితముగా శోభిల్లుతున్నది.
    అభినందనమందారమాలలివేగైకొనండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. సహదేవా వందనములు
    సహృదయతను చాటినారు సలలిత మంచున్
    సహచరుని పూరణను మీ
    సహవాసమ్మరయ గొప్ప సంపద నాకౌ!

    రిప్లయితొలగించండి
  13. కవివరేణ్యు డొకడు కాంత! "నీమోముకు
    సాటి గాదు పూర్ణచంద్రు" డనగ
    నతివ పల్కె నాథ! యవసరార్థం బెన్నొ
    కల్ల లాడు వారు కవులు సుమ్ము.

    రిప్లయితొలగించండి
  14. కల్లలాడువారు కవులు సుమ్ము

    ఈ విషయమ్మును కొందరు పాక్షికముగా, కొందరు సంపూర్ణముగా సమర్థించి పూరణ చేసేరు మన మిత్రులలో కొందరు. శివ శివ!

    కవి అంటే హంస. పురాణ కవులను గూర్చి చెప్పాలంటే:
    (1) గణపతి (కవీనాం కవి)
    (2) శుక్రాచార్యులు (భగవద్గీతలో పేర్కొనబడిన విషయము)
    (3) కవి అంటే బ్రహ్మ, విష్ణువు, సూర్యుడు, మొదలిడిన వారెందరో.

    కవి అంటే క్రాంత దర్శనుడు అని ఆర్యోక్తి. ఈ విషయములు అందరికీ తెలిసినవే అందుచేత ఇక్కడికి వదిలివేద్దాము.

    పూరించిన మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ కొన్ని సూచనలు:

    (1) శ్రీచంద్రశేఖర్ గారి పద్యములో 2వ పాదములో 4వ గణమును సవరించాలి.
    (2) శ్రీ సహదేవుడు గారు : ధర్మపాలనను ఎంచి అనేటప్పుడు ధర్మపాలనెంచి అనుట సరియైన ప్రయోగము కాదు.
    (3) శ్రీ ఎచ్.వి.ఎస్.ఎన్.మూర్తి గారు: ఉకార ఋకారముల తరువాత "కు" అని వాడుట కంటే "నకు" అని వాడుట వ్యాకరణ సమ్మతము. (నీ మోముకు అన్నారు కదా)
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. ఆర్యా!
    సూచనకు ధన్యవాదములు.
    మొదటి పాదాన్ని క్రింది విధంగా మారుస్తున్నాను.

    "కవియొకండు నాదు కాంతమోమునకెందు"

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమానివారికి ధన్యవాదములతో:
    కల్ల లాడువారు కవులుసుమ్మనకుమా
    కప్పి చెప్పు టేను కవుల నేర్పు
    కల్ల కపట మెరుగ నొల్లని వారల
    మనసు వెన్న మాట మధుర తరము!

    రిప్లయితొలగించండి
  17. అయ్యా, తమరి వ్యాఖ్య ఇప్పుడే చూచాను. మన్నించండి. తెలియక చేసిన పూరణ మొదటిది.
    మీ సూచనలను స్వీకరించి చేసిన నా పూరణ.

    కవుల మాటలెల్ల కల్లలంచు పరిహ
    సించువారనెట్లు జెప్పవచ్చు?
    క్రాంతదర్శనులగు ఘనులు వారెవ్వరు?
    కల్లలాడువారు; కవులు సుమ్ము.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నేమానివారికి ధన్యవాదములతో:

    గురువుగారూ ,
    తమరి అమూల్యమైన సూచిత సవరణ తరువాత

    ధర్మ పాలనమన తల్లడిల్లెడివారు
    తరుణులందుఁబెళ్ళితంతులందు
    ప్రాణ మాన విత్త హానులదప్పింప
    కల్లలాడువారుకవులుసుమ్ము

    రిప్లయితొలగించండి
  19. కమలభవునిరాణి కరుణామృతము గ్రోలు
    పావనాత్ములు కవివర్యు లెల్ల
    కల్లలాడు వారు కవులు సుమ్మనుటకు
    చిత్తమెటుల నొప్పె చెప్పుడయ్య!

    రిప్లయితొలగించండి
  20. ఎల్ల వేళ లందు కల్ల కపటము లేక
    వనిత సొగసు లనగ వఱలు ప్రీతి
    కవిత వ్రాయ నెంచి కల్పించి వర్ణించి
    కల్ల లాడు వారు కవులు సుమ్ము !

    రిప్లయితొలగించండి
  21. అన్ని రంగముల గుణాత్ములు , గుణహీను
    లుండగలరు నిక్కమో మహాత్మ !
    కనుక సత్యమిద్ది కవులలో కొందరు
    కల్లలాడువారు కలరు కలరు !

    కవి యటన్న నేమి ? గణ యతి ప్రాసల
    నేర్చి కూర్చి కైత బేర్చువాడు ;
    తుచ్చ భావములను దోహలమ్మున పద్య
    మందు గూర్ప నేమనందు వాని?

    పద్యమల్లె గనుక పండిత కవి యంచు
    వాణికి సముడంచు పలుకవలెనొ ?
    హీన భావమొండు పూని ఛందమ్మందు
    నింపె గనుక నపహసింపవలెనొ ?

    పద్యమల్లునట్టి ప్రతివాడు మహనీయు
    డైనవాడు కాదు , కాన నేటి
    యీ సమస్య లోన నించుక దోసమ్ము
    లేదు గాక లేదు వాదమేల ?

    రిప్లయితొలగించండి
  22. కవిమిత్రులకు వందనాలు.
    ఈనాటి సమస్య కూడా పునరుక్తి అన్న విషయం మిస్సన్న గారు చెప్పేదాకా గుర్తుకు రాలేదు. నిజమే ... “కల్ల లాడువారె కవులు గాదె.” అని గతంలో ఇచ్చిన సమస్య. అదే కాదు... “కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.” అని కూడా ఒక సమస్య ఇవ్వడం జరిగింది.
    ఇక నేమాని వారికి ఈ సమస్య నచ్చలేదు. తమ అద్భుతమైన రచనలతో రసానుభూతిని, సందేశాన్ని ఇచ్చే కవుల పట్ల అగౌరవంగా భావించడం తగని పనే. నా పూరణలోను ఆ దోషం ఉంది. వారి మనస్సును నొప్పించినందుకు మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను.
    ఉత్సాహంగా వైవిధ్యంగా పూరణలు చెప్పిన గుండు మధుసూదన్ గారికి, లక్ష్మీదేవి గారికి, మిస్సన్న గారికి, సుబ్బారావు గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, సహదేవుడు, శ్రీపతి శాస్త్రి గారికి, సత్యనారాయణ మూర్తి గారికి, చంద్రశేఖర్ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి అభినందనలు, ధన్యవాదాలు.
    సభ్యతాపరిధిని దాటని అజ్ఞాత గారి విమర్శకు ధన్యవాదాలు, వారి పద్యరచనా ప్రావీణ్యానికి అభినందనలు.
    స్వస్తి!

    రిప్లయితొలగించండి
  23. అజ్ఞాతగారి భావం అర్థమయింది. కానీ వారి క్రింది మాటలతో ఏకీభవించలేము.
    "కవి యటన్న నేమి ? గణ యతి ప్రాసల
    నేర్చి కూర్చి కైత బేర్చువాడు..."
    "పద్యమల్లె గనుక పండిత కవి యంచు
    వాణికి సముడంచు పలుకవలెనొ ?"
    నలభై ఏళ్ళక్రితం నేను ఎలిమెంటరీ స్కూల్ లోచదువుతున్నప్పుడే మామాస్టారూ చెప్పేవాడు-"ఒరేయ్, పద్యం వ్రాసిన ప్రతివాడూ కవి కాలేడురా. ఏదో కందపద్యం, ఆవె, తేగీ,ఉత్పలమాల వ్రాసేశానని మురిసిపోకండి..." కవి అనిపించుకోవటానికి చాలా లక్షణాలు కావాలి. ఇవేమాటలు తదుపరి సాహిత్య సభలలో విశ్వనాధ, కరుణశ్రీ, ప్రసాదరాయకులపతి వంటి పెద్ద వారి ద్వారా ముఖాముఖీ విన్నవాడిని కాబట్టి నా సవినయ మనవి. సమస్యలోని కవి అనే పదానికి నిజార్థము తీసుకొంటే, ఔచిత్యభంగం జరిగిందనే అనిపిస్తుంది. కానీ శంకరయ్య మాస్టారు ఇదివరలో చెప్పినట్లు రోజుకొక సమస్య, అది కూడా అన్ని రకాలుగా పరిపూర్ణతతో కూడినదీ (దైవ దూషణ లేకుండా, సాహిత్య పరమైన విరుపు, మలుపులతో కూడినది వగైరా) ఇవ్వటం కష్టతరమే. కాబట్టి కొన్ని చూసీచూడనట్లు పోదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. కవికి నిర్వచనము కానరాదెచ్చట
    కల్పనమ్ము సలిపి కమ్ర రీతి
    పలుకులందు తెలుపు వాడెపో కవి యని
    తెలియవచ్చును మన తెలుగు గారు !

    పద్యమల్లునట్టి ప్రతివాడు కవి కాడు ,
    కాడటంచు నెరుక కలదు నాకు ;
    కవి యటన్న వాడు కల్లలాడుటకేమి?
    వాడు మనుజుడే ! వివాదమేల?

    స్ఫోటకంపు ముఖము శోభను మెచ్చును
    ఇంతనంత జేసి వింత గూర్చు
    అతిశయంపు పలుకు లనని కవి యెవడు?
    కల్లలే యవెల్ల కనుము వినుము !

    కవియు నెవ్వడే యెకాయెకి స్వర్గమ్ము
    నుండి భూమిపైకి నూడిపడడు !
    మనుజ తతికి గలుగు మానసిక వికార
    జాడ్యముల వహింపజాలియుండు !

    కవియు గొప్పవాడె , కాదని యనలేము
    కల్లలాడినంత పొల్లు పోదు
    వాని బుద్ధి బలము పాండిత్య సంపద;
    దేని దారి దానిదే గణింప !

    కల్లలాడినంత ఘనత కొంచెము కాదు
    కల్లలాడనట్టి కవి యెవండు ?
    ఆ ప్రబంధ యుగము నీ ప్రస్తుత యుగమ్ము
    లోన జూడ కల్ల లేనిదేది ?

    మరల మరల జెప్ప విరతి లేనే లేదు
    కవియు కూడ మనుజుడె వివరింప
    మనుజుడాడడొక్కొ యనృతమ్ము ధాత్రిపై?
    సూటి ప్రశ్నమిదియె సూరివర్య !

    రిప్లయితొలగించండి
  25. ఉచితానుచితములు ఒజ్జలు నిర్ణయింతురుగాక.

    పిల్ల పాపలకును తెల్లమగునటుల
    పామరులకునైన భావమొనర
    వర్ణనలనుపేర వాసికెక్కెడిరీతి
    కల్ల లాడు వారు కవులు సుమ్ము !

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. సరస గతుల దున్ని సాహిత్య సేద్యమ్ము
    సలిపి కావ్య ఫలము సజ్జనాళి
    చేతి కందజేసి జేజేలు పొందుట
    కల్ల లాడు వారు కవులు సుమ్ము.

    రిప్లయితొలగించండి
  27. 1.ధనము కొరకు నర్హతలు లేకున్నను
    ప్రభువు ప్రాపు కొరకు ,పలుకుబడికి,
    అల్లిబిల్లి కబురు లాడుచు,బొగడుచు,
    కల్లలాడువారు కవులు సుమ్ము.

    2.

    మెల్లకన్ను ప్రియను మీనాక్షి యంచును
    చలము చెప్పినట్లు వలపు కలుగ
    కవితలల్లు భావకవిరాజు లెంచగా
    కల్లలాడు వారు కవులు సుమ్ము.

    రిప్లయితొలగించండి
  28. అల చకోరకములు, నటు చక్రవాకముల్
    చంద్రబింబమందు శశము, మృగము
    కలవటంచనాది కాలంబునుండియు
    కల్లలాడు వారు కవులు సుమ్ము.

    రిప్లయితొలగించండి